Showing posts with label గోపాలం. Show all posts
Showing posts with label గోపాలం. Show all posts

Saturday, September 24, 2016

నిప్పు చెప్పే నిజాలు




నిప్పు జీవంగలది. అది శ్వాసిస్తుంది, అందిన దాన్ని తింటుంది, అసహ్యించుకుంటుంది. మంటను గెలవాలంటే మనమూ దానిలాగే మెలగాలి. దానిలాగే ఎటుపడితే అటు కదలాలి. మండే పదార్థాలు ఉన్నాయని మంటకు తెలియదు. మంట ఉందని మండే పదార్థాలకు తెలియదు. మంట, నిప్పు కలిసి మన ప్రపంచాన్ని మార్చేశాయి. ఒకానొక సినిమాలో ఒకానొక పాత్ర అన్న మాటల ఆధారంగా.
* * *
చుట్ట వెలిగించడానికి చెన్నయ్య చెకుముకి రాయి కొట్టేవాడు. పొయ్యి వెలిగించడానికి పెద్దమ్మ పక్కింటి నుంచి పిడక మీద నిప్పు తెచ్చేది. అప్పుడు అగ్గిపెట్టె, కిరోసిన్ నూనె వచ్చి పద్ధతి మార్చాయి. అగ్గిపుల్ల ఎక్కడ గీచినా మండేది. ఓ సినిమాలో క్రూరుడయిన విలన్ ఎదుటి వాడి బట్టబుర్ర మీద పుల్లగీరి దాంతో చుట్ట వెలిగించుకోవడం చూచాను. అది తెలుగు సినిమా మాత్రం కాదు. అగ్గి పుల్లలను అంత క్రూరంగా ఉండని పద్ధతికి మార్చి భద్రత గలవి అని పేరు కూడా పెట్టారు. అగ్గిపెట్టెల మీద సేఫ్టీ మ్యాచెస్ అని ఉంటుంది. కనీసం ఈసారయినా గమనించి చూడండి. అదీ మీకు అగ్గిపెట్టె దొరికితేనే. ఇక ఆ తర్వాత కరెంటు వచ్చి కాలానే్న మార్చింది. ఇప్పుడు నిప్పు, పొగ, వేడి ఏదీ లేకుండానే మైక్రోవేవ్‌లో వంట జరుగుతోంది. మంటలేదు గానీ వంట మాత్రం అలాగే ఉంది. ఇంతకూ వంట, మంట ఎప్పుడు మొదలయ్యాయనేది అసలు ప్రశ్న.
తొలి రోజుల్లో మనిషి తెచ్చుకున్న కాయలు, పళ్లు గానీ వేటాడిన జంతువును గానీ పచ్చిగానే తినేవాడు. కాల్చి తినడం ఆ తర్వాత అలవాటయింది. చిన్నప్పుడొక కథ విన్నట్లు గుర్తు. తెచ్చిన మాంసం లేదా జంతువు అలా ఉండగానే అనుకోకుండా ఒకసారి అగ్నిప్రమాదం జరిగిందట. మంట ఆరిన తర్వాత జంతువేమయిందో వెదుకుతూ మనిషి ఉడికిన మాంసంలో వేలు పెట్టాడు. చురుక్కుమంది. అనుకోకుండా వేలిని నోట్లో పెట్టుకున్నాడు. మాంసం రుచి మారింది. బాగుంది కూడా! అలా తిండిని కాల్చి తింటే బాగుంటుందని తెలుసుకున్నారంటారు. ఇలాంటి కథలు, కథలుగా కూడా నిజంగానే వినిపిస్తాయి. అప్పట్లో అంటే ఆదిమానవుని కాలంలో ఏం జరిగిందీ అన్నది ఊహించి చెప్పవలసిందే తప్ప అందుకు ఆధారాలు లేవు కదా! కనుక కథకూ, సత్యానికి మధ్యన అంత తేడా లేదు.
పది లక్షల సంవత్సరాల క్రితం ‘హోమో ఎరెక్టస్’ అనే నిటారుగా నిలబడిన మానవులు వంటకు, వెలుగుకు ఇతర అవసరాలకు మంటను వాడుకున్నారని ఒక వాదం. రెండు లక్షల సంవత్సరాలకు ముందు మానవుడు అగ్నిని తన అవసరాలకు వాడుకున్న గుర్తులేవీ, కనిపించడం లేదంటారు మరి కొందరు పరిశోధకులు. అంటే, అప్పటికి ‘హోమో సాపియోన్స్’ అనే మనలాంటి మనుషులు వచ్చేశారు. అంతకు ముందు మనుషులకు వంట తెలియదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆ ఆశ్చర్యాన్ని కొంచెం తగ్గించే ఆధారాలు కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాన్సులో దొరికాయి. 4,65,000 సంవత్సరాల నాటిదిగా గుర్తించిన ఒక మానవ ఆవాస ప్రదేశంలో పొయ్యిలా మండిన చోటు ఒకటి దొరికింది. లెక్కలో ఎంత తప్పు ఉన్నా 65 వేల సంవత్సరాలకన్నా అటూ ఇటూ కావడానికి వీలులేదంటున్నారు పరిశోధకులు. అంటే నాలుగు లక్షల ఏళ్లనాడే మనుషులు పొయ్యి పెట్టి వంట చేసుకున్నారని భావం. ఆ కాలానికి నేడున్న మనలాంటి మానవ జాతి ఆవిర్భవించలేదు. నిటారు మనుషుల కాలమే అది!
ఎలెక్ట్రాన్ స్పిన్ రెసొనాన్స్ అనే పద్ధతితో ఎక్కువ వేడయిన క్వార్ట్‌జ్ వయసు గుర్తించడం వీలవుతుంది. గులకరాళ్లు, మట్టిలో ఈ క్వార్ట్‌జ్ ఉంటుంది. పొయ్యిలో నుంచి రాళ్లను, మట్టిని తీసి చూస్తే అవి లక్షల ఏళ్ల నాటివని తెలిసింది. మొదటి పరిశీలనలోని రాళ్లు 3,80,000 సంవత్సరాల నాటివి. అక్కడే పురాతత్వ పరిశోధన కోసం జరిపిన తవ్వకాలలో మరింత లోతున మరో పొయ్యి కనిపించింది. అందులోని రాళ్లను పరీక్షిస్తే అవి 4,65,000 నాటివని తెలిసింది. అయితే మానవులు ఆ కాలంలోనే మంటను వాడుకున్నారని చెప్పడానికి ముందు పరిశోధకులు ఒకటి రెండు సంగతులను తేల్చి చెప్పాల్సి ఉంటుంది. అందులో ఒకటి కాలం నిర్ణయించడానికి వాడుతున్న డేటింగ్ పద్ధతుల్లో పొరపాటు లేదని, రెండవది పరీక్షించిన రాళ్లు నిజంగా ఒక ‘పొయ్యి’లోవని, ఏదోవేరు రకంగా గురయినవి కావని తేలాలి!
పరిశోధనలో ఎప్పటికీ పొరపాట్లే జరుగుతాయంటే అన్యాయం. అలాగని పొరపాటు జరగవనడానికి కూడా లేదు. ఇక్కడ మరొక కథ గుర్తుకు వస్తుంది. ఇద్దరు గప్పాల రాయుళ్లు ముచ్చటాడుతున్నారట. ‘మా ఇంట్లో బావి కోసం వంద అడుగులు తోడితే, ఆ లోతులో తీగలు దొరికినయి. అంటే వెనకట మనవారు టెలిఫోను వాడుకున్నారనే గదా అర్థం!’ అన్నాడు మొదటి గప్పాలాయన. రెండవ ఆయన అందుకుని ‘మా ఇంట్లో నిజానికి రెండు వందల అడుగులు తోడినా ఏ తీగా దొరకలేదు. అంటే అప్పట్లో వారు వైర్‌లెస్, సెల్‌ఫోన్ వాడుకున్నారనేగా అర్థం!’ అన్నాడు. ఫలితాలను అందుకోవడం ఒక ఎత్తు. వాటిని అన్వయించి చెప్పడం మరో ఎత్తు! వేడెక్కిన రాళ్ల వయసు నిర్ధారించడానికి వాడే పద్ధతి గట్టిదే. అయితే అందులో అయిదు లక్షలకన్నా ఎక్కువ సంవత్సరాల వివరాలు తెలియడం కష్టం. పరిశీలిస్తున్న ఈ రాళ్లు ఇంచుమించు పరీక్షా పద్ధతుల అంచులను తాకుతున్నాయి. అలాంటి ఫలితాలను నమ్మడం కొంచెం కష్టమే. అందుకే పరిశోధకులు రాళ్లను థర్మోల్యుమినిసెన్స్ అనే మరో పద్ధతిలో కూడా పరీక్షించే ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఒక సమస్య తీరుతుంది. సాధారణంగా ఏ విషయాన్నయినా అనుమానం లేకుండా నిర్ణయించాలంటే, ఒకటికన్నా ఎక్కువ పద్ధతులతో పరిశీలించడం, పరిశోధనలోనే కాదు, మన బతుకుల్లోనూ అలవాటే. డాక్టర్‌లు తాము చెప్పింది కాక, మరో డాక్టర్‌కు చూపించి మరో అభిప్రాయాన్ని తీసుకోవడం అనే ఒక పద్ధతి ఉండనే ఉన్నది కదా!
ఇక రెండవ సమస్య, రాళ్లు నిజంగా మనుషులు ఏర్పాటు చేసుకున్న నెగడు లేదా పొయ్యిలో నుంచి వచ్చినవేనా? లేక మనిషి ప్రమేయం లేకుండానే మంటకు గురయినవా? అడవులు తగలబడడం మామూలే. అది కాకున్నా ఒక ఎండిన చెట్టు తగలబడి ఉండవచ్చు. ఇటువంటి మంటకు, మనిషి వేసుకున్న పొయ్యి మంటకు తేడా తెలియడం కష్టం. అయితే ఫ్రాన్సు తవ్వకాల్లో దొరికిన పొయ్యిలు మాత్రం చాలాకాలంపాటు మండిన దాఖలాలున్నాయి. సహజంగా తగలబడిన వస్తువులేవీ ఇంతకాలం మండవు.
హోమో ఎరెక్టస్ కాలంలోనే మంటను, నిప్పును వాడుకున్నారనేది నిర్ణయమయితే మానవజాతి పరిణామ చరిత్ర కొంచెం మారుతుంది. నిప్పు, చక్రం, వ్యవసాయం మానవ జాతి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం గల అంశాలు. అవి మనిషికి బ్రతుకు నేర్పించాయి. నిప్పు నియంత్రణ జీవితానికి గుర్తు, చక్రం సాంకేతిక పరిజ్ఞానానికి, ప్రగతికి ఆధారం. వ్యవసాయం సాంఘిక పద్ధతికి సామూహిక జీవనానికి, అన్నిటికీ మించి ‘స్వంత’ భావానికి మొదలు, వంట స్వంతం. ఫలసాయం స్వంతం. అది తన వారికే అందాలి. అంటే ఇతరుల నుంచి కాపాడుకోవాలి. నిప్పు మాత్రం సంఘానికి గుర్తుగా ఉన్నాలేకున్నా స్వంతం కానవసరం లేదు.
మన గురించి మనం తెలుసుకోవడంలో ఒక వింత ఆనందం ఉంది. మానవులు ప్రస్తుతం ఈ రకంగానే ఎందుకున్నారని ప్రశ్నిస్తే, జవాబులందడానికి ఇటువంటి వివరాలు మరెన్నో తెలియాలి!
ఝలక్: నాన్న ఒక అనుభవం చెప్పేవాడు. కొత్తగా మంటినూనె వచ్చిన రోజులు. మంటి నూనె అంటే నేల నుంచి తీసిన నూనె. అదేమిటో మీకు అర్థమయి ఉండదు. పెట్రోలును భూమిలోనుంచి తీస్తారు. మంచి నూనెను నువ్వులు, పల్లీలు అనే వేరుశెనగలు లాంటి వృక్ష సంబంధ పదార్థాల నుంచి తీస్తారు. అంతకు ముందు తెలిసిన నూనెలన్నీ అంతే. ఎందుకోగానీ ఆముదాన్ని నూనె అనలేదు. అది వేరే కథ గానీ, కెరోసీన్ తెచ్చుకొని మా ఊళ్లో ఒకతను ఆముదం దీపం పద్ధతిలో మట్టి మూకుడులో పోసి వత్తి వేసి వెలిగించాడట. వత్తి ఒకటే కాదు, మొత్తం దీపమంతా వెలగడం మొదలయింది. గ్యాసు నూనె బుడ్డీ దీపాలు వడిన వాండ్లకు ఈ సంగతి తెలుస్తుంది. పాపం ఆ మనిషి పెట్టిన మంటతో పూరి గుడిసె అంటుకున్నది. తాగి ఉన్నాడేమో ఆర్పడం గురించి కూడా ఆలోచన రాలేదు. ఇంట్లోని డప్పు తెచ్చుకుని దరువు వాయిస్తూ ఆ మనిషి ఇంటి ముందు నాట్యం చేశాడట. నాన్న ఈ సంగతి నవ్వకుండా చెప్పేవాడు.

