Saturday, December 31, 2011

తెలుగులో సైన్సు - గతంలోనే ఉంది

నేనేదో గొప్పగా సైన్సు రాస్తున్నానని చాలా మంది నన్ను అభినందిస్తుంటారు.
రెండు మూడు అవార్డులు కూడా ఇచ్చారు.
మాకు దారి చూపిన పెద్దలు వసంతరావు వెంకటరావు గారు, నళినీమోహన్ గారు, కోనేటిరావు గారు లాంటి కొందరిని చూడ గలిగాను,, వారి అభిమానాన్ని కొంత చూరగొన్నాను కూడా.
అయినా, నేను పుట్టిన సంవత్సరం 1953 లోనే పాపులర్ సైన్సు రాసుకున్నారంటే సంతోషం కలిగింది.
అప్పటి వారు కనీసం పేరు కూడా వేసుకోలేదు.

మంచి పని చేయాలి, అంతే గానీ చేస్తున్నామని అన్నిసార్లూ గొంతు చించుకోనవసరం లేదు.
పనికి పేరు రావాలి.
మనిషికి కాదు!


Thursday, December 29, 2011

నా కవిత - ఏముంది


ఏముంది

పదిమంది రాసింది చదివినందుకు నేనున్నాను
పదిమంది పాట విన్నందుకు నేను మిగిలాను
అందరి ఆలోచనలు తలలో ఆడుతున్నందుకు
నేనింకా కదులుతున్నాను
కలం కన్నీళ్లతో కాగితాన్ని తడిపింది
గతంలోని బరువును ఊపిరి తుడిపింది
మెరుపు విరిగి
ముక్కలు తల నిండా పరుచుకున్నాయి
చిత్తడి నేలలోంచి
అక్షరాలు మొలకెత్తుతున్నాయి
వాన వెలిస్తే బాగుండును
పొగచూరిన ఆలోచనల వాసనలోనుంచి
సారాంశం వాక్యాలను వెతకగలిగే వాడిని
సంతకాలకు రంగులున్నాయా
ఎందుకట్లా మొరటు గొంతులు
కనుపాపల మీద నాట్యమాడుతున్నాయి
గీతలు కరగక ముందే
ఆకారాలను కలగలిపి
రేపటి కొరకు వంతెన కొనసాగించాలి
కనీసం మాటలకు
వైశాల్యం పెరుగుతుంది
లేకుంటే అంతా అయోమయం
చెప్పేందుకు నేనుండాలె గదా

2011లో సైన్సు - కొన్ని ముఖ్యాంశాలు


ఒక్కసారి వెనక్కి తిరిగి.....

వీడ్కోలు ‍ 2011

మరో మలుపు వచ్చింది. అనుభవాలు, పరిచయాల ఆధారంగా గతాన్ని గుర్తు చేసుకోవడానికి ఇది సమయం. సంవత్సరాలు వస్తాయి, పోతాయి. కొన్ని సంవత్సరాలు మనలను ఒక కుదుపు కుదిపి మరీ పోతాయి. సైన్సుకు సంబంధించి ఈ సంవత్సరం, ప్రతీ సంవత్సరం లాగే ఎన్నో కొత్త సంగతులను మనముందు ఉంచింది. అందులో కొన్ని నిజంగా కుదుపులు! మనిషి ఆలోచనలు, అనుభవాలను మార్చే విషయాలివి...


కాంతికన్నా వేగంగా...

‘న్యూట్రినోలు మనిషికి తెలిసిన వేగం పరిధులను దాటాయి. భౌతికశాస్త్రం మారే కాలం వచ్చిందా?’
ఐన్‌స్టైన్, ఆయన సాపేక్ష సిద్ధాంతం, 20వ శతాబ్దంలోని భౌతిక శాస్త్ర అవగాహన అంతా తలకిందులయే పరిస్థితి వచ్చినట్టుంది. సైన్సులో శాశ్వత సత్యాలు ఉండవు అనడానికి ఇదొక నిదర్శనం. 174 మంది భౌతిక శాస్తవ్రేత్తలు న్యూట్రినోలనే అణుకణాలతోప్రయోగాలు చేశారు. ఆ కణాలు వేగంగా విశ్వమంతా వ్యాపిస్తున్నాయని తెలుసు. ఆ వేగాన్ని కనుగొనాలని వాటిని స్విట్జర్లాండ్‌లోని జెనీవానుంచి ఇటలీలోని గ్రాన్ సాటోలో ఉండే ఒక డిటెక్టర్ వరకు పంపించారు. ఒకసారి కాదు, మూడు సంవత్సరాల పాటు పంపి వేగాన్ని విశే్లషణలు చేశారు. 2011 సెప్టెంబర్‌లో ఫలితాలను ప్రకటించారు. ఆశ్చర్యంగా కణాలు సెకండులో ఒక కోటి డెబ్బయి లక్షల వంతు ముందే గమ్యం చేరుతున్నాయట. ఈ మాట సులభంగా అర్థం కాదని తెలుసు. ఒకటి మాత్రం నిజం. న్యూట్రినోలు కాంతికన్నా వేగంగా కదులుతున్నాయి. అంటే వేగం గురించి ఇప్పటివరకున్న అవగాహనలు తప్పు, అని అర్థం! అంటే ఐన్‌స్టైన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం బోర్లాపడిందని అర్థం! కాలం ముందుకు మాత్రమే సాగుతుందని కదా అనుకుంటున్నాం! అది వెనక్కు కూడా వెళ్లగలదు! సమాచారాన్ని న్యూట్రినోల మీద పంపగలిగితే, అది పంపకముందే గమ్యానికి అందుతుంది. ఇంకా సులభంగా చెప్పాలంటే కారణం కన్నా ముందు పని జరుగుతుంది! విశ్వం గురించిన అవగాహనలిక మారనున్నాయి! సిద్ధంగా ఉందాం మరి!
‘‘కాంతికన్నా ముందే వేగంగా కదిలే వర్తమానం పంపించవచ్చు. కానీ పంపకముందే గమ్యం చేరే వర్తమానాన్ని ‘పంపడం’ ఎలా కుదురుతుంది’’? ఈ ప్రశ్న నిజంగా సమంజసం! ఈ కాంతికన్నా వేగాన్ని చాలామంది అబద్ధం అంటున్నారు. కానీ, ఈ ప్రయోగంలో కణాలను పంపడం, అవతలవాటిని పట్టడం, వేగం కొలవడం అద్భుతాలు. ఫలితం అబద్ధమని రుజువయితే కూడా, ఈ అద్భుతాలు మాత్రం నిలబడతాయి. ఇక, స్థలం, కాలాల గురించిన మన అవగాహనలు మరోసారి పరీక్షించాలన్న సూచన అంతకన్నా అద్భుతం. విశ్వం తీరులో అర్థంకాని రహస్యాలు మిగిలే ఉన్నాయని మాత్రం అందరూ అంగీకరిస్తారు. ఈ న్యూట్రినో ప్రయోగం ఆ మార్గంలో మనిషిని నడిపిస్తుందన్నది సత్యం!

ఎయిడ్స్‌ను ఆపవచ్చు....

‘‘స్టెమ్ సెల్స్ సాయంతో రోగ నిరోధక శక్తిని మార్చి హెచ్‌ఐవీని తట్టుకునే రకంగా మార్చవచ్చు. అంటే ఎయిడ్స్‌కు చికిత్స ఉందని అర్థం!’’

 జింక్ ఫింగర్ న్యూక్లియెసెస్ అనే ప్రొటోన్లను పరిశోధన కాలంలో తయారుచేశారు. ఇవి కణాల్లో ప్రవేశించి జన్యువులను కత్తిరిస్తాయి. 2011లో వీటిని వాడి, ఇరవయి సంవత్సరాలుగా చికిత్స పొందుతున్న ఎయిడ్స్ రోగుల, సమస్యను అంతం చేశారు. ఇనే్నళ్లుగా ఎన్ని రకాలు మందులు యిచ్చినా, వారిలో వైరసు మాత్రం ఉంటూనే వచ్చింది. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఈ పద్ధతిలో జరిగిన మరో పరిశోధన కూడా మంచి ఫలితాలను ఇచ్చింది. అక్కడ కూడా ఆరుగురు పేషంట్లకు, మామూలు చికిత్స ఆపి, జింక్ ఫింగర్ న్యూక్లియెస్‌తో మార్చిన కణాలను ఎక్కించారు. మందులు ఆపినందుకు హెచ్‌ఐవీ వైరసు ముందు ఎక్కువయింది. కానీ, త్వరలోనే వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఒక వ్యక్తిలో, పనె్నండు వారాల తర్వాత అసలు వైరసు కనబడనే లేదు. సిడి నాలుగు అనే రోగ నిరోధక కణాలమీద సిసిఆర్ ఐదు అనే స్థావరం ఉంటుంది. వైరసు జీవకణంలోకి ప్రవేశించి హాని కలిగించడానికి ఈ స్థావరం అవసరం. ఈ కణాలలోని రిసెప్టర్ స్థావరాన్ని తొలగిస్తే, వైరసు పని ఆగిపోతుంది. మునుముందు, ఈ రకంగా మార్చిన కణాలను ఎక్కువగా యిచ్చి పరీక్షలు చేస్తారు. అసలు సిసిఆర్ ఐదు లేని స్టెమ్ సెల్స్‌ను తయారుచేసే ప్రయత్నం కూడా ఫలించింది. త్వరలోనే వాటితో మనుషులలో ప్రయోగాలు జరగనున్నాయి.
‘‘ప్రపంచాన్నంతా కొంతకాలం గడగడలాడించిన ఎయిడ్స్ వ్యాధిని త్వరలోనే అదుపు చేయగలుగుతారు’’.

అయినా, మనిషే గొప్ప!...

‘‘ఐబిఎమ్ వారి కంప్యూటర్, వ్యాప్సన్ ఒక క్విజ్ పోటీలో ఛాంపియన్ల మీద గెలిచింది. అయినా, అది మనుషుల తెలివితో పోటీపడజాలదంటున్నారు’’.

