Tuesday, October 30, 2012

సమయం కుదిరితే...

ఎవర్ని ఏ పని సాయం అడిగినా సమయం లేదంటారు. నిద్ర గురించి కూడా ఆలోచించకుండా, పనిచేసినా సమయం సరిపోవడం లేదు. ఇక సైన్సులోకి వెళ్లి అడిగితే- వాళ్లకు సమయం సమస్య మరో రకంగా ఎదురవుతుంది. రెండు రసాయన పరమాణువులు కలిసి ఒక అణువు పుట్టడానికి పట్టే సమయం ఒక పికో సెకండ్. అది నిజంగా ఎంత నిడివి ఉన్న మాట మనకు తోచదు. కన్ను రెప్పపాటు- మనకు తెలిసిన చిన్న కొలత. ఒక కొండ పుట్టడానికీ, రెండు గెలాక్సీలు కొట్టుకోవడానికి పట్టే సమయం ముందు మన కనురెప్ప పాటు అలాంటిదే. నిజానికి సైన్సు అనుకుంటున్న విషయాలు జరగడానికి పట్టే కాలం మనిషి జీవనకాలానికన్నా చాలా ఎక్కువ. పరిశోధకులు తరతరాలుగా ఒకే అంశం గురించి పరిశోధిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు. 1920 ప్రాంతంలో మొదలయిన కొన్ని పరిశోధనలు అక్కడే, ఆ పరిశోధన శాలల్లోనే ఇంకా కొనసాగుతున్నాయి. ఆ ఆలోచన మొదలుపెట్టిన వారు పోయారు. చరిత్రలో ఒక అంశం గురించి మరీ చాలా కాలంపాటు సమాచారం సేకరించి పరిశీలించిన సందర్భానికి ఉదాహరణ బహుశః ఖగోళ శాస్త్రంలో ఉంది. ప్రాచీన నాగరికతలయిన బాబిలోన్ లాంటి చోట్ల మొదలయిన సమాచార సేకరణ ఇంకా సాగుతున్నది. సాంకేతిక శక్తి మారిందని, ఆ తరువాత వచ్చిన సమాచారాన్ని పాత పద్ధతి సమచారానికి కలపడానికి వీలు లేదన్నా సరే, కనీసం ఆరు వందల సంవత్సరాలపాటు పాత పద్ధతి సమాచార సేకరణ జరిగింది. గ్రహణాలు మొదలయిన సంగతులను గురించి మన దేశంలో, ఆసియా దేశాలలో కూడా ఈ రకమయిన సమాచార సేకరణ జరిగింది.

ఇప్పటికీ పరిశోధకులు కొన్ని ప్రయోగాలకు తమ జీవితకాలం సరిపోదు అంటారు. నిజంగా సమయం సమస్య కాకుండా ఉంటే, ఏ రకం పరిశోధనలు వీలవుతాయని వారిని ప్రశ్నించారు. మీరే వెయ్యి, పదివేల సంవత్సరాలు ఉండగలిగితే, ఏ రకం ప్రయోగాలు చేస్తారని ప్రశ్న. జవాబు రావడానికి ఒక చిక్కు ఎదురవుతుంది. అంతకాలం గడిచేలోగా సాంకేతిక వనరులు, పద్ధతులు మారిపోతాయి. అవి మారకనే ఇప్పటి సదుపాయాలతో, ఎక్కువ కాలం జరగవలసిన పరిశోధనలు ఎన్నో ఉన్నాయని తెలిసింది.

* జీవం పుట్టుక: మిల్లర్, ఉరే అనే పరిశోధకులు 1950 దశకంలో జీవం పుట్టుక గురించి ఒక సిద్ధాంతం చేశారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే జీవం పుట్టుకకు అవసరమయిన అమైనో ఆమ్లాల వంటి రసాయనాలు వాటంతటవే పుడతాయన్నారు. ఈ రకం రసాయనాలు అంతరిక్షం నుంచి వచ్చాయన్నవారు కూడా ఉన్నారు. వాటంతటవే పుట్టడం గురించి పరిశోధించాలంటే తగిన పరిస్థితులు కల్పించి, తగిన రసాయనాలను చేర్చి, తేలికగా వాటిని పరిశీలించాలి. అది అనుకున్నంత సులభం కాదు. పదివేల సంవత్సరాలు వేచి చూస్తే, నిజంగానే జీవ రసాయనాలు పుట్టవచ్చు. మొదట్లో జీవం పుట్టడానికి అంతకన్నా ఎక్కువ కాలమే పట్టి ఉండవచ్చు. తమంత తాము పుట్టి, తమ వంటి రసాయనాలను తయారుచేయగలగడం జీవ రహస్యమన్నది అర్థమయిన విషయమే.

భూమి, దాని మీద పరిస్థితులు, రసాయనాలు, గతంలో ఎప్పుడో ఉన్నప్పటి తీరుగా ఏర్పాటుచేయాలి. భూమి మీద అలనాటి పరిస్థితులలో లక్షల రకాల రసాయనాలు ఉండి ఉంటాయి. అవి అంతులేని రకాలుగా కలిసి, ఎన్నో ప్రయోగాలు జరిగి ఉంటాయి. ఆ రసాయనాలు తగినంతగా ఉంటే, అవి కలవడానికి వీలు కలుగుతుంది. తక్కువగా ఉంటే, అవి ఒక్క చోటికి రావడానికి మరింత కాలం కావాలి. జీవ రసాయనాలు రాళ్లమీద పుట్టినట్టు ఒక ఆలోచన ఉంది. అక్కడి తేమలో అంతులేని రసాయన చర్యలు జరిగి ఉంటాయి. వాటి సంఖ్య ఒకటి పక్కన ముప్ఫయి సున్నాలు వేసినంత- అని అంచనా ఉంది. ఆ కార్యక్రమం వందల మిలియనుల సంవత్సరాల పాటు సాగి ఉండవచ్చు.