Friday, September 23, 2016

కుటుంబం- మిత్రులు- దేశం

గుయెన్ ది బిన్ (ఆత్మకథ) -ఆకెళ్ళ శివప్రసాద్,
పేజీలు: 220,
వెల: రూ.150/-
నవచేతన పబ్లిషింగ్ హౌస్,
బండ్లగూడ,
హైదరాబాద్- 68
ఫోన్: 24224453/4
**

హోచిమిన్ అనే పేరుతో పరిచయంగల వారికి ఈ పుస్తకం గురించి సులభంగా తెలుస్తుంది. ‘న్ గుయెన్ ది బిన్’ అనే వ్యక్తి వియెత్నాం దేశానికి ఒకప్పుడు ఉపాధ్యక్షురాలు. మామూలు కుటుంబంలో పుట్టిన ఈమె స్వయంకృషితో గొప్ప నాయకురాలుగా ఎదిగింది. 1995లో చైనాలో జరిగిన ఐక్యరాజ్యసమితి వారి సమావేశాలు తరువాత ఆమె పేరు ప్రపంచమంతటా మారుమోగింది. ‘కుటుంబం- మిత్రులు -దేశం’ అనే శీర్షికతో ఆమె ఆత్మకథ (400 పుటలలో) వస్తున్నదంటే హోబిమిన్ నగరంలో 2012 జూన్‌లో పెద్ద సంచలనం జరిగింది. అందరూ ఆమెను చూడాలని, పుస్తకం చదవాలని గుంపులుగా వచ్చారు. పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురించారు. ప్రస్తుతం అది తెలుగులో వచ్చింది.

గుయెన్ (సౌలభ్యంకొరకు ‘న్’ను వదిలేశారు) బాల్యం విశేషాలు, తిరుగుబాటు ఉద్యమంలో ఆమె పాత్ర, చివరికి ప్రభుత్వ అధికారిణిగా బాధ్యతలు చేపట్టడం లాంటి విశేషాలన్నింటినీ ఆమె కథల ధోరణిలో చక్కగా వివరించారు. 1973లో సంతకాలు జరిగిన పారిస్ శాంతి ఒప్పందంలో తమ దేశం బృందానికి ఆమె నాయకురాలుగా వెళ్లడంతో కథ తారస్థాయికి చేరుకుంది.

85 సంవత్సరాలలో చెప్పుకోవలసిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. కనీసం వాటిని గురించి నోట్స్ రాసుకునేందుకు కూడా వ్యవధి లేదు. అయినా ఆ పెద్దవయసులో ఆమె ఈ రచనను అందించింది. దేశం స్వతంత్రంకొరకు జరిపిన పోరాటం గురించి ఆమె ఎంతో రాశారు. స్వతంత్రం తరువాత జీవితం ప్రశాంతంగా సాగిందని కూడా వివరిస్తారు. పోరాటం గురించి ఆమె వెలువరించిన భావాలు, అలనాటి యువత భావాలకు ప్రతీకలని సులభంగానే అర్థమవుతుంది. పటిష్టమయిన దేశాన్ని నిర్మించాలంటే చక్కని వ్యక్తిత్వం, ఆత్మగౌరవం, ఆదర్శాలుగల నమ్మకమయిన ప్రజల భాగస్వామ్యం అవసరం అంటారు గుయెన్.

ఈ రకం రచనలు ఇంగ్లీషులోకి రావడమే ఒక విచిత్రం. అనువాదం అనుకున్నంత సులభంగా కుదరదు. ఆ అనువాదం నుంచి తెలుగు రచన రావాలంటే అది మరొక ప్రయత్నం. అందుకు పూనుకున్న అనువాదకునిది గట్టి ధైర్యమే. అయితే విషయం, వాతావరణం, ఆయా దేశాలు, సంఘటనల గురించి అవగాహన ఉంటే, అనువాదం మరింత సులభంగా ముందుకు సాగేది. ‘ఎండలు విరగకాసేవి’లాంటి మాటలు, వింతగా రాసిన పేర్లు, మొత్తానికి అనువాదం మరింత బాగా ఉండవచ్చును అనిపిస్తుంది.
అనువాదం తరువాత, అర్థం చెడకుండా, భాషను చక్కబెట్టడం అవసరం!
- కె. బి. గోపాలం

Sunday, September 18, 2016

కథ చెపుతాను.. ఊ కొడతావా

వెయ్యి గొంతుల మధ్యన కూడా తెలిసిన గొంతు వెంటనే వినిపిస్తుంది. ఇష్టమున్న గొంతు మురిపిస్తుంది. - ఎవరన్నారో తెలియదు.
* * *

చాలామంది కథలు రాస్తారు. కానీ నిజానికి కథలు చెప్పడం అసలు పద్ధతి. పురాణం అన్నా, హరికథ అన్నా కథ చెప్పడమే. ఇక జానపద పద్ధతిలో జముకుల కథ, బయిండ్ల కథ, బుర్రకథ లాంటివి ఎన్ని చెప్పినా కథ చెప్పడమే కానీ ముందు రాసుకుని దాన్ని నోటికి నేర్చుకుని చెప్పే పద్ధతి లేనే లేదు. చుక్క సత్తయ్య ఒగ్గు కథ గురించి అందరికీ తెలుసు. తెలియని వాళ్లకు నమస్కారం. ఎన్ని కథలు చెపుతావు అని అడిగితే దండకంలాగ బోలెడన్ని పేర్లు ఒక లయలో చెప్పేసేవాడు. వాటన్నిటికీ పుస్తకాలు లేదా వ్రాతప్రతులు ఉన్నాయని అనుకునే వాళ్లకు నిరాశ ఎదురవుతుంది. సత్తయ్యకే కాదు, జానపద కథలు చప్పే వాళ్లకు ఎవరికీ ఒక స్క్రిప్టు ఉండదు. వాళ్లకు కథ తెలుస్తుంది. గతంలో తమ వంటి వారు చెప్పిన తీరు విని ఉంటారు. కనుక ఎప్పటికప్పుడు కథను తమ లయలో మాటలను పేరుస్తూ అందంగా చెప్పేస్తూ ఉంటారు. పురాణానికి పుస్తకం ఉంటుంది. హరికథకు కొంతవరకు ఒక రాత ప్రతి ఉంటుంది. కనీసం పాటలకయినా ప్రతి ఉంటుంది. మాటలకు మాత్రం కథకుల కౌశలాన్ని బట్టి ఎప్పటికప్పుడు కొత్త రూపం వస్తుంది.

మా ఇంట్లో బుడ్డన్న పనిచేసేవాడు. పాతకాలం పద్ధతిలో చెప్పాలంటే అతను మా జీతగాడు. వ్యవసాయం పనులను అన్నింటినీ తానే చేస్తుంటాడు. అవసరం కొద్దీ మిగతా వాళ్లు ఎప్పటికప్పుడు రోజు కూలీకి వస్తారు. బుడ్డన్న మాత్రం సంవత్సరమంతా మాతోనే ఉంటాడు. అట్లా అతను కొన్ని సంవత్సరాలపాటు మాతో ఉన్నాడు. నేను ప్రేమగా ‘బుడ్డడు’ అని పిలుచుకునే మా బుడ్డన్న గొప్ప గాయకుడు. ఆ సంగతి వానికి తెలియదు. ఆ కాలంలో నాకు అంతకన్నా తెలియదు. రేడియోలో వారు జానపద సంగీతాన్ని సేకరించి, దాన్ని లలిత సంగీతం వాళ్లచేత పాడించడం అప్పట్లో పద్ధతి. అది అన్యాయమని నాకు తరువాత అర్థమయింది. ఇప్పుడు కొన్ని టీవీ ఛానళ్లలో జానపద సంగీతాన్ని జానపదుల చేతే పాడిస్తూ ఉంటే నాకు బుడ్డన్న గుర్తుకు వస్తాడు. అయితే బుడ్డన్న గురించి చెపితే శాఖా సంక్రమణం అవుతుంది. నిజానికి వాని తమ్ముడు అడివన్న. వాడు నాకంటే వయసులో చిన్నవాడు. కనుక నాకు వాడు దోస్తు. వాడు మా పశువులను కాసేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత అప్పుడప్పుడు నాతో కబుర్లతో గడిపేవాడు. వాడు కథల పుట్ట. ఎన్ని కథలు ఎంత బాగా చెప్పాడో గుర్తుకు తెచ్చుకుంటే నాకు కళ్లకు నీళ్లొస్తాయి. నీళ్లెందుకు? పాపం అడివన్న ఇప్పుడు లేడు. వాడు ఉంటే కూచోబెట్టి కథలు చెప్పించి పుస్తకాలకు, పత్రికలకు వాడి పేరుననే ఎక్కించేవాడిని కాదా? అది నా బాధ. అది ఇప్పుడు వీలుకాదు.

నేను కథలు రాయకూడదని నిర్ణయించు కున్నాను. వ్యాసాలు, అందునా సైన్స్ వ్యాసాలు రాయాలన్నది నా నిర్ణయం. అయినా సరే, ఆ వ్యాసాలలో నా రాత తీరు మాట్లాడుతున్నట్టే ఉంటుందని చాలామంది నాకు చెప్పారు. ఆ తరువాత నాకు కూడా ఆ విషయం తలకెక్కింది, అర్థమయింది కూడా. మనం ప్రపంచానికి చెప్పదలుచుకున్న సంగతిని మాటలతోనే చెపుతాము. ఆ మాటలను, పాటలను, రచనలను కనిపించే అక్షరాల ద్వారా అందించడం చాలా తరువాత వచ్చింది. కొంతమంది మాత్రమే కలం పట్టుకుని కూచుంటే, మాట తీరున కాకుండా మరో రకంగా రాస్తారు. ఆ రచన చదువుతుంటే రచయిత చెపుతున్న భావం వినిపించదు, కనిపించదు. రాతలో కనిపించిన అక్షరాలు శిలా శాసనాలయితే బాగుంటాయి. కథలు, కవితలయితే అవి చెప్పినట్టుగా ఉంటేనే బాగుంటాయి.