 జియొపార్డీ అనే క్విజ్ షోలో కెన్ జెన్నింగ్స్, బ్రాడ్ రుడర్ ఛాంపియన్‌లు. వాళ్లతో వ్యాప్సన్ అనే కంప్యూటర్ మూడు రోజులపాటు పోటీపడింది గెలిచింది కూడా. అయితే ఇంతకూ ఈ వ్యాప్సన్ శక్తి ఏమిటి? కేవలం ఒక యంత్రమా, లేక తన మార్గం తాను వెతకగలిగే మరమనిషా? ఇంతకూ ఆర్ట్ఫిషియల్ ఇంటలిజెన్స్ అంటే ఏమిటి? దానికి ఉండగలిగిన ప్రయోజనాలేమిటి? అన్న ప్రశ్నలు మిగిలే ఉన్నాయి.
జియొపార్టీ క్విజ్ విచిత్రంగా ఉంటుంది. అందులో ప్రశ్న ఉండదు. క్విజ్ మాస్టర్ ఒక క్లూ లాంటి వాక్యం చదువుతారు. ముందు బజర్ నొక్కిన వ్యక్తి, అందుకు సంబధించిన జవాబు కాక, ఆ జవాబు రాదగిన ప్రశ్న అడగాలి!
సెర్చ్ ఇంజన్లో సమాచారం వెతకాలంటే కొన్ని కీలకమైన పదాలు ఆధారం. ‘భారతీయ భాషలన్నీ సంస్కృతం నుంచి పదాలను అరువుతెచ్చుకున్నాయి. కానీ ఇది మాత్రం పర్షియన్ నుంచి తెచ్చింది’ అని క్విజ్ మాస్టర్ అడిగారనుకుందాం. పోటీలో ఉన్నవారు ‘ఉరుదూ అంటే ఏమిటి?’ అన్న ప్రశ్నను జవాబుగా అడగాలి. భారతీయ భాషలు అని సెర్చ్ చేస్తే ఏ గూగుల్‌లోనో వందల పేజీలు వచ్చేస్తాయి. ఇక్కడ అది కాదు కావలసింది. వ్యాప్సన్ ఇక్కడ సరైన సమాధానాన్ని వెదకగలుగుతుంది. జవాబు ఎక్కడ అని కాక, ఏమిటి అని వెదకగలగడం దాని ప్రత్యేకత. రకరకాల పద్ధతులను వాడి వ్యాప్సన్ సుమారు ఏడు కోట్ల పేజీలలో జవాబు కొరకు వెదుకుతుంది. నమ్మకం కుదిరితేనే జవాబు చెతుంది. అందుకు పట్టే సమయం కేవలం మూడు సెకండ్లు.
ఇంతకూ వ్యాట్సన్  అన్నింటికన్నా, మనిషికన్నా తెలివయిన యంత్రం అనగలమా? అది సృజనాత్మకంగా మనిషిలాగా ఆలోచించగలుగుతుందా? అన్న ప్రశ్నలకు కాదు, లేదు అని జవాబిస్తున్నారు నిపుణులు. కంప్యూటర్‌కు హాస్యం అంటే ఏమిటో తెలియవచ్చు, కానీ జోక్ మాత్రం అర్థం కాదు, అంటారు వారు.
‘‘వ్యాట్నన్ ను తయారుచేసిన డేవిడ్ ఫెరుచి కూడా ఇది కంప్యూటర్ మాత్రమే అంటున్నారు’’.

కొత్త గ్రహాల వేట.. డబ్బు దండగా?..

‘‘కెప్లర్ ఉపగ్రహం భూమిలాంటి ఎన్నో గ్రహాలను కనుగొంటున్నది. వాటిల్లో జీవం గురించి కూడా తెలిసే అవకాశం ఉంది’’. 

స్టార్‌వార్స్ సినిమా తీసినపుడు జార్జ్ లూకాస్ అనుకోకుండా రాసిన కొన్ని సన్నివేశాలు నిజమయ్యాయి. కెప్లర్ అబ్జర్వేటరీ కనుగొన్న 16 బి అనే గ్రహం ఆ సినిమాలో కనిపించిన గ్రహంలాగే ఉంది. అది శనిగ్రహమంత పరిమాణం గలది. ఈ పరిశోధన నౌక భూమిలాంటి గ్రహాల కొరకు చేస్తున్న అనే్వషణ అనుకోని విజయాలను సాధించింది. ఇప్పటికే అది చాలా గ్రహాలను గుర్తించగలిగింది. ఒక స్పేస్ షటిల్‌కయేకన్నా కొంచెం ఎక్కువ ఖర్చుతో కెప్లర్ నౌక సాధించిన విజయాలు అందరినీ ఆశ్చర్యంలో ముంచాయి. అది కనుగొన్న గ్రహాలలో 10బి, 11, 16బి, హెచ్‌డి855128, ఎల్‌కెసిఏ 15బి మొదలయినవి ముఖ్యమైనవి. అయితే విచిత్రంగా నాసావారు, ఖర్చుల కొరత పేరుతో, కెప్లర్ కార్యక్రమాన్ని ఆపివేయడం ఇంకా ఆశ్చర్యకరమయిన విషయం. కెప్లర్‌కు సహాయంగా ఉండడానికి ప్రయోగించదలచిన రెండు కృత్రిమ ఉపగ్రహాలను ఇప్పటికే ఆపివేశారు. ఇక కెప్లర్ మనుగడ కూడా అనుమానంలో పడింది.
గ్రహాలను అన్వేషించడానికి జరుగుతున్న పరిశోధనను, బుద్ధిజీవులు లేదా మరోగ్రహాలనే జీవుల పరిశోధనలో భాగంగా చెప్పవచ్చు. ఇంత ముఖ్యమైన కార్యక్రమానికి తగిన ప్రాధాన్యం లేకపోవడం గురించి అందరూ ఆందోళన పడుతున్నారు. నాసావారు, తమ సంస్థల్లోని వారు కాక, వెలుపలున్న నిపుణులతో ఒక సంఘాన్ని ఏర్పాటుచేసింది. వారు కెప్లర్ పని గురించి, పోటీగా ఇతరత్రా జరుగుతున్న కృషి గురించి ఒక నివేదికను త్వరలో ఇవ్వనున్నారు. ఆ తర్వాత కెప్లర్ కొనసాగేదీలేనిదీ తెలుస్తుంది.
‘ఈ కార్యక్రమం ఎంతో ముఖ్యమయినది. దీన్ని ఆపిన తర్వాత, జీవం కొరకు అనే్వషణకు అర్థం ఉండదు’ అంటారు కెప్లర్‌తో పనిచేయిస్తున్నవారు, మిగతా పరిశోధకులు కూడా. కెప్లర్ ఇప్పటికే కనుగొన్న గ్రహాలన్నీ మనకు దగ్గరలోనివే. అసలు అనే్వషణ ఆ రకంగా సాగాలని ముందే నిర్ణమయింది. ఆ గ్రహాలను మరింతగా పరిశీలిస్తే, జీవం కనబడి తీరుతుంది, అంటారు మరికొందరు.

‘‘ఇతర గ్రహాల మీద జీవం ఆచూకీని చెప్పగల కెప్లర్ కార్యక్రమం కొనసాగుతుందా’’ అన్నది ప్రశ్న.

వ్యక్తులు... అమహమద్ జెవేల్

ఈజిప్టు దేశంలో పుట్టిన ఈ రసాయన శాస్తవ్రేత్త నోబెల్ బహుమతి గెలిచాడు. ఆ దేశంలో నోబెల్ గెలిచిన వారు మరెవరూ లేరు! అహమద్ అమెరికాలోని ప్రసిద్ధ సంస్థ కాల్‌టెక్‌లో పనిచేస్తున్నారు. తమ దేశంలో జరుగుతన్న ప్రజా పోరాటం గురించి తెలిసి ఆయన అక్కడికి వెళ్ళారు కూడా. అక్కడ అందరికీ ఆయన ఒక హీరోమరి! నా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. నేను అక్కడే చదువుకున్నాను’ అన్నారు అహమద్
రసాయనాల మధ్య జరిగే చర్యలను పరిశీలించడానికి, లేజర్లనువాడే పద్ధతి కొనుగొన్నందుకు అహమద్ జెవేల్ 1999లో నోబెల్ బహుమతిపొందారు. తన దేశంలో సైంటిస్టులకు తగిన గౌరవం, ఆదాయం లేదని తెలుసు. యూనివర్సిటీలు కూడా అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయని తెలుసు. ఒకక్లాసులో వెయ్యిమంది విద్యార్థులు ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
శాస్తవ్రేత్తలు రాజకీయాలను పట్టించుకోరన్నది జగమెరిగిన సత్యం! కానీ అహమద్ తమ దేశం వెళ్లి తిరుగుబాటుదారులు, ప్రభుత్వానికి మధ్యవర్తిగా వైస్ ప్రెసిడెంట్ ఒమర్ సులేమాన్‌తో చర్చలు జరిపారు. తహ్‌రీర్ మైదానంలో చేరిన యువకుల నాయకులతోకూడా మంతనాలు జరిపారు.
‘అలెగ్జాండ్రియా లైర్రీలో నేను సైన్సు, ప్రజా సమస్యల గురించి ఉపన్యసించాను. ఆరువేలమంది యువకులు వినడానికి వచ్చారు. కైరోలో ఈజిప్టులోని సైన్సు, టెక్నాలజీలను గురించి నేను చేసిన జాతీయ ప్రసంగాన్ని, మూడు కోట్లమంది టెలివిజన్‌లోచూచారు. మీరు నమ్మరుగానీ, సైన్సులో ఘనత సాధించినవారికి, ఫుట్‌బాల్ ప్లేయర్లకన్నా మంచి గుర్తింపువుంది. ప్రజలు జ్ఞానపిపాస కలిగి ఉన్నారని తెలుస్తూనే ఉంది గదా!’’ అంటారాయన. ఈ పరిస్థితి మన దగ్గర కూడా ఉంటే ఎంత బాగుండును!

మరెన్నో సంగతులు...