ఇప్పుడు ఒక పరిశోధన, పరిశోధనశాల పదివేల సంవత్సరాలపాటు కొనసాగే వీలుంటే, జీవం పుట్టుక ప్రయోగాన్ని కొంతవరకయినా పరిశీలించవచ్చు. అప్పుడు జరిగిన రకం రసాయన ప్రయోగాలను ఇప్పుడు జరిపి చూడవచ్చు. వాటి సంఖ్య ఎంత ఎక్కువ ఉంటే, అంత త్వరగా, సంతృప్తికరంగా ఫలితాలు అందుతాయి. గదుల నిండా రకరకాల రసాయనాలు కలిసిన పాత్రలు, తగిన తేమ, ఒత్తిడి, వేడి లాంటి పరిస్థితులతోబాటు ఏర్పాటయి ఉంటాయి. ఇప్పుడు మనకు కంప్యూటర్ అందుబాటులో ఉంది గనుక పాత్రలు నిజంగా ఏ గాజు పాత్రలో కాక, కంప్యూటర్ చిప్స్ రూపంలో ఉంటాయి. తగిన పరిస్థితులు అక్కడ కలిగించడం, అవసరం కొద్దీ మార్చడం సులభమవుతుంది. వీటిని చిప్ పరిశోధనశాలలు అనవచ్చునేమో! వాటిలో ఎక్కడో ఏదో ఒక రసాయనం, తనలాంటి రసాయనాన్ని తయారుచేస్తే క్షణాల్లో తెలిసిపోతుంది.

సాంకేతిక పద్ధతులను వాడుతున్నాము గనుక పరిశోధనకు పట్టే సమయాన్ని కూడా తగ్గించే ప్రయత్నాలు జరుగుతాయి. ఎక్కడో ఒక రసాయన చర్య మనమనుకున్న రకంగా జరుగుతున్నాయని సూచన వస్తే, అక్కడి పరిస్థితులను మరింత అనుకూలంగా మార్చవచ్చు. ప్రయోగాలు సాగితే, అసలు ప్రకృతిలో రసాయనాలు కలిసి, రకరకాల మార్పులకు దారితీసే పద్ధతులు అర్థం కావచ్చు! ఇంతకూ ఈ పరిశోధన వీలవుందా? అవసరమా ?-అని అడిగితే మాత్రం జవాబు లేదు.
* భౌతిక ప్రపంచం, సిద్ధాంతాలు: జెరాల్డ్ గాబ్రియెన్స్ హార్వార్డ్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తుంటారు. పదివేల సంవత్సరాలు దొరికితే తాము చేయగలిగిన పరిశోధన గురించి ఆయన చెప్పిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.
భౌతిక శాస్త్రంలో కొన్ని సిద్ధాంతాలు, నియమాలు శాశ్వతమయినవని అనుకుంటున్నాము. అన్ని ప్రొటానులకు ఒకే రకమైన ఛార్జ్ ఉందంటున్నారు. కాంతి ఎప్పుడయినా ఒకే వేగంతో కదులుతుందంటారు. ఇలాంటివే మరెన్నో విషయాలున్నాయి. వాస్తవంగా చూచి పరిశీలించినవారు కొందరు ఈ రకం సిద్ధాంతాలలో మార్పు ఉండే వీలుందంటున్నారు. అంతరిక్ష పరిశోధనలో ఇటువంటి మార్పులను గమనించామన్న వారు కూడా ఉన్నారు. వారిని అందరూ అంగీకరించకపోవడమన్నది మరో సంగతి. పరిశోధనలన్నీ ఈ సిద్ధాంతాల ఆధారంగానే నడుస్తున్నాయి. జెరాల్డ్ పరిశోధనశాలలో ఎలెక్ట్రానుకు గల అయస్కాంత శక్తిని కొలిచారు. ఈ రకం కణాల అసలు లక్షణాలను గురించి చేసిన పరిశోధనల్లో, వేసిన కొలతల్లో ఇంతకంటే కచ్చితమయినది మరొకటి లేదంటారు. ఈ పరిశీలనలను వేల సంవత్సరాలపాటు చేస్తూపోతే, కొలతలో మార్పు కనబడుతుందేమోనంటారు జెరాల్డ్.

ఒక్క ఎలక్ట్రాను అయస్కాంత శక్తిని కొలవడమే నిజంగా ఆశ్చర్యకరమయిన సంగతి. అది జరగాలంటే, విద్యుత్తు అయస్కాంత లక్షణాలు స్థిరంగా ఉండే పరిస్థితిలో ఎలక్ట్రాను ఒకే తలంలో కదిలే విధంగా ఏర్పాటుచేయాలి. అది వృత్తాకార మార్గంలో గుండ్రంగా తిరిగేట్లు చేయాలి. దాని శక్తి మరే కారణంగా పెరగడం లేదని స్థిరం చేసుకోవాలి. అట్లా తిరుగుతుండే కణాన్ని తిరగబడేలా బలాలను ఉపయోగించాలి. ఇన్ని జరిగిన తరువాత ఫలితం తెలుస్తుంది. దాని శక్తి- ఒకటి పక్కన పదమూడు సున్నాలు వేసిన కొలతలో మూడవ వంతులు మాత్రమేనని!

ఇదంతా ఎవరికి అర్థమవుతుందని, ఎందుకు ఉపయోగపడుతుందని అడిగితే లాభం లేదు. ప్రపంచంలో జరుగుతున్న సైన్సు మొత్తం, మనకు నేరుగా పనికివచ్చేకాలం పోయింది. కొంత సైన్సు- కేవలం సైన్సుకొరకు జరుగుతుంది. అసలు కాలానికి, ఈ కొలతకు సంబంధం ఏమిటని మనం అడగడానికి వీలుంది. ఈ కొలత వెయ్యి సంవత్సరాల కాలంలో, ఒక్క భాగం పెరగడమో, తరగడమో జరిగి ఉండవచ్చు గదా! అది తెలియాలంటే, ఈ కొలతలను సంవత్సరాలపాటు పరిశీలించాలి. సైన్సులో ఏదీ శాశ్వతం కాదు. మార్పు వేగం మరీ నెమ్మదిగా జరుగుతుంటే, ఆ సంగతి తెలిసే వరకు మాత్రమే సిద్ధాంతం నిలబడుతుంది. ఆ మార్పు పరిశోధనశాలలో కొన్ని సంవత్సరాల కాలంలో చూపడం, చూడడం కుదరదు. భౌతిక, రసాయనిక, జైవిక విషయాలలో మార్పులు, ఒకప్పుడు జరిగిన వేగం, ఇప్పుడు జరుగుతున్న వేగం ఒకేలాగ ఉండవు. అందుకే ప్రయోగాలు వేల సంవత్సరాలపాటు సాగితే సంగతి తెలుస్తుంది. సాంకేతిక నైపుణ్యం పెరిగినకొద్దీ ఫలితాలు తొందరగా తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి.
................................
ఇలాంటివే మరికొన్ని ఆలోచనలు
...................................
కోతులు రాను రాను మారి.. మానవులు వచ్చారని సిద్ధాంతం. వేల సంవత్సరాలుపాటు, రకరకాల కోతులను పెంచి వాటి తెలివి తేటలను, మిగతా పద్ధతులను పరిశీలిస్తే, మార్చగలిగితే ఏ రకం జీవులు వస్తాయని పరిశీలించాలంటారు- షికాగో యూనివర్సిటీ జెనెటిసిస్ట్ బ్రూస్ లాన్.