కొంతమంది ఉపన్యాసం చెప్పినా, ముందు రాసుకుని చెపుతున్నట్టు ఉంటుంది. అది బాగుండదు అనడానికి లేదు. చెప్పే తీరును బట్టి అది కూడా ఆకర్షణీయంగా ఉండవచ్చు. వేలుక్కుడి కృష్ణన్ అని ఒక తమిళ పండితుడు గొప్పగా ప్రవచనాలు చెపుతాడు. గంటలు మాట్లాడినా ఆయన ప్రవచనంలో అనవసరమయిన మాటలు గానీ, చెప్పిందే మళ్లీ చెప్పడంగానీ ఉండదు. మొదట్లో నాకు ఆయన పద్ధతి గొప్పగా ఉందనిపించింది. రానురాను అది కొంచెం బిగిసుకుపోయిన పద్ధతేమో అని అనిపించసాగింది. ఇక మరి కొందరు ఉపన్యాసం చెపితే ‘ఎందుకు చెపుతున్నాననంటే అండీ’ అంటూ మరీ పిచ్చాపాటి పద్ధతికి దిగుతారు. చెప్పిందే మళ్లీ చెప్పడం గురించి మళ్లీ మళ్లీ చెప్పడం ప్రస్తుతం అప్రస్తుతం. చెప్పవలసిన విషయాన్ని మరీ మనసు కెక్కించాలంటే ఒకసారి పునశ్చరణ చేయాలని పద్ధతి ఉందిగానీ అదే పనిగా రుబ్బుతూ ఉంటే దాన్ని పిండి పిసకడం అంటారు. ఈ మధ్యన పురాణాలు, ప్రవచనాలు వింటూ ఉంటే నాకు ఈ సంగతి క్షణక్షణం గుర్తుకు వస్తుంది. కథ ముందుకు సాగదు, విషయం బయటకు రాదు, మాటలు మాత్రం సాగుతూ నే ఉంటాయి.

ఇంతకూ ఈ విషయం ఎత్తుకుని ఎందుకు చెపుతున్నాను అని నన్ను నేనే ప్రశ్నించుకుంటాను. ఇన్నాళ్లుగా రాస్తున్నాను గానీ నన్ను ఎవరయినా రచయిత అంటే, ఒక్క క్షణం నాకు ఆశ్చర్యం అవుతుంది. నేను రాయడం లేదు, నాకు తెలిసిన సంగతులను, అర్థమయిన సంగతులను మళ్లీ చెపుతున్నాను. ఈ చెప్పడంలోని అనుభవం అది రాసే వాళ్లకు తెలిసినట్టే చదివే వాళ్లకు కూడా తెలుస్తుంది. గ్రాంథికంగా, లేకున్నా సరే పడికట్టు పద్ధతిలో రాసిన మాటలు చదువుతుంటే ఊపు ఉండదు. అందులో రచయిత గొంతు వినిపించదు. ఈ గొంతు అన్న మాటను అందరూ పట్టుకోవాలని నాకు గట్టి నమ్మకం. పుస్తకం చేతికి ఎత్తుకుంటే పేజీలో అక్షరాలు కాక, టీవీ తెర మీదలాగ ఆ విషయం చెప్పిన మనిషి కనిపించాలి. అక్షరాలు ఆయన మాటలయి వినిపించాలి. విశ్వనాథ సత్యనారాయణ గారి పద్ధతిలో అందరూ రచనలు చేసి ఉండకపోవచ్చు. ఆయనకు కూచుని రాయడం అలవాటు లేదట. ఆయన చెపుతూ ఉంటే పక్కన మరెవరో కూచుని రాసేవారట. పుట్టపర్తి వారి గురించి కూడా ఇదే మాట విన్నాను. వాళ్ల రచనల్లో మాటల ధోరణి వినిపించిందంటే ఆశ్చర్యం లేదు. అందరు రచయితలు అట్లా డిక్టేటర్స్ కాదు. ఎవరికి వారు కూచుని రాసుకున్నారు. ఈ మధ్య వరకు నేను కూడా అదే పద్ధతి. అయినా సరే తమ గొంతు పాఠకులకు వినిపించేలా రచయితలంతా రాయడానికి ప్రయత్నం చేశారు. చాలామంది ఆ పనిని విజయవంతంగా చేయగలిగారు.
సులభంగా అర్థం కావాలంటే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. వార్తాపత్రికను ఒకదాన్ని ఎత్తుకుని ఏ అంశాన్నయినా తీసుకుని చదివి చూడండి. వార్తలలో వ్యక్తి కనిపించకూడదు. కేవలం విషయం కనిపించాలి. కాబట్టి దాన్ని బొటాబొటిగా రాస్తారు. వ్యాఖ్య అయితే వెంటనే రాసిన మనిషి గొంతు వినిపిస్తుంది.

రచయితలందరూ మంచి మాటకారులు కాదు, బాగా ప్రసంగాలు చేయగలిగిన వారందరూ కూడా రాయలేకపోవచ్చు. ఇందుకు కారణం వారి గొంతు. కలం పట్టుకుని కూచుంటే గొంతులో గుండె వచ్చి ఇరుక్కుంటే రచన ముందుకు సాగదు. ఎదురుగా ఎవరో కూచున్నారని ఊహించుకుని వాళ్లకు చెపుతున్నట్టు రచన మొదలుపెడితే అది చాలా సులభంగా జరుగుతుంది. అడివన్న కథ చెపుతూ ఇంచుమించు అక్కడ ప్రత్యక్ష పురాణం పద్ధతిలో సీన్‌ను సృష్టించేవాడు. డైలాగు చెపితే దాన్ని రాసిన అక్షరాన్ని ఏ భావమూ లేకుండా చదివినట్టు చెప్పామనుకోండి అర్థం ఉండే మాటలు కూడా అర్థం లేనట్టు కనిపిస్తాయి. ‘అయ్యో! అంత పని జరిగిందా?’ అనే ఒక డైలాగును మా కుటుంబమంతా కలిసి ఒకనాడు టీవీలో విన్నాము. ఆ చెప్పిన అమ్మాయికి చేతులెత్తి నమస్కరించాలి. భావం ఏ మాత్రం పలకకుండా ఆమె చెప్పిన పద్ధతిలో ఆ డైలాగు చెప్పాలని మా ఇంట్లో వాళ్లమంతా ఇవాళటికీ పోటీ పడుతుంటాము. గొంతు! అచ్చు అక్షరంలో కూడా గొంతు! దాన్ని గురించి కాసేపు ఆలోచించండి. అప్పుడు నేను కథ చెపుతాను. మరి ఊ కొడతారా?
ఝలక్: చాలామంది ముందు కవిత రాసుకుని దాన్ని కవి సమ్మేళనంలో వినిపిస్తారు. నాకు తెలిసిన కొందరు చెప్పవలసినదంతా ముందు చెప్పేసి అప్పుడు దాన్ని అచ్చు రూపంలోకి మారుస్తారు. నేను కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నాను. ఈ నాలుగు మాటలను కూడా నేను కలంతో రాయలేదు.

Saturday, September 10, 2016

మా ఊరు

........................................................
ఊళ్లో ఒక ఆంజనేయుని గుడి ఉన్నది. దాన్ని చిన్నప్పటి నుంచి హనుమాండ్ల గుడి అనడం అలవాటు. నేను కనీసం హ అనే అక్షరం వాడాను. మా ఊరి వాండ్లకందరికీ అది అన్మాండ్ల గుడి మాత్రమే. నాకు తెలిసి అందులో నిత్యం ధూప దీపం నడిచేది కదా. ఊళ్లో మాకున్న కొద్దిపాటి పొలం ఇనాం భూమి అని చెప్పారు. ఏం చేయడానికి ఆ ఇనాం ఇచ్చారో నా వరకు రాలేదు. ఆ గుడిలో దీపం పెట్టే బాధ్యత మాత్రం మాది కాదని, ఆ బాధ్యత ఎవరికీ లేదని అనుభవం వల్ల నాకు తెలిసింది. నేను చదువు పేర ఊరు వదిలి బయటకు వచ్చిన తరువాత ఆ గుడిని మరమ్మతు చేయించారు. నిత్యం పూజలు చేయగల కుటుంబాలు ఊళ్లో లేవు.

......................................................
పేర్లు పెట్టడం అనేది ఒక గోకుడు. అది ఆ వస్తువును స్వంతం చేసుకోవాలన్న గోకుడు లాంటిదే - ఎడ్వర్డ్ ఆబి
* * *

ఎప్పుడో ఒకసారి చెప్పడానికి ఏముంది అని ఓ కవిత రాశాను. ‘అందరితో కలిసి ఉంటున్నందుకు నేను ఉన్నాను’ అన్నాను. కనుక ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదని కూడా అన్నాను. కానీ మనసు మారినట్టుంది, చెప్పడానికి చాలానే ఉంది అని కూడా అన్నాను. చెప్పదలచుకుంటే ఎంతయినా చెప్పవచ్చు. మూడు సంవత్సరాల నుంచి లోకాభిరామం పేరుతో చాలా సంగతులు చెపుతున్నాను. పెద్దలు, పిన్నలు, తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు చాలామంది బాగుందని కూడా అన్నారు. ఈ మధ్యన ఒకచోటికి వెళ్లవలసి వచ్చింది. అక్కడికి వచ్చిన చాలామందిలో నాకు పరిచయమున్న వాళ్లు నలుగురే. ఆ నలుగురితోనే నాలుగు మాటలు మాట్లాడి, మరో నలుగురితో పరిచయం చేసుకునే ప్రయత్నాలు చేసి చివరికి ఇంటి దారి పట్టే సందర్భంలో కళకళలాడుతున్న ఒక అమ్మవారు దగ్గరగా వచ్చారు. బాగా పరిచయమున్నట్టే పలకరింపులు కూడా లేకుండా ‘మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలండీ’ అన్నారు. ‘ఉన్నట్టుండి లోకాభిరామం వ్యాసాల్లో తెలంగాణం భాష ఎందుకని వస్తుంది?’ అని ఆమెగారి అనుమానం. అప్పుడు నాకు మా ఊరు మళ్లీ గుర్తుకు వచ్చింది. ఊరు గురించి, గతం గురించి, నా గురించి చెప్పినప్పుడంతా అలవాటుగా చిన్ననాటి నుంచి, నేటి వరకు ఇంట్లో మాట్లాడుకుంటున్న మాటల తీరు బయటికి వస్తుంది. అదే సంగతి ఆ అమ్మగారితో చెప్పాను. ఆవిడ నవ్వేసి వెళ్లిపోయారు. ఆలోగా నా వ్యాసాలను వాళ్లందరూ క్రమం తప్పకుండా చదువుతారని, అవెంతో బాగుంటాయని కూడా అభిమానం ఉట్టిపడే పద్ధతిలో చెప్పి మరీ వెళ్లారు. నాకు ఆనందమయిందా? ఏమో? అయ్యే ఉంటుంది!