సంవత్సరం చివరన కనీసం సైన్సు పత్రికలు, ఆ సంవత్సరంలో గొప్ప సైన్సు వార్తాంశాలను ఒకచోట చేర్చి ప్రచురిస్తారు. అందులో ఆసక్తి ఉండే కొంతమంది వాటిని చదువుతారు. చాలామంది, ఆ పత్రికలను ఆ వార్తలను పట్టించుకోరు. అందుకు కారణాలు లేకపోలేదు. సైన్సు సాధారణంగా, సామాన్యులకు అర్థంకాని పద్ధతిలో ముందుకు సాగుతూ ఉంటుంది. శరీరంలో సైన్సు నిత్యం బతుకులో సైన్సు గురించి పట్టనివారికి హిగ్స్ బోసాన్ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తే వారెందుకు వింటారు? ఎందుకు వినాలి?
ఆటం అన్నమాట విని ఉంటారు. అయినా ఆటంబాబులు అంటే దీపావళిని గురించి ఆలోచించేవారే ఎక్కువ! అణువులో ఎలెక్ట్రానులు, న్యూట్రానులు, ప్రోటానులుంటాయని కొంతమందికి తెలిసి ఉంటుంది కానీ ప్రొటానులంటే ప్రొటీనులాంటివి అనుకునే వారే ఎక్కువ! ఇక న్యూట్రీనోల గురించి హిగ్స్ బోసాన్‌ల గురించి ఎవరికి చెప్పాలి? ఈమధ్యన ఒక తెలుగు దినపత్రికలో బోసాన్‌ల గురించి రాస్తూ ‘దైవకణాలు’ అనే మాట వాడారు. నిజంగానే, బోసాన్‌లు అనే ఈ కణాలు ఉన్నాయా లేవా అని అనుమానం. ఫ్రాన్సు, ఇటలీ మధ్య నేలలో 17 మైళ్ళ నిడివి సొరంగం గల లార్జ్ హాడ్రాన్ కొలైడర్‌లోని ప్రయోగాలతో బోసాన్ల ఉనికి 2011లో తెలుస్తుందన్నారు. అక్కడ చాలా సంగతులు తెలిశాయి. కాలం వెనక్కు నడవగలదన్న సూచనలు కూడా వచ్చాయి కానీ బోసాన్‌లుమాత్రం కనిపించలేదు. కనుక ‘దేవుడింకా కనిపించలేదు’ అని మనం చెప్పుకోవచ్చు.
మనిషి వెంట్రుక మందంలో అరవయివేల వంతు మాత్రమే ఉండే మోటారు ఈసారి తయారయింది. గినెస్‌బుక్‌వారు కూడా దాన్ని గుర్తించారు. అడవులు తిరిగి పెరుగుతున్నాయన్నారు. లేకుండా పోయిన జంతుజాతులను, మళ్లీ పుట్టించవచ్చునన్నారు. మొట్టమొదటిసారిగా, నోబెల్ బహుమతిని మరణానంతరం కాన్సర్ పరిశోధకుడు రాల్ఫ్ స్ట్రైన్‌మన్‌కు ఇచ్చారు.
‘ఎన్నో విశేషాలు, ఎన్నెన్నో విషయాలు. ఇవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. పట్టించుకోవడం మన వంతు!’

Monday, December 26, 2011

కవిరాజు త్రిపురనేని రామస్వామి - పుస్తకం - సమీక్ష


‘కవిరాజు’ కలం చిందులు
-కె.బి.గోపాలం, December 18th, 2011

కవిరాజు
సాహిత్యం -2 - భగవద్గీత-
రచన: కవిరాజు త్రిపురనేని రామస్వామి,
పేజీలు :422
వెల: రూ. 200/-
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,
బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాద్.


కవిరాజుగా పేరుపొందిన త్రిపురనేని రామస్వామి ‘చౌదరి’గారు నిజమయిన స్వంత భావాలు గల తాత్వికులు. వారి రచనలు పండిత పామరులలో కూడా ఆలోచనలను ప్రేరేపించాయి. వారి రచనలను విశాలాంధ్రవారు సంపుటాలుగా వేస్తున్నారు. ఇది రెండవ సంపుటం (మొదటి సంపుటం వివరాలు ఈ సంపుటంలో లేవు). ఇందులో మాత్రం భగవద్గీత అన్న పద్యరచన, కురుక్షేత్రం, శంబుకవధ, ఖూనీ అనే పద్య నాటకాలు, కుప్పుస్వామి శతకము, ధూర్తమానవా శతకాలు, సూతాశ్రమగీతాలు, వివాహవిధి అన్న రచనలు ఉన్నాయి. ఇవన్నీ 1920 నుంచి 1941 మధ్య వచ్చిన రచనలు.


‘అహమ్ బ్రహ్మాస్మి’ గాన నాకు నేనె నమస్సులొనర్చుకొందు’ అని మొదలుపెడతాడు కవిరాజు. వారి ఆలోచనా సరళికి అక్కడే అంకురార్పణం జరుగుతుంది. అందరూ నమ్మి అనుసరిస్తున్న విషయాలను మరో పార్శ్వం నుంచి చూడగల శక్తి, దాన్ని వివరించి, నమ్మించగల పాటవమూ గల కవిరాజు రచనలకు నిజంగా తగిన ప్రాచుర్యం లభించకపోవడానికి కారణాలు వెదకవలసి ఉంది.


‘తొలి పలుకు’లో (భగవద్గీతకు) ‘ఒకదానికలవాటుపడిన లోకమాయలవాడులనుండి తప్పించుకొనుటకు చాలా కాలము పట్టును’ అంటారీ కవిరాజు. కురుక్షేత్ర యుద్ధము ధర్మసంస్థాపనకు కానే కాదు. కారెంపూడి యుద్ధం మాత్రం కేవలం ధర్మ సంస్థాపన కొరకే జరిగింది, అంటూ ఒక కొత్త భగవద్గీతను ఈ రచనలో ఆవిష్కరించారు. అసలు రచనను అర్థం చేసుకోవడానికి కొంత భాష, మరింతగా కొత్త ఆలోచనలను అంగీకరించగల, కనీసం వినగల ఓపిక అవసరం. కానీ, తొలి పలుకులను చదివిన తర్వాత ఆ ఓపికతో బాటు ఎంతో ఉత్సుకత, కుతూహలం కూడా పుట్టుకు వస్తాయి. తెలుగు భాష పరిస్థితి (అప్పటికే!), ఉత్తరదేశం వారి గొప్పదనం (?) గురించి కవిరాజు వ్యాఖ్యలు ఎవరినయినా కదిలిస్తాయి. ద్విపదకు గౌరవం లేనందుకే పల్నాటి యుద్ధం అందరి దృష్టికి రాలేదంటారీయన. విద్యావంతులలో ఉన్న అవినీతి చదవనివారిలో వుండదు కనుక భారత యుద్ధంలో నీతి కరువయింది, అన్నది సత్యం గదా! ఈ భగవద్గీత అన్న రచన గురించి నాలుగు మాటలలో చెప్పడం కష్టం!


‘కురుక్షేత్ర సంగ్రామం’ అని నాటకం. ఇక్కడ కూడా రచన గొప్పది. దానికన్నా ప్రవేశిక మరింత గొప్పది. తెలుగులో నాటకాల లేమి గురించిన చర్చ ఆలోచనకు దారితీస్తుంది. శ్రీనాథులు కేవల ముదర పోషణకయి కైత జేసిరి, అవి ఒక నిజాన్ని చెప్పిన తీరు మొహంలో పిడిగుద్దులాగుంటుంది. కౌరవపాండవుల వైరం, అయిదూళ్ల విషయం, దుర్యోధనుని తలిదండ్రుల తీరు, కర్ణుని జన్మరహస్యం చర్చ, మొత్తంమీద కురుక్షేత్ర యుద్ధం ఒక అధర్మ సంగ్రామమని తేల్చిన తీరు, గొప్పవి ఈ ఆలోచనా ధోరణి ఎందుకని అందరికీ అందలేదు? అర్థం కాదు. మనకు తెలిసి, రాయబారంలో, ఆ చర్చలో కంసునికి ఎక్కువ పాత్ర కనిపించలేదు. ఈ రచనలో కంసుని పాత్ర ఎక్కువ. ఆ ప్రశ్నలు, ఆలోచనలు భావస్ఫోరకంగా ఎదురవుతాయి. పదుగురాడు మాటలోని బలాన్ని చర్చించిన తీరు, ఇంకా అందరిలోకి చేరి చర్చ మరింత సాగాలి!
ఉత్తర దేశంలోని రాజులంతా దేవుళ్లయితే, దక్షిణాన గలవారు రాక్షసులు. మాంసాహారులయిన వారు రాక్షసులు, శాకాహారులు కోతులు. ఈ రకమైన ప్రతిపాదనలు ఎవరికయినా సులభంగా అర్థమవుతాయి. శంబుకవధ అనే చిన్న వృత్తాంతాన్ని భూమికగా, కవిరాజు నడిపించిన నాటకం చూచి, చదివి, విని ఊరకుండవలసినది కాదు. అట్లా ఉండనీయదు కూడా’. మనవారు చరిత్రను పురాణంగా చెప్పి తప్పుడు అవగాహనలకు దారితీశాడు అంటారు కవిరాజు. ఆధారాలతో సహా రామాయణ ప్రదేశాల గురించి, మరెన్నో విశేషాల గురించి ఈ శంబుకవధ నాటకానికి రాసిన తొలి పలుకులు కనువిప్పు కలిగించే తీరున నడిచింది. ఇరవయి పేజీలపైబడి సాగిన ఈ ప్రవేశిక, మళ్లీ అసలు రచనకన్నా ఆసక్తికరంగా ఉంది.


‘ఖూనీ’ అని మరో నాటకం. అపరాధ పరిశోధన అనిపిస్తుంది. నిజంగా ఇది అపరాధ పరిశోధనే. వేనరాజు గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు రచన ఉంది. అది ప్రేరణగా ఈ రచన వచ్చింది. వేనుడు బ్రాహ్మణ వ్యతిరేకి. కనుక హత్య చేయబడ్డాడు, అన్నది కవిరాజు వాదం! బ్రాహ్మణుల విలనీని ఈ రచనలో బాగా చూడవచ్చు.
తరవాతి శతకాలు, పాటలు కూడా ఆసక్తి కలిగించేవే.


