Showing posts with label వ్యాసం.. Show all posts
Showing posts with label వ్యాసం.. Show all posts

Saturday, September 24, 2016

నిప్పు చెప్పే నిజాలు




నిప్పు జీవంగలది. అది శ్వాసిస్తుంది, అందిన దాన్ని తింటుంది, అసహ్యించుకుంటుంది. మంటను గెలవాలంటే మనమూ దానిలాగే మెలగాలి. దానిలాగే ఎటుపడితే అటు కదలాలి. మండే పదార్థాలు ఉన్నాయని మంటకు తెలియదు. మంట ఉందని మండే పదార్థాలకు తెలియదు. మంట, నిప్పు కలిసి మన ప్రపంచాన్ని మార్చేశాయి. ఒకానొక సినిమాలో ఒకానొక పాత్ర అన్న మాటల ఆధారంగా.
* * *
చుట్ట వెలిగించడానికి చెన్నయ్య చెకుముకి రాయి కొట్టేవాడు. పొయ్యి వెలిగించడానికి పెద్దమ్మ పక్కింటి నుంచి పిడక మీద నిప్పు తెచ్చేది. అప్పుడు అగ్గిపెట్టె, కిరోసిన్ నూనె వచ్చి పద్ధతి మార్చాయి. అగ్గిపుల్ల ఎక్కడ గీచినా మండేది. ఓ సినిమాలో క్రూరుడయిన విలన్ ఎదుటి వాడి బట్టబుర్ర మీద పుల్లగీరి దాంతో చుట్ట వెలిగించుకోవడం చూచాను. అది తెలుగు సినిమా మాత్రం కాదు. అగ్గి పుల్లలను అంత క్రూరంగా ఉండని పద్ధతికి మార్చి భద్రత గలవి అని పేరు కూడా పెట్టారు. అగ్గిపెట్టెల మీద సేఫ్టీ మ్యాచెస్ అని ఉంటుంది. కనీసం ఈసారయినా గమనించి చూడండి. అదీ మీకు అగ్గిపెట్టె దొరికితేనే. ఇక ఆ తర్వాత కరెంటు వచ్చి కాలానే్న మార్చింది. ఇప్పుడు నిప్పు, పొగ, వేడి ఏదీ లేకుండానే మైక్రోవేవ్‌లో వంట జరుగుతోంది. మంటలేదు గానీ వంట మాత్రం అలాగే ఉంది. ఇంతకూ వంట, మంట ఎప్పుడు మొదలయ్యాయనేది అసలు ప్రశ్న.
తొలి రోజుల్లో మనిషి తెచ్చుకున్న కాయలు, పళ్లు గానీ వేటాడిన జంతువును గానీ పచ్చిగానే తినేవాడు. కాల్చి తినడం ఆ తర్వాత అలవాటయింది. చిన్నప్పుడొక కథ విన్నట్లు గుర్తు. తెచ్చిన మాంసం లేదా జంతువు అలా ఉండగానే అనుకోకుండా ఒకసారి అగ్నిప్రమాదం జరిగిందట. మంట ఆరిన తర్వాత జంతువేమయిందో వెదుకుతూ మనిషి ఉడికిన మాంసంలో వేలు పెట్టాడు. చురుక్కుమంది. అనుకోకుండా వేలిని నోట్లో పెట్టుకున్నాడు. మాంసం రుచి మారింది. బాగుంది కూడా! అలా తిండిని కాల్చి తింటే బాగుంటుందని తెలుసుకున్నారంటారు. ఇలాంటి కథలు, కథలుగా కూడా నిజంగానే వినిపిస్తాయి. అప్పట్లో అంటే ఆదిమానవుని కాలంలో ఏం జరిగిందీ అన్నది ఊహించి చెప్పవలసిందే తప్ప అందుకు ఆధారాలు లేవు కదా! కనుక కథకూ, సత్యానికి మధ్యన అంత తేడా లేదు.
