Monday, December 31, 2012

కొన్ని ముఖములు

మరి కొన్ని ముఖములు
ఇవి కూడా ఆసక్తి కరమయినవే
ఉదాహరణకు ఈ ముఖము 60 సంవత్సరాల నాటి వ్యాపార ప్రకటన


ఇంక ఈ ముఖమును జాగ్రత్తగా చూడండి.
చెవి ఆభరణములా? తుపాకి గొట్టమా?


నాకు నచ్చినవన్నీ ప్రపంచమునకు నచ్చవలెనన్న నియమము లేదని తెలుసును.
నా వెర్రి నాది!

Saturday, December 29, 2012

కొన్ని ముఖములు

ఈ ముఖములను గమనించండి
ఇవి చాలా ప్రత్యేకమయినవి.
నేషనల్ జియొగ్రాఫిక్ వారికి గుర్తింపుగా నిలిచిన చిత్రమిది.
ఈ ఇరాను అమ్మాయిని 38 సంవత్సరాల తరువాత మళ్లీ వెతికి ఫొటో తీసి ప్రచురించారు


2012 లో అంతర్జాతీయ స్థాయిలో బహుమతి గెలిచిన ఫొటో ఇది.

(ఈ చిత్రాలు చాలా పెద్దవి. మరొక టాబ్ లో చూడండి.)

Tuesday, December 18, 2012

ఎవరికివారే ప్రత్యేకం!

ఏం వాయ్, మై డియర్, మొఖం వేలవేశావ్? అంటాడొకాయన. ఆ ముఖం వేలవేసిన బాబు సంవత్సరం పరీక్షలో ఫెయిలయ్యాడు. సెలవులకు ఇంటికి పోతే, తండ్రి తంతాడని భయం. ఈ అడిగినతను, ఆ బాబుకు చదువు చెప్పవలసిన ట్యూషన్ గురువు. చుట్ట కాల్చడం నేర్పించాడు, అంతేగానీ, చదువు చెప్పినట్టు లేదు. గురజాడ వారు సృష్టించిన వేల ముఖం వెనక ఎంతో కథ ఉంది. ఆ బాబు ముఖం వెలగమంటే ఎట్లా వెలుగుతుంది?

తన మీద తనకు గౌరవం ఉన్న మనిషి ముఖం వెయ్యి వాట్ల బల్బులా వెలుగుతుంది. తన మీద తనకున్న గౌరవం, హద్దులు మీరితే కూడా మంచిది కాదని గుర్తుంచుకోవాలి. గౌరవంతోనే బతుకు ముందుకు సాగుతుంది. నీకు ప్రపంచంలో ఎన్నో కావాలి. అందులో కొన్ని తప్పకుండా కావాలి. అవి నీకు అందాలంటే, అందుకు తగిన యోగ్యత, నీ దగ్గర ఉండాలి. అందుకే కొందరికి తమకు కావలసిందేదో అడగాలన్నా భయంగా ఉంటుంది. ‘కావాలి. నిజమే! కానీ, అందుకు నీవు చేసింది ఏమిటి?’ ఎందుకని నీకు ఏ విషయమయినా అందాలి? అందుకు నీవు తగినవానివని రుజువేమిటి? సీటు కోసం, ఉద్యోగం కోసం, చివరకు జీవిత భాగస్వామి కోసం వెతుకుతుంటే, ఎదురయేవి ఈ ప్రశ్నలే గదా!


మన గురించి, మన కోరికల గురించి, మనం ధైర్యంగా చెప్పగలగాలంటే, మనకు మన మీద గౌరవం ఉండాలి. మనమే సాధించి ఉండాలి. మనకు కొంతయినా, ప్రత్యేకత, గుర్తింపు ఉండాలి. నీకు ఉద్యోగం అవసరం గనుక ఉద్యోగం ఇవ్వాలా? లేక నీవల్ల ఎదుటివారికి కొంత ఉపయోగం ఉంటుంది గనుక ఇవ్వాలా? ఇదేనా సమస్య? ఈ గౌరవం ఎంత ఉండాలని ప్రశ్నించుకుని చూడండి. ఆత్మగౌరవాన్ని కొలవడం కుదరదు. అన్ని సందర్భాలలోనూ ఒకంతే గౌరవం ఉండడం కూడా కుదరదు. సందర్భాన్ని బట్టి గౌరవం అవసరం మారుతుంది. కొన్ని చోట్ల. ఉదాహరణకు నిన్ను అర్థం చేసుకున్న పెద్దవారి ముందు, ఈ ఆత్మగౌరవం ప్రదర్శించకుండా ఉంటేనే మంచిది.

ముఖం వేల వేసిన వెంకటేశం తండ్రికి, బోలెడంత కోపం, మరింత మొండితనం ఉన్నాయి. ఆయన ఏ విషయంలోనూ ఎవర్నీ సంప్రదించడు, నమ్మడు. తల్లి మాత్రం అమాయకురాలు. ఆ కాలం పరిస్థితులు, అనుకుని సర్దుకుపోవచ్చు. ఈ కాలంలో కూడా, చాలా కుటుంబాలలో పరిస్థితి పిల్లల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేదిగా ఉండటం లేదు. బయట సంఘంలోనూ, ‘నువ్వెందుకూ కొరగావు’ అని చిన్నచూపు చూచేవారే. ‘నీవు కూడా ఏదో సాధించగలుగుతావు’ అని ధీమా చెప్పిన తల్లిదండ్రులు, ఇరుగు పొరుగువారూ ఉన్న వారు అదృష్టవంతులు.


ఈ ప్రపంచంలో మనకంటే గొప్పవారు ఎంతోమంది ఉన్నారు. మనకంటే తక్కువ తెలివితేటలూ, పనితనం గలవారు కూడా ఉన్నారు. సరిగ్గా మనలాంటి మనుషులు మాత్రం లేరు. అందుకే ఎవరికివారే ప్రత్యేకం! ఈ సంగతి మీకు ఇంతవరకు ఎవరైనా చెప్పి ఉంటే మీరు ఇక ధైర్యంగా, గౌరవంగా ముందుకు సాగుతారు. ‘ఆ అమ్మాయిని చూడు, ఈ బాబును చూడు! మరి నువ్వూ ఉన్నావు’ అన్న సాధింపులు చిన్ననాడు మొదలవుతాయి. అదే భావం మనసులో నాటుకుంటుంది. ఎన్ని నాళ్లయినా వెంటాడుతూ ఉంటుంది. ప్రపంచం భయపెడుతుంటే, ఈ భావం బలపడుతుంది. భయపెడుతుంది. మనమీద మనకు గౌరవం అడుగంటుతుంది.


అద్దంలేని కాలంలో ఒకానొక పౌరాణిక పురుషుడు, నీళ్లలో తననుతాను చూసుకుని ‘నేనెంత అందంగా ఉన్నాను!’ అనుకునేవాడట. ఇవాళటికీ ఆ రకం వ్యక్తులు చాలామందే ఉంటారు. కానీ తనలో ఎక్కడో ఏదో లోపం కూడా ఉందని తెలుసుకున్నవారు కాళ్లు నేలమీద ఆనుకుంటాయి. సరిగా నడుస్తాయి. మనకున్న శక్తియుక్తులను గుర్తించటం అవసరం. అంతకన్నా ఎక్కువ శక్తియుక్తులు కూడా ఉంటాయని గుర్తించడం, అంతకన్నా అవసరం. నిద్రలేచిన వెంటనే అద్దంలో ముఖం చూచి మనలను మనమే ‘శభాష్!’ అనుకుంటే, ఆ రోజు బాగా గడుస్తుందా? నిన్నటికీ, ఇవాళటికీ మనలో వచ్చిన మార్పులను గుర్తించి, మంచిని పెంచి, చెడును తుంచితే రోజు బాగా గడుస్తుందా? ఈ రెండవ పద్ధతి మనకు చేతనవుతుందని అర్థమయిననాడు, మన మీద మనకు, మరింత మందికీ, తెలియకుండానే గౌరవం ఎక్కువవుతుంది. అసలు, ఈ సంగతి పట్టించుకోకుండా, మంచి మార్గంలో మరింత వినయంగా, ముందుకు సాగుతూ ఉంటే, మరింత సౌకర్యంగా ఉంటుంది. మనం సాధించిన చిన్న చిన్న విషయాలను అందరూ గుర్తించకపోవచ్చు. అందుకు కుంగిపోవనవసరం లేదు. వాటిని మనం లెక్కవేసుకుని గుర్తించుకుంటే చాలు. గుర్తు ఉంచుకోకున్నా ఫరావాలేదు. మన గౌరవం కొనసాగుతుంది. మంచి మార్గం సాగుతుంది.



మంచిదారిలో నడవడం అలవాటయిన తరువాత, చెడు దారిని గుర్తించడం సులభంగా వీలవుతుంది. మంచిదారి మనకు ఇష్టమయిన దారిగా మారుతుంది. మనకు ఇష్టమయిన పనులను మాత్రమే మనం చేస్తుంటే, అంతకన్నా ఆనందమే లేదు. అందులో మనకు మనమీద, ఇతరులకు మనమీద గౌరవం పెరుగుతుందని అర్థమవుతుంది. మనం ఇష్టం వచ్చిన మంచి పనులను, మనకు ఇష్టం గనుక చేస్తాము. గౌరవం కొరకు మాత్రం కాదు. పదుగురి మెప్పుకోసం చేసే పనులు, చెప్పకుండానే తెలిసిపోతాయి. తేలిపోతాయి. ఇష్టపడిన పనిని చేయడం ఒక ఎత్తు. చేస్తున్న, చేయవలసిన పనులను ఇష్టపడటం మరొక ఎత్తు. ఇది కూడా అలవాటయితే, గౌరవం కన్నా దృష్టి ఆనందం మీదకు మారుతుంది. ఉత్సాహం ఉరకలు వేస్తుంది.

చేస్తున్న పని నచ్చింది గనుక, అందులో మెళకువలు నేర్చుకునే ప్రయత్నాలు అవే మొదలవుతాయి. మనం పెరుగుతాము. మన పనులు, నిర్ణయాలు మరింత మెరుగుగా వస్తుంటాయి. అది గౌరవంగానూ, ఆనందంగానూ ఉంటుంది. నిర్ణయాలు వస్తున్నాయంటే, అవి మరికొందరిని ప్రభావితం చేస్తాయి. వారికి మనతో సంబంధ బాంధవ్యాలు మొదలవుతాయి. అక్కడో ఇక్కడో మనలను ప్రశ్నించి విమర్శించి, తికమకపెట్టేవారు ఎదురవుతారు. వారు నిజానికి మనకు సాయం చేస్తున్న వారిలో లెక్క. మన దారి, పనులు, నిర్ణయాలు మంచివేనని తేల్చుకోవడానికి వీరు మనకు ఎంతో సాయం చేస్తారు. ఆ సంగతి వారికీ అర్థమయితే, మిత్రులవుతారు. అభిమానులవుతారు. అనుయాయులవుతారు. అంటే మన వెంట వస్తారు!


ఈ ప్రపంచంలో లోపం లేని మనుషులు లేరు. ఈ ఒక్కటీ గుర్తుంచుకుని ముందుకు సాగుతుంటే, మనకు గౌరవంలోగాని, ఆనందంలోగానీ లోపం ఉండవలసిన అవసరం లేదు!

Thursday, December 13, 2012

కార్టూన్ - యువ నుంచి

పాత కార్టూన్ ఒకటి.
1963 లో వచ్చిందిది.
యువ మాస పత్రికలో.


Tuesday, December 11, 2012

పరిణామం- బరువు

ప్రతి మనిషికీ స్వంత ఆలోచనలు, ఆశలుంటాయి. అందరి ఆలోచనలు ఒకే రకంగా ఉండవు. కొన్ని ఆలోచనలు మాత్రం ఒక వర్గానికి, ప్రాంతానికి, దేశానికి గుర్తింపుగా నిలుస్తాయి. నాది అన్న భావన ఆలోచనతో ముగియదు. వస్తువులతో మొదలయి అది విస్తరిస్తూ పోతుంది.

మనుషుల తీరు ఇట్లాగే ఎందుకుంది? ఈ స్థితి ఎక్కడికి దారితీస్తుంది? మానవ జాతి గురించి, పరిణామం గురించి పరిశీలించేవారు చెప్పే సమాధానం, సంతృప్తికన్నా ఆశ్చర్యాన్ని ఎక్కువగా కలిగిస్తుంది. మనిషి జాతి పుట్టి లక్షల సంవత్సరాలయింది. అందులో 99 శాతం సమయంలో నాగరికత తెలియకుండానే గడిచింది. మనుషులు గూడు లేకుండా బతుకుతూ తిండి వెతుకుతున్నారని అర్థం. ఈ గతం మనకు తెలియకుండానే మనలను వెంటాడుతున్నది. అవునా, అని ఆశ్చర్యపడవలసినంత సత్యమిది. రక్షణ లేకుండా, తిండికి గ్యారంటీ లేకుండా బతికినందుకు, మనిషికి, ముఖ్యంగా రెండు లక్షణాలు అలవడినయి. మొదటిది రెండు కాళ్లమీద నడక. రెండవది మెదడు సైజులో పెరుగుదల. ఈ లక్షణాలు ఎప్పుడు ఎందుకు వచ్చాయని ఆలోచిస్తే అసలు సంగతి మన ముందుకు వస్తుంది. రెండు కాళ్లమీద నడిచినందుకు ప్రస్తుత ప్రపంచంలో మనకు ఒరిగింది వెన్నునొప్పి తప్ప మరో లాభం లేదు! ఇక మెదడు పెరిగినందుకు వచ్చిన కష్టాలు ఇన్ని అని చెప్పడానికి లేదు. ఆలోచన పెరిగింది. అసలు ఈ బతుకు ఎందుకు? లాంటి ప్రశ్నలు కూడా పుట్టాయి, పుడుతున్నాయి. కాలక్రమంలో మనిషి పరిణామాన్ని ఒక గీతగా భావిస్తే, ఈ లక్షణాలు, గీత మొదట్లో ఎప్పుడో పుట్టాయి. సహాయంగా నిలిచాయి. సందేహం లేదు. మనం మాత్రం గీత చివరల్లో ఉన్నాము. ఇప్పుడా లక్షణాలు మనకు సాయం చేస్తున్నాయి, చేయడంలేదు!