మా ఊరు పేరు ఏనుగొండ. ఇంగ్లీషులో మాత్రం ‘వై’తో మొదలుపెట్టి రాస్తారు. మరిదాన్ని యేనుగొండ అనాలి కదా! కానీ అలా పలకడం అంత సులభంగా ఉండదు. కనుక అందరూ ఏనుగొండ అని మాత్రమే అంటారు. నన్ను ఇప్పటికీ మా వాండ్లందరు ఏనుగొండ గోపి అని మాత్రమే పిలుస్తారు. ఈ దేశంలో చాలా ఊళ్లున్నాయి. రాంపూర్ అనే ఊళ్లు మన దేశంలో 84 ఉన్నాయట. ఇది తపాలా శాఖ వారు చెప్పిన సమాచారం. నేను మాత్రం బల్లగుద్ది, మరి దేన్నయినా గుద్ది నమ్మకంగా చెప్పగలను, ఏనుగొండ అనే ఊరు మరొకటి లేదు. మా ఊరు పక్కనే పాల్కొండ లేదా పాలకొండ అనే ఊరు కూడా ఉంది. చారిత్రక ఆధారాలు తెలియవుగానీ, ఆ పాలకొండ నిజానికి పాలకుండ అని, మా ఊరేమో వెన్నకుండ అని పెద్దవాళ్లు చెప్పారు. ఆ పేర్లు రానురాను పాలకొండ, ఏనుగొండగా మారాయి. లోకాయపల్లి సంస్థానం అని ఒకటి ఉండేదట. ఆ సంస్థానం దొరలకు ఈ ఊళ్ల నుంచి పాలు, వెన్న అందేవట. ఇవన్నీ అట అన్న సంగతులేగానీ ఎంతవరకు నిజాలో నాకు తెలియదు. మా ఊరికి కొంతదూరంలో ఉన్న ఒకానొక గుట్టకు ఊరగుట్ట అని పేరు. దాని మీద ఒక విచిత్రమైన రాయి ఉంటుంది. మామిడికాయ ఆకారంలో ఉండే ఆ రాయి, ఎప్పుడు దొర్లి పడుతుందా అన్నట్టు ఒక పెద్దరాతి మీద కొంతమాత్రమే కింద రాతికి తగిలి నిలబడి ఉంటుంది. పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, అది పడను మాత్రం పడలేదు. హైదరాబాద్ చుట్టూ ఇటువంటి రాళ్లను పరిశీలించే ఒక బృందం ఉంది. వాళ్లు మా రాతిని, మామిడికాయ రాతిని చూచింది, లేనిది తెలియదు.

ఏనుగొండ అనే మా ఊరు మొదట్లో ఆ గుట్ట కింద ఉండేదట. గుట్ట కింద అంటే గుట్ట ఉన్నచోట కాదు. దాని పక్కన అని అర్థం. అక్కడి నుంచి ఊరు రెండు అంచెలలో ప్రస్తుతం ఉన్నచోటికి వచ్చింది. ఇందుకు సాక్ష్యంగా గుట్ట ప్రాంతంలో, మధ్యలో ఉండే పొలాలలో తవ్వకాలు జరుగుతూ ఉంటే బూడిద, కాలిన మన్ను, కుండముక్కలు లాంటివి దొరికాయి. ఒకానొక పొలంలో ఏకంగా గణేశుని విగ్రహం దొరికింది. ఆ విగ్రహానికి ఎక్కడో ఒక చిన్న లోపం ఉన్నట్టు నేను గమనించాను. అవి నేను బడిలో చదువుకుంటున్న రోజులు. ఫలానా వాళ్ల పొలంలో దేవుడు దొరికాడు అని ఊళ్లో కలకలం మొదలయింది. అందరమూ కలిసి వెళ్లాము. గణేశుని విగ్రహాన్ని తవ్వి బండికి ఎత్తించి ఊళ్లోకి తెచ్చాము. అది భారీగానే ఉంది. దానికి పూజలు, పునస్కారాలు కూడా జరిగినట్టు గుర్తు. ఇటువంటి సందర్భాలలో నాన్న నిశ్శబ్దంగా ఉండేవాడు. ఊళ్లో బ్రాహ్మణ కుటుంబాలు రెండే రెండు. అందులో మాది ఒకటి. విగ్రహం దొరికినప్పుడు దాన్ని చూడడానికి నాన్న తప్పకుండా వచ్చి ఉండాలి. ఆయన వచ్చినట్టు నాకు గుర్తులేదు. తరువాత ఆయన ఒక సిద్ధాంతం చెప్పాడు. విగ్రహంలో లోపం ఏర్పడితే దాన్ని భూస్థాపితం చేయడం పద్ధతి అట. అట్లా చేసిన విగ్రహం ఏదో ఒక రకంగా మళ్లీ అందరి దృష్టికి వచ్చింది అని ఆయన అన్నారు. నాకూ నిజమే అనిపించింది. ఇన్ని సంవత్సరాల తరువాత ఆలోచిస్తే, ఆ విగ్రహం ఏమయింది అన్న ప్రశ్న నా మెదడులో ఇవాళ పుట్టింది. దానికి పూజలు ఎందుకు కొనసాగలేదు అన్న ప్రశ్న కూడా మనసులో తొంగి చూసింది. నేను ఈ మధ్యన మా ఊరికి వెళ్లడానికి కారణం కనిపించడం లేదు. ఈసారి వెళ్లి గణపతిని వెతకాలి.

ఊళ్లో ఒక ఆంజనేయుని గుడి ఉన్నది. దాన్ని చిన్నప్పటి నుంచి హనుమాండ్ల గుడి అనడం అలవాటు. నేను కనీసం హ అనే అక్షరం వాడాను. మా ఊరి వాండ్లకందరికీ అది అన్మాండ్ల గుడి మాత్రమే. నాకు తెలిసి అందులో నిత్యం ధూప దీపం నడిచేది కదా. ఊళ్లో మాకున్న కొద్దిపాటి పొలం ఇనాం భూమి అని చెప్పారు. ఏం చేయడానికి ఆ ఇనాం ఇచ్చారో నా వరకు రాలేదు. ఆ గుడిలో దీపం పెట్టే బాధ్యత మాత్రం మాది కాదని, ఆ బాధ్యత ఎవరికీ లేదని అనుభవం వల్ల నాకు తెలిసింది. నేను చదువు పేర ఊరు వదిలి బయటకు వచ్చిన తరువాత ఆ గుడిని మరమ్మతు చేయించారు. నిత్యం పూజలు చేయగల కుటుంబాలు ఊళ్లో లేవు. ఈ మధ్యన మరెవరో పై ఊరి పెద్ద మనిషి వచ్చి ఊళ్లో ఉంటున్నాడని, పౌరోహిత్యం సాగిస్తున్నాడని ఎవరో చెప్పగా విన్నాను. ఆయన ఏమయినా గుడిని పట్టించుకుంటున్నాడేమో తెలియదు.

కార్తీకమాసం వస్తే ఊళ్లో వాళ్లు రోజుకు ఒకరు చొప్పున కార్తీక పూజ అనే ఆకుపూజ చేయించేవారు. నాకే నమ్మకం కలగదు గానీ కొంతకాలం ఆ పూజలు చేసే బాధ్యత నా తల మీద పడింది. తెలిసిన కుటుంబాల వారు పొద్దునే్న సరంజామాతో వచ్చి ‘ఇవాళ కార్తీకం చెయ్యాలె! అన్మాండ్లకు చెండూరం పెట్టు, సాయంత్రం పూజ కూడ చేయించు’ అని అడిగేవారు. నాన్న ఎందుకో పౌరోహిత్యం చేయడు. కనుక నేను కాదనలేక పోయేవాడిని. సరంజామాలో సాహిత్యం ఉంటుంది. ఈ సాహిత్యానికి అక్షరాలకు సంబంధం లేదు. ఆ రోజున దేవుని నైవేద్యానికి, నా తిండికి సరిపడ బియ్యం, పప్పు, బెల్లం, కూరగాయలు లాంటివి కలిపితే దాని పేరు సాహిత్యం. సాహిత్యం అన్న మాటకు సరయిన అర్థమేమిటో ఇప్పటికయినా నేను వెతుక్కోవాలి. ఇక సింధూరం, నూనె కూడా ఉంటాయి. నూనె కలిపిన సింధూరాన్ని హనుమంతుని విగ్రహానికి పట్టించాలి. ఆ పని చేతులతోనే చేయాలి. చేతికి, గోళ్లలో పట్టిన రస సింధూరం నా శరీరానికి హాని కలిగిస్తుందని నాకు అప్పట్లో తెలియలేదు. తెలిసిన తరువాత ఎవరూ నన్ను కార్తీకం చేయించమని అడగలేదు. నేను అక్కడ ఉంటేగదా!

ఝలక్: ఈ ముక్క రాస్తూ ఇక్కడ ఆపాను. చిత్రంగా అనుకోకుండా మరునాడు మహబూబ్‌నగర్ అనే పాలమూరుకు వెళ్లాను. అదేదో జక్కడు జాతరకు పొయ్యొచ్చినట్టు, పాతి ముట్టిచ్చుకోని (అంటే ఏమో ఎవరికన్న తెలుసునా పోవలసిన చోటికి పొయ్యి, వంటల పొయ్యి కాదు, వెళ్లి, చేరి లాంటిదన్నమాట, దాన్ని తా వెనిక్కి వస్తే అది పాతి ముట్టిచ్చుకోవుడు) తిరిగి వచ్చిన నాకిప్పుడు ఏనుగొండలోకి పొయ్యే మనసు లేదు, సమయము అంతకన్నా లేదు. పోయేటప్పుడు తొందర, తిరిగి వచ్చేటప్పుడు అంతకన్నా తొందర. మొత్తానికి నాకొక చిత్రం అర్థమయింది. ఈ చిత్రము విచిత్రము గావచ్చును లేదా బొమ్మ గావచ్చును. పంచాయతి సమితిగా నాకు తెలిసిన మా ఊరు ఇప్పుడు, పట్నమయిన పాలమూరు అను మహబూబ్‌నగర్‌లోని ఒక వార్డు మాత్రమే.
ఊరి గుర్తింపు గంగలో పోయింది. అయినా సరే, మా ఊరి గురించి చెప్పుకోవలసిన సంగతులు నా మనసులో మాత్రం కావలసినన్ని ఉన్నయి.

Thursday, July 31, 2014

దొంగతనానికి అర్థం – విష్ణుప్రభాకర్



ఆ పొడుగాటి దారి మీద పక్కన అతని దుకాణం ఉన్నది. బాటసారులు అక్కడ చెట్టుకింద కూచుని సేదదీరుతరు. అతను వాళ్లను కుశలం అడుగుతడు.

ఒకనాడొక బాటసారి అణా వస్తువు కొని రూపాయి యిచ్చినడు. మామూలుగనే అతను లోపలి అల్మారా తెరిచినడు. చిల్లర తిరిగి ఇచ్చేందుకని తన పాత రేకుపెట్టె తెరిచినడు. దాని మూత తెరిచి చూచే లోపల అతని చెయ్యి కదలడం ఆగిపోయింది. పక్కనుండి చూస్తున్న పెద్దమనిషి ఒకతను ఏమయింది?” అని అడిగినడు.


ఏమి లేదు, పెట్టెను మూస్తూ దుకాణదారుడు నెమ్మదిగా చెప్పాడు, పేద మనిషి ఎవరో తన నిజాయితీని కుదువబెట్టి పైసలు తీసుకుపోయినడు అని.

విష్ణు ప్రభాకర్ ప్రఖ్యాత హిందీ కథా రచయిత.

Saturday, November 2, 2013

అద్దంలో



నిన్ను నీవు అద్దంలో ఏం చూచుకుంటావు
నిన్ను నీవు చూడాలనుకుంటే
ఎదుటి వాళ్ల కళ్లలో చూడు, మాటల్లో చూడు, చిరునవ్వుల్లో చూడు
అన్నిటికీ మించి

నీ లోపలికి నీవే తొంగి చూడు.

