Saturday, September 24, 2016

నిప్పు చెప్పే నిజాలు




నిప్పు జీవంగలది. అది శ్వాసిస్తుంది, అందిన దాన్ని తింటుంది, అసహ్యించుకుంటుంది. మంటను గెలవాలంటే మనమూ దానిలాగే మెలగాలి. దానిలాగే ఎటుపడితే అటు కదలాలి. మండే పదార్థాలు ఉన్నాయని మంటకు తెలియదు. మంట ఉందని మండే పదార్థాలకు తెలియదు. మంట, నిప్పు కలిసి మన ప్రపంచాన్ని మార్చేశాయి. ఒకానొక సినిమాలో ఒకానొక పాత్ర అన్న మాటల ఆధారంగా.
* * *
చుట్ట వెలిగించడానికి చెన్నయ్య చెకుముకి రాయి కొట్టేవాడు. పొయ్యి వెలిగించడానికి పెద్దమ్మ పక్కింటి నుంచి పిడక మీద నిప్పు తెచ్చేది. అప్పుడు అగ్గిపెట్టె, కిరోసిన్ నూనె వచ్చి పద్ధతి మార్చాయి. అగ్గిపుల్ల ఎక్కడ గీచినా మండేది. ఓ సినిమాలో క్రూరుడయిన విలన్ ఎదుటి వాడి బట్టబుర్ర మీద పుల్లగీరి దాంతో చుట్ట వెలిగించుకోవడం చూచాను. అది తెలుగు సినిమా మాత్రం కాదు. అగ్గి పుల్లలను అంత క్రూరంగా ఉండని పద్ధతికి మార్చి భద్రత గలవి అని పేరు కూడా పెట్టారు. అగ్గిపెట్టెల మీద సేఫ్టీ మ్యాచెస్ అని ఉంటుంది. కనీసం ఈసారయినా గమనించి చూడండి. అదీ మీకు అగ్గిపెట్టె దొరికితేనే. ఇక ఆ తర్వాత కరెంటు వచ్చి కాలానే్న మార్చింది. ఇప్పుడు నిప్పు, పొగ, వేడి ఏదీ లేకుండానే మైక్రోవేవ్‌లో వంట జరుగుతోంది. మంటలేదు గానీ వంట మాత్రం అలాగే ఉంది. ఇంతకూ వంట, మంట ఎప్పుడు మొదలయ్యాయనేది అసలు ప్రశ్న.
తొలి రోజుల్లో మనిషి తెచ్చుకున్న కాయలు, పళ్లు గానీ వేటాడిన జంతువును గానీ పచ్చిగానే తినేవాడు. కాల్చి తినడం ఆ తర్వాత అలవాటయింది. చిన్నప్పుడొక కథ విన్నట్లు గుర్తు. తెచ్చిన మాంసం లేదా జంతువు అలా ఉండగానే అనుకోకుండా ఒకసారి అగ్నిప్రమాదం జరిగిందట. మంట ఆరిన తర్వాత జంతువేమయిందో వెదుకుతూ మనిషి ఉడికిన మాంసంలో వేలు పెట్టాడు. చురుక్కుమంది. అనుకోకుండా వేలిని నోట్లో పెట్టుకున్నాడు. మాంసం రుచి మారింది. బాగుంది కూడా! అలా తిండిని కాల్చి తింటే బాగుంటుందని తెలుసుకున్నారంటారు. ఇలాంటి కథలు, కథలుగా కూడా నిజంగానే వినిపిస్తాయి. అప్పట్లో అంటే ఆదిమానవుని కాలంలో ఏం జరిగిందీ అన్నది ఊహించి చెప్పవలసిందే తప్ప అందుకు ఆధారాలు లేవు కదా! కనుక కథకూ, సత్యానికి మధ్యన అంత తేడా లేదు.
పది లక్షల సంవత్సరాల క్రితం ‘హోమో ఎరెక్టస్’ అనే నిటారుగా నిలబడిన మానవులు వంటకు, వెలుగుకు ఇతర అవసరాలకు మంటను వాడుకున్నారని ఒక వాదం. రెండు లక్షల సంవత్సరాలకు ముందు మానవుడు అగ్నిని తన అవసరాలకు వాడుకున్న గుర్తులేవీ, కనిపించడం లేదంటారు మరి కొందరు పరిశోధకులు. అంటే, అప్పటికి ‘హోమో సాపియోన్స్’ అనే మనలాంటి మనుషులు వచ్చేశారు. అంతకు ముందు మనుషులకు వంట తెలియదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆ ఆశ్చర్యాన్ని కొంచెం తగ్గించే ఆధారాలు కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాన్సులో దొరికాయి. 