మనం మన బతుకును ప్రపంచాన్ని చాలా మార్చుకున్నాము. నిజానికి మన శరీరం, మెదడు తీరు ఇప్పటి ప్రపంచానికి అనువుగా పెరిగినవి, మారినవి కావు. తిండికోసం మనం పనిచేస్తున్నాము. కానీ, నిజంగా పరుగులు పెట్టి జంతువును తరమడం లేదు. కాయలు, పండ్లు వెతకడం లేదు. ‘పండించిన’ తిండిని ‘వండుకుని’ తింటున్నాము. ఆ వంటయినా అందరూ చేయడంలేదు. కూచుని, తింటూ కాలం గడిపేవారు ఎక్కువగా ఉన్నారు. అందరూ కలిసి గుంపులుగానే బతుకుతూ ఉన్నాం. కానీ, ఎవరితోనూ కలిసి గడపటానికి సమయం లేదు. మాటలు నేరుగా జరగవు. మనుషులు నేరుగా కనిపించరు. అంటే మొత్తానికి మన శరీరం, మనసు ఒక రకంగా ఉంటే, మన ప్రపంచం మరో రకంగా ఉందని అర్థమయింది. కానీ, ఆలోచన మనిషిని, అనుకూలం గాని పరిస్థితులలో ఉండనివ్వదు.


పరిణామం, అంటేనే మార్పు. నాగరికత తెలియక బతికిన మనిషికి, అనువయిన రకం లక్షణాలు, చిటికెవేస్తే రాలేదు. ప్రస్తుతం మన బతుకు తీరుకు, అనుకూలంగా ఉండే లక్షణాలు కూడా అంత సులభంగా రావు. పరిణామం బరువును మానవజాతి మొత్తం మోస్తున్నది. కనుకనే, ఆ బరువుతో సహా మరింత వేగంగా, తెలివిగా ముందుకుసాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాత మనిషి బుర్రను తిండి సంపాదించడం కొరకుమాత్రమే వాడలేదు. కనుకనే, మనం ఇవాళ ఇప్పటి పరిస్థితిలో ఉన్నాము. కానీ, మొత్తం పరిణామ చరిత్రని చిత్రంగా గీస్తే, అందులో ఈ పద్ధతి ఒక మూలన కూడ కనబడనంత చిన్నది. మంచికో, చెడుకో మనిషికి ‘సైన్సు’ అనే ఆలోచన కలిగింది. సమస్యలతో పోరాడడం ఒకటే కాదు ప్రస్తుతం మనిషికి వాటికున్న సమాధానాలను వెతకడం అలవాటయింది. ఉన్న తీరు కన్నా మరింత బాగా బతకాలన్న కోరికతో మనిషి చేస్తున్న ప్రయత్నాలు పరిణామం సాగే పద్ధతిని మారుస్తున్నాయి.


మనుగడ కొరకు సాగే సమరంలో నెగ్గిన లక్షణాలు గెలుస్తాయి. జాతులు నిలుస్తాయి ఇదే కదా డార్విన్ మహాశయుడు చెప్పిన పరిణామ క్రమంలోని సూత్రం! మైదానాల్లో ఎన్నో రకాల జంతువులు, అందులో కొన్ని మనలాంటివి కూడా ఉండేవి. వాటిలోనుంచి మనుషులం మాత్రం ఇంత దూరం రాగలిగాం. అడవుల్లో బతుకు వేరు, మైదానంలో తీరు వేరు. మైదానంలో ఎండలు ఎక్కువ, తిండినిచ్చే చెట్లు తక్కువ. అందుకే మన ఒంటిమీది వెంట్రుకలు పోయినయి. పంటి వరుసలో మార్పులు వచ్చినయి. శరీరానికి తిండిని దాచుకునే శక్తి అలవాటయింది. ఇప్పుడేమో అనవసరంగా తినడం అలవాటయింది. కనుకనే చక్కెర వ్యాధి మొదలయ్యింది. ప్రపంచమంతా ఒకటయింది నిజమే కానీ, తుమ్మితేచాలు, వైరసు, ప్రపంచమంతా వ్యాపించే వీలు కూడా మొదలయింది. ఇలాంటి బరువులు, మానవ జాతి బతుకు నిండా వేలాడుతున్నాయి. ప్రకృతిని కాదని, మరింత ముందుకు, మరింత ఎత్తుకు, లోతులకుపోవడం మనిషికి మొదటి స్వభావంగా మారింది, ఈ బరువు కారణంగానే. ఈ నడకకు, ప్రగతిని అసలయిన సాయం అందింది, ఒక్క సైన్సు నుంచి మాత్రమే. ఏం జరుగుతున్నా, ఎందుకు జరుగుతున్నదో తెలుసుకోవడం మనకు తెలిసింది. ఈ సైన్సు ఆధారంగా మానవుడు, ప్రపంచాన్ని తనకు అనుకూలంగా మారుస్తూ ముందుకు వెళ్లిపోతున్నాడు. మొదట్లో మొక్కలను, పశువులను తమ అదుపులోకి తెచ్చుకున్నవారు మనకు ఆదర్శప్రాయులు. దాంతో తిండి, పంట, రక్షణలు మనిషికి వీలయినయి. కానీ, బాగున్నాయనుకున్న ఆలోచనలు ప్రస్తుతం మనకు శత్రువులుగా నిలిచి భయపెడుతున్నాయి. సైన్సులో విచిత్రం ఇక్కడే ఉంది. ఇక్కడ ఏదీ శాశ్వత సత్యం కాదు. మనం అనుకుంటున్న ప్రతి అంశాన్నీ, ప్రశ్నించమంటుంది సైన్సు.


ఆ అంశం సైన్సులోనుంచి పుట్టిందయినా చర్చకు లొంగనిది కాకూడదు. కాదు. సైన్సు, మనలను నిలదీసి, ‘నీవెవరు?’ అని అడుగుతుంది. పరిశోధనలు, వాటి ఆధారంగా జరిగిన మార్పుల ఆధారంగా, మనిషి బతుకు తీరు మారింది. సగటు వయస్సు, ఎత్తు, తెలివి అన్నీ పెరుగుతున్నాయి. రికార్డులు పడిపోతూనే ఉన్నాయంటే, అది సైన్సువల్ల గానీ, మనిషివల్ల గాదు. సైన్సు మన తీరును మార్చింది. కానీ, పరిణామం బరువు మిగిలే ఉంది. ఎక్కువ కాలం బతికినందుకు లాభమా? నష్టమా చెప్పలేము. చావక తప్పదు, అది మారొక సత్యం! ఎవరో ఒకరు ఎత్తులు ఎగిరితే, వేగంగా పరుగిడితే అది నిజంగా పరిణామం అనడానికి లేదు. సగటున అందరికీ ఆ శక్తి ఉండాలి. మనిషి ఎంత వేగంగా పరిగెత్తినందుకు, ఏం లాభం జరుగుతుంది? ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే, పక్కవాడికన్నా వేగంగా పరుగెత్తితే చాలు!


ప్రశ్నలు అడగడం కొనసాగితే, సైన్సు కొనసాగుతుంది. ప్రగతి కొనసాగుతుంది. పరిణామం బరువు తరగడం కూడా వీలవుతుంది. పరిణామం ప్రకారం మనిషికి పరిధులు ఏవయినా ఏర్పడి వుంటే, వాటిని ప్రశ్నించడానికి, ఎదిరించడానికి, అధిగమించడానికి, మనకు ఒక సాయం సిద్ధంగా ఉంది. అదే- సైన్సు!

Saturday, December 8, 2012

కాస్త తెలివిగా..

ఒక రైతు ఇంట్లో ఒక కుక్క, ఒక కోడి ఉన్నాయి. కుక్క కాపలా కాస్తుంది. కోడి ఉదయానే్న కూస్తుంది. గుడ్లుకూడా పెడుతుంది. వాటి బతుకు మొత్తానికి బాగానే నడుస్తున్నది. కానీ, కొంత కాలానికి వాటికి బయట ప్రపంచం కూడా చూడాలి గదా, అనిపించింది. ఉన్నచోటిని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాయవి. ఒకానొకనాడు ఆనందంగా బయలుదేరి, ఉల్లాసంగా నడుస్తూ అవి చాలా దూరం నడిచాయి. దారిలో అనుకోని సంగతులేమీ ఎదురుకాలేదు. తిండికి కూడా కష్టం కాలేదు.

నడుస్తుండగా రాత్రయింది. ఇక ఎక్కడో విశ్రాంతి తీసుకోవాలి. కోడి చుట్టూ వెతికింది. ఒక పెద్ద చెట్టులో మంచి బొరియ ఉంది. కుక్కను బొరియలో పడుకొమ్మని, కోడి తాను మాత్రం చెట్టు ఎక్కి, కొమ్మల నడుమ సేద దీరింది. అలసి ఉన్నాయి గనుక హాయిగా నిద్రపట్టింది వాటికి.

తూర్పున సూర్యుడు కనిపించకముందే, వెలుగులు మాత్రం పరుచుకున్నాయి. అలవాటు కొద్దీ కోడి నిద్రలేచింది. తానింకా రైతు పొలంలోనే ఉన్నాననుకుని, నిద్రలేపడం బాధ్యత గదా అని, అలవాటు కొద్దీ గట్టిగా కూసింది. రెక్కలు టపటపలాడించింది కూడా. రైతు చుట్టుప్రక్కల లేనేలేడు. కానీ, పొదల్లో పడుకున్న నక్కకు మెలుకువ వచ్చింది. దానికి, వెంటనే ఈ పూటకు ఆహారం దొరికిందన్న ఆనందం కలిగింది. అది చెట్టు దగ్గరికి వచ్చేసింది.


‘అయ్యా! ఎప్పుడు వచ్చారు? ఎంత సంతోషం మీరు రావడం. కిందకు రండి, ఏదయినా తిందాం’ అన్నది.
కోడికి సంగతి అర్థమయింది. గాభరా పడితే లాభం లేదు. ‘అదేమిటి? పెద్దలు, మీరే పైకి రండి. అదుగో, ఇంటి తలుపుదగ్గర మా పనివాడున్నాడు. దారి చూపిస్తాడు, రండి!’ అన్నది కోడి తెలివిగా.


నక్కకు కోడి గురించి మాత్రమే ఆలోచన. అది చెట్టు దగ్గరకు వచ్చింది. విషయం గమనించిన కుక్క, దాని మెడను పట్టేసుకున్నది!


మారాలనుకుంటే సరిపోదు. అందుకు తెలివిని సాయంగా తెచ్చుకోవాలి.
-ఈసప్ కథలనుండి

Thursday, November 29, 2012

పిట్టల గురించి పట్టదా?

‘ఇంత ఛిన్న పిట్టవు. ప్రపంచానికి పట్టవు’-అని అరుణగారు తమ కవితలో పిట్టల గురించి పట్టించుకున్నారు. పిట్టలు, వాటి గూళ్లు నేడు కనబడడం లేదు. పట్నాలలో పావురాలు కూడా తరిగిపోతున్నాయి. పిట్ట కనబడితే పండగ చేసుకోవచ్చు! పిట్టను ఊరపిచ్చుక అని కూడా అంటారు. జంతు శాస్త్రం ప్రకారం దాని పేరు పిట్టా సటైవా. ఇందులోని పిట్ట అనే మాట, అసలయిన మన తెలుగుమాట. సటైవా అంటే మనుషుల మధ్యన, ఇండ్ల మధ్యన, ఇండ్లలో ఉంటుందని అర్థం. మరేమయింది ఈ పిట్ట? పిట్ట గూడు కట్టే పద్ధతి మనిషికి చేతగాదు. అంత సౌకర్యంగా, సురక్షితంగా, అందంగా ఇల్లుకట్టుకోవడం పిట్టకే చేతనయింది. అంత చిన్న పిట్టకు తనకన్నా ఎంతో పెద్ద గూడు కట్టడమంటే కొన్ని రోజులపాటు కొనసాగే కార్యక్రమం. నగరాలలో కాదు, పల్లెల్లో కూడా పిచుకలు లేవిప్పుడు. అందుకు కారణాలు వెదుకుతూ జూలియా అనే షెఫీల్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకురాలు పట్నాలు వదిలి కనీసం రోడ్లు కూడా లేని పల్లె ప్రాంతాలకు వెళ్లిపోయారు. గడచిన దశాబ్దాలలో మన మధ్య నుంచి పిట్టలు పారిపోవడానికి, తరిగిపోవడానికి గల కారణాలు, ఆమెకు అక్కడ అర్థమయినయి.