పది లక్షల సంవత్సరాల క్రితం ‘హోమో ఎరెక్టస్’ అనే నిటారుగా నిలబడిన మానవులు వంటకు, వెలుగుకు ఇతర అవసరాలకు మంటను వాడుకున్నారని ఒక వాదం. రెండు లక్షల సంవత్సరాలకు ముందు మానవుడు అగ్నిని తన అవసరాలకు వాడుకున్న గుర్తులేవీ, కనిపించడం లేదంటారు మరి కొందరు పరిశోధకులు. అంటే, అప్పటికి ‘హోమో సాపియోన్స్’ అనే మనలాంటి మనుషులు వచ్చేశారు. అంతకు ముందు మనుషులకు వంట తెలియదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆ ఆశ్చర్యాన్ని కొంచెం తగ్గించే ఆధారాలు కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాన్సులో దొరికాయి. 4,65,000 సంవత్సరాల నాటిదిగా గుర్తించిన ఒక మానవ ఆవాస ప్రదేశంలో పొయ్యిలా మండిన చోటు ఒకటి దొరికింది. లెక్కలో ఎంత తప్పు ఉన్నా 65 వేల సంవత్సరాలకన్నా అటూ ఇటూ కావడానికి వీలులేదంటున్నారు పరిశోధకులు. అంటే నాలుగు లక్షల ఏళ్లనాడే మనుషులు పొయ్యి పెట్టి వంట చేసుకున్నారని భావం. ఆ కాలానికి నేడున్న మనలాంటి మానవ జాతి ఆవిర్భవించలేదు. నిటారు మనుషుల కాలమే అది!
ఎలెక్ట్రాన్ స్పిన్ రెసొనాన్స్ అనే పద్ధతితో ఎక్కువ వేడయిన క్వార్ట్‌జ్ వయసు గుర్తించడం వీలవుతుంది. గులకరాళ్లు, మట్టిలో ఈ క్వార్ట్‌జ్ ఉంటుంది. పొయ్యిలో నుంచి రాళ్లను, మట్టిని తీసి చూస్తే అవి లక్షల ఏళ్ల నాటివని తెలిసింది. మొదటి పరిశీలనలోని రాళ్లు 3,80,000 సంవత్సరాల నాటివి. అక్కడే పురాతత్వ పరిశోధన కోసం జరిపిన తవ్వకాలలో మరింత లోతున మరో పొయ్యి కనిపించింది. అందులోని రాళ్లను పరీక్షిస్తే అవి 4,65,000 నాటివని తెలిసింది. అయితే మానవులు ఆ కాలంలోనే మంటను వాడుకున్నారని చెప్పడానికి ముందు పరిశోధకులు ఒకటి రెండు సంగతులను తేల్చి చెప్పాల్సి ఉంటుంది. అందులో ఒకటి కాలం నిర్ణయించడానికి వాడుతున్న డేటింగ్ పద్ధతుల్లో పొరపాటు లేదని, రెండవది పరీక్షించిన రాళ్లు నిజంగా ఒక ‘పొయ్యి’లోవని, ఏదోవేరు రకంగా గురయినవి కావని తేలాలి!
పరిశోధనలో ఎప్పటికీ పొరపాట్లే జరుగుతాయంటే అన్యాయం. అలాగని పొరపాటు జరగవనడానికి కూడా లేదు. ఇక్కడ మరొక కథ గుర్తుకు వస్తుంది. ఇద్దరు గప్పాల రాయుళ్లు ముచ్చటాడుతున్నారట. ‘మా ఇంట్లో బావి కోసం వంద అడుగులు తోడితే, ఆ లోతులో తీగలు దొరికినయి. అంటే వెనకట మనవారు టెలిఫోను వాడుకున్నారనే గదా అర్థం!’ అన్నాడు మొదటి గప్పాలాయన. రెండవ ఆయన అందుకుని ‘మా ఇంట్లో నిజానికి రెండు వందల అడుగులు తోడినా ఏ తీగా దొరకలేదు. అంటే అప్పట్లో వారు వైర్‌లెస్, సెల్‌ఫోన్ వాడుకున్నారనేగా అర్థం!’ అన్నాడు. ఫలితాలను అందుకోవడం ఒక ఎత్తు. వాటిని అన్వయించి చెప్పడం మరో ఎత్తు! వేడెక్కిన రాళ్ల వయసు నిర్ధారించడానికి వాడే పద్ధతి గట్టిదే. అయితే అందులో అయిదు లక్షలకన్నా ఎక్కువ సంవత్సరాల వివరాలు తెలియడం కష్టం. పరిశీలిస్తున్న ఈ రాళ్లు ఇంచుమించు పరీక్షా పద్ధతుల అంచులను తాకుతున్నాయి. అలాంటి ఫలితాలను నమ్మడం కొంచెం కష్టమే. అందుకే పరిశోధకులు రాళ్లను థర్మోల్యుమినిసెన్స్ అనే మరో పద్ధతిలో కూడా పరీక్షించే ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఒక సమస్య తీరుతుంది. సాధారణంగా ఏ విషయాన్నయినా అనుమానం లేకుండా నిర్ణయించాలంటే, ఒకటికన్నా ఎక్కువ పద్ధతులతో పరిశీలించడం, పరిశోధనలోనే కాదు, మన బతుకుల్లోనూ అలవాటే. డాక్టర్‌లు తాము చెప్పింది కాక, మరో డాక్టర్‌కు చూపించి మరో అభిప్రాయాన్ని తీసుకోవడం అనే ఒక పద్ధతి ఉండనే ఉన్నది కదా!