నక్షత్రాలు పేలిపోవడం గురించి పరిశీలించడానికి పదివేల సంవత్సరాల పథకంతో సిద్ధంగా ఉన్నారు మేరీలాండ్ పరిశోధకులు కోల్‌మిల్లర్. నక్షత్రాలు పేలడం, సూపర్ నోవాలు పుట్టడం అరుదయిన విషయం. మన గెలాక్సీలో సూపర్‌నోవా క్రీ.శ.1604లో పుట్టిందని కెప్లర్ గమనించాడు. ఇటీవలివన్నీ మరీ దూరంలో గల గెలాక్సీలలో పుట్టాయి. సమయం ఉంటే అక్కడ బ్లాక్‌హోల్స్ గురించి పరిశీలించవచ్చు.

మనిషి తినే తిండి మారుతుంది. మార్పుల కారణంగా డయాబెటిస్ వంటి వ్యాధులు మొదలవుతాయి. వేల సంవత్సరాలలో మన తిండి, ఆరోగ్యం మారే తీరును పరిశోధించాలి, అంటారు శారా టిస్క్ఫా.

త్వరలోనే ప్రపంచంలోని చమురు నిక్షేపాలు అడుగంటుతాయి. అయిపోతాయి. వాటి స్థానంలో మరో రసాయన ఇంధనం దొరికే వీలు లేదు. అంటే మనుషులు బతికే తీరు పూర్తిగా మారిపోతుంది. అప్పుడు మనిషి, గతంలోని ఆటవిక మానవునివలే మారి, వనరుల కోసం కీచులాడుకుంటాడా? ఇది లారెన్స్ స్మిత్ ప్రశ్న!

జీవులలో ఒక కొత్త జాతి (స్పీసీస్) పుట్టడానికి లక్ష సంవత్సరాలు పడుతుంది. ఇదిమనకు తెలిసిన కాలం తీరు కాదు. భౌగోళిక కాలం అని మరొకటి ఉంది. లక్ష సంవత్సరాలు ఒక పరిశీలన సాగించే వీలుంటే, జీవుల పరిణామాన్ని గమనించవచ్చునంటారు- జెర్రీ కోయిన్.

Saturday, October 27, 2012

కొత్త కవిత



లలు రాళ్లకు కొట్టుకొని అరిగి పోతున్నయి.
అలిసిన సూర్యుడు సాయంత్రాన్ని చూచి సిగ్గు పడుతున్నాడు.
నీడలు మరీ పొడుగయి కరిగి పోతున్నయి
చీకటి భయం భయంగా కమ్ముకుంటుంది ఎందుకు?
కొంచెం సేపయితే తనదే రాజ్యమని దానికే తెలియదు!
మునిగాళ్ల మీద లేచినా నాన్న మోకాళ్లే కనబడినప్పుడు ఒక భయం ఆదరమయింది
పగలు రాత్రి గడియారానికి కూడా తెలియవు
బతుకు యంత్రంలో సాయంత్రం నలిగి పోయింది
గాజు కళ్లలో కాంతి తళుక్కుమంటుంది. సంగీతం వింటుంది
రాత్రి ముదిరే లోగా మహెఫిలె ముషాయిరా సాగుతుంది
కన్నీళ్లు ఆ లోపలే ఇంకిపోనీ!
పంచుకునేందుకు ముచ్చట్లు ఎన్ని లేవు గనుక!
ఉదయం భాష హుషారు1
ఆసుపోసిన అనుభవాల తుంపర
పూలూ ఉన్నయ్ ముళ్లున్నయ్1
చిటికెన వేలు పట్టుకుని నడుస్తున్న తెలివి ఎంత రుచి?
లలు రాళ్లకు కొట్టుకొని మురిసి పోతున్నయి


రంగుటద్దాలలోంచి చూస్తే వెలుతురు కనబడదు
అందరూ మోసే వారే అయితే పల్లకీ ఎక్కేది ఎవరు?
అగ్బరూ రాజ్యమేలాడు, అనామకుడూ రాజ్యమేలాడు
శిలాశాసనాలు వేయడం ఇద్దరూ మరిచిపోయారు
అడుగుజాడలను అలలు తుడిచేస్తాయి
శిలాస్తంభాలు కూడా గాలికి అరిగిపోతాయి
ఫలకం మీద పేరెక్కే దాకా అడుగులు పడుతూనే ఉంటాయి
దాద్ ఉన్నా లేకున్నా ఇర్షాద్ ఉంటుంది!!
మవునంగా నా కవితను మనసుల మీద చెక్కుతాను1
నందంగా మరో సాయంత్రం అవుతాను!

Thursday, October 25, 2012

లుఖ్మాన్ కథ!

లుఖ్ మాన్ గొప్ప పండితుడు. సన్యాసికూడా. అయితే వికారంగా ఉంటాడు. స్నానం, గుడ్డలుతకడం లాంటి పనుల పట్ల ఆయనకు ఆసక్తి తక్కువ. కనుక మురికిగా కనబడతాడు. అతడిని బానిసగా పొరబడి బాగ్దాద్ నగరంలో కందకాలు తవ్వేపనిలో పెట్టారు. 