మొత్తంమీద కవిరాజుగారి పద్యం ఎంతో బాగుంటుందని కొత్తగా చెప్పనవసరం లేదు. తెలుగు స్థితి తెలిసి కూడా కవి, తిరిగి అందరి మార్గంలో సంస్కృత పదాలతో రచనలు ఎందుకు చేసి ఉంటారు? వేనరాజు కథలో పాటలున్నాయి. ‘నిదురపోనీకోయి నీ చేతి కత్తి!’ అంటారాయన. ఈయన కలమే చేతికత్తి. ‘కల్లవ్రాతలు తొలగిపుచ్చుము’ అని చెప్పడమే కాకుండా చేసిచూపించారు కవిరాజు.


ఈ సంకలనానికి బాపుగారు వేసిన ముఖ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడ గీతోపదేశం చేస్తున్నది కవిరాజు. వింటున్నది కృష్ణుడు. ఆ ముఖాలలోని భావాలు అద్భుతం!
కవిరాజు త్రిపురనేని రామస్వామిగారి ఆలోచనలు తెలుగు పాఠకులకే గాక మిగతా ప్రపంచానికి అందే మార్గం ఉందా?

Wednesday, December 21, 2011

ఎత్తవోయి నీ జయజెండా - పాట

వంశీ తన బ్లాగులో ఈ పాట పాఠం ప్రచురించాడు.
నేను పాట కలుపుతున్నాను.
ఈ లోగా బాపు గారు గీసిన ఈ బొమ్మ కనిపించింది.
టంగుటూరి సూర్యకుమారి గారి గొంతు, రూపం ఒకదానికొకటి పోటీ.




ఎత్తవోయి నీ జయజెండా

విప్పవోయి నీ ప్రియకాండా

స్వతంత్రబారత చరితచ్ఛాయలు
బ్రహ్మాండము నిండా
ఎత్తవోయి నీ జయజెండా
విప్పవోయి నీ ప్రియకాండా

ఉదయాస్త్రాదుల తలవాకిండ్లను
సేతు శీతనగ శిఖరాగ్రములను

మువ్వన్నియలును పొదిగీ పొందీ
ఏకస్వామిక రేఖ నలందా
ఎత్తవోయి నీ జయజెండా
విప్పవోయి నీ ప్రియకాండా

కపటవంచనా నిపుణ తంత్రముల
మారణహింసా మధిత చిత్తమయి

ద్వేషలోభములు తెర్లి జ్వలింపగ
మసలి భ్రమించేమనుకుల మరయగ
ఎత్తవోయి నీజయజెండా

మానవమైత్రీ మంగళతంతువె
మంత్రాంగములకు మూలసూత్రమని

సత్యాగ్రహ ఋషి చాటిన పాఠము
ఎల్లజాతులను పల్లవిపాడా

ఎత్తవోయి నీ జయజెండా
విప్పవోయి నీ ప్రియకాండా

Sunday, December 18, 2011

గ్రీన్ సిమెంట్


గ్రీన్ సిమెంట్

ట్టి మిద్దెలు, గోడలు మాయమయినయి. ప్రపంచమంతా కాంక్రీటు, సిమెంటుల అడివి అయింది. గడచిన సంవత్సరం ప్రపంచంలో 3.6 బిలియన్ టన్నుల సిమెంటు తయారయింది. 2050 నాటికి అది ఏడాదికి నాలుగున్నర బిలియన్ టన్నులవుతుందట. ప్రపంచంలో మానవులు ఇంతకంటే ఎక్కువ పరిమాణంలో వాడుతున్న పదార్థం మరొకటి ఉందంటే, అది నీరు ఒకటే.
సిమెంటును, కంకర, ఇసుక, నీళ్లు, కావాలంటే మరేవో కొన్ని పదార్థాలతో కలిపితే గట్టిబడి కాంక్రీటు అవుతుంది. కాంక్రీట్ అంటేనే గట్టిది అని అర్థం. 

సిమెంటును గురించి మనిషికి ఇంత ఆసక్తి కలగడానికి కారణం, అది చవకగా దొరుకుతుంది. రాయిగా మారుతుంది. అయితే దీనికిగల మరొక లక్షణం మాత్రం మొదటినుంచీ మనిషికి అర్థం కాలేదు. సిమెంటు అంటేనే మురికి! తయారయే ప్రాంతంలో బతికేవారికి ఈ సంగతి తెలుస్తుంది. దాంట్లో పనిచేసేవారికి అంతకన్నా బాగా తెలుస్తుంది. ఆశ్చర్యంగా, ప్రపంచం వేడెక్కడానికి కారణమయిన వాయువులకు సిమెంటు కూడా ఒక ముఖ్య కారణమని కనుగొన్నారు.

సున్నం రాతినుంచి మొదలుపెట్టి సిమెంటును తయారుచేస్తారు. సముద్ర జంతువుల గుల్లలనుంచి ఈ ముడి పదార్థం దొరుకుతుంది. రసాయనపరంగా అందులో ఉండేది కాల్షియం కార్బొనేట్. ఈ పదార్థాన్ని కాల్చాలి అంటే ఏదో ఒక రకమయిన ఇంధనం అవసరం. కాల్చినపుడు గుల్లల నుంచి కార్బన్‌డై ఆక్సైడ్ కావలసినంతగా పుడుతుంది. మనుషుల కారణంగా తయారవుతున్న కార్బన్‌డై ఆక్సైడ్‌లో ఐదు శాతం, సిమెంటు కారణంగా వస్తున్నదంటే ఆశ్చర్యం. చైనాలో, మన దేశంలో ప్రగతి పేరున జరుగుతున్న నిర్మాణ కార్యక్రమం ఈ సమస్యను మరింత పెంచుతున్నది.

రెండు వేల సంవత్సరాల క్రితమే రోమనులు, సున్నం, అగ్నిపర్వతం చిమ్మిన బూడిద, రాళ్లుకలిపి కాంక్రీటు సిద్ధం చేశారు. నాటినుంచి, మరింత మంచి సిమెంటు కొరకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. 1820లో ఇంగ్లండ్‌లో ఒక మేస్ర్తి కొత్త సిమెంటును కనుగొన్నాడు. పోర్ట్‌లాండ్ దీవిలోని రాతి వంటి పదార్థం తయారుచేయడానికి వీలు కలిగించిన ఆ సిమెంటును కూడా పోర్ట్‌లాండ్ అని పిలిచాడతను. 1824లో ఆ సిమెంటుకు పేటెంటునిస్తూ ‘కృత్రిమంగా రాతిని తయారుచేయగల’ పదార్థమని వర్ణించారు.

సున్నపురాతిని సిమెంటుగా మార్చడానికి 2,600 డిగ్రీల ఫారెన్‌హైట్‌కు వేడి చేయవలసి ఉంటుంది. అందులో కొంత మెగ్నీషియం ఆక్సయిడ్ కలిపితే, అంత వేడి అవసరముండదని ఆస్ట్రేలియన్ పరిశోధకులు గమనించారు. దీంతో ఇంధనం ఆదా అవుతుంది. రెండు రకాలుగా పుట్టే సీఓటూ కూడా తగ్గుతుంది. కానీ వ్లాసోపోలస్ అనే పరిశోధన విద్యార్థి కార్బన్‌డై ఆక్సైడ్ తగ్గడంలేదని గుర్తించాడు. మెగ్నీషియం ఆక్సైడ్ పేరున నిజానికి సీఓటూ ఉత్పత్తి పెరుగుతున్నదని అతను గమనించాడు. 2004లో ఇతను పరిశోధన మొదలుపెట్టినప్పటినుంచి, పోర్ట్‌లాండ్ సిమెంటు పరిశ్రమ వారు ఉత్పత్తి పద్ధతిని మార్చేసే యత్నాలు చేస్తూనే ఉన్నారు. ‘గ్రీన్ సిమెంట్’, అంటే పర్యావణానికి హాని కలిగించని సిమెంటును తయారుచేయాలని వారి ప్రయత్నాలు!

కానీ వ్యాసోపోలస్ మాత్రం మరో వేపు దృష్టి సారించాడు. పోర్ట్‌లాండ్ సిమెంటుతో పోరాడుతున్నంతకాలం, అనుకున్న పని జరగదు, అన్నాడతను. ‘మరేదో మార్గం, పదార్థం చూడాలని’ అతడు పట్టుబట్టాడు. సున్నం రాతికి బదులు మెగ్నీషియం ఆక్సయిడ్‌ను వాడి, సిమెంటును తయారుచేయడం అతనికి మంచి ఆలోచనగా కనబడింది. కానీ, ఆ ఒక్క పదార్థంతో పని జరగదు. దాన్ని రాతిగా మార్చేందుకు మరేదో ప్రేరకం కావాలి. అంతకన్నా ముందు, కార్బన్ వాయువులు పుట్టని పద్ధతిలో ముడిపదార్థాన్ని తయారుచేసే మార్గం కావాలి. అందుకని మెగ్నీషియం సిలికేట్స్‌ను ఎంపిక చేశాడు. ఈ పదార్థం ప్రపంచంలో పుష్కలంగా దొరుకుతుంది.

ఎంత చేసినా, సిమెంటు వెల గల పదార్థం. అంతకంటే మంచి సిమెంటుకు మరింతగా వెల ఉంటుంది. అందుకే వ్యాసోపోలస్ తన ‘గ్రీన్ సిమెంట్’ పని తీరును, తయారీ పద్ధతిని బాహాటంగా చెప్పడంలేదు. పేటెంట్లు తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. మెగ్నీషియం ఆక్సయిడ్‌కు మరేవో రసాయనాలు, నీరు కలిపాను. ఒక రాయి తయారయింది. అందులోంచి వేడి, అంటే శక్తి పుడుతున్నదని నికోలస్ వ్యాసోపోలస్ తయారుచేస్తున్న కొత్త సిమెంటులో కూడా కార్బన్‌డై ఆక్సైడ్ ప్రమేయం ఉంది. మొత్తానికి అతను కొత్త సిమెంటు తయారీ కొరకు నోవాసెమ్ అనే కంపెనీని ప్రారంభించాడు. పరిశోధనలో దిగకముందు ఈ యువకుడు, అతని అంకుల్‌గారి సిమెంట్ కంపెనీలో పనిచేసేవాడట. ఇప్పుడా అంకుల్, ‘నా వ్యాపారం మూయించేస్తావా?’ అని సరదాగా అంటున్నాడు. లండన్ ఇంపీరియల్ కాలేజీలో ఈ రకం పరిశ్రమలకు ప్రోత్సాహం ఉంటుంది. ఇప్పటికి అక్కడ ఉన్నవనీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ లాంటి రంగాలకు సంబంధించినవి. ఇతనొక్కడే అక్కడ సిమెంటు కంపెనీ పెట్టాడు. రోమనుల కాలం తర్వాత లండన్ నగరం మధ్యలో, గోల, దుమ్ము పుట్టించే కంపెనీ రావడం ఇదే మొదలని అంతా ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు.