ఇక రెండవ సమస్య, రాళ్లు నిజంగా మనుషులు ఏర్పాటు చేసుకున్న నెగడు లేదా పొయ్యిలో నుంచి వచ్చినవేనా? లేక మనిషి ప్రమేయం లేకుండానే మంటకు గురయినవా? అడవులు తగలబడడం మామూలే. అది కాకున్నా ఒక ఎండిన చెట్టు తగలబడి ఉండవచ్చు. ఇటువంటి మంటకు, మనిషి వేసుకున్న పొయ్యి మంటకు తేడా తెలియడం కష్టం. అయితే ఫ్రాన్సు తవ్వకాల్లో దొరికిన పొయ్యిలు మాత్రం చాలాకాలంపాటు మండిన దాఖలాలున్నాయి. సహజంగా తగలబడిన వస్తువులేవీ ఇంతకాలం మండవు.
హోమో ఎరెక్టస్ కాలంలోనే మంటను, నిప్పును వాడుకున్నారనేది నిర్ణయమయితే మానవజాతి పరిణామ చరిత్ర కొంచెం మారుతుంది. నిప్పు, చక్రం, వ్యవసాయం మానవ జాతి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం గల అంశాలు. అవి మనిషికి బ్రతుకు నేర్పించాయి. నిప్పు నియంత్రణ జీవితానికి గుర్తు, చక్రం సాంకేతిక పరిజ్ఞానానికి, ప్రగతికి ఆధారం. వ్యవసాయం సాంఘిక పద్ధతికి సామూహిక జీవనానికి, అన్నిటికీ మించి ‘స్వంత’ భావానికి మొదలు, వంట స్వంతం. ఫలసాయం స్వంతం. అది తన వారికే అందాలి. అంటే ఇతరుల నుంచి కాపాడుకోవాలి. నిప్పు మాత్రం సంఘానికి గుర్తుగా ఉన్నాలేకున్నా స్వంతం కానవసరం లేదు.
మన గురించి మనం తెలుసుకోవడంలో ఒక వింత ఆనందం ఉంది. మానవులు ప్రస్తుతం ఈ రకంగానే ఎందుకున్నారని ప్రశ్నిస్తే, జవాబులందడానికి ఇటువంటి వివరాలు మరెన్నో తెలియాలి!
ఝలక్: నాన్న ఒక అనుభవం చెప్పేవాడు. కొత్తగా మంటినూనె వచ్చిన రోజులు. మంటి నూనె అంటే నేల నుంచి తీసిన నూనె. అదేమిటో మీకు అర్థమయి ఉండదు. పెట్రోలును భూమిలోనుంచి తీస్తారు. మంచి నూనెను నువ్వులు, పల్లీలు అనే వేరుశెనగలు లాంటి వృక్ష సంబంధ పదార్థాల నుంచి తీస్తారు. అంతకు ముందు తెలిసిన నూనెలన్నీ అంతే. ఎందుకోగానీ ఆముదాన్ని నూనె అనలేదు. అది వేరే కథ గానీ, కెరోసీన్ తెచ్చుకొని మా ఊళ్లో ఒకతను ఆముదం దీపం పద్ధతిలో మట్టి మూకుడులో పోసి వత్తి వేసి వెలిగించాడట. వత్తి ఒకటే కాదు, మొత్తం దీపమంతా వెలగడం మొదలయింది. గ్యాసు నూనె బుడ్డీ దీపాలు వడిన వాండ్లకు ఈ సంగతి తెలుస్తుంది. పాపం ఆ మనిషి పెట్టిన మంటతో పూరి గుడిసె అంటుకున్నది. తాగి ఉన్నాడేమో ఆర్పడం గురించి కూడా ఆలోచన రాలేదు. ఇంట్లోని డప్పు తెచ్చుకుని దరువు వాయిస్తూ ఆ మనిషి ఇంటి ముందు నాట్యం చేశాడట. నాన్న ఈ సంగతి నవ్వకుండా చెప్పేవాడు.