సంవత్సరం గడిచింది. ఎవరికీ అనుమానం రాలేదు. నిజం తెలిసిన తరువాత ఖలీఫా, అతని కాళ్లమీద పడి క్షమాపణ కోరాడు.

సన్యాసి చిరునవ్వుతో ‘నీ క్షమాపణ నాకెందుకు? ఏడాదిపాటు నీ కింద తొత్తుగా నలిగాను. ఒక గంటలో మరవడం వీలవుతుందా? అయినా నిన్ను క్షమిస్తాను. నీకు లాభం జరిగిందేమో కానీ, నాకు నష్టం మాత్రం లేదు కదా! నీ పని జరిగింది. నాకు తెలివి పెరిగింది. నాకూ ఒక పనివాడుండేవాడు. వాడిని నేను కష్టాలకు గురిచేసేవాడిని. ఇకమీద ఆ తప్పు చేయను. నేను పడ్డ కష్టాలు గుర్తుంచుకుంటాను’ అన్నాడు లుభ్‌మాన్!

Monday, October 22, 2012

అనుకరణ - అనుసరణ


ఎవరయినా కంటికి ఫురుగులాగా కనబడుతున్నారంటే- అలుసయినట్లు కదా అర్థం!
పురుగులు బోలెడుంటాయి. ఊరికే చనిపోతాయి. అయినా బోలెడుంటాయి. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఎక్కువ సంఖ్యలో ఉండే జీవులు కీటకాలే. అంతగా విజయవంతంగా బతుకున్నాయంటే, వాటి నిర్మాణంలో, బతుకు తీరులో ఎంతో పరిణతి, వైవిధ్యం ఉంటుందని అర్థం. హెలికాప్టర్‌ను చూస్తే తూనీగలాగా కనబడుతుంది. వెస్పా అనే స్కూటర్‌కు కందిరీగ పేరు  పెట్టారని అందరికీ తెలియకున్నా తప్పులేదు. పురుగులను, వాటి నిర్మాణాన్ని మనిషి అనుకరించి రకరకాల అవసరాలకు  వాడుతున్నాడు. ఒక్క పురుగులేగాక ఎన్నో జంతువులు, మొక్కలు మనిషి తెలివికి పదునుపెట్టాయి. ఆ పదును కారణంగా బయో మిమిక్రీ అనే రంగం పుట్టింది.

పరిణామక్రమంలో జంతు, వృక్షాలు మారుతూ మారుతూ బతుకు సుఖంగా సాగడానికి అనువయిన క్షణాలను పెంచుకున్నాయి. పక్షుల ముక్కులు, పురుగులు, పక్షి రెక్కలు మొదలు ఎన్నో లక్షణాలు మనిషి సాంకేతిక ప్రగతికి

ఆధారాలయినాయి. మార్క్ మైల్స్ అనే యువ పరిశోధకుడు మైక్రో ఎలెక్ట్రో మెకానికల్ అండ్ మెటీరియల్ ప్రాసెసింగ్ అనే రంగంలో పనిచేస్తున్నాడు. అదేమిటో అర్థం చేసుకోవడానికి మనకు సమయం పడుతుంది. పదార్థం నిర్మాణంలో సూక్ష్మ వివరాలు అనుకుని ముందుకుసాగుదాం. అతను పరిశోధన పత్రికలను సీరియస్‌గా చదువుతున్నాడు. సీతాకోకచిలుక రెక్కలు, వాటిలో రంగులను గురించిన వ్యాసం ఒకటి అతడిని ఆకర్షించింది. కొన్ని సీతాకోకచిలుకల రెక్కలు నీలం రంగుతో మెరిసిపోతుంటాయి. రంగులు ఎక్కడ కనిపించినా వాటికి ఆధారంగా కొన్ని రసాయనాలు ఉంటాయని అందరికీ తెలిసే ఉంటుంది. ఈ నీలం రంగు మాత్రం రసాయనంలో నుంచి రావడం లేదు. ఇక్కడ భౌతిక శాస్త్రం ఉంది. ఈ రకం రంగులు పదార్థం నిర్మాణం కారణంగా వస్తాయి. సీతాకోక చిలుక రెక్కలమీద చాలా చాలా చిన్న పలకలు అమర్చి ఉంటాయి. వాటి ఆకారం, వరుస, మధ్య దూరం అన్నీఒక పద్ధతిలో ఉంటాయి. వెలుగు వాటి మధ్యన ప్రతిఫలిస్తూ రంగులు కనబడడానికి కారణమవుతుంది. ఇక్కడ ఆ రంగు నీలంగా ఉంది! రసాయనం అంటే పిగ్మెంట్ ఆధారంగా ఈ రకం నీలం తళతళ పుట్టాలంటే ఎంతో శక్తి అవసరమవుతుంది. అరుదుగా దొరికే శక్తిని సీతాకోక చిలుక తన రంగుల ప్రదర్శనకు వాడటంలేదు. ఆ శక్తి ఎగరడానికి తిండి వెదకటానికీ, పిల్లలను కనడానికి పనికివస్తుంది. అందుకే అది రంగు కోసం ఫిజిక్సును పట్టుకుంది.