నిజానికి ఈ రకం కొత్త సిమెంటు తయారీ కొరకు మరో నాలుగయిదు చోట్ల తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచమంతా కార్బన్ డై ఆక్సైడ్ గురించి చర్చిస్తున్నది. పైగా సిమెంటు ప్రపంచ వ్యాప్తంగా 170 బిలియన్ అమెరికన్ డాలర్ల పరిశ్రమ. కావేరా, కాలిక్స్, లూయిసిమవా యూనివర్సిటీ లాంటి సంస్థలన్నీ గ్రీన్ సిమెంటు తయారీ ప్రయత్నంలో ఉన్నాయి. త్వరలోనే వీటిలో ఏదో ఒకటి ఫలించి చేతికి అందుతుంది.
బ్రిటన్‌లో అన్నింటికన్నాపెద్ద ప్రైవేట్ నిర్మాణ సంస్థ లేంగ్ ఓ రూర్కీలో ధీరజ్ భరద్వాజ్ అని ఒక అధికారి నోవాసెమ్ గురించి తెలుసుకున్నాడు. ఈ సిమెంటు పోర్ట్‌లాండ్ రకంకన్నా బాగుందని తమ పరిశోధనల ద్వారా తెలుసుకున్నాడు. ఇది తెల్లనిది. కనుక ఇందులో రంగులు కలిపివాడవచ్చు. వాతావరణ పరంగానే కాకుండా, నిజంగానే గ్రీన్ సిమెంట్ తయారు చేయవచ్చునని, పరిశ్రమలో వారికి కూడా నమ్మకం కలుగుతున్నదని అర్థం. ‘కొత్త సిమెంటుతో వంతెన కడితే, దాటుతావా?’ అన్న ప్రశ్నకు ‘ఓ!’ అని భరద్వాజ్ జవాబిచ్చాడు. ఆ వంతెన ఎప్పుడు, ఎక్కడ కడతారో మరి!

Thursday, December 15, 2011

మన గురించి మనం - 3


ప్రయాణం

ఎక్కడికి ప్రయాణం?
ఎన్ని రకాల ప్రయాణాలు?

మనం కదిలితేప్రయాణం, మనసు కదిలితే ప్రయాణం, ఉందోలేదో తెలియని చోటికి ప్రయాణం – అంతు లేని ప్రయాణం. బతుకే ఒక ప్రయాణం. యాత్రా చరిత్రలున్నాయి. మనసు నడచిన మార్గాల కథలున్నాయి. కారులో షికారు కథలున్నాయి.

ప్రయాణం అంటే నిజానికి ఆ తతంగమే. బయలుదేరడమూ, గమ్యం చేరడమూ ఉంటాయి గానీ, నిజానికి ప్రయాణమనే తతంగం మధ్యలో జరుగుతుంది. ఈ తతంగం లేని ప్రయాణం ఎందుకు? అసలు దాన్ని ప్రయాణం అనవచ్చా? గమ్యంకన్నా అటువేపు కదలిక ముఖ్యం. అది అనుకున్నట్టు జరుగుతుంటే, గమ్యం వచ్చినా గుర్తించలేనంత బాగుంటుంది. గుర్తించక అదే పనిగా ముందుకు నడిచిన బాటసారులెందరో ఉన్నారు. ఇంటికని బయలుదేరి, ఇల్లు దాటి, పల్లె దాటి ముందుకు పోయిన ప్రయాణం నిజంగా బాగున్నట్టు లెక్కగదా!

మనకు ప్రయాణం భావన అలవాటయింది. ఆలోచించకుండా, ఆ పనేదో మరెవరో చేసి పెడుతుంటే బతుకు వెళ్లమార్చడం అలవాటయింది. ఇంతకూ ప్రయాణం అంటే ఏమిటి చెప్పండి చూద్దాం! ఇందాకటినుంచీ చదువుతూనే ఉన్నారు గదా! ఏం చదువుతున్నరు? కాలం కదిలిందా? ఇంతసేపూ మీరు కదిలారా? మనసు కదిలిందా? ఏ రకం ప్రయాణం జరిగింది? ఏది బాగుంది? ఆలోచించారా? లేదు కదూ!!

అంతా బుద్ధిమంతులయిన బాలలు! ప్రయాణం ముఖ్యం కాదు, తతంగం ముఖ్యమంటే అవునంటారు. మరి గమ్యం సంగతేమిటి? అది అవసరమా కాదా? చదువుకోవాలి! సంపాయించాలి! పిల్లలను కనాలి! వాళ్లను ప్రయోజకులుగా తీర్చి దిద్దాలి! మరో లెవెల్లో ఆలోచిస్తే, వంట చేసుకోవాలి. అన్నం తినాలి. నిద్ర పోవాలి మళ్లా లేవాలి

ఇవన్నీ ప్రయాణాలా? గమ్యాలా? లేక ప్రయాణమన్న దాని తతంగమా? బతుకు ప్రయాణమయితే అందులో గమ్యమేది? తతంగమేమిటి?

తతంగం లేకుండా బతుకు గడిచేట్టుంటే బాగుండునని ఎప్పుడయినా అనిపించిందా? తెల్లవారేకల్లా పిల్లలు పెద్దవాళ్లయి ఎదురయితే ఎంత బాగుంటుంది? బాగుంటుందా? లేక వారిని తీర్చి దిద్దలేదన్న లోటు తోస్తుందా? మీకు ప్రయాణం, గమ్యం రెండూ కావాలా? లేక గమ్యం ఒకటీ అందితే చాలా?

నిజానికి అనుకున్నది ఒక్కటయితే అయ్యింది ఒక్కటన్న బతుకులే ఎక్కువ. ఎక్కడికని బయలుదేరిందీ గుర్తుండదు. ఎక్కడికి చేరిందీ అర్థం కాదు. మన చేతుల్లో ఏ నిర్ణయమూ ఉండదు. గమ్యం చేరిన వారి సంగతి మరొక రకంగా ఉంటుంది. అక్కడికి చేరిన తరువాత అర్థమవుతుంది, చేరదలుచుకున్నది ఆ గమ్యం కాదని. కానీ ప్రయాణం పేరున జరిగిన తతంగం మాత్రం భలే అనుభవంగా నిలిచిపోతుంది. పోనీ, మళ్లా బయలుదేరి కొత్త దారి పడితే పోయిందిగదా అన్న ఆలోచన కలిగితే అంతకన్నా కావలసింది మరొకటి ఉందా?
తతంగం సాగుతుంటే మనకు చేతనయిన సంగతులూ, చేతగానివీ అర్థమవుతాయి. కొత్త అనుభవాలు కొత్త గమ్యాల గురించి చెపుతాయి. చివరికి గమ్యం కాదు ప్రయాణమే ముఖ్యమనే చోటికి చేరుకుంటాం. అదీ ఒక గమ్యమేనా?

ఆలోచించండి! ఏం కావాలి? ప్రయాణమా? గమ్యమా? తతంగమా? తికమక అవసరం లేదు.
అలోచిస్తే అంతా తెలుస్తుంది.

Tuesday, December 13, 2011

జగ్ జీత్ సింగ్ గురించిన నా వ్యాసం

ఈ వ్యాసం ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చింది.


తేరి జీత్ అమర్ హోగీ
- కెబి గోపాలం
October 12th, 2011

"తు ఇత్‌న జో ముస్కురా రహే హో, క్యా గమ్‌హై జిన్‌కో చుపా రహేహో" - అంటూ మొదలయే పాట, సినిమా పాట, విని ఆదిలాబాద్‌లోని సదాశివగారికి ఉత్తరం రాశాను. మొత్తం గజల్ దొరికితే బాగుండును అన్నారాయన. గమ్, గజల్ అన్న మాటలలోని ‘గ’ అనే అక్షరం అసలయిన రూపాన్ని తెలుగులో రాయడం కుదరదు. అది ఒక విచిత్రమయిన ధ్వని ఉరుదూ, కాదు ఉర్దూ భాష తీరే అంత. ఇత్న అనగూడదు, ఇత్‌న అనాలి, జిస్‌కో అనాలి. గజల్ పాడడంలో వచ్చిన చిక్కే ఇది. అందుకేనేమో శాస్ర్తియ సంగీతంలో గజల్‌కు సరయిన స్థానం అందలేదు. ఠుమ్రీ, ఠప్పా, దాద్రా, చెయితీలు హిందుస్తానీ కచేరీలో వినిపించాయి గానీ, గజల్‌లో వినిపించలేదు. అటు కవితా ప్రపంచంలోనూ, ఇటు సంగీతంలోనూ గజల్‌ది ప్రత్యేకమయిన స్థానం! కొందరికే అర్థమవుతుంది. పాడడం కూడా కొందరికే చేతనవుతుంది అనుకున్న గజల్‌ను అందరికీ పంచిన జగ్‌జీత్ సింగ్, తన దుఃఖాన్ని దాచుకుని, అందరికీ ఆనందం పంచాడు. ఇంతగా చిరునవ్వుచుంటివేల, దాచదలచిన దుఃఖమదేమి చెప్పను!’ అనిగదూ పైన పేర్కొన్న గజల్ ప్రారంభం మాటలకు అర్థం.


జగ్‌జీత్ అసలు సిసలయిన పంజాబీ సిఖ్ సంప్రదాయంలో పెరిగాడు. అసలు పేరు జగ్‌మోహన్. తండ్రి పేరును జగ్‌జీత్‌గా మార్చాడు. జగ్‌జీత్ కూడా ముందు పండిట్ ఛగన్‌లాల్ శర్మ, తర్వాత సేనియా ఘరానా గాయకుడు ఉస్తాద్ జమాల్‌ఖాన్‌ల వద్ద శాస్ర్తియ సంగీతం నేర్చుకున్నాడు. ఖయాల్, దుఖ్రా, ధ్రుపద్‌ల లోతులను రుచి చూచాడు. ‘‘సంగీతం ప్రేరణ కలిగించేదిగా ఉండాలి. అంతేగాని, అందులో పోటీ ఏమిటి?’’ అని ఇటీవల ప్రశ్నించాడా మహా గాయకుడు. మన సంగీతంలో గొప్ప లెక్కలు, వ్యాకరణం ఉన్నాయి. వాటి గురించి తెలియకుండానే పాడడం తప్పు అని ఆయన అభిప్రాయం.


