Saturday, September 15, 2012

మంచి బొమ్మ

నాకు చిత్రకళ చాలా ఇష్టం
మంచి బొమ్మలు ఎక్కడివైనా ఫరవా లేదు.

(బొమ్మ మీద క్లిక్ చేస్తే పెద్దదిగా కనబడుతుంది)

Thursday, September 13, 2012

మనిషి - దాయాదులు

మానవ పరిణామం గురించిన చర్చలో కో తుల ప్రసక్తి రావడం సహజం. ‘కోతులు, మన తాతల తాతలు’ అన్నమాట అందరికీ తెలిసిందే. మరి మన దాయాదులంతా ఏమయినట్టు? కోతి (ఏప్) జాతి నాలుగు భాగాలుగా విడిపోయింది.

హోమో (ఈ జీనస్‌లోనే మనుషులనే మనమూ ఉన్నాము): హోమో జాతిలోని మిగతా ఉపజాతులు లేదా ప్రజాతులు అన్నీ అంతరించిపోయినయి. శాపియెన్స్ అనే మనం మాత్రం మిగిలి ఉన్నాము. ఈ జాతి 24 లక్షల సంవత్సరాల నాడు మొదలయిందని అంచనా. హోమో శాపిమెన్స్ అనే ఆధునిక మానవజాతి మాత్రం రెండు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో మొదలయిందని పరిశోధకులు లెక్కతేల్చారు. గ్రేట్ ఏప్స్ జాతిలో బాగా సంఖ్య పెరిగిన ఉపజాతి ఇది ఒక్కటే. ప్రపంచంలో వీరి సంఖ్య ఏడు బిలియన్లు దాటింది.


పాన్ (చింపాంచీలు, బూనోబోలు ఉండే జాతి లేదా జీనస్): గ్రేట్ ఏప్స్‌లో మానవుల జాతితో చాలా ఎక్కువ పోలికలు గల జాతి ఇది. చింపాంజీలు, మనుషుల జన్యు పదార్థం (డిఎన్‌ఎ)లో తొంభయి తొమ్మిదిశాతం ఒకే రకంగా ఉంటుందని 1973లోనే కనుగొన్నారు. ఈ జాతిలో చింపాంజీలు, బోనోబోలు అనే రెండు ఉపజాతులున్నాయి. అవి పది లక్షల సంవత్సరాల నాడు వేరు వేరు ఉప జాతులయ్యాయి. ప్రస్తుతం మాత్రం ఈ రెండు రకాలు కూడా అంతరించే దశకు చేరుకున్నాయి.


పోంగో (ఒరాంగుటాన్‌ల జాతి): గ్రేట్ ఏప్స్‌లోని ఒరాంగుటాన్స్ అనే జాతి ఒక్క ఆసియా ఖండంలో మాత్రమే ఉంది. ఇరవయి సంవత్సరాల కింద కూడా ఈ జంతువులన్నీ ఒకే జాతిగా లెక్కింపబడుతూ ఉండేవి. జన్యువుల పరిశీలన, సీక్వెన్సింగ్ తర్వాత ఒరాంగుటాన్‌లో రెండు ఉప జాతులు ఉన్నట్టు తెలిసింది. బోన్నియాలో ఉండే జాతి పోంగో పిగ్మేయియన్ ఒకటి. సుమత్రాలోని పోంగో ఎబెలియై మరొకటి.


గొరిల్లా (గొరిల్లాల జాతి): గొరిల్లాలన్నీ ఒకే జాతి అనే భావన చాలా కాలం వరకు ఉండేది. కానీ, ఈ జాతిలో అంతకుముందు అనుకున్నట్టు మూడు ఉప జాతులు కాక, రెండు జాతులు, వాటిలో నాలుగు (ఒక్కొక్క జాతిలో రెండు) ప్రజాతులు ఉన్నాయని గుర్తించారు. పడమటి గొరిల్లా, తూర్పు గొరిల్లా అనేవి రెండు జాతులు. వీటిలో రెండు ఉపజాతులు ఉన్నాయి. తూర్పు గొరిల్లాలో మూడవరకం కూడా ఉందని ఈ మధ్యన పరిశోధకులు గమనించారు.