ఈ పద్ధతితో మనం కూడా రంగులను పుట్టించవచ్చునని మైల్స్‌కు ఆలోచన పుట్టింది. ఎలెక్ట్రానిక్స్ రంగంలో పలుచని పరికరాల్లో రంగులు అవసరమవుతాయి. మైల్స్ వెంటనే రంగు పరికరాలను తయారుచేసే కంపెనీ పెట్టాడు. త్వరలోనే క్వాల్‌కామ్ అనే కంపెనీవారు దాన్ని కొన్నారు. ‘మిరాసోల్ డిస్‌ప్లే’ అనే పరికరంలో రంగు పద్ధతిని వాడుకుంటున్నారు. ఆప్టికల్ ఇంటర్‌ఫీరెన్స్ అనే పద్ధతితో గాజుపలకల కింద, కదిలే చిన్న చిన్న అద్దాలను ఏర్పాటు చేస్తారు. అద్దాలు పదినుంచి యాభయి చదరపు మైక్రాన్లు మాత్రమే ఉంటాయి. అవి కిందకు, మీదకూ కదులుతూ మైక్రో సెకెండ్స్‌లో రకరకాల రంగులు కనిపించడానికి కారణమవుతాయి. సీతాకోకచిలుక రెక్కలలోని పలకలమీద ఏ రంగూ లేని కాంతి పడుతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆ సూర్యకాంతి చూస్తుండగా రకరకాల రంగులను వెదజల్లుతుంది. మనకు తెలిసిన ఎల్‌సీడీ డిస్‌ప్లేలో కూడా రంగులు కనబడతాయి. ఈ రకం టెలివిజన్‌లు, మానిటర్‌లు మామూలయిని. కానీ, వీటిలో కరెంటు సాయంతో రంగు, వెలుగు పుట్టాలి. మిరాసోల్‌లో మాత్రం స్వంత వెలుగు లేదు. ఉన్నది సూర్యకాంతి మాత్రమే. బయట వెలుగు ఎంత బలంగా ఉంటే, అందులోని రంగులు కూడా అంతగా తళతలాడతాయి. ఎల్‌సీడీకి అయ్యే కరెంటు ఖర్చులో పదవ వంతుతో ఇక్కడ, ఇంకా మంచి రంగులు కనబడతాయి. ఈ పద్ధతినివాడి క్వాల్‌కామ్ వారు ఈ-రీడర్ (కిండిల్ లాంటి పుస్తకాలు చదివే పరికరం) తయారుచేశారు.


టెక్నాలజీని మిగతా వారికి అందజేస్తున్నారు కూడా. జీవుల శరీర నిర్మాణం ఆధారంగా పరికరాలు రావడం కొత్త మాత్రం కాదు. కొన్ని రకాల మొక్కల విత్తనాలు మన శరీరానికి, దుస్తులకు అంటుకుపోతుంటాయి.వాటిని తీయడానికి వేళ్ళతో ప్రయత్నిస్తే వేళ్లకు పట్టుకుంటాయి. వీటిలో వంకర తిరిగిన ముళ్లలాంటి భాగాలుంటాయని గమనించారు. వాటి ఆధారంగా 1955లోనే ‘వెల్‌క్రో’ పుట్టింది. సంచులు, దుస్తులు, షూస్‌లో బెల్టులు, జిప్‌ల బదులు చిరచిరలాడుతూ ఊడివచ్చి, అదిమితే మళ్లీ అతుక్కునే ‘వెల్‌క్రో’ అందరికీ తెలుసు. దాని వెనుక కథ మాత్రం తెలియదు. కొన్ని రకాల గడ్డి మొక్కలు గాలిలో కదిలే తీరునూ, నిటిలస్ అనే సముద్ర జంతువు శంఖం నిర్మాణాన్ని ఆధారంగా, పారిశ్రామిక పంఖాలను తయారచేశారు. ఒంటె తన ముక్కులో తేమను సేకరించుకునే తీరు ఆధారంగా, ఖతార్ దేశంలో ఒక గ్రీన్‌హౌస్‌ను పనిచేయిస్తున్నారు. పదార్థ నిర్మాణం మరీ చిన్నదయిన నానోస్కేల్‌కు చేరుతున్నది గనుక ఇప్పుడు మరెన్నో విచిత్రాలు రానున్నాయి.

బయో మిమిక్రీ అన్నది ఒక పదార్థం కాదు. అదొక పద్ధతి. మన దేశంలోనే కొండ ప్రాంతాలలో కడుతున్న ఒక ఆధునిక నగరంలో వర్షాలను ఆకర్షించే పద్ధతిలో ఆకురాలు చెట్లను నాటారు. అక్కడ వర్షం రాకపోవడమనే ప్రశ్న ఉండదంటున్నారు. మర్రి ఆకుల ఆదర్శంగా ఇంటి పైకప్పు మీద పెంకులను అమర్చి, వర్షం నీటిని సేకరించే ప్రయత్నం జరుగుతున్నది. చీమల పుట్టలు ఆదర్శంగా తడవని గోడలు కడుతున్నారు. లవాసా అనే ఈ నగరం 2020 నాటికి పూర్తి అవుతుంది. అది మూడులక్షల మందికి ఆశ్రయమిస్తుంది.


మనిషి కారణంగా వాతావరణం పాడవుతున్నదని అందరూ గుర్తించారు. ఆ రకం ప్రభావం తగ్గించాలన్న ఆలోచన మొదలయింది. ప్రకృతివల్ల పడే ప్రభావం మరొకరికి సాయంగా ఉంటుంది. మన నగరాలు కూడా ఆ రకంగా ఉండవచ్చునన్న ఆలోచన ఈ మధ్యన మొదలయింది. నగరాల్లో కురిసిన వర్షం, అక్కడి మురికి, చెత్తలను వెంట తీసుకునిపోయి, ఏదో ప్రవాహంలో కలుస్తుంది. ఆ నీరు మరింత పరిశుభ్రంగా, ప్రవాహంలో కలిస్తే బాగుంటుందన్న ఆలోచన, అందుకు తగిన ప్రయత్నాలు సాగుతున్నాయి.

అడవులు తగలబడుతుంటే పైన్ చెట్లు, యూకలిప్టస్ చెట్లు విచిత్రంగా తప్పించుకుంటాయి. యూకలిప్టస్ బెరడు ఊడి పడిపోయి బోదెను కాపాడుతుంది. ఈ పద్ధతి ఆధారంగా మంటకు తట్టుకునే గుడ్డను తయారుచేశారు. పీతలు, రొయ్యల శరీరంలోనుంచి ఒక రసాయనాన్ని గమనించి, అదే పద్ధతిలో మరో గుడ్డను తయారుచేశారు. ఇందులోని ఒక రసాయనం పొర మంటను అడ్డుకుంటుంది. పక్షులు, పురుగుల నుంచి నేర్చుకోవలసింది మరెంతో ఉందంటారు సైంటిస్టులు. సీతాకోకచిలుకల నుంచే మరెన్నో పాఠాలు అందుతున్నాయి. ఒక రకం సీతాకోకచిలుక రెక్కల మీద నల్లని మచ్చలుంటాయి. అవి సూర్యరశ్మిని బాగా పీల్చుకుంటాయి. వాటి నిర్మాణాన్ని గమనించి, అనుకరించి మరింత బాగా పనిచేసే సోలార్ టెక్నాలజీని సిద్ధం చేస్తున్నారు.