జగ్‌జీత్ సినిమా రంగంలో గాయకుడుగా చేరాలని ప్రయత్నించాడు. కానీ, అక్కడ సరయిన ఆదరణ అందలేదు. అదే మంచిదయింది. అతని చూపు గజల్ వేపు మళ్లింది. 70 దశకంలో కూడా గజల్ సిసలయిన శాస్ర్తియ సంగీతం ఆధారంగా నడిచేది. భాష తెలియదు, అర్థం కాదు. శాస్ర్తియ సంగీతం, అందరికొరకు కాదన్న భావం మనదేశంలో నాటి నుంచి నేటి దాకా బలంగా సాగుతూనే ఉంది. జగ్‌జీత్ సింగ్, ఆ పరిస్థితిని మార్చి మరోదారి పట్టించాడు. సంగీతయాత్ర ప్రారంభంలోనే అతనికి చిత్రాతో పరిచయం అయింది. అది పరిణయానికి దారి తీసింది. జగ్‌జీత్, చిత్రాలు గజల్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించడం మొదలయింది. ‘‘పత్తా పత్తా, బూటా బూటా, హాల్ హమారా జానేహై? లాంటి వారి యుగళగీతాలు నేటికీ అందరికీ గుర్తున్నాయి. తామున్నచోట విజయం సాధించి, తలలో నాలుకగా నిలిస్తే అప్పుడు సినిమావారు జగ్‌జీత్‌ను ఆహ్వానించారు. జగ్‌జీత్ సినిమాలో కూడా పాడాడని చెప్పాలి. అతను కేవలం గజల్ గాయకుడు. చివర కాలంలో శబద్ - కీర్తన్‌లు పాడినా అతను గజల్ గాయకుడే.


జగ్‌జీత్ మొత్తం 80 ఆల్బమ్‌లు రికార్డ్ చేశాడు. గజల్ వినే వారున్న ప్రతిచోటా పాడి అందరినీ మైమరపించాడు. అతనికి కాదనడం చేతగాదు. ఆ మధ్య ఢిల్లీ పక్కన గుడ్‌గాఁవ్‌లో ఒక కచేరీ చేశాడతను. మన పంజాబీ గాయకుడన్న అభిమానం తప్పితే, అక్కడివారికి సీరియస్ సంగీతం తలకెక్కదు. ఆ ప్రాంతమంతా దుమ్ముగానూ, గోలగానూ ఉందట. అయినా ఓపికగా జగ్‌జీత్, వారందరికీ నచ్చేతీరులో కార్యక్రమాన్ని సాగించాడు. అది అతని పద్ధతి. మిత్రుడు, క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ, మనవాడుగదా, అన్న భావంతో పంజాబీ గాయకుడుగా గుర్తింపు పొందడం గురించి వ్యాఖ్యానించాడు. ‘ఎవ్రీ డాగ్ హావ్ ఇట్స్ డే!’ (ప్రతి కుక్కకు కూడా ఒకరోజు అవకాశం వస్తుంది) అని జగ్‌జీత్ జవాబు.


జగ్‌జీత్ పాడిన హిట్ పాటలను ఏకరవు పెట్టడం అర్థంలేని మాట. అతను పట్టిందల్లా బంగారమే. గీత రచయిత నిదా షాజ్లీ లాంటి వారు తమ గజల్‌ను జగ్‌జీత్ పాడితేనే అర్థం, భావం, సరిగా పలుకుతాయని భావించారంటే అర్థం చేసుకోవచ్చు. భాష, ఉచ్చారణ, కవి భావం సరిగ్గా అర్థం చేసుకుని పాడడం జగ్‌జీత్‌కు గుర్తింపు. ఒక్కమాట మీద అనుమానం వచ్చినా, నేరుగా రచయితనే సంప్రదించి, కనీసం ఫోన్‌లో నయినా దాన్ని సరిగ్గా పలికిన దాకా ప్రాక్టీస్ చేసిన సందర్భాలు ఎన్నో. ‘అలాంటివారికి పద్మభూషణ్‌లు మరేవో గౌరవాలు ఒక వేపయితే, ప్రపంచమంతటా అభిమానుల పరంపర ఇంకోవేపు. పాక్, ఆప్ఘాన్ దేశాల అభిమానులు, ఇంటర్‌నెట్‌లో అందిస్తున్న సంతాప సందేశాలు వెల్లువ అందుకు సాక్ష్యం’!


దుఃఖాన్ని వెనక్కు తోసి, చిరునవ్వులు పంచడం అందరికీ చేతగాదు. చిత్రా జగ్‌జీత్‌ల జీవితం పాటలాగా సాగుతూ ఉంది. ‘హోంధోంసే భూలో తుమ్, మేర గీత్ అమర్ కర్‌దో, బన్‌జాఓ మీత్ మెరే, మేరి ప్రీత్ అమర్ కర్‌దో! (నీ పెదవులతో తాకి, నా పాటకు అమరత్వాన్నివ్వు! నా స్నేహాన్ని అంగీకరించి, నా ప్రేమకు అమరత్వాన్నివ్వు!) లాంటి పాటలు ఆ జీవితాలకు బాటలయ్యాయి కానీ, చిత్ర మొదటి వివాహం ద్వారా కలిగిన బిడ్డడు పోయాడు. 1990లో చిత్రా, జగ్‌జీత్‌ల బిడ్డడు వివేక్ పోయాడు. ఆ ప్రణయ స్వరాలు ఒక్కసారిగా మూగవయ్యాయి. చిత్ర నేటికీ గొంతు విప్పలేదు. అభిమానుల ప్రోద్బలం మీద జగ్‌జీత్ మాత్రం బరువుగా పాటను సాగించాడు. అతని గొంతుకలో ధ్వనించే ‘మాయూసీ’ అనే లక్షణం గీతాలకు కొత్త అర్థాలు తోచేలా చేసింది. భక్తి సంగీతంతో మొదలయిన గీతార్చన తిరిగి అదే దారికి చేరింది.
జగ్‌జీత్ గురించి ఎంత చెప్పినా తక్కువే!


‘జగ్‌నే ఛీనా ముఝ్ సే, ముఝే జో భి లగా ప్యారా!’ నాకిష్టమయినదాన్నంతా ఈ ప్రపంచం అపహరించింది! ప్రపంచం తీరే అంత!

మంచి పాటే ఉంటే ప్రపంచమెందుకు?
సుగానం యద్యస్తి విశ్వేన కిం?

Monday, December 12, 2011

పచ్చబొట్టు - సైన్సు


పచ్చబొట్లు, గాయం మచ్చలు సమసిపోకుండా ఎలాగుంటాయి?

నిజమే! రక్తకణాలలాగే చర్మం కణాలు కూడా పాతవిపోయి ఎప్పటికప్పుడుకొత్తవి పుడుతూ ఉంటాయి. అయినా ‘పచ్చబొట్టు చెదిరిపోదులే’ అనేపాట ఎలా వచ్చింది?

సులభంగా చెప్పాలంటే చర్మం అంతా ఒకే పొర కాదు. అందులో అన్నింటికన్నా వెలుపలిపొర ఎపిడెర్మిస్. అందులో మాత్రమే పాత కణాలుపోయి కొత్తవి పుడుతూ ఉంటాయి. మన పడక బట్టలలో, ఇంట్లో ఉండే దుమ్ములో సగం, చనిపోయిన ఈ కణాలే ఉంటాయంటే నమ్మగలరా? ఇక డెర్మిస్ అనే లోపలి పొరలో కూడా కణాలు విభజన చెందుతూంటాయి కానీ, అక్కడ పాత కణాలు పోవడం అనే పద్ధతి లేదు. అందుకే పచ్చబొట్టు పేరున లోపలికి చేరిన రంగుగా, లోతయిన గాయం గానీ అట్లాగే ఉండిపోతాయి.

చర్మమంతా, కొలాజెన్ అనే ప్రొటీన్ పదార్థంతో తయారై ఉంటుంది. ఈ కొలాజెన్, ఫైబ్రోబ్లాస్ట్స్ అనే కణాలలో పుడుతుంది. గాయం తగిలి, మానుతుంటే కొత్త కొలాజెన్, ఆ గాయంలోనే ఫైబ్రోబ్లాస్ట్‌లు ఉండి, వాటిలో నుంచి పుడుతుంది. అది మామూలు కొలాజెన్‌లాగుండదు. అందుకే గాయం మానిన చోట చర్మం, మిగతా చర్మంలా కాక బాగా నునుపుగా ఉంటుంది. చర్మంలో మిగతా కణాలు, లోపలి పొరలలోవి కూడా పెరుగుతున్నా ఈ గాయం కొలాజెన్ మాత్రం అట్లాగే ఉండిపోతుంది.

శిశువుకు, గర్భంలో ఉన్నపుడు గాయాలు తగిలితే మాత్రం మామూలు చర్మం వచ్చేస్తుంది. అంటే అక్కడ గాయం కణాలు, అందులో కొలాజెన్ తయారీ లాంటివి ఉండవు.

పచ్చబొట్టు విషయాని వస్తే, మరో ఆసక్తికరమయిన విషయం ఉంది. శరరంలో ప్రవేశించిన ఇతర రసాయనాలను సాధారణంగా తెల్ల రక్త కణాలు మింగేస్తూ ఉంటాయి కానీ పచ్చబొట్టు పేరున శరరంలోకి పంపబడుతున్న, రంగు రసాయనాల కణాలు పెద్దవిగా ఉంటాయి. తెల్లరక్తకణాలు వాటిని మింగజాలవు. అందుకే పచ్చబొట్టు చెరగకుండా, చెదరకుండా ఉండిపోతుంది. ఎవరన్నా పచ్చబొట్టును నిజంగా తుడిపి వేయాలనుకుంటే అందుకు పద్ధతులున్నాయి. లేజర్ కిరణాలతో ఈ రంగు రసాయనాన్ని పొడిగా చేయవచ్చు. అప్పుడు తెల్ల రక్తకణాలు ఈ పొడిని మింగేస్తాయి. పచ్చబొట్టు మాసిపోతుంది.