Tuesday, October 21, 2014

బీభత్స, వినోదాల మధ్యనే కదా జీవితం!

ఎప్పుడో రాసిన నా వ్యాసం ఇది.


జీవితం కష్టసుఖాలు కలగలసిన కాలక్రమం. మనుషులుగా మనం మాత్రం ప్రతినిత్యం ఈ సత్యాన్ని మరిచిపోవాలని ప్రయత్నం చేస్తుంటాం. కానీ ప్రకృతి మాత్రం తన ప్రకృతిని ప్రదర్శిస్తూనే ఉంటుంది. ‘‘ఈ ప్రకృతిని పూర్తిగా అర్థం చేసుకోవడంఅనుభవించడం వీలుగాదు’’ అన్నాడు డేవిడ్‌ థోరో. అలా అనుకోవడం తప్పులాగుంది. అందుకే ప్రకృతి తన తీరును మన ముందు ఉంచుతూ ఉంటుంది.

భూమి రకరకాలుగా మారి ఈనాటి రూపం పొందింది. దానిమీద వాతావరణం తయారయింది. నిప్పుదొరికి మన బతుకులను మార్చేసింది. నీరు మన ఉనికికే ఆధారంగా నిలబడి ఉంది. ఇలా మనల్నిఅంటే మానవజాతిని ముందుకు నడుపుతున్న ఈ శక్తులే ఒక్కోసారి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. భూమిదాన్ని ఆవరించుకుని ఉన్న తత్వాలు ఇలా విలయతాండవం చేసినప్పుడు మనుషులు ఒకసారి విస్తుపోయి ‘‘అవునుగదా!’’ అనుకుంటారు.

చరిత్రలోకథల్లోసాహిత్యంలో వైపరీత్యాల గురించి లెక్కలేనన్ని విశేషాలున్నాయి. అయినా అవన్నీ ఒకక్షణం పక్కన బెట్టి మనమంతా సరదాగామరో రోజు గురించిసంవత్సరం గురించి ఆలోచిస్తాం. అది సహజం. జీవితంలోని ఈ నాటకీయతఈ సంబరాలుభయాలు అన్నీ కలిస్తేనే అది అసలు సిసలయిన సత్యమవుతుంది.

చావు తప్పదు. అయినా దాన్ని గురించి ఆలోచించడమే తప్పనుకుంటాం. అపాయాలుఆపదలు తప్పవు. అయినా వాటి గురించి అనుకోకుండా ఉండడం అలావాటు చేసుకుంటాం.

గుజరాత్‌లో పొద్దున్నే జెండాకు దండం పెట్టడానికి బయలుదేరిన ఎంతోమంది పిల్లలు ఇంటికి తిరిగి రాలేదు. రావడానికి ఇల్లూ మిగలలేదు. వాళ్ళూ మిగలలేదు. జెండా పుణ్యమా అని కొందరు బ్రతికి బయటపడినవారు ఉన్నారు. ఇళ్ళు మాత్రం ఇసకలో కట్టిన పిచికగూళ్ళలా కుప్పకూలాయి.