ప్రస్తుతం నకిలీ వస్తువులను తయారుచేసి మోసగించే ప్రయత్నాలకు సమాధానంగా, మంచి ఉత్పత్తుల మీద హోలోగ్రామ్‌లను పెడుతున్నారు. అదే రకమయిన హోలోగ్రామ్‌లను దొంగచాటుగా తయారుచేయడం కుదరదు. సీతాకోకచిలుకల రెక్కల నిర్మాణం ఆధారంగా, త్వరలోనే, హోలోగ్రామ్స్‌కన్నా మంచి పద్ధతి రానున్నదని చెపుతున్నారు. అందంగా దుస్తులు వేసుకున్న అమ్మాయిలను సీతాకోక చిలుకలు అనడం తెలుసు. ఇప్పుడు సిడ్నీలో ఒక ఫాషన్ డిజైనర్, రంగులులేని మార్ఫోటెక్స్ అనే గుడ్డను  తయారుచేయించాడు. అది వెలుగులో రకరకాల రంగులతో మెరుస్తుంది. ఇంతకంటే చక్కని మిమిక్రీ ఇంకేముంటుంది?

Sunday, October 21, 2012

మన గురించి మనం - మరోసారి!


చెప్పాలా ప్రత్యేకంగా
మాట్లాడాలన్న ఆలోచన మనిషికి ఎందుకు కలిగిందో ఆశ్చర్యం కదూ?
మాటలు అంటే ఏవో చప్పుళ్లని కదా అర్థం!
ఈ అర్థం అన్నమాటతోనే అన్నీ అనర్థాలు వస్తాయి.
భాష అని ఒకటి ఎట్లా ఎందుకు పుట్టింది. ఈ భాష మనిషి బతుకులో చాలా ముఖ్యమయిన అంశంగా మారింది.
మనమేవో ధ్వనులు చేస్తాం. అవి మిగతా వారికి అర్థమవుతాయి. అన్ని చప్పుళ్లూ అర్థమవుతాయా అది చిక్కు. చప్పుళ్లకు అర్థం ఉండాలి. అప్పుడే అవి అర్థమవుతాయి. పదాలు, వాటితో భాష ఉండాలి. అప్పడే అవి మాటలవుతాయి. అవి కూడా అందరికీ అర్థం కావు. ఆ భాష తెలిసిన వారిక మాత్రమే అర్థమవుతాయి. ఒక రకమయిన ధ్వనుల కూర్పుతో ఒక అర్థం పుడుతుంది. అది ఒక మాట అనిపించుకుంటుంది. చిత్రంగా ఒకే మాటకు రకరకాల అర్థాలు ఉండవచ్చు, ఒకే మాట అనుకున్నది ఒకే మాట కాకపోవచ్చు కూడా. అంటే గింటే, భాష తెలియాలంటే మాటలకున్న అర్థాలు తెలిసి ఉండాలి. తప్పదు.

వింత ఏమిటంటే, ఏ మాటకు ఏ మాటకు ఏమి అర్థం అన్న సంగతి ఎట్లా తెలుస్తుంది. ఈ అర్థమన్నది ఎక్కడుంటుంది. మాటకు ఒక నిడివి ఉంది. ప్రేమికుని మాట ముడుచుకుంటే వాని మనసు, విచ్చుకుంటే మొత్తం ప్రపంచం అని అర్థం వచ్చే కవిత ముక్క ఒకటి ఉరుదూలో ఉంది. ఇలాంటి అర్థం కొలతలు లేనిది. ఎక్కడ ఉందో తెలియదు. పాలు అన్నాము. అది తెలుగే. ఆ మాటకు ఛందస్సు ప్రకారం ఒక నిడివి ఉంది. అది ఒక రకమయిన ధ్వని రూపం. ఒక క్రమంలో వచ్చిన ప్రకంపనాల క్రమం అది. స్ట్రోబోస్కోపు అనే పరికరానికి ఆ ధ్వని రూపం తెలుస్తుంది. దాని స్థలం, కాలం, కదలిక, ధ్వని  పరిమాణాలు ఇట్లా ఎన్నో లక్షణాలు తెలుసుకోవచ్చు. మరి దాని అర్థం ఏమిటి అంటే చిక్కు మొదలవుతుంది. పాలు అంటే పశువులిచ్చే పాలు. ఆవుపాలు, బర్రెపాలు, అవి కూడా జున్నుపాలు, గుమ్మపాలు ఏవయినా కావచ్చు. మర్రిపాలు కూడా పాలే. అందిన పాలల్లో మీరూ నేనూ పాలు పంచుకోవచ్చు. అర్థం కాకపోతే నాకేమీ పాలుపోలేదని నేననవచ్చు. రాజుగారు లేదా నాయకులు దేశాన్ని పాలించడంలో పాలున్నాయి గదా. అని ఏ రకం. ఒక గురువు ఒక లఘువు కలిసిన చిన్న మాటకు ఇన్ని అర్థాలా అంటే కథ ముగియలేదు. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలుసుకోవలసి ఉంది. మాటకు కొలతలకు అందే లక్షణాలు కొన్ని మాత్రమే. అందులో అర్థం మాత్రం లేదు. ధ్వనితో ఒక అర్థం మనసులో మెదలాడవచ్చు. కానీ ఆ ధ్వనితో గానీ, లో గానీ ఆ అర్థం ఉండదు.