తాతగారు బూనోబో: కోతుల్లో అందరికన్నా దగ్గరి చుట్టం మనకు ఈ బూనోబోగారే! మూడు అడుగులకు మించని ఎత్తు, 40కిలోలకు మించని బరువు ఈ తాతగారి లక్షణాలు. పండ్లు, గింజలు, ఆకులు, పూలు మాత్రమే తింటారు. అప్పుడప్పుడు మాంసం కూడా తింటారు. చూడడానికి చింపాంజీలాగే ఉన్నా, ముఖం మరింత చదునుగా, నల్లగా ఉంటుంది. కనుబొమలు కూడా చదునుగా ఉంటాయి. శరీరం, సన్నగా ఉంటుంది. వర్షారణ్యాలు, చిత్తడి అడవులకు ఈ జాతి పరిమితమయి ఉంది. మొత్తం సంఖ్య 5 నుంచి 50వేల మధ్య ఎంతయినా ఉండవచ్చు. మనిషి కారణంగా వీటికి తగిన జాగా మిగలడం లేదు. మనుషులు పట్టి పెంచుతున్నారు కూడా. కనుక, ఈ జాతి అంతరించే స్థితికి వచ్చింది.

Tuesday, September 4, 2012

తెలుగు రేడియో నాటకాలు

ఆసక్తి గల మిత్రులకు,

తెలుగు రేడియో నాటకాలు ఇక్కడ

విని మీ అభిప్రాయాలు తెలియబరిస్తే మరిన్ని కూడా






Sunday, September 2, 2012

కవిత

ఈ కథ గ్రీసు దేశంలో వేలాది సంవత్సరాలకు ముందు ఎపుడో జరిగింది.

ఎథెన్స్ నగరానికి వెళ్ళే దారిలో ఇద్దరు కవులు కలుసుకున్నారు. కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకున్నారు. నమస్కారాలు, క్షేమ సమాచారాలు మామూలుగానే సాగాయి.


కవులు గనుక సంభాషణ సహజంగా, కవితల వేపునకు మరలింది. ఒక కవి మరొక కవిని అడిగాడు గదా! ‘అయ్యా! ఈ మధ్యన తాజాగా ఏమి వ్రాశారు? తప్పకుండా ఏదో రాసే ఉంటారుగా’ అని!


మొదటి కవి సంతోషంగా ముఖం పెట్టి ‘ఇప్పుడిప్పుడే ఒక మహత్తరమయిన కవిత రాయడం ముగిసింది.
అది నా కవితల్లోకెల్లాగొప్పది. అంతేగాదు, మన భాషలోనే గొప్ప కవిత అదే. అది నేను దేవుడి గురించి స్తుతిస్తూ రాశాను’ అన్నాడు.


కవి అంతే సంతోషంగా తన ముల్లెలోనుంచి కవిత రాసిన పార్చ్‌మెంట్ తీశాడు. ‘ఇదుగో! కవిత! నాతోనే ఉంది. చదివి వినిపిస్తాను. వింటారుగదా! రండి! ఆ సైప్రస్ చెట్టు కింద నీడలో చేరి కవిత అందాన్ని అనుభవిద్దాం!’ అన్నాడు.
కవితాగానం సాగింది. అది మరీ పొడుగాటి కవిత


‘గొప్ప కవితండీ! ఇది కలకాలం నిలిచి ఉంటుంది. తమ కీర్తిని నిలబెడుతుంది!’ అన్నాడు విన్న కవి.
ప్రశాంతంగా విని మొదటి కవి లాంఛనంగా ‘మరి తమరేమి వ్రాశారో? వినవచ్చునా అంటూ అడిగాడు.
‘నేను నిజంగా అంతగా ఏమీ వ్రాయలేదంటే నమ్మండి. తోటలో ఆడుతున్న కుర్రవాడి గురించి సరిగ్గా ఎనిమిదంటే ఎనిమిది పంక్తుల కవిత ఒకటి మాత్రం రాశాను’ అంటూ ఆ కవిత వినిపించాడు.


‘్ఫరవాలేదు. బాగానే ఉంది’ అన్నాడు మొదటి కవి.
తరువాత వారు ఎవరిదారిన వారు పోయారు.


తరాలు గడిచాయి. రెండు వేల సంవత్సరాలయింది. కవి రాసిన ఎనిమిది పంక్తుల కవిత ప్రపంచ భాషలన్నింటిలోకీ అనువదింపబడింది. ఆ కవిత తెలియని మనుషులు ఉండరంటారు.
మొదటి కవిగారి దీర్ఘకవిత కూడా నిలిచి ఉంది. కానీ అది గ్రంథాలయంలో, పండితుల సేకరణలలో మాత్రమే ఉంది. దాన్ని ఇష్టపడేవారు లేకపోలేదు. కానీ చదివినవారు మాత్రం తక్కువ.