Friday, April 13, 2012

ఏముంది - కవిత


ఏముంది


చెప్పవలసింది చాలనే ఉంది
ఆ ఊరిగురించి చెప్పాలె
నా పేరు గురించి చెప్పాలె
అశలు ఆశయాల గురించి చెప్పాలె
అందని అంచుల గురించీ చెప్పాలె
ఉన్నది ఉన్నట్టు చెప్పాలె
తెట్టెను కదిలిస్తే తేనెటీగలు
మిమ్ములను కూడా కుట్టిపెడతయి
బాలసంతువానికిచ్చి
దో ఆనాకు కొన్నరంటే అర్థమవుతుందా
బడికి వెల్లి కూచుంటే
బలవంతంగా ఇంటికి తెచ్చారంటే అర్థమవుతుందా
అక్కడనే మొదలయింది వైరుధ్యం
ఇంటిపేరు ఎందుకు వచ్చిందో తెలువదు.
తాతగారు ఏం చేసేవారో తెలువదు
తెలిసింది చెప్పుదామంటే
ఎక్కడ మొదలుపెట్టాలె
నా చాటభారతం నాకే నచ్చనట్టుంది
అనుకుంటే అంతా ఆనందమే
కాదనుకుంటే ఇంతవరకు ఎట్లా వచ్చాను
అనుభవాలకు సొంత రంగులు ఉండవు
నేనూ సంతోషంగా బతికినట్టే గుర్తు
నేటికీ పెదవులతో పాదులు తవ్వి
కన్నీటితో తడిపి
చిరునవ్వులు నాటుతున్నాను
బాగానే పూస్తున్నయి
కనుకనే చెప్పేందుకు
ఏదో ఉంది

Friday, March 30, 2012

సైన్సంటే ఏమిటి?

‘సైన్సును సమాజంలోకి తీసుకుపోతున్నాము’-అన్నారొక పెద్దాయన. నిజమే. ఆ అవసరం చాలా ఉందనిపించింది, ఆ మాట వినగానే. ఆయనగారికి తెలిసిన సైన్సు, అలాంటి వారంతా చేస్తున్న సైన్సు, అందరికీ పట్టదు. అంత సులభంగా అర్థం కాదు. ఆ సైన్సును ఆయనగారు అరటిపండు గుజ్జులాగా చేసి మన ముందు ఉంచినా, మనకు అదేమిటో అంతుపట్టదు. అసలు, సైన్సు అని ఒకటి ఉందనీ, మనమంతా అందులోనే, దానివలన, దానిచేత బతుకుతున్నామనీ మనకు తెలియదు మరి! ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో సైన్సు కానిది ఏదీ లేదు. ప్రపంచంలో మనం కూడా ఉన్నామంటే, మనం కూడా సైన్సే. ఈ సంగతి తెలియకుండానే మనమంతా బతుకుతున్నాము. మన గురించి, మన బ్రతుకు, పరిసరాలు, ప్రపంచం గురించి మనకు తెలుసనే అనుకుంటాము. కానీ తెలిసింది గోరంత మాత్రమే. అందుకే ‘సైన్సు’ అనగానే ‘ఇది మనది కాదు, మనకు కాదు!’ అన్న భావన ఎదురవుతుంది.



మనమున్నాము. మరిన్ని జంతువులు, చెట్లు, మరెన్నోరకాల ప్రాణులున్నాయి. భూమి, నీరు, గాలి, వాతావరణం ఉన్నాయి. కదలిక, కాలం, విద్యుత్తు, అయస్కాంతం, అంతరిక్షం, నక్షత్రాలు, ఇలా ఎనె్నన్నో ఉన్నాయి. మన నుంచి మొదలు మహా విశ్వం దాకా ఉండే అన్నింటి గురించి, నిర్మాణం, పని తీరు, పరస్పర సంబంధాలు, వాటి వెనుక శక్తుల గురించి తెలుసుకుంటే.. అదే సైన్సు. తెలుసుకోవాలన్న కోరికతో ముందుకు సాగి, మరీ లోతుగా ఆ తెలివిలో మునిగినవారు సైంటిస్టులు. వారికి తెలిసిన సైన్సు, ‘మన గురించి కాదు!’ అనేంత లోతుకు చేరింది. వారికీ, మామూలు మనుషులయిన మనకు మధ్యన దూరం పెరిగింది. మొదటినుంచి మొదలుపెట్టి, సైన్సు గురించి తెలుసుకోవాలని ప్రయత్నించేవారికి, కొంత తెలుసు. వాళ్లు లోతులకు వెళ్లాలనే ప్రయత్నంలో, బ్రతుకులోని సైన్సును మరిచిపోతుంటారు.


సైన్సు అన్నది ఒక మూడు అంతస్తుల భవనమయితే, సైంటిస్టులు పై అంతస్తులో ఉంటారు. మిగతా ప్రపంచం కన్నా వారికి లోతయిన సైన్సు గురించి ఎక్కువ ధ్యాసుంటుంది. మధ్య అంతస్తుతో వీరికి కొంచెం సంబంధాలు ఉంటాయి. ఏ కొందరికోతప్ప కింద అంతస్తు ఒకటి నేల మీద ఉందనీ, అది కూడా సైన్సే అనీ భావం కలగడానికి తీరిక, ఆలోచన ఉండదు. కొంతమంది కింది అంతస్తుతో సంబంధం లేకుండా, తమ ప్రపంచంలో బతుకుతుంటారు. తమ శ్రమ మొత్తం, కింది అంతస్తుతో సహా మొత్తం భవనం కోసమన్న సంగతి వారికి గుర్తుచేయాలి!


మధ్య అంతస్తులోవారు తెలిసీ తెలియక బతుకుతుంటారు. సైన్సు ఉందని తెలుసు. సైన్సన్నా, సైంటిస్టులన్నా బోలెడంత గౌరవం వీరికి! కానీ, సైన్సు కోసం అనుకుని, సూత్రాలను, శాస్త్రాలను చదువుతారే తప్ప, అర్థం చేసుకుని, ప్రభావాలను వెదికే పద్ధతి అలవాటు ఉండదు. వీళ్లకు అప్పుడప్పడు కింద అంతస్తులో వారితో సంబంధాలు ఉంటాయి. కానీ, ఆ సంబంధంలో సైన్సుమాత్రం ఉండదు. జరిగేదంతా సైనే్స అయినా అదింకా సైన్సుగా కనబడదు! సైన్సు భవనంలో కింద అంతస్తు చాలా పెద్దది. అది ఈ ప్రపంచమంత పెద్దది. ప్రపంచమే ఈ అంతస్తు. అందులో మనమంతా ఉన్నాము. మనకు సైన్సు అంటే తెలియదు. మనం, మన బతుకు సైన్సు అని తెలియదు. చెప్పడానికి ఎవరూ రారు. వచ్చినా సరైన మాటలు చెప్పరు. కనుక మనలో కొందరు సైన్స్ అనే మాట వినకుండానే, బతుకు సాగిస్తారు. కొందరు అనకుండా, అందరూ అనడం బాగుంటుందేమో! మీరింత వరకు ఈ వ్యాసాన్ని చదివారంటే, మీరు పై అంతస్తుల గురించి పట్టించుకుంటారనీ, అప్పుడప్పుడు మొత్తం భవనం గురించి పట్టించుకుంటారనీ అనవచ్చు. ‘పిల్లలు చదువుతారు’ అంటారు చాలామంది సైన్సు గురించి మాట్లాడుతూ! ‘మీరెందుకు చదవరు?’ అని వారిని ఎవరడగాలి?


నిద్ర లేచింది మొదలు మరునాడునిద్ర లేచేదాకా, బ్రతుకంతా సైన్సు. శరీరం, దాని పనితీరు, ఆరోగ్యం, అనారోగ్యం, అందుకు కారణాలు, అన్నీ సైన్సు. కూడూ, గూడూ, గుడ్డా, అంతా సైన్సు. అర్థమయితే, అందులో కొంత సాంకేతిక శాస్త్రం ఉంది. అదేదో కొత్త సంగతి కాదు. ఒక విషయం, లక్షణాలు, పరిస్థితులను తెలుసుకుంటే సైన్సు. దాన్ని వాడుకునేందుకు పద్ధతులను సిద్ధం చేస్తే, అది సాంకేతిక శాస్త్రం. ఇందులో యంత్రాలు, పరికరాలు, పద్ధతులూ మొదలయినవి ఉంటాయి. వాటికి ఆధారమయిన సమాచారమంతా సైన్సు. ప్రపంచమంతా సాంకేతిక ప్రపంచమయింది. లాట్రిన్ లేకున్నా సరేగాని, అందరిదగ్గరా సెల్‌ఫోన్‌లు మాత్రం ఉన్నాయని జనాభా లెక్కలవారు చెపుతున్నారు. ఫోన్, ఫ్యానూ, ఫ్రిజ్, కనీసం లైటు, లేకుంటే నూనె దీపం వీటన్నిటిలోనూ సాంకేతిక శాస్త్రం ఉంది. సైన్సు ఉంది. దీపం ఉంది చాలు.. అందులో సైన్సు నాకెందుకు? అని అనుకుంటే, అంతకన్నా అమాయకులు మరొకరు ఉండరు. చమురు దీపంలో ఒత్తి వెలిగిస్తే మండుతుంది. కిరసనాయిలు దీపంలో వత్తి మరోలాగ ఉండాలి. గుండ్రని లైటు బల్బులో వేడి కూడా పుడుతుంది. వేడెక్కని కరెంటు దీపాలున్నాయి. ఇలాంటి సంగతులు మీకు తెలిసే ఉంటాయి. అంటే మీకు సైన్సు తెలుసని అర్థం. అది సైన్సు అని మాత్రం తెలియదు. భవనం మొత్తం సైన్సు. కానీమధ్య అంతస్తులో ‘భట్టీ’ సైన్సు, పైన అంతస్తులో ‘గట్టి’ సైన్సు ఉన్నాయని అనుకుంటాము కొందరము. అసలు మన భవనం సైన్సు అని తెలియకుండానే బతుకుతాము మరికొందరము. అందుకే మనమధ్యకు సైన్సును తీసుకురావాలనుకుంటారు ‘పైవాళ్లు’. వాళ్ల సైన్సు మనకు అర్థం కాదు. మనకు తెలిసిన సైన్సు, మన అనుభవంలోకి వస్తున్న సైన్సు గురించి మనకు సూచన ఇస్తేచాలు. ఈ కింద అంతస్తులోని మన బ్రతుకులు మరింత బాగా నడుస్తాయి.


సైన్సు ఉందనీ, అందుకు సంబంధించి ఒక ఆలోచన పద్ధతి ఉందనీ, తెలియక మనమంతా ‘గుడ్డెద్దు చేలో పడ్డట్టు’ బతుకుతున్నాము. ఆలోచన తీరు కొంచెం మారితే, మనం చేసే పనుల అర్థం తెలుస్తుంది. పరిశీలన, ప్రయోగం, అనుభవాల ద్వారానే ప్రపంచంలోని పద్ధతులన్నీ నడిచాయి. ప్రమిదలో గ్యాసు నూనె అనే కిరసనాయిలును పోసి, దీపం వెలిగిస్తే, వత్తితో బాటు ప్రమిదంతా మండుతుంది. అయినా నేనలాగే చేస్తానంటే, అది సైంటిఫిక్ ఆలోచన కాదు. అలాంటి ఆలోచనలతో గుడిసె, ఇల్లు అంతా మండుతుంది. సైన్సునూ, దాని పద్ధతినీ పట్టించుకోని మన బతుకులు ఈ రకంగానే సాగుతున్నాయి. వ్యవసాయం, ఆరోగ్యం, సదుపాయాలు, వస్తువులు అన్నీ సైన్సులోంచి పుట్టి సాంకేతిక శాస్త్రం ద్వారా మనకు చేరుతున్నాయి. ఆ సంగతి తెలిసీ తెలియక, పట్టించుకోకుండానే వాటిని వాడుకుంటున్న మనకు పై అంతస్తులో వారు, సైన్సును పంచి పెడుతున్నామంటారు. ముందు బతుకును తాకిన సైన్సును అర్థం చేసుకుందాం. తర్వాత మిగతా సైన్సు కూడా అర్థమవుతుంది.