Sunday, December 11, 2011

ఒక జోకు - పాత పత్రిక నుంచి

లవ్వితే లవ్వండి.
లాకు జలుబు. అత్తే!


బాగుల్దల్టారా?

Saturday, December 10, 2011

గుర్రాలు - నాడాలు


గుర్రాలు-నాడాలు

వ్యవసాయం కన్నా బహుశా ముందే మనిషి జంతువులను మచ్చిక చేసి పెంచడం మొదలుపెట్టాడు. వ్యవసాయంతోబాటు, కొన్ని జంతువులు పశువులయి మనిషికి సాయంగా నిలిచాయి. బండి, పశువుల కాళ్ళకు నాడాలు వేయడంతో ఒకరకం సాంకేతికత మొదలయింది. ప్రస్తుతం పశువులు, పాడికేగానీ, పంటకు కాదనే ధోరణి వచ్చింది. వ్యవసాయంలో మాత్రమే వాడుకునే ఎద్దులకు నాడాలు ఎందుకు అవసరమయ్యాయన్నది ప్రశ్న. రోడ్డుమీద నడవవలసి రావడంతో ‘నాడా’లు వచ్చి ఉండాలి.

నాడాల చరిత్రను గమనిస్తే చాలా విచిత్రమయిన విషయాలు బయటపడ్డాయి. అమెరికాలోని ‘కౌబాయ్స్’ (పశువుల కాపరులు), తమ గుర్రాలకు నాడాలు వేశారు. కానీ స్థానిక అమెరికనులు తమ గుర్రాలకు మాత్రం నాడాలు వేయలేదు (ఈ సందర్భంగా ఒక విశేషం! ఎద్దులు, ఎనుముల కాలి గిట్టలు రెండు భాగాలుగా ఉంటాయి. గుర్రం గిట్ట మాత్రం ఒకే భాగంగా ఉంటుంది!).

ఏ గుర్రాలకు నాడాలు అవసరమయ్యాయి? ఏ రకానికి వాటి అవసరం లేదు? అన్న ప్రశ్నలకు జవాబు వెతికితే, పరిణామక్రమం అనే డొంకంతా కదులుతుంది. ఇది జీవ పరిణామం మాత్రమే కాదు సాంకేతిక, సాంఘిక పరిణామాలకుకూడా ఇందులో పాత్ర ఉంది. గుర్రాలు, పశువులు పెరిగిన ప్రాంతాలకూ ప్రమేయం ఉంది.

గుర్రాలు మధ్య ఆసియాలోని గడ్డి మైదానాలులో పుట్టినాయనవచ్చు. అడవిగాడిదల జాతి మొదలయింది అక్కడే. చారల గుర్రం అనే జీబ్రా, అంతరించిపోయిన క్వాగా లాంటి జాతులు ఆఫ్రికాలోని గడ్డి మైదానాల్లో పుట్టాయి. ఇక్వస్ గుర్రాలు ఉత్తర అమెరికాలో పుట్టాయి. కానీ ఈ అమెరికా గుర్రాలు, వాతావరణ కారణాలవల్లా, మనుషుల వేట మూలంగా 7600 సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. మళ్లీ గుర్రాలు అమెరికాలోకి స్పెయిన్ వారి వెంట మాత్రమే వచ్చాయి. 1540 ప్రాంతంలో, కొన్ని గుర్రాలు తప్పించుకుని ఉత్తర అమెరికా మైదానాలకు చేరుకున్నాయి. మిసిసిపీ ప్రాంతంలో వ్యవసాయం జరుగుతున్న రోజులవి. గుర్రాల మీదస్వారీ చేయవచ్చునని అక్కడి రైతులకు నిజానికి తెలియదు. అయినా వారు 1680 నాటికి గుర్రం స్వారీ, గుర్రాల మీద రవాణా నేర్చుకున్నారు. వంద సంవత్సరాల కాలంలో గుర్రం కారణంగా నార్త్ అమెరికనుల బతుకు తీరుమారింది. అక్కడి ప్రజలకు, ముఖ్యంగా మైదానాలలో వారికి, వేట, తిండి వెతకడం తప్ప సాంకేతిక విషయాలమీద పట్టు లేదు. లోహాలు కావాలంటే, యూరోపియనుల మీద ఆధారపడేవారు. కనుక గుర్రానికి నాడాలు వేయడం అందుబాటులో లేని పని. ఖర్చుతో కూడుకున్నపని! వారి గుర్రాలకు నాడాల అవసరం రాలేదుకూడా. గడ్డి మైదానాలలో తిరిగే గుర్రాల గిట్టలు అరిగే అవకాశమే లేదు.

గుర్రం నాడాలు వాడడం మొదలయింది యూరపులోని వాయవ్య భాగాలలోనే అనవచ్చు. అయిదవ శతాబ్ది నాటికే గౌల్స్, ఫ్రాంక్స్ జాతివారు తమ పెంపుడు గుర్రాలకు నాడాలు వేసినట్టు ఆర్కియాలజికల్ ఆధారాలు చెపుతున్నాయి. అక్కడి శీతోష్ణ పరిస్థితులు, భూమి లక్షణాలుకలిసి నాడాల అవసరానికి దారి తీశాయి. అక్కడ వాతావరణం తేమగా ఉంటుంది. మట్టి మెత్తగా ఉంటుంది. కనుక గుర్రం గిట్టలుకూడా మెత్తబడతాయి. అంతకన్నా ముఖ్యంగా అక్కడి వారు గుర్రాలను ప్రయాణాలకు, రవాణాకు, యుద్ధాలకు మాత్రమే వాడుకున్నారు. పెద్ద బరువులు మోస్తూ గుర్రాలు చాలా వేగంగా పరుగ్తెవలసివచ్చేది. నాడా లేకుంటే గిట్టలు అరిగి, గుర్రాలు కుంటివవుతాయి.

గడ్డి మైదానాలలోని ‘ఇండియన్స్’ వాడిన గుర్రాల వాడకం, ఇంచుమించు అడివి గుర్రాల బతుకుకు దగ్గరగా ఉండేది. అడవిగుంపులుగా, నెమ్మదిగా, గడ్డిమీద తిరుగుతూ ఉండేవి. అంతా పొడి ప్రాంతమది. ఎగుడు, దిగుళ్లుకూడా ఎక్కువగా ఉండవు. గిట్టలు అరిగినా ఒకే రకంగా, తిరుగుతాయి. అంతకన్నా విచిత్రంగా, అక్కడ అందరికీ ఒకటికన్నా ఎక్కువ గుర్రాలుండేవి. రెండు వేల మంది సైనికులున్న ఒక బృందానికి 15 వేల గుర్రాలు అందుబాటులో ఉండేవి.

యూరోపియనులకు ఈ పరిస్థితి లేదు. పైగా పశుపోషణ, నిర్వహణకు వారికి తగిన తీరిక లేదు. నైపుణ్యం అంతకన్నా లేదు. యుద్ధాలలో మునిగి తేలే సైనికులకు తమ క్షేమం ఎక్కువ ముఖ్యం. గుర్రం సంగతి అంతగా పట్టేదికాదు.

మైదానంలో వీరుడు కూడా యుద్ధం చేశాడు. కానీ, తన గుర్రాలను ఒక గౌరవం, ఒక ఆస్తిగా గమనించి గర్వంగా వాటిని ప్రదర్శించేవాడు. అప్పట్లో గుర్రాన్ని దొంగిలించడం అన్నది అతి హీనమయిన నేరం! అది హత్యకు సమానమనుకునే వారు అప్పట్లో! అందుకే అక్కడి వారు తమ గుర్రాలను జాగ్రత్తగా చూచి, నాడాల అవసరాన్ని గుర్తించారు. కౌబాయ్‌లు వాడిన గుర్రాలు చాలా వేగంగా పరుగెత్తేవి. కానీ, అవి ఎక్కువ దూరం వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదు! కావలసినచోటికి క్షణాల్లో చేరగలుగుతారు. వారి అవసరం అంతవరకే. అక్కడినుంచి ముందుకువెళ్ళనవసరం లేదు. అయినా, ఆ నేల తీరు కారణంగా నాడాలు అవసరమయ్యాయి.

భారతదేశంలోనూ సాంతం ఎక్కువగా పొడి నేలలే. ఇక్కడా గుర్రాలను రవాణా, యుద్ధాలకే వాడారు. ఇక్కడా నాడాలు వాడుకున్నారు. వ్యవసాయంలో వాడే పశువులకు నాడాలు అవసరం లేదు అనే ఎద్దులు బండ్లను లాగుతూ గట్టి దారుల మీద చాలా దూరం వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు వాటికీ నాడాలు వచ్చాయి. ఈ నాడా ఎద్దులు బురద సేద్యానికి దిగితే కష్టం. ప్రస్తుతం ఎద్దులూ తరిగిపోతున్నాయి, నాడాలూ తరిగిపోతున్నాయి మరి. *

Friday, December 9, 2011

Cartoon - Computer

నవ్వితే నవ్వండి
లేదంటే ఊరుకోండి
నన్ను మాత్రం తిట్టకండి.


ఈ కార్టూను ఎట్లా తయారయిందో ఊహించగలరా?

Saturday, December 3, 2011

సినారె కవితా సంకలనం - నా సమీక్ష


జ్ఞాపకాల నిధులు
నా చూపు రేపటి వైపు (కవితా సంకలనం) రచన: డా. సి. నారాయణ రెడ్డి వెల: రూ. 150/-, ప్రచురణ: వరేణ్య క్రియేషన్స్, హైదరాబాద్ ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ
-గోపాలం కె.బి., October 30th, 2011

పద్మభూషణులు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. సి. నారాయణరెడ్డి కవితా కృషీవలులు. ఆయన జీవితమే కవిత. ఒక విశ్వంభర, కర్పూర వసంతరాయలు లాంటి కావ్యాన్ని వెలయించినంత తీవ్రతతోనే ఆయన సినీగేయాన్ని కూడా రాస్తారు. ఆయన ఆలోచనే కవితగా సాగుతుంది. అందుకే ప్రతి జన్మదినానికి ఒక కొత్త కవితా సంపుటి కూడా పుడుతుంది. ఎనభయి వసంతాలు గడిచిన పండుగనాడు ఈ సంకలనం వచ్చింది. ఇందులో కవితలు 80 మాత్రమే. వీటన్నింటిలోనూ ఒక తలపండిన తాత్వికుడుగా సినారె మనలను పలకరిస్తారు.