టీవీలో మధ్యాహ్నం దాకా సంబరాలు చూసినవారుఆ తర్వాత సర్వనాశనమయిన పట్టణాలనుబతుకులనూ చూశారు. అప్పటిదాకా దేశభక్తిక్రమశిక్షణలతో ఉప్పొంగిన గుండెలు,ఒక్కసారిగా బరువెక్కాయి. అందరి మనసుల్లోనూ ఒకటే భావం! ఆ కూలిన ఇంటి ముందు నిలబడిదిగులుగా చూసే పరిస్థితి నాకే వచ్చి ఉంటేగుండె మరింత బరువవుతుంది.

ఆపదలు చెప్పిరావుప్రకృతి వైపరీత్యాలు అర్థం కావు. మానవులంతా బతుకుదెరువు పేరుతో అపాయాల్లోకి నడిచివస్తున్నారు. అందరూ ఒకే చోట గుమికూడుతున్నారు. గుజరాత్‌ భూకంపం మరీ పెద్దది. అందుకే పల్లెల్ని కూడా అది నేలమట్టం చేసింది. గుడిసెచిన్న ఇల్లు కూలితే అందులో ప్రమాదం తక్కువ. అందులో చిక్కుకున్న వాళ్ళను రక్షించడమూ సులభం! ఆరేడు అంతస్తులుగా ఇళ్ళు కట్టుకుని నగరాల్లో బ్రతుకుతున్నవారే ఈ భూకంపంలో ఎక్కువగా మరణించారునష్టపోయారన్నది మాత్రం నిజం.
మన దేశంలో రాజధానితో సహా ఎన్నో నగరాలుభూకంపాలకు గురయ్యే అవకాశం ఉందని తెలుసు. తుపానులువరదలు మొదలయిన బీభత్సాలకు నగరాలుజనావాసాలు గురవుతూనే ఉన్నాయి. అలాగని అందరూ ఆయా ప్రాంతాలను వదిలి వెళ్ళిపోతున్నారాకనీసం భయపడుతున్నారా?

ఇక్కడ నష్టం జరిగే వీలుందని తెలిసి కూడాచింతించకుండా ఉండిపోవడం రెండు కారణాల వల్ల జరుగుతుంది. ఒకటితప్పని పరిస్థితుల్లోఅంతకంటే మంచి అవకాశం లేకుంటే అక్కడే ఉండడం మంచిది. అపాయం వచ్చిననాడు చూడవచ్చు! రెండవదిఒక రకమయిన మొరటుబారిన బ్రతుకుతీరు. ‘‘మనకు గతం మంచి పాఠాలు నేర్చుకునే అలవాటులేదు’’ అంటారు గోల్డెన్‌.
ప్రమాదం జరిగితే వెంటనే పుట్టే ప్రశ్న ‘‘ఎందుకిలా జరిగిందీ?’’ అని. వైజ్ఞానికులు చాలా రకాల ప్రమాదాలకు కారణాలు చెప్పగలుగుతున్నారు. కొన్నింటిని ముందుగా సూచించగలుగుతున్నారు కూడా!

ఒకప్పుడు ప్రమాదాలు జరిగితేవివరాలు అంతగా తెలిసేవి కావు. సమాచారప్రసార సాధనాలు బాగా పరిణతి చెందిన ఈ రోజుల్లో ప్రమాదం తాలూకు వివరాలు క్షణాల మీద మన ముందు దర్శనమిస్తున్నాయి. ఒక్క క్షణం విస్తుపోయినా దూరం నుంచి చూసిన వారు మళ్ళీ రోజువారీ కార్యక్రమంలో మునిగిపోతారు. వార్తల ఛానల్స్‌ భూకంపం భీభత్సాన్ని చూపుతుంటేమిగతా ఛానల్స్‌ వినోదాన్ని చేటలతో చెరుగుతూనే ఉన్నాయి. జీవితమూ అంతే! మనంమనవారు కానంతవరకు ఫర్వాలేదు. అయితే ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన వారికి మాత్రంవెంటనే కొంతతర్వాత మరికొంతశాశ్వత ప్రాతిపదిక మీద ఇంకొంత సాయం అవసరం.