Wednesday, February 22, 2012

అవసరాలు - అపాయాలు

బాగా బతకడం అన్న మాటకు అర్థాలు మారిపోయినయి. కూడు, గుడ్డ, గూడూ సరిపోవు. మామూలు వాళ్ళమని అనుకుంటున్న వారలము కూడా ఫ్యాన్ కావాలి, ఫోన్ కొనాలి అనుకుంటున్నాము. వీలయితే బైకు ఉండాలి. లేకున్నా బస్ ఎక్కి ఎక్కడికో వెళ్లాలి. ఈ మాటలను ఇలా పొడిగించుకుంటూ పోతే చివరికి ఒక సంగతి తేలుతుంది. అందరూ ఏదో ఒక రకంగా ఇంధన శక్తిని వాడుతున్నారు. కలిగినవారయితే పవర్‌ను అన్యాయంగా వాడి ఆడుకుంటున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఇంధనం సరిపోవడం లేదు. అందరికీ అన్ని సదుపాయాలు అందాలనుకుంటే ఇంతకు పది రెట్లు వనరులు అందుబాటులోకి రావాలి.

సాంకేతిక పద్ధతులు రాను రాను పల్లెలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. అంతా యంత్రాలతోనే నడిచే రోజు ఎంతో దూరం లేదు. దీనికంతా సరిపడే పవర్, ఇంధనశక్తి ఎక్కడ నుంచి రావాలి? పెట్రోలియం లాంటి శిలాజ ఇంధనాలు తరిగిపోతున్నాయి. వాటివల్ల ప్రపంచమే వేడెక్కి, పరిస్థితి మారిపోతున్నది. అందరూ ప్రత్యామ్నాయాలంటూ సౌరశక్తి, గాలిమరల వంటి వేరే పద్ధతులను వాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు రహస్యం ఏమిటంటే... ఈ ప్రత్యామ్నాయ ఇంధనాలవల్ల కూడా ప్రకృతి మీద చెడు ప్రభావాలు ఉంటాయి.


‘పెద్ద గీత-చిన్నగీత’ పద్ధతిలో రాక్షసిలాగా పెట్రోలియం కాలుష్యం ప్రభావాలు కనబడుతున్నాయి. వాటిముందు మిగతా ఇంధనాల వల్ల కలిగే కష్టనష్టాలు చిన్నవిగా, తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ రకం ఇంధనాల నుంచి వచ్చే శక్తిని ఇంకా ‘క్లీన్ ఎనర్జీ’ అంటున్నారు. కానీ వాటినింకా ఎక్కువగా వాడవలసిన పరిస్థితి గనుక, రాను రాను వాటి ప్రభావం గురించి కూడా తెలియవస్తుంది. నిజానికి ఈ విషయాలను గురించిన పరిశోధనలు కూడా ఇంకా తొలి దశలోనే ఉన్నాయనాలి. అందరూ అణు విద్యుత్తు గురించి మాట్లాడుతున్నారు. కొందరు మాత్రం దాన్ని భూతంతో పోల్చి భయపెడుతున్నారు. అంతకన్నా చాలా పెద్ద భూతం, మనలను సగం మింగింది. కనుక అణు విద్యుత్తు మంచి పద్ధతిగానే చాలామందికి కనబడుతున్నది. అవసరం ముందు అపాయాలు తక్కువగా కనిపిస్తాయి మరి! అణువిద్యుత్తు మన ఇంధన సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని మాత్రం అందరికీ లోలోపల తెలిసి ఉంటుంది. తరగని ఇంధన వనరులను కూడా జాగ్రత్తగా వాడవలసి ఉంటుంది. వాటివల్ల కూడా ఏవో ప్రభావాలు ఉండనే ఉంటాయి. పెద్ద ఎత్తున వాడినప్పుడు మాత్రమే అవి ముందుకు వస్తాయని అంటున్నారు ఇంధన రంగంలోని అనుభవజ్ఞులు. ముందే జాగ్రత్తపడి, గాలి శక్తి లాంటి వనరులను తెలివిగా వాడుకుంటే మిగతా కారణాలవల్ల జరిగిన మార్పులను కూడా తిప్పికొట్టే వీలు ఉందని అంటున్నారు. ఇంధనాలు వాడి సౌకర్యాలు పొందడం గురించి ఈమధ్య ఆసక్తికరమయిన సంగతులు తెలుస్తున్నాయి. ఇంధన శక్తిని ఏ ఉపయోగానికి వాడినా అందులోనుంచి కొంత వేడి పుడుతుంది. అది మరో రకంగా వాడడానికి వీలుగానిది అంటే వ్యర్థమవుతుందని అర్థం. సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లు బాగా పెరుగుతున్నాయి. వాటిలోనుంచి వేడి పుడుతుందని తెలుసు. ముందు ఫోన్, కంప్యూటర్‌లోని లోపలి భాగాలు మాత్రమే వేడవుతాయి. ఆ వేడి మనకు అసౌకర్యంగా కనిపించదు. కానీ అది కూడా చివరకు వాతావరణంలోకి చేరుతుంది. వాటిలోనుంచి మరింత శక్తి విద్యుదయస్కాంత తరంగాలుగా మారుతుంది. ఈ తరంగాలు కూడా ఎక్కడోఒకచోట వేడిగా మారుతాయి. వెలుగు కోసం బల్బు వెలిగినా, గాలి కోసం పంఖా తిరిగినా, మరే పరికరాన్ని వాడినా కావలసినంత వేడి పుడుతుంది. చిన్నా, పెద్దా యంత్రాలు అన్నింటినూ ఊహించి, వాటివల్ల భూ వాతావరణం ఎంత వేడెక్కుతున్నదో ఊహించవచ్చు.


మనుషులంతా కలిసి ఒక క్షణంలో పదహారు టెరావాట్ల విద్యుత్తును వాడుతున్నాము. విచిత్రంగా అంతే సమయంలో సూర్యుని నుంచి 1,20,000 టెరావాట్ల సౌరశక్తి భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ లెక్క ఎంత శక్తి వచ్చింది, ఎంత తిరిగి వెళ్లిపోయింది అనే వివరాల మీద ఆధారపడి ఉంటుంది. వాతావరణంలోకి వచ్చినంత వేడి తిరిగి బయటకు కూడా పోతుంటే, లోపల స్థితి సమతూకంలో ఉంటుంది. ఒకవేళ తేడా వచ్చి వాతావరణం వేడెక్కితే సమతూకం వచ్చేదాకా, వేడిమి వెలుపలికి పంపే పద్ధతి మొదలవుతుది కానీ, సమతూకం కొంత ఎక్కువ వేడి దగ్గర కుదురుకుంటుంది. గడచిన వేల సంవత్సరాలుగా ఈ తంతు జరుగుతూనే వుంది. అయినా వాతావరణం మాత్రం చెప్పుకోదగినంత వేడెక్కలేదు. ప్రస్తుతం మాత్రం గ్రీన్ హౌస్ గ్యాస్‌ల కారణంగా వేడి పెరుగుతున్నది. కారణంగా వచ్చే వేడికన్నా 380 టెరావాట్లు తక్కువ వేడి వెలికి పోతున్నది అంటే భూవాతావరణం వేడెక్కుతున్నదని అర్థం!


ఈ లెక్కతో పోలిస్తే, మనుషులు తమ సదుపాయాల పేరున పుట్టిస్తున్న 16 టెరావాట్ల వేడిమి మరీ అంత ఎక్కువ కాదు కానీ, రాను రాను ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. మనుషులు అయిదువేల టెరావాట్లు విద్యుత్తు వాడే రోజు త్వరలోనే వస్తుంది. అప్పటికి వాతావరణం మరో మూడు డిగ్రీల వేడి ఎక్కువవుతుందని లెక్క తేల్చారు!


కార్బన్‌డై ఆక్సైడ్ కారణంగా పుట్టే వేడి తన దారిని తాను వాతావరణాన్ని వేడెక్కించి సమస్యను మరింత పెంచుతుంది. ఆ వేడి వేరుగా ఉందని మనం గుర్తుంచుకోవాలి. ఈ లెక్కలు చేసిన చైసన్ అనే పరిశోధకుడు, ‘ఇవన్నీ తప్పు అని ఎవరైనా రుజువుచేస్తే బాగుండును. నావన్నీ కాకిలెక్కలే అంటే బాగుండును’ అని చమత్కరించాడు. సైన్సులో ఇదేమంత గొప్ప జోక్ కాదు. కానీ చైసన్ లెక్కలను ఇప్పటివరకూ ఎవరు ‘తప్పు’ అనలేదు.


మరైతే మనిషి ఇంధనశక్తి వాడకం తగ్గించాలా? అన్నది ప్రశ్న. ఆ అవసరం లేదుగానీ శక్తి ఎక్కడనుంచి వస్తుందన్నది ముఖ్యమంటున్నారు పరిశోధకులు. సౌరశక్తి కాక మరే వనరులయినా అదనపు నష్టాన్ని కలిగిస్తాయి. ఎండ ఏదో ఒక రకంగా వేడిని పుట్టించక మానదు. ఎండ కారణంగా వచ్చే గాలి, జల విద్యుత్తు, అలల నుంచి శక్తి కూడా సౌరశక్తికి సంబంధించినవే. కనుక వాటివల్ల నష్టం లేదని అంటారు చైసన్. ఈయన ప్రఖ్యాత పరిశోధకుడు, రచయిత కార్ల్ సేగన్ శిష్యుడు. సేగన్ కూడా ఇదే దారిలో మాట్లాడేవారు. అంతరిక్షంలో సోలార్ ఎనర్జీ పుట్టించడం కూడా అదనపు వేడికి దారితీస్తుందని ఆయన అనేవారు. అవసరాలకు, అపాయాలకు సరైన చోటిచ్చి గుర్తించాలని వీళ్ల వాదం.

Tuesday, February 7, 2012

ప్రొఫెసర్ నాయుడమ్మ - పుస్తకం


విశిష్టం.. శాస్తజ్ఞ్రుడి జీవన చిత్రం

డా.వై.నాయుడమ్మ
రచన: డా. సోమరాజు సుశీల
సి.పి.బ్రౌన్ అకాడమి 53,
నాగార్జునహిల్స్,
పంజగుట్ట, హైదరాబాద్-82
పేజీలు: 134;

వెల: రూ.95/-


సి.పి.బ్రౌన్ అకాడమీవారు విరివిగా చేస్తున్న పుస్తక ప్రచురణలో 25కు పైగా పుస్తకాలు వివిధ రంగాలకు చెందిన మహనీయుల జీవిత చిత్రాలు. వాటిలో ఒక సైంటిస్టు గురించి వచ్చిన పుస్తకం ఇదేననవచ్చు. నాయుడమ్మగారు కేవలం ఒక సైంటిస్టు కాదు. గొప్ప మానవతావాది. అట్టడుగు వర్గాల మేలుకొరకు పాటుపడిన ఆదర్శమూర్తి. ఈ ప్రపంచంలో చాలా కొద్దిమంది జీవితాలు మాత్రమే అందరూ అనుసరించవలసిన బాటలుగా సాగుతాయి. అటువంటి అరుదయిన వ్యక్తులలో నాయుడమ్మగారి పేరు ముందు వస్తుంది.