అరుదయిన జంతువులను గురించి పరిశోధించాలనుకునేవారు సాధారణంగా తమ కృషిని కొనసాగించడానికి దీవులను ఎంచుకుంటారు. అక్కడయితే జంతువులు అక్కడే ఉండిపోతాయి. దీవి ప్రకృతి సిద్ధమయిన పరిశోధనశాలగా మారి పరిశీలనలు సులభంగా సాగేందుకు సాయం చేస్తుంది. పిచుకలకు మనం చేసే గోల సహించడం వీలుగావడం లేదని కొంతవరకు గమనించారు. జూలియా ప్రోడర్ ఈ సిద్ధాంతాన్ని మరింత పరిశీలించడానికి ఇంగ్లండ్ తీరంలోని లుండీ అనే పల్లె ప్రాంతానికి చేరుకున్నారు. కానీ, అక్కడ ఆమెకు ఆశ్చర్యం ఎదురయింది. దీవి అంతా ప్రశాంతంగా ఉంది. ఒక చోట మాత్రం పొలంలో కట్టుకునే గుడిసెలాంటి బార్న్ ఉంది. అక్కడ ఉండే జెనరేటర్ అదేపనిగా చప్పుడు చేస్తున్నది. అయినా పిట్టలు ఆ బార్న్‌లోకి వస్తున్నాయి. గుడ్లు కూడా పెడుతున్నాయి. గుడ్లనుంచి పుట్టే పిల్లలపైన గోల ప్రభావం గురించి అక్కడ పరిశీలన సాగింది. గోల లేని చోట, ఉన్న చోట పిల్లల సంఖ్యలో పెద్ద తేడా లేదు. కానీ ఉన్న తేడాలో ఏవో అర్థాలు తోచాయి.

గోలగా ఉండే చోట పిల్లలకు, తల్లి పిట్టకూ మధ్యన సమాచార వినిమయం తక్కువగా ఉంటుంది. అందుకని తల్లి తన పిల్లలకు సరిగా తిండి అందించదని గమనించారు. పిల్లలకు తలిదండ్రులు రావడం తెలియడం లేదు గనుక అవి అరవడం లేదా? లేక పెద్ద పిట్టలకు పిల్లల ధ్వనులు వినిపించడం లేదా? అన్న విషయంలో ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఇంతకు ముందు కేట్ వినె్సంట్ లాంటి మరికొందరు పరిశోధకులు పిట్ట పిల్లల తిండి గురించి పరిశోధించారు.

పిట్టలు ముఖ్యంగా పురుగులను తింటాయి. పరిసరాలలో ఆ రకం తిండి, అంటే పురుగులు సరిగా అందకుంటే, పిట్ట పిల్లలు బతికి పెద్దవిగా పెరగడం కష్టమని గమనించారు. ఇక వాతావరణంలో నైట్రోజెన్ డై ఆక్సైడ్ ఎక్కువగా ఉన్నా పిల్లలు సరిగా పెరగవని తెలిసింది కూడా. అంటే ట్రాఫిక్ ఉండే రోడ్ల పక్కన పిట్టలు గూడు కట్టి పిల్లలను కంటే, అవి మిగతా చోట్లలో పిల్లలవలే బలంగా పెరగడం కుదరదని అర్థం. కనుక పిల్లలు పెరగకపోవడానికి కాలుష్యంతో బాటు, గోల కూడా కారణమవుతుందని ప్రస్తుతం పరిశోధనలతో అర్థమవుతున్నది.

మనుషుల మనుగడే కష్టంగా ఉంది గనుక, మన దగ్గర పిచ్చుకల గురించి పట్టించుకునేంత మంచితనం లేదు. సందర్భం వచ్చిందని పిట్టల బొమ్మలను నగరాలలో రోడ్లమీద నిలిపితే వాటికి రక్షణ దొరకదు. ప్రపంచమంతటా, అంతరించిపోతున్న జంతుజాతులను గుర్తిస్తున్నారు. వాటిని రక్షించాలని మాట్లాడుతున్నారు. వరిపొలాల్లో కనిపించే నత్తలు, అంతటా కనిపించే కప్పలు, పిచుకలు వెతికినా కనిపించని కాలం వచ్చింది. ఇంగ్లండ్‌లో కూడా పిచుకలను రెడ్ లిస్టులో చేర్చారు. కానీ, అక్కడ ఇంకా కావలసినన్ని పిట్టలున్నాయని లెక్క చెపుతున్నారు. సుమారు అరవయి లక్షల జతల పిచుకలున్నాయని వారు లెక్క చెపుతున్నారు కూడా!

మనిషికి, ప్రకృతికి మధ్యన వారధిగా ఊరపిచ్చుకలను గురించి చెప్పుకునేవారు. మనకు అన్నింటికన్నా ఎక్కువగా, తరచుగా కనిపించే పక్షులలో అవే మొదటివిగా ఉండేవి. ఒక్కసారిగా 15-20 సంవత్సరాల కాలంలో పిట్టల సంఖ్య తొంభై శాతం వరకు తగ్గిపోయిందంటే ఆశ్చర్యం. ఆ తరుగుదల మొదలయినప్పుడే బ్రిటన్ లాంటి చోట్ల పరిశోధకులు, పరిస్థితిని గుర్తించారు. మనం ఆ అవకాశాన్ని వదులుకున్నట్టు తోస్తుంది. ఒకప్పుడు నగరాలలో పావురాల సంఖ్య మరీ ఎక్కువగా ఉంటూ కొంత సమస్యకు కారణమయేది. ఈ మధ్యన వాటి సంఖ్య కూడా వేగంగా తరిగిపోతున్నది.
పిచ్చుకలు తగ్గడానికి కొన్ని కారణాలు ముందుగా కనబడతాయి. మనం ఇళ్లు కట్టుకునే తీరు మారింది. నేడు పూరిళ్లు పల్లెల్లో కూడా లేవు. మన ఇళ్లు, పరిసరాలు మరింత పరిశుభ్రం, ఆధునికం అయినయి. తోటలు కూడా మరీ మరీ శుభ్రంగా ఉంటున్నాయి. కనుక గతంలో వలే పిచుకలకు తలదాచుకునే చోటు లేదు. తిండి అంతకన్నా లేదు. పిచ్చుకలకు మనుషుల మధ్యనే పచ్చని ప్రాంతాలుండాలి. పొదలుండాలి, పురుగులు ఉండాలి. అవన్నీ మనకు అనాగరికంగా కనిపించే లక్షణాలుగా మారాయి.

నిజానికి మనుషులు ఎక్కువగా తిరగని, పాడుబడిన బంగళాలలో, అపరిశుభ్రంగా, ఎవరూ పట్టించుకోక వదిలిన పార్కులలో పిట్టలు కనబడుతున్నాయట. అక్కడ పిట్టలకు పుష్కలంగా పురుగులు దొరుకుతాయి. ఇళ్లు అందంగా, శుభ్రంగా కట్టుకోవడం అవసరమే కానీ పిట్టలుంటే చుట్టూ ఉండే పురుగులను తింటాయి. మన పరిసరాలు మరింత పరిశుభ్రంగా ఉంటాయి. కొంతమంది పిచుకలు ఉండడానికి అనువుగా గూళ్లను ఏర్పాటుచేస్తుంటారు.

అందులో వాటికి కొంత తిండి కూడా దొరికే ఏర్పాటు ఉంటే పిచుకలు తిరిగి వస్తాయి. ఎక్కడో ఒక మూల చెత్త చేరడం మామూలే. అందులో పురుగులు దొరుకుతాయి గనుక పిచుకలు మరింతగా పెరుగుతాయి. కానీ, నగరాలలో, పల్లెలలో కూడా గోల బాగా ఎక్కువయింది. మిగతా పరిస్థితులు అనుకూలంగా వున్నా, గోల కారణంగా పిచుకలు తరిగిపోతున్నాయి. గోల చేయకుండా బతకడం మనకు చేతనవుతుందన్న నమ్మకం పోయింది. ప్రశాంత వాతావరణం పక్షులకే కాదు, మనకు కూడా మంచిది! ఈ సంగతి అర్థమయితే.. పిట్టలను మనం పట్టించుకున్నట్టే!

Friday, November 23, 2012

గొడ్డలి వేటు - మతియాస్ నెస్పోలో



ముసలి మొరెట్టి ముందర నరకవలసిన కట్టెలు చాలనే ఉన్నయి. అతని వేళ్లు మాత్రం అప్పటికే కొంకర్లు పోతున్నయి. కాలి వేళ్ల గురించి చెప్పనవసరమే లేదు. అవి ఉన్నయో లేవో తెలియడము లేదు. ఇంకో పక్క ముక్కు మరగకాచిన నీటిలో ముంచినట్టు మండుతున్నది. మెడ చుట్టు మేక వెంట్రుకల మఫ్లర్ ఉంది. నెత్తికి ఒక గుడ్డ చుట్టి ఉంది. దాని మీదినించి ఒక వెడల్పు అంచు ఉన్న షాంబర్గో టోపీ పెట్టుకున్నడు.

గంటసేపటినుంచి ఆయన ఆగకుండ కట్టెలు కొడుతున్నడు. అలిసి పోయినడు. వయసు పైనబడిందాయె. ఎంతకూ తెగని ఒక ముక్కను ఆయన తిడుతున్నడు. ఇంక ఓపిక నశించింది. మొరెట్టీకి కాలయాపన చేసే ఆలోచన లేదు. బాగా ఊపిరి పీల్చి గట్టి దెబ్బ ఏసినడు. సూటిగ. పడవలసిన చోట. ఎదలోనుంచి ఒక్క మూలుగు వచ్చింది. కట్టె మూడు తునుకలయ్యింది. కాని, గొడ్డలి ఆయన చేతినించి జారి పోయింది. అది మంచులో నాటుకున్నది. ఆయన కాలి బూటు పక్కననే.

మొరెట్టికి సంగతి తెలిసేందుకు కొంచెం సేపు పట్టింది. చలిగాలిలో ఆయన ఊపిరి కనబడుతున్నది. గొడ్డలిని తీసుకునేందుకు వంగినడు. అది బాగా బలంగ నాటుకుని ఉంది. కామ మంచుకన్న చల్లగ ఉంది. ఇప్పటి వరకు అది తన చేతిలోనే ఉంది. మరి అంత ఎట్ల చల్లగయ్యింది.

దాన్ని అట్లనే ఇడిచి పోదమా అనుకున్నడు. ఇంకొన్ని కట్టెపుల్లల కొరకు, మంచులో గడ్డగట్టుకపోతే అర్థం లేదు. వాతావరణం బాగయిన తరువాత పని మళ్ల మొదలు పెట్టవచ్చు. ప్రస్తుతానికి రాత్రి మంటకు సరిపోను కట్టెలున్నయి. రేపు ఆదివారం. కొడుకు సెర్జియో ఒస్తడు. వాడు పట్నములో గొంగళ్ల సంగెములో పనిజేస్తడు. పిల్లగాడే. కాని కనీసము సెక్రటేరీ అన్న అయ్యి ఉంటడని ముసలాయన నమ్మకము. మొరెట్టీకి కొడుకు గురించి గర్వంగ ఉంటుంది. వాడు వచ్చినంక కట్టెలుగొట్టి కొట్టము నింపమని సాయం అడుగవచ్చు. ఇంక ఎండకాలము దనుక ఏ ఆలోచన ఉండదు. వాడు ఎట్లనన్న రెండు వారాలు ఉంటననే అన్నడు మరి. వానికి గూడ పని నించి తెరిపి గావాలే. అప్పటికల్ల చెట్లు పడగొట్టి పెడితే రెండు మూడు వారాలల్ల పని అయితది. పొయ్యిల పట్టెటంత తునుకలు జేస్తే చాలు.

ఆయన ఆ పనిని మెల్లమెల్లగ తన పద్ధతిలో చేస్తుంటడు. తీరిక ఉన్నప్పుడే వసంతరుతువులో మొదలు పెడితే చలి మొదలయ్యే కాలానికి కావలసిన కట్టెలు చేరుకుంటయి. కానీ ఈ సంవత్సరం అట్ల చేయడము కుదురలేదు. ఈ సారి ఆయన గొర్రెల ఉన్ని తీసే పని మానేసినడు. కొండలెక్కే వాండ్లకు తిండి అందించే పనిలోకి దిగినడు. రొట్టెలు చేసి అమ్మితే ఎక్కువ పైసలు వస్తయని ఆయనకు తోచింది. కానీ అనుకున్నదానికంటే ఆ పనిలో ఎక్కు సమయం పట్టింది. ముఖ్యంగ మట్టితోటి పెద్ద పొయ్యి కట్టవలసి వచ్చింది. ఇప్పటికి ఉన్న పొయ్యి నిజానికి అంత పెద్దది కాదు. కొత్త పొయ్యిని వేడి చేసి సరిగ్గ మంట ఉండేటట్లు చూడాలంటే కట్టెలు శాన కావల్సి వచ్చినయి. చలికాలానికి సరిపొయ్యేటన్ని కట్టెలు జమచేసుడు గాక ఎండకాలమంత వ్యాపారం కొరకు కట్టెలు గొట్టుడుతోనే సరిపొయ్యింది. సంగతి అర్థమయ్యే సమయానికి చలికాలం రానే వచ్చింది. అందుకే ఇప్పుడాయన కష్టపడుతున్నడు.
ఏదో రకంగ తనకు తానే నచ్చజెప్పుకుంటు, గొడ్డలివట్టుకుంటే ఒళ్లు బిగదీసుక పోతున్నది. గొడ్డలి వేరులో దిగవడినట్టున్నది. కామను పట్టుకోని గట్టిగ లాగినడు. ఏమయిందో వెంటనే అర్థమయ్యింది ఆయనకు. ఎడమ కాలిలో పొడుస్తున్న బాధ తెలిసింది. అది వెన్నెముకలోనుంచి మీదికి పాకుతున్నది. ప్రభావం మెడ వెనుక తెలుస్తున్నది. అది నిజం కాజాలదు. ఒక్కసారిగ ఒళ్లంత ఉడుకయ్యింది. బట్ట కణతలకు అంటుకుంటున్నది. చెమటలు పడుతున్నయి. నిజంగ ఇట్ల జరుగుతున్నదా. నాశినం గాను. కాల్లో నొప్పి బాగ సలుపుతున్నది. కిందికి చూస్తే అనుమానాలన్ని దూరమయినయి. బూటు రక్తం మడుగులో ఉంది. కరిగిన మంచులోనుంచి ఆవిర్లు పుడుతున్నయి.