-ఖలీల్ జిబ్రాన్ నుంచి

Saturday, September 1, 2012

ఆంగ్లంలో మనుచరిత్ర


‘అల్లసాని పెద్దన’ మనుచరిత్ర- ఆంగ్లం.
అనువాదకులు: శిష్ట్లా శ్రీనివాస్
పేజీలు:404;
వెల: రూ.495/-
దృశ్యకళా దీపిక ప్రచురణలు;
లాసన్స్ బేకాలనీ, విశాఖపట్నం

తెలుగులో కావ్యాలు అనగానే, అందరికీ ముందు గుర్తుకువచ్చేది మనుచరిత్ర. మనుచరిత్ర అనగానే అందరికీ ముందు గుర్తుకు వచ్చేది ప్రవర వరూధినులు. కానీ, ఈ కథలో ప్రవరునికి పాత్ర లేదు. వరూధినికి స్వరోచి, అతనికి స్వారోచిషుడనే మనువు పుట్టాలి. అది మనుచరిత్ర. కథను తెలుగు చదవలేనివారికి కూడా అందించే పద్ధతిలో శిష్ట్లా శ్రీనివాస్‌గారు ఈ ఇంగ్లీషు అనువాదాన్ని స్వయంగాచేసి, ప్రచురించారు. ఇంతకుముందు ఈయనే ఆముక్తమాల్యదను ఆంగ్లంలో అందించారు.

శ్రీనివాస్, ఆంధ్ర విశ్వవిద్యాలయం కళల విభాగంలో కళాచరిత్ర బోధకులు. శిల్పం, చిత్రకళ మీద జరిపే పరిశీలనలు, పరిశోధనలతో వారి దృష్టి సారస్వతంవేపు మళ్లింది. భూమి గుండ్రంగా ఉందని చూపే బొమ్మలు, శిల్పాల ప్రేరణతో ఆయన ‘కపిత్థాకార భూగోళ’అనే పుస్తకం రాశారు. శ్రీకృష్ణదేవరాయలు, గురజాడవారు వీరిని ఎంతో ప్రభావితం చేశారు. రాయల రచనను ఆంగ్లంలోకి అనువదించడానికి అదే ప్రేరణ అనవచ్చు. రాయలను సాక్షాత్తు శ్రీమహావిష్ణువుగా భావించి తన కావ్యాన్ని అంకితమిచ్చిన పెద్దన మనుచరిత్ర, క్రమంలో తరువాత వచ్చింది.

కృష్ణదేవరాయలకు తాను దాసీపుత్రుడన్న జనవాక్యం, బాధాకరంగా తోచడం సహజం. రాయల వ్యాసంగంలో ‘స్వారోచిష మను సంభవం’ తగిలింది. ఆ మనువుకూడా రాణికి పుట్టినవాడు కాదు. కనుక రాయలు ఆ కథను పెద్దన చేత తెలుగులో వ్రాయించాడు. అందులో ప్రయత్నంగా పెద్దన కొన్ని మార్పులుచేర్పులతో కథను మలిచి మహత్తర కావ్యంగా రాయలకు అంకితం చేశాడు. మనువుల కథ సంస్కృతంలో మార్కండేయ పురాణంలో వస్తుంది. దాన్ని మారన తెలుగు కావ్యంగా మలిచాడు. రాయలు కూడా రచన అదే మార్గంలో ఉండాలని పెద్దనకు సూచించాడు. అల్లసాని కవి మాత్రం మారన పేరు కూడా ఎత్తకుండా కథను మహా రంజకంగా వెలయించాడు. ఆంధ్ర(!) కవితా పితామహుడనిపించుకున్నాడు. ఆ కావ్యాన్ని శ్రీనివాస్ ప్రస్తుతం, పద్యానికి పద్యం, పాదానికి పాదంగా ఆంగ్లంలో అందించాడు.