4,65,000 సంవత్సరాల నాటిదిగా గుర్తించిన ఒక మానవ ఆవాస ప్రదేశంలో పొయ్యిలా మండిన చోటు ఒకటి దొరికింది. లెక్కలో ఎంత తప్పు ఉన్నా 65 వేల సంవత్సరాలకన్నా అటూ ఇటూ కావడానికి వీలులేదంటున్నారు పరిశోధకులు. అంటే నాలుగు లక్షల ఏళ్లనాడే మనుషులు పొయ్యి పెట్టి వంట చేసుకున్నారని భావం. ఆ కాలానికి నేడున్న మనలాంటి మానవ జాతి ఆవిర్భవించలేదు. నిటారు మనుషుల కాలమే అది!
ఎలెక్ట్రాన్ స్పిన్ రెసొనాన్స్ అనే పద్ధతితో ఎక్కువ వేడయిన క్వార్ట్‌జ్ వయసు గుర్తించడం వీలవుతుంది. గులకరాళ్లు, మట్టిలో ఈ క్వార్ట్‌జ్ ఉంటుంది. పొయ్యిలో నుంచి రాళ్లను, మట్టిని తీసి చూస్తే అవి లక్షల ఏళ్ల నాటివని తెలిసింది. మొదటి పరిశీలనలోని రాళ్లు 3,80,000 సంవత్సరాల నాటివి. అక్కడే పురాతత్వ పరిశోధన కోసం జరిపిన తవ్వకాలలో మరింత లోతున మరో పొయ్యి కనిపించింది. అందులోని రాళ్లను పరీక్షిస్తే అవి 4,65,000 నాటివని తెలిసింది. అయితే మానవులు ఆ కాలంలోనే మంటను వాడుకున్నారని చెప్పడానికి ముందు పరిశోధకులు ఒకటి రెండు సంగతులను తేల్చి చెప్పాల్సి ఉంటుంది. అందులో ఒకటి కాలం నిర్ణయించడానికి వాడుతున్న డేటింగ్ పద్ధతుల్లో పొరపాటు లేదని, రెండవది పరీక్షించిన రాళ్లు నిజంగా ఒక ‘పొయ్యి’లోవని, ఏదోవేరు రకంగా గురయినవి కావని తేలాలి!
పరిశోధనలో ఎప్పటికీ పొరపాట్లే జరుగుతాయంటే అన్యాయం. అలాగని పొరపాటు జరగవనడానికి కూడా లేదు. ఇక్కడ మరొక కథ గుర్తుకు వస్తుంది. ఇద్దరు గప్పాల రాయుళ్లు ముచ్చటాడుతున్నారట. ‘మా ఇంట్లో బావి కోసం వంద అడుగులు తోడితే, ఆ లోతులో తీగలు దొరికినయి. అంటే వెనకట మనవారు టెలిఫోను వాడుకున్నారనే గదా అర్థం!’ అన్నాడు మొదటి గప్పాలాయన. రెండవ ఆయన అందుకుని ‘మా ఇంట్లో నిజానికి రెండు వందల అడుగులు తోడినా ఏ తీగా దొరకలేదు. అంటే అప్పట్లో వారు వైర్‌లెస్, సెల్‌ఫోన్ వాడుకున్నారనేగా అర్థం!’ అన్నాడు. ఫలితాలను అందుకోవడం ఒక ఎత్తు. వాటిని అన్వయించి చెప్పడం మరో ఎత్తు! వేడెక్కిన రాళ్ల వయసు నిర్ధారించడానికి వాడే పద్ధతి గట్టిదే. అయితే అందులో అయిదు లక్షలకన్నా ఎక్కువ సంవత్సరాల వివరాలు తెలియడం కష్టం. పరిశీలిస్తున్న ఈ రాళ్లు ఇంచుమించు పరీక్షా పద్ధతుల అంచులను తాకుతున్నాయి. అలాంటి ఫలితాలను నమ్మడం కొంచెం కష్టమే. అందుకే పరిశోధకులు రాళ్లను థర్మోల్యుమినిసెన్స్ అనే మరో పద్ధతిలో కూడా పరీక్షించే ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఒక సమస్య తీరుతుంది. సాధారణంగా ఏ విషయాన్నయినా అనుమానం లేకుండా నిర్ణయించాలంటే, ఒకటికన్నా ఎక్కువ పద్ధతులతో పరిశీలించడం, పరిశోధనలోనే కాదు, మన బతుకుల్లోనూ అలవాటే. డాక్టర్‌లు తాము చెప్పింది కాక, మరో డాక్టర్‌కు చూపించి మరో అభిప్రాయాన్ని తీసుకోవడం అనే ఒక పద్ధతి ఉండనే ఉన్నది కదా!