ముసలి మొరెట్టీకి నమ్మకం గలుగలేదు. గొడ్డలితోటి ఇంతకు ముందెప్పుడు ఇట్ల జరగలేదు. అసలు అట్ల ఏదీ జరుగలేదు. తెలివి దెలిసినప్పటినుంచి కట్టెలు కొడుతునే ఉన్నడు మరి. ఒకప్పుడు గొర్రెల మంద చుట్టు వేసిన కంచెతీగె తెగింది. అది మొఖంలో తగిలింది. ఇంకొక సారి గొర్రెల ఉన్ని తీసే కత్తెరతోటి చెయ్యి తెగింది. తొందరలో ఉండంగ ఒక మంకు గొర్రె పట్టుదప్పి కదిలింది.ప్రమాదాలు జరుగుతయి. కానీ గొడ్డలితో ఎన్నడు జరుగలేదు. ఎట్లనంటే చెప్పేటందుకు లేదు.

గొడ్డలి చేతిలోనే వేలాడుతున్నది, ఆయన అన్యమనస్కంగ ఆలోచనలో పడినడు. గొడ్డలిని దాని చోటులో పెట్టాలనుకున్నడు. కానీ ఆగినడు. ముందు కాలిని రక్తం మడుగులోనుంచి ఎత్తే ప్రయత్నం చేసినడు. నిలకడ తప్పింది. తలకాయ తిరిగింది. తాను కింద పడిపోలేదు. కానీ, గొడ్డలిని మాత్రం గట్టిగ పట్టుకున్నడు. అప్పుడు దాన్ని ఆధారంగ వాడవచ్చునని తోచింది. కామను మంచులో పొడిచి గొడ్డలిని గట్టిగ పట్టుకున్నడు. చేతికంత రక్తం అంటింది.

కాలును మెల్లెగ మీదికి ఎత్తి శుభ్రంగ ఉన్న మంచు మీద పెట్టినడు. అయినా చుక్కలు గనిపించుడు మొదలయింది. ఒక్కసారిగ ఐదు పండ్లు ఊడబీకినట్లున్నది. ఉన్నవే తక్కువ మరి. అది గూడ మత్తుమందు ఇయ్యకుండనే పండ్లు పీకినట్టున్నది. మొరెట్టీ నోటెంట తిట్ల వాన మెదలయింది. కుడికాలు మీదికి లేపి ఒక్క అడుగు ముందుకు ఏసినడు. నొప్పి బాగ ఎక్కువయింది. చూపు ఆనుత లేదు. దెబ్బతగిలిన కాలి మీద బరువు ఏసే ధైర్యం లేదు. దాన్ని మీదికి ఎత్తేదే కష్టంగ ఉన్నది. ఈడ్చుకుంటు పోవాలె ఇగ.
బూటును గుంజుతున్నందుకు మంచులో కాలువవడుతున్నది. దాంట్లో చిన్న ప్రవాహంగ రక్తం వస్తున్నది. ఇంటిలోనికి పోవాలంటే ఇరువయి మీటర్ల దూరమున్నది. ముసలాయనకది అయిదు నూర్లంతంలు అనిపించింది. నొప్పి. దిక్కుమాలిన నొప్పి. గొడ్డలి ఇంకా కాల్లోనే ఉన్నంత నొప్పి.

వరండా చేరుకోని కమ్ములను గట్టిగ పట్టుకున్నడు.  బరువునంత గొడ్డలి మీద ఆనించినడు. కుంటికోడి లాగ ఎగురుకుంటు మూడు మెట్లు ఎక్కినడు. నేల చెక్కల మీద గొడ్డలి కామ తగిలి చప్పుడు చేస్తున్నది. మూడు గుద్దులు గుద్దినట్టు ఉందది. భుజంతోటి తలుపులను ముందరికి తోసి పెము కుర్చీలో కూలవడ్డడు. స్టవ్ మండుతున్నది. తలుపులోనుంచి గాలి వస్తున్నది. తలుపును మూయాలని తాను చేసిన ప్రయత్నం పని చెయ్యలేదని అర్థం.

మొరెట్టీ గొర్రెలను తరిమిన కుక్కలాగ ఒగరుస్తున్నడు. రక్తం వాసన పసిగట్టి కుక్క తనచోటినుంచి వచ్చింది. చారను చూసుకుంటు ఇంట్లోకి వచ్చింది. వచ్చి బూటును నాకసాగింది.

ఫో చీదర!’ మొరెట్టీ అదిలించినడు. కుక్క దూరం జరిగింది. కాని మరీ అంత దూరంగాదు.

బూటు నీటిబుగ్గ వలె ఉన్నది. రక్తం ఓడుతున్నది. అన్యాయంగ ఉన్నది అనుకున్నడు ముసలాయిన. కాల్లో ఉడుకుదనం అలలు అలలుగ కదులుతున్నది. రక్తనాళం తెగినట్టున్నది.

ఆయన నెత్తికి గట్టిన గుడ్డను టోపీని తీసేసినడు. ఊపిరి బిగబట్టి కోటును కూడ వదిలించుకున్నడు. అనుకోకుండనే గొడ్డలిని కుర్చీ పక్కకు ఆనించి వదిలేసినడు. దాని తల పైకి ఉన్నది. రక్తంలో తడిసి గర్వంగ. ఒక చేదు నవ్వుతో మొరెట్టీ దాన్ని పక్కకు పడేసినడు. అది వినయం లేని పిశాచి. దాని ఆలోచన ముందే తెలిసి ఉంటే, దాన్ని సానరాయి మీద అంతగనము నూరి ఉంటేవాడు గాదు. కట్టెలు కొట్టినప్పుడల్ల చేసే పనేనాయె అది.

బాగున్న కాలి బొటనవేలు సాయంతో, బూటును మడమ నుంచి కిందికి కదిలించినడు. అది ఊడింది. సలుపుతున్న నొప్పి తగ్గినట్టనిపించింది. ఏదో తిమ్మిరి మాత్రం మిగిలింది. బూటును పూర్తిగ తీయాలని ఒంగినడుతను. మళ్ల తల తిరిగింది. బూటు దానంతటదే కింద పడినంతవరకు కాలిని రెండు మూడు సార్లు విదిలించినడు. బొటనవేలు మధ్యగ చీలింది. గాయం విచ్చుకోని బాగ కనవడుతున్నది. కొంచము కదిలించి చూస్తే పాదంలో కూడ గాయమయిందని అర్థమయింది. బూటు ఇంక పనికిరాదు.
ఇంతసేపయింది. కాని ముసలాయన, గాయాన్ని మాత్రం చూడలేదు. కావాలనే అట్ల చేస్తున్నడనిపిస్తుంది. నిజానికి చూడదలుచుకున్నా, రక్తం, రక్తంలో ముద్దయిన సాక్ మాత్రమే గద కనిపించేది. సాకును కుట్టుకోవాలె. తప్పదు. అసలు ముందు ఆ రక్తాన్ని ఆపాలె. నేల మీద రక్తం మడుగు రానురాను పెద్దగవుతున్నది. అది కుర్చీ కాలు వరకు, అటు స్టవ్ కాలు వరకు పారింది. మొరెట్టి నోరు ఎండుకపోతున్నది. ఒక గ్లాసు మంచినీళ్ల కొరకు ఏమయిన చేసేట్లున్నది. కాని, పొయ్యి నీళ్లు తెచ్చుకునే ఓపిక మాత్రం లేదు. మగత ముంచుకొస్తున్నది. ఆయన ఓడిపోతున్నడు. కనురెప్పలు బరువవుతున్నయి. కొంచసేపు విశ్రాంతి దీసుకుంటే నష్టమేమి లేదు.

ముందు రక్తం ప్రవాహాన్ని ఆపాలని తెలుసు. కాని అది చిత్రమైన ఉన్నది. ఆ పని చేయకపోతే అంతే సంగతులవుతుంది. రక్తం మొత్తం పోయేట్టుంది. ఒకప్పుడు ఫస్ట్ ఎయిడ్ గైడు ఒకాయన చూపినది గుర్తున్నది. బెల్టుతోటి కాలిని కట్టవచ్చు. దానికి ఒక కట్టె లేకుంటే అటువంటిదేదో కావాలె. పోకరు గూడ పనికి వస్తుంది. కాని మంచినీళ్ల లాగనే అవేవి అందే దూరంలో లేవు. ఆయన లేవాలె. కాని లేవడు. నిజం చెప్పాలంటె, అది కుదిరేట్టు లేదు. ముసలాయన వశంలో లేడు.

బెల్లు ఊడదీయాలనే చిన్న పని గూడ గగనమయి పొయ్యింది. ఎస్టెలా ఉండి సహాయం చేస్తే ఎంత బాగుండు. తాను పోయినంక ఇది మూడో చలికాలం. ఈ లోపల అంత కష్ట పడకుండ వంటచేసుకునేది మాత్రం అలవాటయింది. కాని, అమె లేని లోటు అప్పుడప్పుడు తోస్తుంది.లేదంటే, ఇప్పటి లాగ ఆమె అవసరం తెలుస్తుంది. కాని, చేయగలిగింది ఏమీ లేదు. జీవితం అంతే. తాను ముందు పోయుంటే బాగుండేది. ఆమె పోయి తాను మిగిలినందుకు అది తప్పు అనిపిస్తుంది. ఎస్టెలా తనకంటె నాలుగేండ్లు చిన్నది. కాని, ఇదే బాగుందేమో. ఆమె ఒక్కతి మిగిలి ఉంటే ఇంకా కష్ట పడేది పాపం. అది నిజం.

మొరెట్టి బెల్టును గుంజినడు. అది ఎట్లనో ఊడి వచ్చింది. దాన్ని తొడ చుట్టు తిప్పినడు. బకుల్లోనుంచి ఏసి గట్టిగ బిగించినడు. కాని, కావలసినంత బలం ఆ మనిషిలో మిగిలి లేదు. చాతనయినంత గుంజి బిగించినడు. కుక్క ఆయన కదలికలను బాగ గమనిస్తున్నది. కాని దగ్గరికి మాత్రం రాలేదు. రెండు మీటర్ల దూరంలో అది సాగదీసుకొని కూచోని ఉన్నది.

అంతే, ముసలాయన గట్టిగ ఊపిరి వదిలి ముందుకు ఒంగినడు. తల తిరుగుతున్నది. అందుకే మెల్లెగ ఒంగినడు. చెయ్యిజాపి గుంజితే ఒక్క ఊపుతోటి సాకు ఊడింది. అది దీపంలో ఒత్తివలె తడిసి ఉంది. గాయం నుంచి ఇంకా రక్తం కారుతునే ఉన్నది. కాని మొదటి అంత లేదు. అదిప్పుడు బాగ కనవడుతున్నది. దెబ్బ అంత పెద్దది కాదు. తరువాత కట్టు కట్టుకోవచ్చు. ఇప్పుడు గావలసింది విశ్రాంతి. గాయానికి కుట్లు వడతయి. తప్పించుకునే పద్ధతి లేదు. తాను ఈ పరిస్థితిలో డ్రయివింగ్ చెయ్యలేడు. మరి తనను పట్నంలోకి ఎవరు తీసుకపొయ్యి చూపిస్తరు. అదిగూడ ట్రక్ స్టార్ట్ అయినప్పుడు. హీటర్లు పాడయ్యి ఉంటయి. ఇంత చలిలో రేపటి వరకు ఎదురు చూచేది తప్ప ఇంకేమి చేసేది లేదు. సెర్జియో వచ్చేటి వరకు విశ్రాంతిగ ఉండి ఎదురు చూడాలె.

మొరెట్టి కుర్చీలో కూలవడ్డడు. తలను బద్దకు ఆనించి కండ్లు మూసుకున్నడు. వెంటనే నిద్రలోకి జారుకున్నడు. అలిసిపొయినడు మరి. ఎస్టెలా తనతోటి మాట్లాడుకుంటు, వంటజేసుకుంటు తినేటందుకు ఏమో పెడుతున్నట్లు కల. తన కుర్చీ ఇంకొక దిక్కు మళ్లి ఉంది. ఆమె కనిపిస్తులేదు. కాని ఉన్నదని మాత్రం తెలుస్తున్నది. ఆమె మేకకూర వండుతున్నది. తనకు ఇష్టమని ఎక్కువ ఉల్లిపాయలు ఏస్తుంది దాంట్లో. ఆమె చెయ్యి మాత్రం మేట్ పానీయాన్ని అందిస్తున్నట్టు కనవడుతున్నది. కమ్మటి గొంతుతోటి ఒకటే సారి వెయ్యి సంగతులను గురించి మాట్లాడుతుంది ఆమె. ముసలాయనకు ధ్యాస కుదురుతు లేదు. ఆయన రేడియో వింటున్నడు. వార్తలు. తలుపు తెరితి ఉంది. మధ్యాహ్నం ఎండ ఇంట్లోకి ఒస్తున్నది.