తమిళులకు పాల్ అంటే చాలు ఒక అర్థం తోస్తుంది. అర మాత్ర తగ్గినా అర్థం అదే. కన్నడిగులకు హాలు అంటే అర్థమవుతుంది. అక్షరం మారింది. హాలు అంటే మనకు ఇంగిలీషు పుణ్యమా అని మరో అర్థం తోస్తుంది. అక్కడ మనకు పాలు అనే అర్థం తోచక పోవడానికి కారణం మన చెవులు మాత్రం కావు. అవి తమ పనిని లక్షణంగా చేస్తున్నా సరే అర్థం తోచదు. మిల్ష్ అంటే ఏమి తోచింది. మిల్క్ లాగే ఉందని కదా. జెర్మనులు మిల్క్ బదులు మిల్ష్ అంటారు. చెవులకు బౌతికమయిన ధ్వని మాత్రమే తెలుస్తుంది. మన చెవులు లక్షణంగా పని చేస్తున్నా సరే, మరేదో భాషలో పాల గురించే అడిగినా వెర్రిమొగం మన వంతవుతుంది.

అదే మాటలతో వచ్చిన చిక్కు.

పాల గురించి ఇంత చెప్పుకున్న తరువాత ఒక అనుమానం. దుగ్ధం అంటే కూడా పాలే. క్షీరం అన్నా అదే అర్థం మరి. ఇన్ని భాషలలో ఇన్ని మాటలు. అన్నిటికీ ఒకటే అర్థం. మరి ఈ అర్థం ఏ భాషలో ఉంది. అది అసలు ప్రశ్న.

అర్థానికి భాష లేదు.

భాషలో మాటలకు మాత్రమే అర్థం ఉంది. లేదా అర్థాలున్నాయి.
మాటల భావం తెలియాలంటే తెలియనిదేదో తెలిసి ఉండాలి.
అందనిదేదో అంది ఉండాలి.
నైరూప్యమయిన భావం తెలిసి ఉండాలి.
ఈ సంగతి గురించి మనం ఇంతకు ముందు ఎప్పుడయినా ఆలోచించామా?
ఆలోచన మనకు అలవాటు లేదు కదా!
చెప్పింది వినడం మాత్రమే తెలిసిన మొద్దబ్బా(మ్మా)లము కదా మనము.
అంటే గింటే ఏదయినా చెయ్యడం సులభం. దాని గురించి చెప్పడం కష్టం అని తేలిందా?
మన గురించి మనం ఆలోచిస్తేనే ఇంత గందరగోళం ఉందే!
ఇక మిగతా సంగతుల గురించి పట్టించుకుంటే ఏమవుతుంది.

Saturday, October 20, 2012

తాకితే తప్పు కాదు!

సెషన్ జరుగుతుండగా, ఒక అమ్మాయిని చూపించి, ఆమెకు ఆరోగ్యం బాగుండలేదని చెప్పారు. నేను జాలిగా దగ్గరకు వెళ్లి, తల మీద చెయ్యి పెట్టి ‘వెళ్లి రెస్ట్ తీసుకొ’మ్మన్నాను. ఆ అమ్మాయి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అక్కడ మిగతా ఒకరిద్దరికి మాత్రం నేను ఆ అమ్మాయిని తాకడం తప్పుగా తోచిందని తరువాత తోచింది.

మన దేశంలో, మరిన్ని దేశాలలోనూ తాకడానికి అందరికీ ఒకే అర్థం తోచదు. ఒకరిని ఒకరు తాకడంలో ఒక నమ్మకాన్ని ఇవ్వడం, ఒక మైత్రీ బంధాన్ని ప్రదర్శించడంలాంటి అర్థాలు ఉన్నాయి. మన మద్దతు, ప్రోత్సాహం తెలియజేయడానికి మన దేశంలో వెన్నుతట్టడం అని పేరుంది. అంటే వీపు మీద తట్టి ‘్ఫరవాలేదు! మేమున్నాం’ అనడమని అర్థం. కానీ కొందరు ఎదుటివారు మాట్లాడుతుంటే తాకుతారు. ఆ తాకడానికి, మాటలకు అడ్డు రావాలన్నది అర్థం. ఇక ఏదో ఆనందం ప్రదర్శించే సందర్భం వచ్చినా షేక్‌హాండ్‌లూ, ఒకరినొకరు దగ్గరకు తీసుకోవడం, చరుచుకోవడం లాంటివి చేస్తుంటారు. అందుకు పూర్తి వ్యతిరేకమయిన శోక సందర్భాలు, మొదలయిన సమయాల్లో కూడా తాకి సాంత్వన చెప్పడం ఉంది. ఒకరిని మరొకరు తగలడంలో ఎన్నో రకాలున్నాయి. ఎన్నో అర్థాలున్నాయి. ఆ పనేదో సరిగా చేస్తే, సరిగా అర్థం చేసుకుంటే, చాలా మంచి కమ్యూనికేషన్ జరుగుతుంది. మాటలలో చెప్పలేని భావాలను ఒక్క స్పర్శతో చెప్పగల సందర్భాలున్నాయి. అదే స్పర్శ సరిగా ఉండకపోతే మాత్రం రకరకాల అపార్థాలు వస్తాయి. ఈ సరిగా అన్న పద్ధతికి నిర్వచనం ఇద్దరిలోనూ చెడే అవకాశం ఉంది. మామూలుగా తాకినా తప్పుడు అర్థం తోచవచ్చు. పనిగట్టుకుని తగిలినా ఫరవాలేదనిపించవచ్చు. ఇక్కడ ఏం చేశారన్నది ముఖ్యం కాదు. ఎట్లా చేశారు, ఎట్లా అర్థం చేసుకున్నారు అన్నది అసలు విషయం!

సాంప్రదాయికంగానే మన దేశంలో ఒకరినొకరు ముట్టుకుని పలకరించే పద్ధతి లేదు. షేక్‌హ్యాండ్ పద్ధతిని మనం ప్రయత్నించి నేర్చుకున్నాము. స్నేహంగా ముందుకువచ్చిన చేతికి ‘నమస్కారం’ ఎదురయిన సంఘటనలు ఇటీవలి వరకు కనబడ్డాయి. కరచాలనం కన్నా ఎక్కువ ‘తాకడం’ అట. పడమటి ప్రపంచంలో కూడా అనాగరికమే! సపోర్ట్‌లాంటి మంచి భావంతో తాకినా యుకె, యుఎస్ దేశాలలో అదేదో తప్పుడు భావంతో తాకుతున్నారనుకోవడం ఈనాటికీ ఉంది? ఇది ఎవరికి వారికే సంబంధించిన విషయం. కొంతమంది ఊరికే పక్కవారిని తాకుతుంటారు. తమను ఎవరయినా తాకినా తప్పుగా భావించరు. మరికొందరికి తాకడం పెద్ద తప్పుగా కనబడుతుంది. అందుకే ఎదుటివారి సంగతి అర్థమయితేగాని, ఎవరూ చెయ్యి కదిలించరు. అదే మంచి పద్ధతి.