ఇక రెండవ సమస్య, రాళ్లు నిజంగా మనుషులు ఏర్పాటు చేసుకున్న నెగడు లేదా పొయ్యిలో నుంచి వచ్చినవేనా? లేక మనిషి ప్రమేయం లేకుండానే మంటకు గురయినవా? అడవులు తగలబడడం మామూలే. అది కాకున్నా ఒక ఎండిన చెట్టు తగలబడి ఉండవచ్చు. ఇటువంటి మంటకు, మనిషి వేసుకున్న పొయ్యి మంటకు తేడా తెలియడం కష్టం. అయితే ఫ్రాన్సు తవ్వకాల్లో దొరికిన పొయ్యిలు మాత్రం చాలాకాలంపాటు మండిన దాఖలాలున్నాయి. సహజంగా తగలబడిన వస్తువులేవీ ఇంతకాలం మండవు.
హోమో ఎరెక్టస్ కాలంలోనే మంటను, నిప్పును వాడుకున్నారనేది నిర్ణయమయితే మానవజాతి పరిణామ చరిత్ర కొంచెం మారుతుంది. నిప్పు, చక్రం, వ్యవసాయం మానవ జాతి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం గల అంశాలు. అవి మనిషికి బ్రతుకు నేర్పించాయి. నిప్పు నియంత్రణ జీవితానికి గుర్తు, చక్రం సాంకేతిక పరిజ్ఞానానికి, ప్రగతికి ఆధారం. వ్యవసాయం సాంఘిక పద్ధతికి సామూహిక జీవనానికి, అన్నిటికీ మించి ‘స్వంత’ భావానికి మొదలు, వంట స్వంతం. ఫలసాయం స్వంతం. అది తన వారికే అందాలి. అంటే ఇతరుల నుంచి కాపాడుకోవాలి. నిప్పు మాత్రం సంఘానికి గుర్తుగా ఉన్నాలేకున్నా స్వంతం కానవసరం లేదు.
మన గురించి మనం తెలుసుకోవడంలో ఒక వింత ఆనందం ఉంది. మానవులు ప్రస్తుతం ఈ రకంగానే ఎందుకున్నారని ప్రశ్నిస్తే, జవాబులందడానికి ఇటువంటి వివరాలు మరెన్నో తెలియాలి!
ఝలక్: నాన్న ఒక అనుభవం చెప్పేవాడు. కొత్తగా మంటినూనె వచ్చిన రోజులు. మంటి నూనె అంటే నేల నుంచి తీసిన నూనె. అదేమిటో మీకు అర్థమయి ఉండదు. పెట్రోలును భూమిలోనుంచి తీస్తారు. మంచి నూనెను నువ్వులు, పల్లీలు అనే వేరుశెనగలు లాంటి వృక్ష సంబంధ పదార్థాల నుంచి తీస్తారు. అంతకు ముందు తెలిసిన నూనెలన్నీ అంతే. ఎందుకోగానీ ఆముదాన్ని నూనె అనలేదు. అది వేరే కథ గానీ, కెరోసీన్ తెచ్చుకొని మా ఊళ్లో ఒకతను ఆముదం దీపం పద్ధతిలో మట్టి మూకుడులో పోసి వత్తి వేసి వెలిగించాడట. వత్తి ఒకటే కాదు, మొత్తం దీపమంతా వెలగడం మొదలయింది. గ్యాసు నూనె బుడ్డీ దీపాలు వడిన వాండ్లకు ఈ సంగతి తెలుస్తుంది. పాపం ఆ మనిషి పెట్టిన మంటతో పూరి గుడిసె అంటుకున్నది. తాగి ఉన్నాడేమో ఆర్పడం గురించి కూడా ఆలోచన రాలేదు. ఇంట్లోని డప్పు తెచ్చుకుని దరువు వాయిస్తూ ఆ మనిషి ఇంటి ముందు నాట్యం చేశాడట. నాన్న ఈ సంగతి నవ్వకుండా చెప్పేవాడు.

1 comment:

  1. what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
    my youtube channel garam chai:www.youtube.com/garamchai

    ReplyDelete