బయటినుంచి సెర్జియో పిలిచినట్టు వినిపించింది. అరుస్తున్నడు. వాడు చిన్నతనంలో ఏదన్న జంతువు కనిపించినప్పుడు లేదంటే మందలో ఒక మేకపిల్ల రాత్రికి ఇంటికి తిరిగి రాలేదని చూచినప్పుడు అరిచినట్టు. నీవే పోయు చూడు. ఇక్కడ పొయ్యి మీద కూర మాడిపోతున్నది అంటుంది ఎస్టెలా. వాడు ఊరికెనే అంటున్నడులే అంటడు మొరెట్టి. ఇప్పుడు సెర్జియోది అట్ల ఆటలాడే వయసు కాదని తెలుసు.

ఎస్టెలా ఏదో మాట్లాడుతునే ఉన్నది. వార్తలను ఆపి మధ్యలో ఏదో ప్రభుత్వ ప్రకటన వినిపించినరు. సంగతి అర్థం జేసుకోవాలని ప్రయత్నం చేసినడు ముసలాయన. కొంచం గూడ అర్థంగాలేదు. సెర్జియో యూనియన్ నినాదాలు చేస్తున్నడు. ఎస్టెలా పిచ్చిగ అరుపులు మొదలువెట్టింది. మొరెట్టీకి చీదరగ ఉన్నది. ఏం జరుగుతున్నదో అర్థమవుతు లేదు. సెర్జియోకు ఇది సమయం గాదని చెప్పాలనిపించింది. కాని, తేచేందుకు కుదరలేదు. ఒక్కసారిగ రాత్రయింది. దీపం మాత్రం పెట్టలేదు. చలివెడుతున్నది. ఇంక అరుపులు తన వంతయింది. బోనులో బంధించిన ఎలుక తీరుగ బాధ పేగులను తెగ కొరుకుతున్నది. కండ్లు తెరిచి చూస్తే మళ్ల తెల్లవారింది. ఒక్క చప్పుడుగూడ ఇనిపిస్తు లేదు. స్టెలా మిఠాయి, ఒక చేతిలో కెటిల్ పట్టుకోని ఒస్తున్నది. ఎనికి నుంచి వచ్చే ఎలుతురు తోటి ఆమె నీడ పొడుగ్గ కనవడుతున్నది. ఆమె మాట్లాడుతు లేదు. ఇక్కడి దిక్కే చూస్తున్నది. కండ్లలోకి సూటిగ. ఆమె కండ్లలో దృశ్యం మొరెట్టీకి నచ్చలేదు. దాంట్లో ఏదో తప్పువడుతున్న భావం ఉన్నది. స్టెలా మిఠాయి ఇచ్చేది పోయి, కాగుతున్న నీళ్లను తన కాలి మీద ఒంపింది. దెబ్బ తగిలిన కాలి మీద.

మొరెట్టి గట్టిగ అరిచి నిద్ర లేచినడు. ఏమి అర్థం గాలేదు. నోట్లో చేదు రుచి. దప్పి తోటి గొంతు ఎండిపోతున్నది. ఎస్టెలా ఎందుకట్ల చేసిందో అర్థం గాలేదు. తాను ఏం తప్పు చేసినడని. మండుతున్న కాలిని చూస్తే గొడ్డలి సంగతి, గాయము గుర్తుకొచ్చినయి.
అందుకా కాలు మండుతున్నది.

బెల్టు కాలిని కొరుకుతున్నది. నొప్పి భరించరాకుండ ఉన్నది. ఆయన దాన్ని ఒదులు చేసినడు. ఇప్పుడు కొంచం మేలు. రక్తం గడ్డ గట్టినట్టు మాత్రం లేదు. మళ్ల గాయం నుంచి రక్తం మొదలయింది. కాలు వాపు దిగినంత వరకు ఆయన ఊరుకున్నడు. తిరిగి బెల్టునుబిగించినడు. అంత బలంగ కుదురలేదు. ఆయన సంగతి వానలో యాలాడేసిన కొత్త తోలులాగ ఉన్నది.

చీకటి పడుతున్నది. కుక్క మాత్రం అక్కడనే ఉన్నది, కాళ్ల దగ్గర. అది పండుకున్నట్టే ఉండి, అయిష్టంగనే ముసలాయన మీద ఒక కన్నేసి ఉంచింది. స్టవ్ లో మంట మెల్లగ తగ్గి పోయింది. తలుపు సందుల్లోంచి చలిగాలి దూరి వచ్చి ప్రళయం చేస్తున్నది. అయినా మొరెట్టీకి మాత్రం వెచ్చగనే ఉన్నది. కసిగ తిరగవడిన నొప్పి పిచ్చెక్కిస్తున్నది. కండ్లు మూసుకుంటే కాలు పెద్ద అవెన్ పొయ్యిలో ఉన్నట్లు అనిపిస్తున్నది. డబల్ రొట్టెలాగ పొంగిందది. మండుతున్నది. దాన్ని బైటికి తీసే వీలు లేదు. ఆయన మూలుగుతడు. తిడుతడు. తల కదిలిస్తడు.

అంతలోనే ఆయన గట్టిగ అరువను మొదలు చేసినడు. తన కాలిని కుక్క కొరుకుతున్నదని తోచింది ఆయనకు. నిద్రలోకి జారుకునే వరకు అదే ధ్యాస. ఈ సారి కలలు రాలేదు.

తెల్లవార కండ్లు తెరిచినడు. వణుకుతున్నడు. తెగ చలి. దప్పి తీరేటట్లు లేదు. నరకంగ ఉన్నది. అయినా కొనసాగాలె. పూర్తిగ తెల్లవారుతుంది. సెర్డియో వచ్చే వరకు ఓపికగ ఉంటే సరి. మొరెట్టీ మళ్ల నిద్రలోకి జారుకున్నడు. తల వాలిపొయింది. కాళ్లు, చేతులు సడలి పొయినయి. ఆయనకు ఇంక నొప్పి తెలుస్తు లేదు.

మధ్యాహ్నంకల్ల ముసలాయన కాలు బాగ శుభ్రంగ అయ్యింది. కుక్క తన నాలుకతోని దాన్ని శుభ్రం చేసింది. మొరెట్టి చల్లగ ఉన్నడు. అదే కుర్చీలో. ఆయనట్ల ఇంకొక మూడు నాలుగు దినాలు, కొఆపరేటివ్ నుంచి ఎవరన్న ఉన్ని కొరకు వచ్చే వరకు, పడి ఉంటడు. సెర్జియో గడిచిన ముప్ఫయి ఏండ్లలో ఎన్నడు ఇంటికి రాలేదు.


ఆర్జెంటీనా రచయిత, మతియాస్ నెస్పోలో కథ ఎల్ హషాజో ను బెత్ ఫౌలర్ ఇంగ్లీషులోకి అనుదించారు. దాన్నితెలుగులోకి రాసింది విజయగోపాల్.



Saturday, November 17, 2012

సలహాలు - సంప్రదింపులు

పని బాగా జరుగుతున్నంత కాలం పక్కవారి గురించి ఆలోచన కూడా రాదు. సమస్య ఎదురయితే మాత్రం, బాసునో, మరొకరినో సాయం అడగాలనిపిస్తుంది. సమస్యను మరొకరి ముందు పెట్టడం వరకే మన పని అనుకుంటే, అక్కడితో మన పెరుగుదల ఆగిపోతుంది. పైఅధికారులు మనకు సహాయం చేయడానికే ఉన్నారు. మరి మన దగ్గరకు ఎవరైనా సమస్యతో వస్తే ఏం చెప్తాము? తెలుసుననుకుని సులభంగా ఒక సమాధానం చెప్పి పంపిస్తామా? మన సమస్యలన్నింటికీ బాసులు సమాధానం చెప్పి పంపుతున్నారా? నిజంగా అట్లా జరుగుతున్నదంటే, ఎక్కడో లోపం ఉందని అర్థం! బాసుకు ఏదో అనుమానం వస్తుంది. అప్పుడు ఎవరిని అడగాలి? ఎవరు సమాధానం చెపుతారు?


సమస్యను తెచ్చి మన ముందు పడేస్తే, ఆ పడేసిన వారి బాధ్యత ముగిసినట్లు కాదు. మనమయినా సమస్యను మరొకరి ముందుకు నెట్టి, చేతులు దులుపుకోలేము. మనమయినా మరొకరయినా, సమస్యతో బాటు సలహాలను జోడించాలి. ‘మీరు చెప్పండి. మేము మీరు చెప్పినట్టు చేస్తాం!’ అంటారు చాలామంది. మరి చెప్పవలసిన వారికి సమస్య ఎదురయితే ఎవరు చెప్పాలి. ఏదో ఒకనాడు మనమూ ఆఫీసర్లవుతాము. బాసులవుతాము. ఇంట్లో పెద్దవాళ్లమవుతాము. బాధ్యత అంతా మన తలకెక్కినప్పుడు బరువు తెలుస్తుంది. ఈ సమస్య ఎందుకు వచ్చిందంటారు? నా స్థానంలో మీరుంటే ‘ఈ విషయంలో ఏం చేయాలనుకుంటారు? మీరే ఏదో ఒకటి చెప్పండి!’ అనే బాసు మీద కోపగించుకునేవారు చాలామంది ఉంటారు.

నిర్ణయాలు వేరు, సలహాలు వేరు. ఏం చేయాలో చెపితే, అది నిర్ణయమవుతుంది. ఇలా చేయవచ్చునేమో, అని చెపితే అది సలహా. సమస్యను ఎస్కలేట్ చేసిన వారు, అంటే పైవారి ముందు పెట్టిన వారు నిర్ణయం చేయలేకనే ఆపని చేస్తారు. నిర్ణయం సరయిందన్న నమ్మకం లేకపోతే ఆ పని చేస్తారు. అప్పుడు చెప్పే తీరులో ఈ సంగతి చక్కగా కనిపించాలి. ఇది సమస్య, ఇది నా నిర్ణయం అని చెప్పడం బాగుండదు. ఈ నిర్ణయం బాగుంటుందని అనుకుంటున్నాను, అంటే, అది సలహాగా మారుతుంది. సంప్రదింపుల ద్వారా, సమస్యకు గల సమాధానాలను వీలయినన్ని ముందు ఉంచుకుని, వాటిని చర్చించి, ఒకటి, రెండింటిని ఎంచుకోవచ్చు. అమలు చేసి చూడవచ్చు. సమస్యను ముందుంచిన వారే, నిర్ణయాన్ని సూచించడం అంతగా అలవాటు లేదు. ఎందుకొచ్చిన బెడద అనుకుంటారు చాలామంది. బాసులకు కూడా సరైన అవగాహన లేకుంటే ‘ఇక నేనెందుకు?’ అంటారు. ఇవి రెండూ తప్పు పద్ధతులే. సలహాలు, సంప్రదింపులు మాత్రమే సరయిన పద్ధతి. చిన్న చిన్న విషయాలలో కూడా ఈ పద్ధతిని పాటించవచ్చు. ఇంట్లో, మిత్రుల మధ్య కూడా ఈ పద్ధతిని పాటిస్తే, అందరికీ సంతృప్తిగా ఉంటుంది. ‘ఇడ్లీ తిందాం పదండి’ కన్నా ‘ఏం తిందాం?’ అన్నమాట బాగుంటుంది. అందరికీ తమ అభిప్రాయం చెప్పే వీలు కలుగుతుంది. చివరికి ఎవరిమాట నెగ్గినా, సలహా ఇచ్చినా సంతృప్తి మిగులుతుంది. ఈ సంతృప్తి, మరింత ఆలోచించడానికి, బాధ్యతతో ప్రవర్తించడానికీ, అవసరమయిన బలాన్ని ఇస్తుంది. దీనే్న ఎంపవర్‌మెంట్ అంటారు.

నిర్ణయాలు చేసే శక్తి కాకున్నా, నిర్ణయాల వరకు చేరుకునే కార్యక్రమంలో భాగం ఉంటే ఆ వ్యక్తులకు మానసిక బలం పెరుగుతుంది. అదే ఎంపవర్‌మెంట్. కూరలు కొనడం తనకు తెలియదు అనుకుంటే జీవితమంతా తెలియకుండానే పోతుంది. కూరలు కొనడంలోని మెళకువలు అర్థం అయే పరిస్థితిని కలిగిస్తే రేపు కూరలు కొనే బాధ్యతను పంచుకోవడానికి మనకే సాయం దొరుకుతుంది. ఎందుకు తెలియదు? ఏం తెలియదు? ఏ రకం కూరల గురించి తెలియదు? లాంటి ప్రశ్నలడిగితే, మరో వ్యక్తికి ఎంపవర్‌మెంట్ జరుగుతుంది. అలాగని ఎడ్డెం తెడ్డెం ప్రశ్నలడిగితే పని జరగదు. పైగా, ఆ మనుషులు మరింత కుంగిపోతారు. కొత్తగా ఆలోచించడానికి దారితీసే ప్రశ్నలుండాలి. విషయం గురించి ఎదుటివారి ఆలోచనలు మరింత పెరిగే రకంగా ప్రశ్నలు అడగాలి. ఇలాగే అడుగుతారు కూడా. మనకు ఆ సంగతి అర్థం కాకుంటే, ఆ ప్రశ్నలు ‘చొప్పదంటు ప్రశ్నలు’గా చికాకు ప్రశ్నలుగా కనిపించి, వినిపించి చికాకు కలుగుతుంది. అందుకే ఎవరైనా ప్రశ్నలు అడిగినా, మనం అడగవలసి వచ్చినా ఒక్క క్షణం ఆలోచించడం మంచిది. అప్పుడు విషయం మరింత సులువుగా అర్థమవుతుంది. రెండువేపుల నుంచి చక్కని సలహాలు వస్తాయి. సమస్యకు సమాధానం దొరుకుతుంది.