శ్రీనివాస్ స్వతహాగా పరిశోధకుడు. తాను తెలుగు, సంస్కృతాలలో పండితుడిని కానని తానే చెపుతాడు. కానీ, కావ్యం ముందు వెనుకల గురించి ఎంతో పరిశీలించి ఎనె్నన్నో అంశాలను కూడా ఈ పుస్తకంలో అందించాడు. కథను సూక్ష్మంగా అందించడం అవసరం. దాన్ని మరీ సూక్ష్మంగా అందించి మరెన్నో విషయాలను మాత్రం చాలా వివరంగా, 100 పేజీలకు పైన వ్యాసాల రూపంలో ఇచ్చాడు. అనువాదం పద్ధతి, అక్నాలెజ్‌మెంట్స్ తర్వాత, ప్రవేశికలో ప్రారంభించి, పురాణాలు, మూడుసార్లు వచ్చిన మనుకథలలో తేడాలు, రాయలు, అల్లసాని, వారి గురించి కావ్యం గురించి ఇచ్చిన సమాచారం తెలిసిన వారికి కూడా కొత్త ఆలోచనలను అందజేసే తీరులో ఉంది. కళాదృష్టితో చూచి ఈ అనువాదకుడు, కథ ఔట్‌డోర్, ఇన్‌డోర్‌లలో నడిచిన తీరు గురించి చేసిన వ్యాఖ్యానం చాలా బాగుంది.
కృష్ణరాయలు, పెద్దనలిద్దరూ వైష్ణవ గురువుల శిష్యులు. ఆముక్త మాల్యద అనువాదం నాటికి శ్రీనివాస్‌కు అంతగా అందని వైష్ణవం విశేషాలు ఈ పుస్తకంలో సవివరంగా కనిపిస్తాయి. కావ్యం అయిన తరువాత యిరవయి పుటలలో ఇచ్చిన వివరాలు, గొప్ప పరిశోధన దృష్టికి నిదర్శనాలు.

అల్లసాని పెద్దన గురించి చెప్పేవారంతా ‘అల్లిక జిగిబిగి’గురించి వ్యాఖ్యానిస్తారు. పెద్దన రచనలో సంస్కృతం ఎక్కువ. అయినా మాటలు మంచి పట్టుగల నడకలో సాగుతాయని చెప్పక తప్పదు. ‘లంబమాన రవి రథతురగ చారుచామర’ లాంటి మాటలు ఎందరికో కలకాలంగా గుర్తున్నాయి. ప్రవరుడు హిమాలయాలకు వెళ్లి (అపజనించె)న, తరువాత పద్యమంతా సంస్కృతమే. అంబర చుంబి శిరస్సరజరీ అంటూ పద్యం జలపాతంలాగే సాగుతుంది. దాన్ని శ్రీనివాస్ ఆంగ్లంలో ఎట్లా రాశారు? నిజమే, ఈ పద్యంలోనే కాదు, మొత్తం కావ్యంలోనే, ఆంగ్లంలో, అల్లిక జిగిబిగి కానరాదు. ఇది వ్యాఖ్యానాలమీద ఆధారపడి చేసిన అనువాదమని శ్రీనివాస్ స్వయంగా చెప్పాడు. ఇంగ్లీషులో కావ్యాన్ని చదివే వారికి, మూలం నడక తెలియదుకానీ, ఏ భావమూ, అభివ్యక్తీ జారకుండా అనువాదం సాగింది. మూలం చదివి, అర్థంచేసుకున్న వారయినా, ఈ విషయాన్ని సహృదయతతో ‘బాగుందం’టారు.

అనువాదకుని అసలు ఆసక్తి శిల్పంలో! ఆముక్తమాల్యద అనువాద గ్రంథంలోలాగే ఈ పుస్తకంలో కూడా, ఎన్నో ఫొటోలు పొందుపరిచారు మరి. ఈ చిత్రాలన్నింటికీ కథలోని సందర్భంతో సంబంధం ఉందా? కొంతవరకు ఉంది. చాలావరకు లేదు. కానీ అరుదయిన శిల్పకళను చూచిన ఆనందం మాత్రం పాఠకునికి మిగులుతుంది.
అల్లసానివారి అల్లిక ‘జిగి బిగి’అంటే ‘విగరస్ అండ్ టైట్’అనే విశేషణాలను వాడారు వ్యాసంలో. ముక్కు తిమ్మనార్య ముద్దుపలుకులను, పదాలు ముద్దులవలె ఉన్నాయని అర్థం వచ్చే మాటలతో అనువదించారు. ముద్దుపలుకులంటే, ముద్దొచ్చే పలుకులేమో? ముఖ పత్రం మీద కృష్ణరాయల బొమ్మ (శిల్పం) ఉంది అల్లసాని పెద్దన, శిష్ట్లా శ్రీనివాస్‌ల పేర్లున్నాయి. రెండు పేర్లలోని స,శ,ష లకు ఒకే ఎస్‌ను వాడారు. ఈ పద్ధతిని గురించి అందరూ ఆలోచించాలి.

ఈ అనువాదంతో శ్రీనివాస్ ఆంధ్ర సాహిత్యానికి గొప్ప ఉపకారం చేశారు. వారింకా ఏయే కావ్యాలను అందిస్తారోనని అంతా ఎదురుచూస్తారు. పుస్తకంలో అచ్చుతప్పులు (అక్కడక్కడ) ఉన్నాయి. పాయసంలో పుడకల్లాగ!