కవికి మనసు మాత్రమే ఉంటుంది. వయసు ఉండదు. తలపండినదన్న భావం తలపులలో రాదు. అందుకే ‘ఎదుట నిలిచే సుదూర గమ్యం’ అన్న కవితలో ఆయన ‘గిరి శిఖరాలపై నుంచి దూకే జలపాతాలు, మోకాళ్ళు విరిగి పోతాయేమోనని శంకించవు’ అంటారు. అంతటి ఉత్సాహంతో మస్తకంలోని ఆలోచనలను పుస్తకంగా మనముందు పరిచారాయన.


శీర్షిక - నా చూపు రేపటి వైపు - అని ఇందులో వయసు వాసన ఏమయినా కనబడుతుందా?
‘గతం నిష్క్రమించింది. అమూల్య జ్ఞాపకాల విధులను నాకు మిగిలించి, అది నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది’’. - అంటారు మొదట్లో. కానీ వెంటనే ‘‘వర్తమానం నాతో చేయి కలిసి నడుస్తున్నది’’ అంటారు. అక్కడ నుంచి కవి ముళ్ళబాటలో నడిచి, భవిష్యత్తును చేరుకుంటే అది ఆయన పాదాల ముందు వాలుతుంది!


ఈ శీర్షిక కవితను 85వ పేజీలో వేశారు. అక్కడ దాని భావం బాగా పండుతుందని కావచ్చు. జ్ఞాపకాల నిధులు సాధారణంగా ఎవరినయినా నాస్కార్జియాలోకి లాక్కుపోతాయి. కానీ ఆలోచనా శీలులయిన ఈ కవి మొదటి కవితలోనే ‘ఆలోచనలకు పదును పెడుతూ కూచున్నాను’ అని ప్రకటించారు. సినారెలోని కవి తత్వం ఆ ఒక్కమాటతో ఆవిష్కరింపబడుతుంది. మొదటి కవితలోనే (సృజనయాగం). ఈ మాట రావడం యాదృచ్ఛికమా? పథకం ప్రకారం వచ్చిందా? శీర్షికకు అనుగుణంగా, రేపటివైపు చూపులు సంకలనం అంతటా కనిపిస్తాయి. బలమయిన ఆశాభావం అడుగడుగునా ఎదురవుతుంది.


చాలా కవితల్లో కాలగమనం గురించిన ప్రసక్తి ఉంది. ‘ఇలా ఎంతకాలం అవిశ్రాంతంగా సాగిపోతావు’ అని కవి గడియారాన్ని అడిగారొక చోట (కాల సూచిక). ‘ఎగిరిపోయిన జ్ఞాపకం’ అన్న కవితలో ముందుకు సాగిపోతున్న జలధార, వెనకవైపు తిరిగి చూస్తుందా? అంటారు. ‘నీ ప్రయాణం ఎంతకాలమని? అంటూ జీవితానే్న ప్రశ్నిస్తారొక చోట. వయసు వాలిపోతున్నా, మనిషి నిటారుగా నిల్చోవాలి అంటారు మరోచోట.


సంకలనంలోని కవితల్లో ముఖ్యంగా కనిపించే మరో అంశం స్మృతులు. అయినా ఎక్కడో వాటిని గురించిన బాధ కనిపించదు. స్మృతులలో నుంచి బలమయిన సమస్యలు బయటపడతాయి. తలుపులు మూసుకుని ‘కలగన్న గది’ కలలోని సన్నివేశాలను నెమరు వేసుకుంటూ, తలుపులు తెరుస్తుంది.


ఇన్ని కవితల్లోనూ మనుషులు కనిపించరు. పక్షులు, చెట్లు, కొండలు, కళ్ళు, చెవులు, ముక్కు లాంటివి ఎక్కువగా భావాలకు ఆలంబనలయి ముందుకు నడిపిస్తాయి. ఆలోచనలకు పదును పెడుతూ కూర్చున్న కవికి ఒంటరితనంలోనూ, చూపులు రేపటిపైనే. కానీ గమనించవలసిన మరో అంశం. అక్కడక్కడ మరణం. శూన్యం లాంటి బలమయిన భావాలు! శూన్యాన్ని వెళ్ళి కలిసినప్పుడు అది ‘నాలో కలిసిపో!’ అని పిలిచిందట. కవి మాత్రం ‘మానవాళికి దూరమయి, అస్తిత్వాన్ని కోల్పోవడం, కుదరదంటారు. చదువుతూ ముందు సాగితే చివరకు ఏకాంతం గురించి కవిత రానే వచ్చింది.


‘కాలం గీసిన రేఖ’, ‘ఈ పూట’, ‘నడుస్తూ నడిపించే కాలం’, ‘కాలజ్ఞత’, ‘తిరిగి చూసుకుంటే’, ఇవన్ని చివరి భాగంలో ఇంచుమించు వరుసగా వచ్చిన కవితలు. అలా సాగుతూనే ఒకచోట ‘సూర్యోదయం సరియైన సమయానికే జరిగిందని సంతృప్తీ కనబడుతుంది.


‘సత్తా ఉన్నంత మాత్రాన విత్తనాలన్నీ మొలకెత్తవు’ అంటూ సాగే కవిత ప్రశ్నల ఆంతర్యం’ కవిగారు తమను తాము అడుగుతున్న ప్రశ్నలకు నికషోపలం!


జాగ్రత్త! ప్రాసలు కనబడవు. మాటకారి తనం కనబడదు. కాలం గడిచింది గదా! పాత సినారె కనబడరు! ఈయన మరెవరో. తలపండిన తాత్వికుడు!


కవితే తన చిరునామా అన్న ఈ కవిగారి మరో సంకలనం కొరకు ఎదురు చూద్దాం.

-గోపాలం కె.బి.

Friday, December 2, 2011

ప్రశ్న - జవాబు


వైరస్‌లు చనిపోతాయా?

ప్రశ్న - జవాబు

Q వైరస్‌లు చనిపోతాయా?
A సూటిగా జవాబు చెప్పాలంటే, వైరస్‌లకు మరణం లేదు. ఎందుకంటే వాటికి జీవం లేదు. జీవంలేని వైరస్‌లు మరి జీవులు ఎట్లా అయినవని ప్రశ్న పుడుతుంది. అదే విచిత్రం. వాటిలో డిఎన్‌ఏ, లేదా ఆర్‌ఎన్‌ఏ అనే న్యూక్లిక్ ఆమ్లాలు ఉంటాయి. వాటి పని తీరును నిర్థారించే సమాచారం ఆ ఆసిడ్‌లలో ఉంటుంది. జీవులన్నింటిలోనూ ఇదే పద్ధతి గనుక, వైరస్‌లను జీవులుగా అంగీకరించక తప్పదు. కానీ, అవిసంపూర్ణ, స్వతంత్ర జీవులు కావు. తమంత తాముగా మనుగడ సాగించలేవు. మరేదో జీవిలో ఉన్నంత కాలమే వాటి మనుగడ సాగుతుంది. అక్కడ అవి తామున్న ప్రాణినుంచి జన్యుసమాచారాన్ని దొంగిలిస్తాయి.
ఇక్కడ ఇంకొకప్రశ్న పుడుతుంది. స్వంత జీవం, ఉనికి లేని ఈ వైరస్‌లు, చావు లేకుండా ఎంతకాలం కొనసాగుతాయి. ఎంతకాలం ఇన్‌ఫెక్షన్ కొనసాగుతుంది? అన్నవి అనుమానాలు. ఒక శరీరంలోకి ప్రవేశించకుండా బయటి వాతావరంలో గనుక ఉండిపోతే, హెచ్‌ఐవి (ఎయిడ్స్), ఇన్‌ఫ్లుయెంజా లాంటి వైరస్‌లు కొన్ని గంటలకన్నా ఎక్కువ కాలం ఉండవు. అవి చనిపోతాయని కాదు గానీ, పని చేయలేకుండా సమసిపోతాయి. పరిశోధకులు, వాటిని పట్టి ఉంచి పరిశీలించడానికి చాలా కష్టపడతారు. అదే మశూచి (స్మాల్‌పాక్స్) వైరస్, ఎక్కడ పడి ఉన్నా సంవత్సరాలపాటుండి, అవకాశం దొరికితే చాలు తిరిగి ఇన్‌ఫెక్షన్‌కు కారణం కాగలుతుంది. 1787లో బ్రిటిష్ డాక్టర్ల కారణంగా ఈ వైరస్ ఆస్ట్రేలియాకు చేరిందట. అది అక్కడ రెండు సంవత్సరాలపాటు పడి ఉండి, ఆ తరువాత స్థానిక అబూరిజిన్స్‌లో ప్రవేశించి పెద్దఎత్తున మశూచి రావడానికి కారణమయిందట!

-----
Q కార్లు, స్కూటర్లు, మోటార్ సైకిళ్లకు వేసే ఎర్రరంగు
మిగతా రంగులకంటే త్వరగా వెలిసిపోతుంది.. ఎందుకు?
A ఎర్రరంగులు మామూలుగా వెలుగుకు ఎక్కువ ప్రభావితమవుతాయి. ఎండలోని యువి కిరణాల కారణంగా ఎర్రరంగు ముందు విరిగిపోతుంది. ఈ విషయం ఒక్క వాహనాలలోనే కాక పుస్తకాలు, పెయింటింగులు మొదలైన ఎన్నో చోట్ల కూడా కనబడుతుంది. ప్రస్తుతం కార్లకు, మిగతా వాహనాలకు వేస్తున్న రంగులు బాగా అభివృద్ధి చెందిన రకం. కనుక ప్రస్తుతం ఎర్రరంగు అంతగా వెలిసిపోవటం లేదు. నీలం రంగు తొందరగా పాడవుతుందన్న భావం కూడా ఉందిప్పుడు. రంగుల మీద ఎండ ప్రభావాన్ని బట్టి వాటి మన్నిక ఉంటుంది.