‘నేను పుట్టుకతో రైతును! వృత్తిద్వారా అంటరాని వాడిని, రెండింటి గురించి నేను చాలా గర్వపడతాను!’ అన్నారు డాక్టర్ యెలవర్తి నాయుడమ్మ. ఆయన తమ పరిశోధనకొరకు ఎంచుకున్న రంగం తోలు పరిశ్రమ. ఎన్ని రకాల పదవులు, అవకాశాలు వచ్చినా ఆయన ఈ రంగాన్ని మాత్రం వదలలేదు. భారతదేశంలో శాస్త్ర పరిశోధనలు, మామూలు ప్రజలకు పనికివచ్చేలా సాగవు. నిజానికి అవి ఎవరికీ పనికిరావు అన్న విమర్శ ఉంది. వౌలిక పరిశోధనలు కొంతవరకు ఆ రకంగా ఉంటే ఉండవచ్చు. వ్యవసాయం, ఆరోగ్యం, పరిశ్రమల విషయంలో మన దేశంలో జరిగిన పరిశ్రమ మామూలువారికి కూడా అందుబాటులోకి వచ్చే విప్లవాలకు కారణమని చాలామంది గమనించరు. నాయుడమ్మగారి నేతృత్వంలో దేశంలో జరిగిన ‘తోలు’ గురించిన పరిశోధనకు ప్రపంచస్థాయిలో ఎంతో గుర్తింపు ఉంది. అంతేగాదు బడుగు చర్మకారులకు సాయపడింది!


నాయుడమ్మగారి జీవిత చిత్రాన్ని డా.సోమరాజు సుశీలగారు రాయడం ఎంతో ఉచితంగా ఉంది. ఆమె నాయుడమ్మగారిని స్వయంగా ఎరిగినవారు. నాయుడమ్మగారి పరిశోధనలు, నిర్వహణ విధానాలవల్ల లాభపడినవారు కూడా. అందుకే, స్వయంగా కెమిస్ట్రీ పరిశోధకులయిన సుశీలగారు నాయుడమ్మగారి పరిశోధనల గురించి, దేశంలో సైన్సు, పరిశోధన, సంస్థలు, పరిశ్రమల గురించి బాగా రాయగలిగారు.


నాయుడమ్మగారు మద్రాసులోని చర్మ పరిశోధన సంస్థలో తమ కృషిని ప్రారంభించి, ఆ సంస్థకు నిర్దేశకులయ్యారు. భారతదేశంలో చర్మ పరిశ్రమకు కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. శాస్త్ర, సాంకేతిక పరిశోధనలను నడిపించే సి.ఎస్.ఐ.ఆర్‌కు ఆయన డైరెక్టర్ జనరల్ అయ్యారు. ‘నేను రిటైర్‌మెంట్‌దాకా ఆ పదవిలో ఉండను. అయిదు సంవత్సరాల తర్వాత వచ్చి, నా పరిశోధన చేసుకుంటాను, మీకు అంగీకారమయితేనే వస్తాను!’ అని దేశ ప్రధానమంత్రికే సూటిగా చెప్పగలిగారు నాయుడమ్మ. ఆయనకు తమ పరిశోధన మీద గల అంకితభావం, అక్కడ ప్రపంచానికి కనబడుతుంది. నిర్వహణదక్షుడయిన నాయుడమ్మగారు, చర్మ పరిశోధన సంస్థలో ఒక ఎకనామిక్స్ శాఖను కూడా ఏర్పాటుచేసి, పరిశోధనలను వాడడం వేపు చూసిన దృష్టి ఆశ్చర్యం కలిగిస్తుంది.
‘కాయబోయే కాయలకన్నా, పండిన ఫలాలను పంపిణీ చేయడంపై ఆయన దృష్టి ఉండేదని’ సుశీలగారు రాశారు. అన్ని రంగాలలోనూ ఈ రకం ఆలోచన ధోరణి కొంత ఉన్నా, దేశం ప్రపంచం ఎంతో బాగుపడతాయి.


నాయుడమ్మగారిని ప్రఖ్యాత జెఎన్‌టియుకు వైస్ ఛాన్సలర్‌గా ఏరికోరి నియమించారు. అక్కడ తనకు కుదరదని, ఆయన తిరిగి పరిశోధనలోకి వచ్చేశారు. ప్రతి అనామకుడూ అధికారంకొరకు పాకులాడుతుండడం అందరికీ తెలిసిందే.
ఈ పుస్తకంలో నాయుడమ్మగారు తమ కార్యదర్శులకు రాసి ఇచ్చిన పనె్నండు సూత్రాలు, అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌కు రాసిన లేఖ లాంటి కొన్నింటిని అనువదించి పొందుపరిచారు. నాయుడమ్మగారు అమలుచేసిన కరీంనగర్ ప్రాజెక్టు వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిని, మొత్తంమీద ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి. చేతనయితే దీన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేయించి దేశంలోని శాస్త్ర పరిశోధకులందరికీ అందజేయాలి!


కేవలం రెండుమూడు గంటలు మాట్లాడినంత మాత్రాన, ఒక వ్యక్తి జీవితమంతా గుర్తున్నారంటే, ఆ వ్యక్తి నిజంగా ఆదర్శమూర్తి. అటువంటి అనుభవం ఈ సమీక్షకునికి మిగిలించారు నాయుడమ్మగారు. ఆంగ్ల చిత్రాల నటుడు గ్రెగరీపెక్ లాగ కనిపించే నాయుడమ్మగారు, ‘ఫీడ్, ఫాడర్, ఫెర్టిలైజర్’ అనేవి మూడు కుదిరితే ఆంధ్ర దేశం మరింత ముందుకు సాగుతుందని రేడియో పరిచయంలో చెప్పిన మాటలు యింకా చెవుల్లో గింగురుమంటున్నాయి
.
హాస్యప్రియులు, జీవితాన్ని ప్రేమించిన వ్యక్తిఅయిన నాయుడమ్మగారి ఆసక్తికరమయిన జీవితానికి ఈ పుస్తకం ‘కొండను అద్దంలో చూపించే’ ప్రయత్నం. అయినా జీవన చిత్రంలో ఉండవలసినవన్నీ ఇందులో ఉన్నాయి. కనుక, ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి. అందరిచేత చదివింపజేయాలి.

Monday, February 6, 2012

అంతరిక్షంలో కొవ్వొత్తి వెలిగిస్తే మండుతుందా?


అంతరిక్షంలో కొవ్వొత్తి వెలిగిస్తే మండుతుందా?


ఒక అబ్బాయి మందుల కంపెనీ రిప్రెజెంటేటివ్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్ళాడు. అక్కడ అతడిని భూమి నుంచి చంద్రుడు ఎంత దూరం? అని అడిగారు. ‘ఏమండీ మన మందులు చంద్రునిమీద కూడా అమ్ముతారా?’ అని గడుసుగా ఎదురుప్రశ్న వేశాడు అబ్బాయి. అంతరిక్షంలో చీకటి ఉంటుందా? అక్కడ కొవ్వొత్తి ఉంటుందా? వెలిగిస్తే మండుతుందా? ఇలాంటి ప్రశ్నలు పుట్టిన బుర్ర గొప్పది! ప్రశ్నలకు జవాబులు ఆలోచించిన బుర్రలు అంతకన్నా గొప్పవి. ఈ రకం సంగతులను కూడా చదవాలనుకునే బుర్రలు మరింత గొప్పవి!


ముందుగా అంతరిక్షంలోకి మనుషులు లేకుండానే నౌకలను పంపారు. అందులో మన వాతావరణంలోలాగా అన్ని వాయువులు కలిపిన గాలికి బదులు, అంతా ప్రాణవాయువే ఉంటే ఎలాగుంటుందని చూడదలుచుకున్నారు. ఆక్సిజన్‌తో అగ్ని ప్రమాదాలు జరుగుతాయని అనుమానం వచ్చింది. అందుకే అక్కడ కొవ్వొత్తి వెలిగించి చూశారు. నిజంగా కొవ్వొత్తి మంటా? లేక మరో మంటనా? అన్న ప్రశ్నను పక్కన ఉంచితే, అంతరిక్షంలో మంట తన కారణంగా తాను ఆరిపోతుందని అర్థం చేసుకున్నారు!

కొవ్వొత్తి వెలిగిస్తే, వెలుగు, వేడి, కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి పుడతాయి. వేడివల్ల అవి వ్యాకోచం చెందుతాయి. అంటే వాటి సాంద్రత (చిక్కదనం) తగ్గుతుంది. కనుక అవి తేలికయి పైవేపు బయలుదేరతాయి. కనుక మంట పైకి సాగుతుంది. ఎక్కువ సాంద్రతగల గాలిలోనుంచి ఆక్సిజన్ తక్కువ సాంద్రతలోకి ప్రవహిస్తుంది. మంట కొనసాగుతుంది. సాంద్రతలో తేడావచ్చి మంట పైకి సాగడానికి ముఖ్యకారణం భూమిక గల గురుత్వాకర్షణ శక్తి, అంతరిక్షంలో ఈ లక్షణం ఉండదు. అందుకే అక్కడ బరువు తెలియదు. కనుక సీఓటూ, నీటి ఆవిరులు పైకి పోకుండా మంట చుట్టూ జమగూడుకుంటాయి. ఆక్సిజన్‌ను అడ్డుకుంటాయి. మంట ఆరిపోతుంది.
గురుత్వాకర్షణలేని వాతావరణం లో మంట కొనసాగాలంటే, అందులోకి ఆగకుండా ఆక్సిజన్ పంపుతూ ఉండాలి. లేదా వత్తిలో నూనెలాగా డిఫ్యూజన్ అనే పద్ధతిలో వాయువు అందాలి. గాలి కదలకుండా ఉండి కూడా గదిలో సువాసనలు వ్యాపించే పద్ధతి ఇది. వాసన గాలిలో కలిసి అంతటా సమంగా వ్యాపించే ప్రయ త్నం చేస్తుంది. కానీ ఈ పని చాలా నెమ్మదిగా సాగుతుంది గనుక మంట ను నిలబెట్టజాలదు.

అంతరిక్ష నౌకలో మంటలు రేగుతాయన్న అనుమానంతో ఈ ప్రయో గం జరిగింది. కానీ 1967లో అపోలో-1లో మంటలు రేగాయి. ముగ్గురు వ్యోమగాములు మరణించారు. అదెట్లా? అని అనుమానం కలిగింది కదూ! ప్రమాదం జరిగినపుడు నౌక ఇంకా భూమిమీదనే ఉంది మరి! ఆ ప్రమాదం అంతరిక్షంలో జరిగే అవకాశం లేదు

.

మందులకు లొంగని క్షయ

ఇది ఆంద్రభూమిలో వచ్చిన నావ్యాసం


పెద్దిగా చూడడానికి చిత్రం మీద క్లిక్ చేయండి

Saturday, February 4, 2012

నీరు - విశేషాలు


* భూమి మీద నీరున్నందుకే జీవం ఉంది. మనం ఉన్నాము. నీటి లక్షణాలు చిత్రమయినవి.

*మానవ శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. యుక్తవయసుగల స్ర్తి, పురుషుల శరీరంలో శరీరం బరువులో 55 శాతం, 60 శాతం నీరు ఉంటుంది. అమ్మాయిల శరీరంలో కొవ్వు పదార్థం ఎక్కువ గనుక కొంత నీరు తక్కువగా ఉంటుంది.

* నీటి శాతం: స్ర్తిలు 55 శాతం పురుషులు 60 శాతం, శిశువులు 78 శాతం, క్రీడాకారులు 60-65 శాతం.

* ఒక్క టెన్నిస్ క్రీడాకారుని శరీరం నుంచి గంటకు 10 నుంచి 11 కప్పులు చెమట రావడంలో వింత లేదు!

* నీరు తాగకుండా ఒక మనిషి 7రోజులవరకు బతకవచ్చునంటున్నారు.

* తిండి లేకుండా నెల రోజులు కూడా మనం ఉండగలుగుతాము.

* మనిషి మెదడు 70 శాతం నీటితోనే నిండి ఉంటుంది. అంటే నీరు వేరుగా మాత్రం ఉండదు మరి!