జాగ్రత్తగా గమనిస్తే, ఈ సందర్భంలోని ప్రశ్నలకు ఒక పద్ధతి ఉంటుంది. వాటికి సూటిగా ఒక జవాబు ఉండదు. ‘ఎందుకు?’ ఎట్లా?’ ‘ఏమయి ఉండవచ్చు?’ లాటి ప్రశ్నలకు జవాబులు కేవలం అభిప్రాయాలు. అవి రకరకాలుగా ఉంటాయి. ఉండాలి కూడా! సమస్య తెచ్చిన వారికి ఈ ప్రశ్నల కారణంగా, మరింత అవగాహన వీలవుతుంది. మరిన్ని జవాబులు మెదడులో మెరుస్తాయి. తమ మీద తమకు నమ్మకం పెరుగుతుంది. జవాబు నేనే యిచ్చానన్న ధీమా కలుగుతుంది. అసలిది సమస్యగా ఎందుకు కనిపించింది? అన్న అనుమానం కూడా రావచ్చు. కావలసింది కూడా అదే! ఈ ప్రపంచంలో ఏ సమస్యకూ, ఎవరివద్దా రెడీమేడ్ జవాబులు ఉండవు. ఉంటే, అసలివి సమస్యలు కావు! సరైన సమయంలో సరయిన ప్రశ్నలు అడిగితే, సమస్య మబ్బులాగా విడిపోతుంది. అందరికీ నచ్చే సమాధానాలు కనబడతాయి. అందరికీ నమ్మకం కలుగుతుంది. అది సలహా, సంప్రదింపులోని బలం!

బాసు మనలను అభిప్రాయం అడిగారంటే, మన తెలివిని, ఆలోచన శక్తిని వారు నమ్ముతున్నారని, గౌరవిస్తున్నారని అర్థం! అదే పద్ధతిని మనం కూడా మనవారిమీద, చివరకు పిల్లలమీద కూడా ప్రయోగించవచ్చు. అటువంటి ప్రశ్న ఎదురయిన మరుక్షణం మన బాధ్యత పెరుగుతుంది. కనుక మరింత జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం మొదలవుతుంది. సమస్యకు సమాధానం మననుంచి వస్తే అది అప్పటికప్పుడు కనిపించే విలువ, లాభం. ఇక ముందు ఈ రకం సందర్భాలలో కూడా ముందే ఆలోచించి, సలహాలతో కూడా ముందుకు సాగే నమ్మకం కలుగుతుంది. అది ఎప్పటికైనా పనికివచ్చే మానసిక బలం. అది మరింత గొప్పలాభం!

అంతా నాకే తెలుసు, నీకేం అధికారం, అని మనం అనవచ్చు. మనమీదివారు మనల్ని అనవచ్చు! మనిషిని మానసికంగా కుంగదీయడానికి అంతకన్నా కావలసింది లేదు! ఎవరికీ ఎవరికన్నా ఎక్కువ తెలియదు. నాలుగు తలలు ఒక చోట చేరితే సలహాలు, సంప్రదింపులు సాగుతాయి. అది తెలివి!

Thursday, November 8, 2012

అదీ తెలివి....

ఒక పెద్దాయన పాపం, దేశాంతరం వెళ్లి అక్కడే కాలం చేశాడు. వీలునామా కింద తన ఊరి వారికి ఒక వర్తమానం పంపించాడు. ఊరివారు నా ఆస్తిలో తమకు కావలసింది తీసుకోవచ్చు. తమకు యిష్టమయినంత భాగం, అమాయకుడయిన నా కుమారుడు ఆరిఫ్‌కు ఇవ్వవలెను అన్నది ఆ వర్తమానంలో సమాచారం. ఆ సమయానికి ఆరిఫ్ యింకా చిన్నవాడు. అంతమందిలో నోరెత్తి మాట్లాడగలశక్తి కూడా లేని అమాయకుడు. ఇంకేముంది? పెద్దలంతా చేరి పెద్దాయన ఆస్తిని పంచుకున్నారు. ఎందుకూ పనికిరాని బంజరు ఏదో మిగిలితే అది ఆరిఫ్‌కు యిచ్చామన్నారు. ఆ బంజరు ఎవరికీ అవసరం లేదు మరి!

ఏళ్లు గడిచాయి. ఆరిఫ్ పెరిగి పెద్దవాడయ్యాడు. బలవంతుడయ్యాడు. తెలివిగలవాడూ అయ్యాడు. ఊరి పెద్దలను కలిసి, తన తండ్రి ఆస్తి తనకు తిరిగి ఇవ్వమని అడగసాగాడు. ఎవరికివారు ‘అదేం ఆలోచన’ కుదరదు పొమ్మన్నారు. ‘వీలునామా ప్రకారం నీకు యివ్వవలసింది యిచ్చేశా’మన్నారు. అమాయకుని ఆస్తిని అప్పగించామన్న ఆలోచన ఎవరికీ కలిగినట్లు లేదు. ఎవరికి కావలసింది వారిని తీసుకొమ్మన్నది మీ నాయనే!’ అని కూడా అన్నారు. అందరినీ పోగేసి సలహాలడుగుదాం అన్నాడు ఆరిఫ్. తమ తప్పు లేదనుకున్న పెద్దలు సంప్రదింపులకు ఒప్పుకున్నారు. సమావేశం మొదలయింది. ఎవరి అభిప్రాయం వారు చెపుతున్నారు. ఒకతను మాత్రం ఏదో తప్పదుగనుక వచ్చానన్నట్టు మొగం వేలవేసుకుని కూచుని ఉన్నాడు. అతని వంతు వచ్చింది. 'మీకు వీలునామా మాటలకు అర్థం తెలియలేదు. తమకు ఇష్టమయినంత భాగం కొడుక్కు యిమ్మన్నాడు పెద్దాయన.అది ఇవ్వడానికి యిష్టమయినంత కాదు. మీరు తీసుకోవడానికి యిష్టమయినంత! మీకు బాగనిపించింది అతనికి ఇస్తే, పిల్లవాడు బాగా బతుకుతాడని తండ్రి నమ్మకం’! అన్నాడు. అందరూ మంచివాళ్లే. అసలు సంగతి అర్థమయి నోళ్లు వెళ్లబెట్టారు. 

ఇష్టమయినంత అన్నమాటకు అర్థం తెలిసింది వారికి. ‘అతను దూరాభారంలో మరణించాడు. ఆస్తి అమాయకుడయిన కొడుకు చేతిలో పెడితే, అతనికి ఏమీ మిగుల్చుకునే శక్తి లేదని తెలుసు. అందుకే ఆస్తిని మీకు అప్పగించాడు. మీదేననుకుని మీరు దాన్ని యినే్నళ్లూ కాపాడారు. కొడుకు పెరిగి, పెద్దవాడయి తెలివి తెలుసుకుంటాడన్న నమ్మకం ఆ తండ్రికి ఉంది. అదే జరిగింది. గౌరవంగా ఆస్తిని అతనికి ఇవ్వడం మంచిది’, అని కూడా వివరించాడు వేలమొగం మనిషి! ఆరిఫ్‌కు ఆస్తి అందింది. పెద్దలు నిజం చూడగలిగారు.

-సయ్యద్ గౌస్ అలీషా (1881)

=============
అసలు మాట

‘జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా మాట్లాడడమే సద్గుణం అన్నాడు మాస్టర్. ‘అదెట్లా’గన్నాడు శిష్యుడు. ‘ఏం చేయాలో తోచనప్పుడు జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా మాట్లాడడమే మంచిది గదా!’అన్నాడు మాస్టర్.

-కన్ఫ్యూషియస్ ఆనలెక్ట్స్ నుంచి

Tuesday, October 30, 2012

సమయం కుదిరితే...

ఎవర్ని ఏ పని సాయం అడిగినా సమయం లేదంటారు. నిద్ర గురించి కూడా ఆలోచించకుండా, పనిచేసినా సమయం సరిపోవడం లేదు. ఇక సైన్సులోకి వెళ్లి అడిగితే- వాళ్లకు సమయం సమస్య మరో రకంగా ఎదురవుతుంది. రెండు రసాయన పరమాణువులు కలిసి ఒక అణువు పుట్టడానికి పట్టే సమయం ఒక పికో సెకండ్. అది నిజంగా ఎంత నిడివి ఉన్న మాట మనకు తోచదు. కన్ను రెప్పపాటు- మనకు తెలిసిన చిన్న కొలత. ఒక కొండ పుట్టడానికీ, రెండు గెలాక్సీలు కొట్టుకోవడానికి పట్టే సమయం ముందు మన కనురెప్ప పాటు అలాంటిదే. నిజానికి సైన్సు అనుకుంటున్న విషయాలు జరగడానికి పట్టే కాలం మనిషి జీవనకాలానికన్నా చాలా ఎక్కువ. పరిశోధకులు తరతరాలుగా ఒకే అంశం గురించి పరిశోధిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు. 1920 ప్రాంతంలో మొదలయిన కొన్ని పరిశోధనలు అక్కడే, ఆ పరిశోధన శాలల్లోనే ఇంకా కొనసాగుతున్నాయి. ఆ ఆలోచన మొదలుపెట్టిన వారు పోయారు. చరిత్రలో ఒక అంశం గురించి మరీ చాలా కాలంపాటు సమాచారం సేకరించి పరిశీలించిన సందర్భానికి ఉదాహరణ బహుశః ఖగోళ శాస్త్రంలో ఉంది. ప్రాచీన నాగరికతలయిన బాబిలోన్ లాంటి చోట్ల మొదలయిన సమాచార సేకరణ ఇంకా సాగుతున్నది. సాంకేతిక శక్తి మారిందని, ఆ తరువాత వచ్చిన సమాచారాన్ని పాత పద్ధతి సమచారానికి కలపడానికి వీలు లేదన్నా సరే, కనీసం ఆరు వందల సంవత్సరాలపాటు పాత పద్ధతి సమాచార సేకరణ జరిగింది. గ్రహణాలు మొదలయిన సంగతులను గురించి మన దేశంలో, ఆసియా దేశాలలో కూడా ఈ రకమయిన సమాచార సేకరణ జరిగింది.

ఇప్పటికీ పరిశోధకులు కొన్ని ప్రయోగాలకు తమ జీవితకాలం సరిపోదు అంటారు. నిజంగా సమయం సమస్య కాకుండా ఉంటే, ఏ రకం పరిశోధనలు వీలవుతాయని వారిని ప్రశ్నించారు. మీరే వెయ్యి, పదివేల సంవత్సరాలు ఉండగలిగితే, ఏ రకం ప్రయోగాలు చేస్తారని ప్రశ్న. జవాబు రావడానికి ఒక చిక్కు ఎదురవుతుంది. అంతకాలం గడిచేలోగా సాంకేతిక వనరులు, పద్ధతులు మారిపోతాయి. అవి మారకనే ఇప్పటి సదుపాయాలతో, ఎక్కువ కాలం జరగవలసిన పరిశోధనలు ఎన్నో ఉన్నాయని తెలిసింది.

* జీవం పుట్టుక: మిల్లర్, ఉరే అనే పరిశోధకులు 1950 దశకంలో జీవం పుట్టుక గురించి ఒక సిద్ధాంతం చేశారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే జీవం పుట్టుకకు అవసరమయిన అమైనో ఆమ్లాల వంటి రసాయనాలు వాటంతటవే పుడతాయన్నారు. ఈ రకం రసాయనాలు అంతరిక్షం నుంచి వచ్చాయన్నవారు కూడా ఉన్నారు. వాటంతటవే పుట్టడం గురించి పరిశోధించాలంటే తగిన పరిస్థితులు కల్పించి, తగిన రసాయనాలను చేర్చి, తేలికగా వాటిని పరిశీలించాలి. అది అనుకున్నంత సులభం కాదు. పదివేల సంవత్సరాలు వేచి చూస్తే, నిజంగానే జీవ రసాయనాలు పుట్టవచ్చు. మొదట్లో జీవం పుట్టడానికి అంతకన్నా ఎక్కువ కాలమే పట్టి ఉండవచ్చు. తమంత తాము పుట్టి, తమ వంటి రసాయనాలను తయారుచేయగలగడం జీవ రహస్యమన్నది అర్థమయిన విషయమే.