కరచాలనం చేసేవారు కొంతమంది ప్రేమగా చేతిని నొక్కి వదులుతారు. కొన్ని దేశాలవారు చేతులు కలిపి కొంతవరకు నిజంగా షేక్ చేస్తుంటారు. కొంతమంది మాత్రం షాక్ తగులుతున్నంత త్వరగా చేతిని వెనక్కు లాక్కుంటారు. దీంతో వారి వారి మనస్తత్వాలు మనకు అర్థమవుతాయి. ఎందుకొచ్చిన సందడి అన్నట్లు, చేతిని చెక్కలాగా అందించి, అంతే చల్లగా వెనక్కు తీసుకునేవారున్నారు. వారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరు ఎదురవుతారు. మాటలు సాగుతాయి. భావాలు, మాట తీరు నచ్చుతాయి. అప్పుడు సూచనగా మనం వారి చేతిని ఒకసారి తాకడం అనుకోకుండానే జరుగుతుంది. తొలిపరిచయం జరిగినప్పుడు కూడా మామూలుగా కలిసిన చేతులు ఒక క్షణం ఎక్కువగానే కలిపి ఉంటాయి. కదులుతాయి. అది సహజం. ఒక గొప్ప మాట చెప్పిన భావం కలిగినవారు, మరొకరిని తాకడం, చరచడం లాంటివి మన దేశంలో మామూలుగా జరుగుతుంటాయి. దేశ సంప్రదాయాలను బట్టి ఈ తాకడం శరీరంలోని భాగాలు కొన్నింటికి పరిమితమవుతుంది. చేతిమీద, భుజం, వెన్నుమీద తట్టడం మనకు మామూలే. చిన్నపిల్లలను పలకరించడానికి మనం తలమీద తాకుతాము. కొన్ని దేశాల్లో మిత్రులు ప్రేమగా ఒకరి జుట్టును మరొకరు వేళ్లతో కదిలిస్తారు. థాయ్‌లాండ్ దేశంలో ఈ రెండు పనులను తప్పుగా భావిస్తారు! స్పర్శతో మనుషుల మధ్య కొత్త బంధాలు ఏర్పడతాయి. తలిదండ్రులు పిల్లలను, మిత్రులు ఒకరినొకరిని, డాక్టర్లు పేషెంట్లను తాకుతారు. అందులో ఎనె్నన్నో మంచి భావాల ప్రకటన జరుగుతుంది. వ్యాపారం, పాలిటిక్స్ లాంటి రంగాలలో ఉండేవారికి, తాకి, మైత్రిని మొదలుపెట్టడం, బలపరచడం బాగా తెలిసి ఉండాలి. ఎదుటి మనిషి చేతిని రెండు చేతులతోనూ పట్టుకుని మాట్లాడడం మనం చూసే ఉంటాము. షేక్ హ్యాండ్ చేస్తూనే మరో చేత్తో మనం ఎదుటి మనిషి చేతిని, పట్టుకున్నామంటే మన మధ్య బంధం మామూలు రకం కాదు సుమా!’ అని చెప్పడమే గదా!


ఈమారు కొత్తగా ఎవరితోనయినా పరిచయం జరిగినప్పుడు, కరచాలనం చేస్తూనే ఎడమ చేతితో కూడా వారిని చేతిమీద తాకుతూ వారి పేరును మరోసారి అని చూడండి. మీకు పేరు మరింత బాగా గుర్తుంటుంది. వారికి మీరెంతో స్నేహభావం గలవారన్న సందేశం అందుతుంది! ఒకే స్థాయి మనుషులమధ్య స్పర్శ సులభంగా జరుగుతుంది. మిత్రులను వీపుమీద చరిచినా అది ప్రేమ! కౌగిలించుకున్నా, చేతిని గట్టిగా నొక్కినా, మరింత ప్రేమ ప్రదర్శించినట్టు లెక్క! అదే పని కొత్తవారితో చేస్తే వెకిలిదనమవుతుంది. కొత్తవారితో కరచాలనం సెకండ్లపాటు మాత్రమే. నిడివి ఏమాత్రం ఎక్కువయినా అందులో మరేవో అర్థాలు తోచే ప్రమాదం ఉంది! మనకంటే పెద్దవారితో, పైస్థాయి వారితో గౌరవంగా క్షణాల షేక్ హ్యాండ్ వరకే పరిమితం కావాలి.


పెద్దవారు, ముఖ్యంగా పై ఆఫీసర్లు, అందరినీ భుజంమీద తట్టి తమ మన్నన తెలియచేస్తారు. డాక్టర్లు తమ పేషంటుకు భరోసా ఇవ్వడానికి తాకుతారు. టీచర్లు పిల్లలను మెచ్చుకుంటూ తాకుతారు. పెద్దలు ఆశీస్సులిస్తూ తలను తాకుతారు. ఈ రకంగా తాకడానికి ఎన్నో అర్థాలున్నాయి. ఎన్ని చేసినా, మన దేశంలో యింకా స్పర్శ విషయంలో ఆడా, మగ, తేడా ఎక్కువగా ఉంది. ఉంటుంది. ఈ తేడా మిగతా దేశాలలో లేదని కాదు. ఇందులో వయసు పాత్ర కూడా ఉంది. పెద్ద వయసుగలవారు ఎవరినయినా ప్రేమగా భుజంమీద తట్టవచ్చు!


స్పర్శ నిజానికి బలమయిన సందేశాలనిస్తుంది. విషయాన్ని, సమయాన్ని, సందర్భాన్ని బట్టి స్పర్శ అర్థాలు మారుతుంటాయి. హద్దులు మీరనంతవరకు తప్పులేదు.