*ఎండ బాగా ఉండే రోజున ఒంటె 53 గాలన్ల నీరు తాగగలుగుతుంది.

* ఒంటె తాగిన నీరు దాని రక్తంలో ఉంటుంది. మూపురంలో మాత్రం కాదు.

*వాన నీటి చుక్కలు 2-3 మి.మీ దాకా ఉంటాయి. గాలి తాకిడి ఎక్కువయితే అవి చిన్న చుక్కలుగా విడిపోతాయి.

*ఈ ప్రపంచంలో 88.4 కోట్లమందికి తాగడానికి మంచినీరు అందడంలేదు!

*వ్యర్థం: మీ ఇంట్లోగానీ, మరోచోటగానీ కుళాయి నుంచి సెకండుకు ఒక చుక్క ప్రకారం నీరు లీక్ అవుతున్నదనుకోండి. ఒక సంవత్సరంలో 2,642 గాలన్ల నీరు వ్యర్థంగా పోతుంది!

Saturday, January 21, 2012

మన గురించి మనం - 5


కలలాంటి బతుకు! బతుకులాంటి కల!
ఏది నిజం? ఏది కల?
ఎక్కడుంది తేడా?
గిల్లుకుంటే లాభం లేదు.

నిద్ర నిజం. కల నిజం. కలలో సంగతి మాత్రం కల. అంటే అబద్ధం అని అర్థం.
బతుకు నిజం. ఇవాళ నిజం. అన్నం నిజం. పోనీ ఇడ్లీ నిజం.
తిండి, నిద్రకన్నా నిజమయిన సంగతులు ఉండవు కదూ!
వాటిని మనం ఎన్నడూ మరిచిపోము. అవి మరి బతుకుకు ఎంతో ముఖ్యం. అవే బతుకు, అనేంత ముఖ్యం. ఆలోచించండి. పని జరగనీ, జరగకపోనీ, సాపాటు జరగవలసిందే. వద్దన్నా నిద్ర ముంచుకు వస్తుంది. ఇంట్లో, వంట్లో సుఖంగా ఉండనీ ఉండకపోనీ సాపాటు జరగవలసిందే. ఆలోచించారా. అంతా మామూలుగా ఉంటే అన్నం తినవచ్చు. ఏ కొంచెం అనారోగ్యమయినా అన్నం పనికిరాదు. రొట్టె కావాలి. పండ్లు కావాలి. పాలు మాత్రం తాగవచ్చు. నాకు పాలు ఇష్టం ఉండవు. కనుక జ్వరం వస్తే రుచిగా ఏదన్నా తాగ వచ్చని ఎదురుచూపులు. పండ్ల రసం కావాలి. బాగుందా ఇష్టమయిన పండ్ల రసం కావాలంటే జ్వరం రావాలి.

శవం పక్కన ఉన్నా సరే, కాఫీ కావాలి.
ప్రాణం పోతున్నా సరే. పాలు కావాలి.
శవం పక్కన ఉండగా హాయిగాపడుకుని రావలసినవారెవరో వచ్చిన తరువాత తగిన ఏర్పాట్లు చేయడం కొత్తగాదు కదా. తగిన ఏర్పాట్లలో తిండి నిద్ర అన్నిటికన్నా ముందుంటాయి.
నిత్యమూ నిద్ర తప్పదు. నిత్యమూ తిండి తప్పదు. అవి మన బతుకులకు పునాదులని మనం గట్టిగా నమ్ముతున్నాం మరి.

తిండి నిద్రలలాగే నిత్యం ఆలోచన, సమీక్ష అవసరమని అనుకోగలమేమో గమనించండి.
ఏం చేశాము? ఏం చేయాలి? ఏమనుకుంటున్నాము? ఏం జరుగుతున్నది? తేడా ఎక్కడున్నది? నిత్యం కనీసం నాలుగు నిమిషాలు ఆలోచించే ఓపిక తీరిక ఉన్నాయా?
అవి మన బతుకులకు అవసరం గాదా? ఆలోచన లేకుండా బతకవచ్చా? బతికితే ఎంత కాలం?
తిండికి నిద్రకు ఎన్ని ప్రయాసలు పడి ఏర్పాట్లు చేసుకుంటున్నాము? బతుకంతా మంచి తిండి, సుఖంగా నిద్ర అందాలనిగదా మిగతా ప్రయత్నాలన్నీనూ? అదేపద్ధతో ఆలోచన అవగాహన కూడా అవసరమనుకుంటే ఎంత బాగుంటుంది!
బతుకు ప్రయాణంలో గమ్యం ముఖ్యమా తతంగం ముఖ్యమా ఆలోచించాలిగదా!
కల నిజమా నిజం కలలాగ ఉందా అర్థం చేసుకోవాలి గదా!
ఇదంతా ఆలోచన లేకుండా వీలవుతుందా?
ఈ ఆలోచన కలిగిన తరువాత, నమ్మండి, నిద్ర పట్టదు, తిండి సయించదు. వాటిప్రాముఖ్యం తెలుస్తుంది. తగ్గుతుంది, కనీసం. వాటిని వదలాలని ఎక్కడా లేదు. వాటినే పట్టుకుని వేలాడాలని కూడా లేదు. అదీ సంగతి.

ఈ ఆలోచన అలవాటుగా మారితే అవగాహనలు మారుతాయి.దానితో ఆశయాలు మారి, అప్పుడు మన ప్రవర్తనలూ మారుతాయి.
మార్పు జరగాలంటే ఆలోచన ప్రారంభం. అది లేనిదే బతుకు బండి నడక మారదు. ఎంత చదివినా ఎన్ని విన్నా చివరకు ఆలోచన జరగకుంటే అంతా దండగేకదా. మన అలోచన లేక అవగాహన ఎంత చదివినా మారదు కదా.

పిల్లలుగా ఉన్నప్పుడు ఆలోచన లేదు. యువవయసులో ఆలోచనల దారి వేరు. ఆ తరువాత బతుకు బండి చక్రాల కింద నలగడం తప్ప మరో ఆలోచనే రాదు. కనుక ఆలోచన అలవాటుగా మారాలి.

ఈ ప్రయాణం మరింత మంచి గమ్యానికి దారి తీయాలి. అసలు ప్రయాణమే బాగుండాలి. మొదలు, మధ్య బాగుంటే చివర సంగతి పట్టదు. గుర్తించగలిగారా ఈ విషయాన్ని
బతుకు తతంగం, అదే బతుకు బండి నడిచే తీరు, దారి, ముఖ్యంగా అవి బాగుండాలి.
ఇవాళకన్నా రేపు బాగుండాలి. నిన్నటికన్నాఇవాళ బాగుండాలి.
అనుకుంటే బాగుంటుందా?
నిత్యం చేసే పనులే చేస్తే, నిత్యం ఉండేట్టే ఇవాళా ఉంటుంది. అవునంటారా
మరి మార్పు రావాలంటే ఆలోచన కావాలి గదా!
ఆలోచించండి.

Saturday, January 14, 2012

మబ్బులొచ్చినయ్!


*తేమగా ఉండే గాలి వెచ్చగా కూడా ఉంటే ఎత్తులకు చేరుతుంది. అక్కడ చల్లదనం ఉంటుంది.

*ఆ కారణంగా తేమ దుమ్ము, బూడిద, సూక్ష్మజీవుల వంటి పదార్థాల మీద చేరి దట్టంగా మారుతుంది. నీరు పdలస్ ఆధారం (దీన్ని సీడ్ లేదా విత్తనం అంటారు) ప్లస్ పైపైకి లాగే శక్తి కలిస్తే మేఘం లేదా మబ్బుపుడుతుంది.

*నీరు లేదా తేమ ఎక్కువగా ఉంది. సీడ్స్ మాత్రం తక్కువగా ఉన్నాయి. అప్పటికే తయారయిన మంచు కణాలుకూడా సీడ్‌గా పనిచేస్తాయి. ఒకేచోట తేమ సమకూరిన కొద్దీ, పైకి లాగే శక్తికి వీలుగానంత బరువుగా మారతాయి నీటి చుక్కలు. అంటే, అవిక కిందికి వర్షంగా పడక తప్పదు!

*మబ్బులు మరీ ఎక్కువగా ఉంటే, వేడిమీ ఈ లోపలే చిక్కుబడి వాతావరణం వేడెక్కుతుంది!
*మబ్బులలో కొన్ని మరీ ముత్యాల్లా మెరిసిపోతుంటాయి. వాటిని ముత్యం మేఘాలనే అంటారు. వాటిలోని మంచు స్ఫటికాలు మరీ సన్నవిగా ఉంటాయి. వెలుగును మరింత ప్రతిఫలింపజేసినందుకు ఆ తళతళ కనబడుతుంది. ఈ రకం మబ్బులు 10నుంచి 15 మైళ్ల ఎత్తులో ఉంటాయి.

*ఈ ముత్యం మేఘాల కారణంగా, ఓజోన్ పొరకు నష్టం ఏర్పడుతుంది.

*వాతావరణంలో మబ్బులను పైకి లాగే శక్తికి సమంగా, గాలివాటూ కిందకు కూడా లాగుతుంటే మేఘాలు గుండ్రంగా కదులుతాయి. ఆ తరువాత తుఫానువచ్చే వీలుంటుంది. కానీ ఈ రకంగా రోల్ అయ్యే మేఘాలు ఎంతో అందంగా, ఆసక్తికరంగా కనబడతాయి.
*భూమి నుంచి 50 మైళ్ల ఎత్తున కూడా మబ్బులు ఏర్పడతాయి. రాత్రిపూట మెరుస్తుండే ఈ మబ్బులు నీలం కలిసిన తెలుపు రంగులో ఉంటాయి. ఇవి పగటి పూట కనబడవు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత, ఆ క్రింద నుంచి వచ్చే వెలుగులో ఇవి తళతళలాడతాయి.
*1853లో క్రకటోవా అగ్నిపర్వతం పేలిన తరువాత ఈరాత్రి మబ్బులు కనబడడం మొదలయింది.

*2010 జూన్‌లో, దక్షిణ డకోటా (యు.ఎస్)లో వడగళ్ళవాన కురిసింది. అంతగా పెద్ద వడగళ్లు ముందెన్నడూ కురవలేదు. అప్పుడు పడ్డ ఒక మంచు ముద్ద రెండు పౌండ్ల బరువుంది. ఫుట్‌బాల్ కన్నా కొంచెం పెద్దదిగా ఉందది!

*ఎత్తులో మేఘాలుండేచోట, గాలివాటు, ఒత్తిడి విచిత్రంగా ఉంటాయి. 2007లో జర్మన్ పారాగ్లైడింగ్ చాంపియన్ ఈవా విస్నియేర్స్‌కా గ్లైడింగ్ చేస్తూ క్యుములోనింబస్ మబ్బులకు దగ్గరగా ఎగిరింది. గాలి ఆమెను 32,000 అడుగుల ఎత్తుకు లాక్కుపోయింది. ఆక్సిజన్ అందకుండా పోయినందుకు ఆమె మూర్ఛపోయింది. 23,000 అడుగుల ఎత్తున ఆమెకు తిరిగి తెలివి వచ్చింది!

*క్యుములోనింబస్ మేఘాలు తక్కువ ఎత్తులో ఉంటాయి. వాటి చుట్టు గాలివాటం చెప్పరాని రకంగా క్షణానికొక తీరుగా మారుతుంటాయి. సాధారణంగా విమానం పైలట్లు అందుకే ఈ రకం మేఘాలగుండా ప్రయాణించడానికి ఇష్టపడరు!

*నిజానికి విమానాలు వాటికన్నా ఎత్తులో ఎగురుతుంటాయి!