భూమి, దాని మీద పరిస్థితులు, రసాయనాలు, గతంలో ఎప్పుడో ఉన్నప్పటి తీరుగా ఏర్పాటుచేయాలి. భూమి మీద అలనాటి పరిస్థితులలో లక్షల రకాల రసాయనాలు ఉండి ఉంటాయి. అవి అంతులేని రకాలుగా కలిసి, ఎన్నో ప్రయోగాలు జరిగి ఉంటాయి. ఆ రసాయనాలు తగినంతగా ఉంటే, అవి కలవడానికి వీలు కలుగుతుంది. తక్కువగా ఉంటే, అవి ఒక్క చోటికి రావడానికి మరింత కాలం కావాలి. జీవ రసాయనాలు రాళ్లమీద పుట్టినట్టు ఒక ఆలోచన ఉంది. అక్కడి తేమలో అంతులేని రసాయన చర్యలు జరిగి ఉంటాయి. వాటి సంఖ్య ఒకటి పక్కన ముప్ఫయి సున్నాలు వేసినంత- అని అంచనా ఉంది. ఆ కార్యక్రమం వందల మిలియనుల సంవత్సరాల పాటు సాగి ఉండవచ్చు.

ఇప్పుడు ఒక పరిశోధన, పరిశోధనశాల పదివేల సంవత్సరాలపాటు కొనసాగే వీలుంటే, జీవం పుట్టుక ప్రయోగాన్ని కొంతవరకయినా పరిశీలించవచ్చు. అప్పుడు జరిగిన రకం రసాయన ప్రయోగాలను ఇప్పుడు జరిపి చూడవచ్చు. వాటి సంఖ్య ఎంత ఎక్కువ ఉంటే, అంత త్వరగా, సంతృప్తికరంగా ఫలితాలు అందుతాయి. గదుల నిండా రకరకాల రసాయనాలు కలిసిన పాత్రలు, తగిన తేమ, ఒత్తిడి, వేడి లాంటి పరిస్థితులతోబాటు ఏర్పాటయి ఉంటాయి. ఇప్పుడు మనకు కంప్యూటర్ అందుబాటులో ఉంది గనుక పాత్రలు నిజంగా ఏ గాజు పాత్రలో కాక, కంప్యూటర్ చిప్స్ రూపంలో ఉంటాయి. తగిన పరిస్థితులు అక్కడ కలిగించడం, అవసరం కొద్దీ మార్చడం సులభమవుతుంది. వీటిని చిప్ పరిశోధనశాలలు అనవచ్చునేమో! వాటిలో ఎక్కడో ఏదో ఒక రసాయనం, తనలాంటి రసాయనాన్ని తయారుచేస్తే క్షణాల్లో తెలిసిపోతుంది.

సాంకేతిక పద్ధతులను వాడుతున్నాము గనుక పరిశోధనకు పట్టే సమయాన్ని కూడా తగ్గించే ప్రయత్నాలు జరుగుతాయి. ఎక్కడో ఒక రసాయన చర్య మనమనుకున్న రకంగా జరుగుతున్నాయని సూచన వస్తే, అక్కడి పరిస్థితులను మరింత అనుకూలంగా మార్చవచ్చు. ప్రయోగాలు సాగితే, అసలు ప్రకృతిలో రసాయనాలు కలిసి, రకరకాల మార్పులకు దారితీసే పద్ధతులు అర్థం కావచ్చు! ఇంతకూ ఈ పరిశోధన వీలవుందా? అవసరమా ?-అని అడిగితే మాత్రం జవాబు లేదు.
* భౌతిక ప్రపంచం, సిద్ధాంతాలు: జెరాల్డ్ గాబ్రియెన్స్ హార్వార్డ్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తుంటారు. పదివేల సంవత్సరాలు దొరికితే తాము చేయగలిగిన పరిశోధన గురించి ఆయన చెప్పిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.
భౌతిక శాస్త్రంలో కొన్ని సిద్ధాంతాలు, నియమాలు శాశ్వతమయినవని అనుకుంటున్నాము. అన్ని ప్రొటానులకు ఒకే రకమైన ఛార్జ్ ఉందంటున్నారు. కాంతి ఎప్పుడయినా ఒకే వేగంతో కదులుతుందంటారు. ఇలాంటివే మరెన్నో విషయాలున్నాయి. వాస్తవంగా చూచి పరిశీలించినవారు కొందరు ఈ రకం సిద్ధాంతాలలో మార్పు ఉండే వీలుందంటున్నారు. అంతరిక్ష పరిశోధనలో ఇటువంటి మార్పులను గమనించామన్న వారు కూడా ఉన్నారు. వారిని అందరూ అంగీకరించకపోవడమన్నది మరో సంగతి. పరిశోధనలన్నీ ఈ సిద్ధాంతాల ఆధారంగానే నడుస్తున్నాయి. జెరాల్డ్ పరిశోధనశాలలో ఎలెక్ట్రానుకు గల అయస్కాంత శక్తిని కొలిచారు. ఈ రకం కణాల అసలు లక్షణాలను గురించి చేసిన పరిశోధనల్లో, వేసిన కొలతల్లో ఇంతకంటే కచ్చితమయినది మరొకటి లేదంటారు. ఈ పరిశీలనలను వేల సంవత్సరాలపాటు చేస్తూపోతే, కొలతలో మార్పు కనబడుతుందేమోనంటారు జెరాల్డ్.

ఒక్క ఎలక్ట్రాను అయస్కాంత శక్తిని కొలవడమే నిజంగా ఆశ్చర్యకరమయిన సంగతి. అది జరగాలంటే, విద్యుత్తు అయస్కాంత లక్షణాలు స్థిరంగా ఉండే పరిస్థితిలో ఎలక్ట్రాను ఒకే తలంలో కదిలే విధంగా ఏర్పాటుచేయాలి. అది వృత్తాకార మార్గంలో గుండ్రంగా తిరిగేట్లు చేయాలి. దాని శక్తి మరే కారణంగా పెరగడం లేదని స్థిరం చేసుకోవాలి. అట్లా తిరుగుతుండే కణాన్ని తిరగబడేలా బలాలను ఉపయోగించాలి. ఇన్ని జరిగిన తరువాత ఫలితం తెలుస్తుంది. దాని శక్తి- ఒకటి పక్కన పదమూడు సున్నాలు వేసిన కొలతలో మూడవ వంతులు మాత్రమేనని!

ఇదంతా ఎవరికి అర్థమవుతుందని, ఎందుకు ఉపయోగపడుతుందని అడిగితే లాభం లేదు. ప్రపంచంలో జరుగుతున్న సైన్సు మొత్తం, మనకు నేరుగా పనికివచ్చేకాలం పోయింది. కొంత సైన్సు- కేవలం సైన్సుకొరకు జరుగుతుంది. అసలు కాలానికి, ఈ కొలతకు సంబంధం ఏమిటని మనం అడగడానికి వీలుంది. ఈ కొలత వెయ్యి సంవత్సరాల కాలంలో, ఒక్క భాగం పెరగడమో, తరగడమో జరిగి ఉండవచ్చు గదా! అది తెలియాలంటే, ఈ కొలతలను సంవత్సరాలపాటు పరిశీలించాలి. సైన్సులో ఏదీ శాశ్వతం కాదు. మార్పు వేగం మరీ నెమ్మదిగా జరుగుతుంటే, ఆ సంగతి తెలిసే వరకు మాత్రమే సిద్ధాంతం నిలబడుతుంది. ఆ మార్పు పరిశోధనశాలలో కొన్ని సంవత్సరాల కాలంలో చూపడం, చూడడం కుదరదు. భౌతిక, రసాయనిక, జైవిక విషయాలలో మార్పులు, ఒకప్పుడు జరిగిన వేగం, ఇప్పుడు జరుగుతున్న వేగం ఒకేలాగ ఉండవు. అందుకే ప్రయోగాలు వేల సంవత్సరాలపాటు సాగితే సంగతి తెలుస్తుంది. సాంకేతిక నైపుణ్యం పెరిగినకొద్దీ ఫలితాలు తొందరగా తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి.
................................
ఇలాంటివే మరికొన్ని ఆలోచనలు
...................................
కోతులు రాను రాను మారి.. మానవులు వచ్చారని సిద్ధాంతం. వేల సంవత్సరాలుపాటు, రకరకాల కోతులను పెంచి వాటి తెలివి తేటలను, మిగతా పద్ధతులను పరిశీలిస్తే, మార్చగలిగితే ఏ రకం జీవులు వస్తాయని పరిశీలించాలంటారు- షికాగో యూనివర్సిటీ జెనెటిసిస్ట్ బ్రూస్ లాన్.

నక్షత్రాలు పేలిపోవడం గురించి పరిశీలించడానికి పదివేల సంవత్సరాల పథకంతో సిద్ధంగా ఉన్నారు మేరీలాండ్ పరిశోధకులు కోల్‌మిల్లర్. నక్షత్రాలు పేలడం, సూపర్ నోవాలు పుట్టడం అరుదయిన విషయం. మన గెలాక్సీలో సూపర్‌నోవా క్రీ.శ.1604లో పుట్టిందని కెప్లర్ గమనించాడు. ఇటీవలివన్నీ మరీ దూరంలో గల గెలాక్సీలలో పుట్టాయి. సమయం ఉంటే అక్కడ బ్లాక్‌హోల్స్ గురించి పరిశీలించవచ్చు.

మనిషి తినే తిండి మారుతుంది. మార్పుల కారణంగా డయాబెటిస్ వంటి వ్యాధులు మొదలవుతాయి. వేల సంవత్సరాలలో మన తిండి, ఆరోగ్యం మారే తీరును పరిశోధించాలి, అంటారు శారా టిస్క్ఫా.

త్వరలోనే ప్రపంచంలోని చమురు నిక్షేపాలు అడుగంటుతాయి. అయిపోతాయి. వాటి స్థానంలో మరో రసాయన ఇంధనం దొరికే వీలు లేదు. అంటే మనుషులు బతికే తీరు పూర్తిగా మారిపోతుంది. అప్పుడు మనిషి, గతంలోని ఆటవిక మానవునివలే మారి, వనరుల కోసం కీచులాడుకుంటాడా? ఇది లారెన్స్ స్మిత్ ప్రశ్న!

జీవులలో ఒక కొత్త జాతి (స్పీసీస్) పుట్టడానికి లక్ష సంవత్సరాలు పడుతుంది. ఇదిమనకు తెలిసిన కాలం తీరు కాదు. భౌగోళిక కాలం అని మరొకటి ఉంది. లక్ష సంవత్సరాలు ఒక పరిశీలన సాగించే వీలుంటే, జీవుల పరిణామాన్ని గమనించవచ్చునంటారు- జెర్రీ కోయిన్.

Saturday, October 27, 2012

కొత్త కవిత



లలు రాళ్లకు కొట్టుకొని అరిగి పోతున్నయి.
అలిసిన సూర్యుడు సాయంత్రాన్ని చూచి సిగ్గు పడుతున్నాడు.
నీడలు మరీ పొడుగయి కరిగి పోతున్నయి
చీకటి భయం భయంగా కమ్ముకుంటుంది ఎందుకు?
కొంచెం సేపయితే తనదే రాజ్యమని దానికే తెలియదు!
మునిగాళ్ల మీద లేచినా నాన్న మోకాళ్లే కనబడినప్పుడు ఒక భయం ఆదరమయింది
పగలు రాత్రి గడియారానికి కూడా తెలియవు
బతుకు యంత్రంలో సాయంత్రం నలిగి పోయింది
గాజు కళ్లలో కాంతి తళుక్కుమంటుంది. సంగీతం వింటుంది
రాత్రి ముదిరే లోగా మహెఫిలె ముషాయిరా సాగుతుంది
కన్నీళ్లు ఆ లోపలే ఇంకిపోనీ!
పంచుకునేందుకు ముచ్చట్లు ఎన్ని లేవు గనుక!
ఉదయం భాష హుషారు1
ఆసుపోసిన అనుభవాల తుంపర
పూలూ ఉన్నయ్ ముళ్లున్నయ్1
చిటికెన వేలు పట్టుకుని నడుస్తున్న తెలివి ఎంత రుచి?
లలు రాళ్లకు కొట్టుకొని మురిసి పోతున్నయి


రంగుటద్దాలలోంచి చూస్తే వెలుతురు కనబడదు
అందరూ మోసే వారే అయితే పల్లకీ ఎక్కేది ఎవరు?
అగ్బరూ రాజ్యమేలాడు, అనామకుడూ రాజ్యమేలాడు
శిలాశాసనాలు వేయడం ఇద్దరూ మరిచిపోయారు
అడుగుజాడలను అలలు తుడిచేస్తాయి
శిలాస్తంభాలు కూడా గాలికి అరిగిపోతాయి
ఫలకం మీద పేరెక్కే దాకా అడుగులు పడుతూనే ఉంటాయి
దాద్ ఉన్నా లేకున్నా ఇర్షాద్ ఉంటుంది!!
మవునంగా నా కవితను మనసుల మీద చెక్కుతాను1
నందంగా మరో సాయంత్రం అవుతాను!

Thursday, October 25, 2012

లుఖ్మాన్ కథ!

లుఖ్ మాన్ గొప్ప పండితుడు. సన్యాసికూడా. అయితే వికారంగా ఉంటాడు. స్నానం, గుడ్డలుతకడం లాంటి పనుల పట్ల ఆయనకు ఆసక్తి తక్కువ. కనుక మురికిగా కనబడతాడు. అతడిని బానిసగా పొరబడి బాగ్దాద్ నగరంలో కందకాలు తవ్వేపనిలో పెట్టారు. 