పట్టించుకోనివారు ఉన్నట్లేచేతనయినంత సాయం చేసేవారు కూడా ఉండడం గమనించదగింది. కాలం గడిస్తే 26 జనవరి భూకంపం చరిత్ర అవుతుంది. కొందరికి మాత్రం అది వ్యక్తి చరిత్రలో భాగమవుతుంది. వారి కోసం మనమేమి చేయగలం

Wednesday, July 4, 2012

పలచనవుతున్న విశ్వం

ఈ విశాల విశ్వంలో మనుషులనే మనం నిజంగా ఒంటరి జీవులం. బుద్ధిజీవులు మరెక్కడయినా ఉన్నారేమోనని వెతకడమే గానీ, ఎవరూ కనిపించడంలేదు. ఇదిలా ఉండగా- ఈ విశ్వం వేగంగా విస్తరిస్తున్నది. గెలాక్సీలు, నక్షత్రాలు మొదలయినవన్నీ ఒకదాన్నుంచి మరొకటి దూరంగా మరింత దూరంగా వెళ్లిపోతున్నాయి. మనం చూడగలిగిన ప్రాంతం కొంత మాత్రమే. 


వెలుగున్నంత దూరం వరకే కనబడుతుంది. విశ్వం వ్యాపించడం ఇట్లాగే కొనసాగితే కొంతకాలం తరువాత, మనకు కనిపించే ప్రాంతంలో ఖాళీ ఎక్కువ, నక్షత్రాలు తక్కువగా మిగులుతాయి. ఇంతకూ ఈ పరిస్థితి రేపెప్పుడో మాత్రం రావడంలేదని, అందుకు బిలియన్ల సంవత్సరాలు పడుతుందని గుర్తుంచుకోవాలి. కొన్ని పదుల బిలియన్ల సంవత్సరాలు సాగితే, మన చుట్టూ మరేవో కొన్ని గెలాక్సీలు మాత్రమే మిగులుతాయి. మిగతావన్నీ మనకు కనిపించని చీకటి ప్రాంతంలోకి వెళ్లిపోతాయి.
ఇదంతా జరగడానికి ఒక శక్తి కారణంగా ఉంది. దాన్ని డార్క్ ఎనర్జీ అంటారు. అంటే ఏమిటని? ఎవరైనా అడిగితే వెర్రిమొగమే సమాధానం. మహామహా పరిశోధకులకే ఈ శక్తి గురించి, దాని స్వభావం గురించి అర్థంకావడంలేదు. అలాంటిదేదో ఉందన్న అనుమానం మాత్రం అందరికీ ఉంది. విశ్వంలోని ఖాళీలలో శక్తి ఉంది. పదార్థమంతా కూడా శక్తియొక్క రూపమే. పదార్థంగా మారని శక్తినుంచి ఒక రకమయిన వికర్షణ పుడుతుంది. డార్క్ ఎనర్జీ అంటే అదేనా? తెలియదు! గురుత్వాకర్షణ శక్తి మరీ ఎక్కువయినందుకు ఈ డార్క్ ఎనర్జీ పుట్టిందా? అంతకన్నా తెలియదు! ఈ అనుమానాలకు ఆధారాలున్నాయి. వాటిలో సమస్యలు కూడా ఉన్నాయి.