సంవత్సరం గడిచింది. ఎవరికీ అనుమానం రాలేదు. నిజం తెలిసిన తరువాత ఖలీఫా, అతని కాళ్లమీద పడి క్షమాపణ కోరాడు.

సన్యాసి చిరునవ్వుతో ‘నీ క్షమాపణ నాకెందుకు? ఏడాదిపాటు నీ కింద తొత్తుగా నలిగాను. ఒక గంటలో మరవడం వీలవుతుందా? అయినా నిన్ను క్షమిస్తాను. నీకు లాభం జరిగిందేమో కానీ, నాకు నష్టం మాత్రం లేదు కదా! నీ పని జరిగింది. నాకు తెలివి పెరిగింది. నాకూ ఒక పనివాడుండేవాడు. వాడిని నేను కష్టాలకు గురిచేసేవాడిని. ఇకమీద ఆ తప్పు చేయను. నేను పడ్డ కష్టాలు గుర్తుంచుకుంటాను’ అన్నాడు లుభ్‌మాన్!

Monday, October 22, 2012

అనుకరణ - అనుసరణ


ఎవరయినా కంటికి ఫురుగులాగా కనబడుతున్నారంటే- అలుసయినట్లు కదా అర్థం!
పురుగులు బోలెడుంటాయి. ఊరికే చనిపోతాయి. అయినా బోలెడుంటాయి. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఎక్కువ సంఖ్యలో ఉండే జీవులు కీటకాలే. అంతగా విజయవంతంగా బతుకున్నాయంటే, వాటి నిర్మాణంలో, బతుకు తీరులో ఎంతో పరిణతి, వైవిధ్యం ఉంటుందని అర్థం. హెలికాప్టర్‌ను చూస్తే తూనీగలాగా కనబడుతుంది. వెస్పా అనే స్కూటర్‌కు కందిరీగ పేరు  పెట్టారని అందరికీ తెలియకున్నా తప్పులేదు. పురుగులను, వాటి నిర్మాణాన్ని మనిషి అనుకరించి రకరకాల అవసరాలకు  వాడుతున్నాడు. ఒక్క పురుగులేగాక ఎన్నో జంతువులు, మొక్కలు మనిషి తెలివికి పదునుపెట్టాయి. ఆ పదును కారణంగా బయో మిమిక్రీ అనే రంగం పుట్టింది.

పరిణామక్రమంలో జంతు, వృక్షాలు మారుతూ మారుతూ బతుకు సుఖంగా సాగడానికి అనువయిన క్షణాలను పెంచుకున్నాయి. పక్షుల ముక్కులు, పురుగులు, పక్షి రెక్కలు మొదలు ఎన్నో లక్షణాలు మనిషి సాంకేతిక ప్రగతికి

ఆధారాలయినాయి. మార్క్ మైల్స్ అనే యువ పరిశోధకుడు మైక్రో ఎలెక్ట్రో మెకానికల్ అండ్ మెటీరియల్ ప్రాసెసింగ్ అనే రంగంలో పనిచేస్తున్నాడు. అదేమిటో అర్థం చేసుకోవడానికి మనకు సమయం పడుతుంది. పదార్థం నిర్మాణంలో సూక్ష్మ వివరాలు అనుకుని ముందుకుసాగుదాం. అతను పరిశోధన పత్రికలను సీరియస్‌గా చదువుతున్నాడు. సీతాకోకచిలుక రెక్కలు, వాటిలో రంగులను గురించిన వ్యాసం ఒకటి అతడిని ఆకర్షించింది. కొన్ని సీతాకోకచిలుకల రెక్కలు నీలం రంగుతో మెరిసిపోతుంటాయి. రంగులు ఎక్కడ కనిపించినా వాటికి ఆధారంగా కొన్ని రసాయనాలు ఉంటాయని అందరికీ తెలిసే ఉంటుంది. ఈ నీలం రంగు మాత్రం రసాయనంలో నుంచి రావడం లేదు. ఇక్కడ భౌతిక శాస్త్రం ఉంది. ఈ రకం రంగులు పదార్థం నిర్మాణం కారణంగా వస్తాయి. సీతాకోక చిలుక రెక్కలమీద చాలా చాలా చిన్న పలకలు అమర్చి ఉంటాయి. వాటి ఆకారం, వరుస, మధ్య దూరం అన్నీఒక పద్ధతిలో ఉంటాయి. వెలుగు వాటి మధ్యన ప్రతిఫలిస్తూ రంగులు కనబడడానికి కారణమవుతుంది. ఇక్కడ ఆ రంగు నీలంగా ఉంది! రసాయనం అంటే పిగ్మెంట్ ఆధారంగా ఈ రకం నీలం తళతళ పుట్టాలంటే ఎంతో శక్తి అవసరమవుతుంది. అరుదుగా దొరికే శక్తిని సీతాకోక చిలుక తన రంగుల ప్రదర్శనకు వాడటంలేదు. ఆ శక్తి ఎగరడానికి తిండి వెదకటానికీ, పిల్లలను కనడానికి పనికివస్తుంది. అందుకే అది రంగు కోసం ఫిజిక్సును పట్టుకుంది.

ఈ పద్ధతితో మనం కూడా రంగులను పుట్టించవచ్చునని మైల్స్‌కు ఆలోచన పుట్టింది. ఎలెక్ట్రానిక్స్ రంగంలో పలుచని పరికరాల్లో రంగులు అవసరమవుతాయి. మైల్స్ వెంటనే రంగు పరికరాలను తయారుచేసే కంపెనీ పెట్టాడు. త్వరలోనే క్వాల్‌కామ్ అనే కంపెనీవారు దాన్ని కొన్నారు. ‘మిరాసోల్ డిస్‌ప్లే’ అనే పరికరంలో రంగు పద్ధతిని వాడుకుంటున్నారు. ఆప్టికల్ ఇంటర్‌ఫీరెన్స్ అనే పద్ధతితో గాజుపలకల కింద, కదిలే చిన్న చిన్న అద్దాలను ఏర్పాటు చేస్తారు. అద్దాలు పదినుంచి యాభయి చదరపు మైక్రాన్లు మాత్రమే ఉంటాయి. అవి కిందకు, మీదకూ కదులుతూ మైక్రో సెకెండ్స్‌లో రకరకాల రంగులు కనిపించడానికి కారణమవుతాయి. సీతాకోకచిలుక రెక్కలలోని పలకలమీద ఏ రంగూ లేని కాంతి పడుతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆ సూర్యకాంతి చూస్తుండగా రకరకాల రంగులను వెదజల్లుతుంది. మనకు తెలిసిన ఎల్‌సీడీ డిస్‌ప్లేలో కూడా రంగులు కనబడతాయి. ఈ రకం టెలివిజన్‌లు, మానిటర్‌లు మామూలయిని. కానీ, వీటిలో కరెంటు సాయంతో రంగు, వెలుగు పుట్టాలి. మిరాసోల్‌లో మాత్రం స్వంత వెలుగు లేదు. ఉన్నది సూర్యకాంతి మాత్రమే. బయట వెలుగు ఎంత బలంగా ఉంటే, అందులోని రంగులు కూడా అంతగా తళతలాడతాయి. ఎల్‌సీడీకి అయ్యే కరెంటు ఖర్చులో పదవ వంతుతో ఇక్కడ, ఇంకా మంచి రంగులు కనబడతాయి. ఈ పద్ధతినివాడి క్వాల్‌కామ్ వారు ఈ-రీడర్ (కిండిల్ లాంటి పుస్తకాలు చదివే పరికరం) తయారుచేశారు.


టెక్నాలజీని మిగతా వారికి అందజేస్తున్నారు కూడా. జీవుల శరీర నిర్మాణం ఆధారంగా పరికరాలు రావడం కొత్త మాత్రం కాదు. కొన్ని రకాల మొక్కల విత్తనాలు మన శరీరానికి, దుస్తులకు అంటుకుపోతుంటాయి.వాటిని తీయడానికి వేళ్ళతో ప్రయత్నిస్తే వేళ్లకు పట్టుకుంటాయి. వీటిలో వంకర తిరిగిన ముళ్లలాంటి భాగాలుంటాయని గమనించారు. వాటి ఆధారంగా 1955లోనే ‘వెల్‌క్రో’ పుట్టింది. సంచులు, దుస్తులు, షూస్‌లో బెల్టులు, జిప్‌ల బదులు చిరచిరలాడుతూ ఊడివచ్చి, అదిమితే మళ్లీ అతుక్కునే ‘వెల్‌క్రో’ అందరికీ తెలుసు. దాని వెనుక కథ మాత్రం తెలియదు. కొన్ని రకాల గడ్డి మొక్కలు గాలిలో కదిలే తీరునూ, నిటిలస్ అనే సముద్ర జంతువు శంఖం నిర్మాణాన్ని ఆధారంగా, పారిశ్రామిక పంఖాలను తయారచేశారు. ఒంటె తన ముక్కులో తేమను సేకరించుకునే తీరు ఆధారంగా, ఖతార్ దేశంలో ఒక గ్రీన్‌హౌస్‌ను పనిచేయిస్తున్నారు. పదార్థ నిర్మాణం మరీ చిన్నదయిన నానోస్కేల్‌కు చేరుతున్నది గనుక ఇప్పుడు మరెన్నో విచిత్రాలు రానున్నాయి.

బయో మిమిక్రీ అన్నది ఒక పదార్థం కాదు. అదొక పద్ధతి. మన దేశంలోనే కొండ ప్రాంతాలలో కడుతున్న ఒక ఆధునిక నగరంలో వర్షాలను ఆకర్షించే పద్ధతిలో ఆకురాలు చెట్లను నాటారు. అక్కడ వర్షం రాకపోవడమనే ప్రశ్న ఉండదంటున్నారు. మర్రి ఆకుల ఆదర్శంగా ఇంటి పైకప్పు మీద పెంకులను అమర్చి, వర్షం నీటిని సేకరించే ప్రయత్నం జరుగుతున్నది. చీమల పుట్టలు ఆదర్శంగా తడవని గోడలు కడుతున్నారు. లవాసా అనే ఈ నగరం 2020 నాటికి పూర్తి అవుతుంది. అది మూడులక్షల మందికి ఆశ్రయమిస్తుంది.


మనిషి కారణంగా వాతావరణం పాడవుతున్నదని అందరూ గుర్తించారు. ఆ రకం ప్రభావం తగ్గించాలన్న ఆలోచన మొదలయింది. ప్రకృతివల్ల పడే ప్రభావం మరొకరికి సాయంగా ఉంటుంది. మన నగరాలు కూడా ఆ రకంగా ఉండవచ్చునన్న ఆలోచన ఈ మధ్యన మొదలయింది. నగరాల్లో కురిసిన వర్షం, అక్కడి మురికి, చెత్తలను వెంట తీసుకునిపోయి, ఏదో ప్రవాహంలో కలుస్తుంది. ఆ నీరు మరింత పరిశుభ్రంగా, ప్రవాహంలో కలిస్తే బాగుంటుందన్న ఆలోచన, అందుకు తగిన ప్రయత్నాలు సాగుతున్నాయి.

అడవులు తగలబడుతుంటే పైన్ చెట్లు, యూకలిప్టస్ చెట్లు విచిత్రంగా తప్పించుకుంటాయి. యూకలిప్టస్ బెరడు ఊడి పడిపోయి బోదెను కాపాడుతుంది. ఈ పద్ధతి ఆధారంగా మంటకు తట్టుకునే గుడ్డను తయారుచేశారు. పీతలు, రొయ్యల శరీరంలోనుంచి ఒక రసాయనాన్ని గమనించి, అదే పద్ధతిలో మరో గుడ్డను తయారుచేశారు. ఇందులోని ఒక రసాయనం పొర మంటను అడ్డుకుంటుంది. పక్షులు, పురుగుల నుంచి నేర్చుకోవలసింది మరెంతో ఉందంటారు సైంటిస్టులు. సీతాకోకచిలుకల నుంచే మరెన్నో పాఠాలు అందుతున్నాయి. ఒక రకం సీతాకోకచిలుక రెక్కల మీద నల్లని మచ్చలుంటాయి. అవి సూర్యరశ్మిని బాగా పీల్చుకుంటాయి. వాటి నిర్మాణాన్ని గమనించి, అనుకరించి మరింత బాగా పనిచేసే సోలార్ టెక్నాలజీని సిద్ధం చేస్తున్నారు.

ప్రస్తుతం నకిలీ వస్తువులను తయారుచేసి మోసగించే ప్రయత్నాలకు సమాధానంగా, మంచి ఉత్పత్తుల మీద హోలోగ్రామ్‌లను పెడుతున్నారు. అదే రకమయిన హోలోగ్రామ్‌లను దొంగచాటుగా తయారుచేయడం కుదరదు. సీతాకోకచిలుకల రెక్కల నిర్మాణం ఆధారంగా, త్వరలోనే, హోలోగ్రామ్స్‌కన్నా మంచి పద్ధతి రానున్నదని చెపుతున్నారు. అందంగా దుస్తులు వేసుకున్న అమ్మాయిలను సీతాకోక చిలుకలు అనడం తెలుసు. ఇప్పుడు సిడ్నీలో ఒక ఫాషన్ డిజైనర్, రంగులులేని మార్ఫోటెక్స్ అనే గుడ్డను  తయారుచేయించాడు. అది వెలుగులో రకరకాల రంగులతో మెరుస్తుంది. ఇంతకంటే చక్కని మిమిక్రీ ఇంకేముంటుంది?