విశ్వంలోని కాంతిని ఈ డార్క్ ఎనర్జీ మింగుతున్నది. అయినా, ఇది కాంతినుంచే పుట్టి ఉండవచ్చునన్న అనుమానం కూడా ఉంది. కాంతి, వెలుగు అంటే విద్యుదయస్కాంత తత్వానికి ఒక రూపం లేక ఫలితం. అందరికీ తెలిసిన ఫిజిక్సుకు అందని రకం విద్యుదయస్కాంత తరంగాలు ఉన్నాయని మరో అనుమానం. వాటి అలల నిడివి, మనకు కనిపించే విశ్వంలోని తత్వానికి ట్రిలియన్ల రెట్లు ఎక్కువ. అదే డార్క్ ఎనర్జీ అంటున్నారు కొందరు. వెలుగుగానీ, అయస్కాంత శక్తిగానీ, వాటి వాటి అలల నిడివి వల్ల రకరకాలుగా ప్రభావాన్ని చూపుతాయి. మనకు కనిపించే కాంతి కొంత. దానికి, అటు యిటూ కనిపించని కాంతులున్నాయని తెలుసు. అదే దారిలో విద్యుదయస్కాంత తరంగాలు కూడా ఉన్నాయని ఇద్దరు పరిశోధకులు గట్టిగా నమ్ముతున్నారు. విశ్వంలోని పూర్తి ఖాళీ ప్రాంతాలలో కూడా అర్థంకాని అయస్కాంత క్షేత్రాలున్నాయని గమనించారు. వాటికి ఈ అతి దీర్ఘ తరంగాలు గల విద్యుదయస్కాంత తత్వం ఆధారమని వీరిద్దరూ అంటున్నారు. మన గెలాక్సీలోనే బ్లాక్‌హోల్స్ ఉన్నాయి. వాటిలోనుంచి కూడా కొన్ని అయస్కాంత క్షేత్రాలు పుడుతున్నాయి! అవి కూడా ఇలాంటివేనంటున్నారు!

విశ్వం తననుంచి తాను దూరంగా పోతున్నది. అంటే అంతులేకుండా విస్తరిస్తున్నది. ఈ సంగతి సుమారు ఇరవయి సంవత్సరాల క్రితమే గట్టిగా రుజువయింది. సూపర్‌నోవాలు ఉండవలసిన వెలుగు లేకుండా, ఉండవలసిన దానికన్నా, మరెంతో దూరంగా ఉన్నాయని గమనించారు. ఈ సంగతిని ఆధారంగా ‘విశ్వం విశాలమవుతున్నద’ని చెప్పినవారికి 2011లో నోబెల్ బహుమతి కూడా ఇచ్చేశారు. విశ్వంలో చాలా భాగం ఖాళీగా ఉంది. అక్కడ కొన్ని వర్చువల్ పార్టికల్స్ పొంగుతున్నాయని క్వాంటమ్ సిద్ధాంతం చెపుతుంది. ఆ పొంగులోనుంచి కొంత శక్తి పుడుతుంది. పార్టికల్స్‌మాత్రం ఈ క్షణం పుట్టి మరో క్షణంలో మాయమవుతాయి, శక్తి మిగులుతుంది. మార్పేమీ లేకుండా మిగులుతుంది. దీనే్న కాస్మలాజికల్ కాన్‌స్టాంట్ అన్నారు. ఇందులోనుంచి లేదా ఇందుకు సంబంధించి డార్క్ ఎనర్జీ పుడుతుందని మరో అనుమానం.

విశ్వం విచ్చుకుంటూ పోవడానికి కొంత, నిజానికి చాలా శక్తి అవసరం. ఒక ఘనపు కిలోమీటరు విశ్వానికి అర జౌల్ శక్తి కావాలి (అసలు, విషయమే అర్థం కావడంలేదంటే, అందులో ఈ లెక్కలు అంతకన్నా అర్థం కావు గనుక వదిలేద్దాం!). వర్చువల్ పార్టికల్స్‌లో నుంచి పుట్టుకు వస్తున్న శక్తి మొత్తాన్ని లెక్కించే ప్రయత్నం చేశారు. అది ‘సున్నా’అని లెక్క తేలింది. 
(ఇదేమిటని ముక్కున వేలేసుకుంటే తప్పులేదు!) మరో లెక్క ప్రకారం, ఈ శక్తి అపారం. ఎంత అపారమంటే, దాని ప్రభావంవల్ల విశ్వంలోని పదార్థమంతా సర్వనాశనమవుతుంది. (ఈసారి ఇదేమిటని బుర్ర పట్టుకుంటే అంతకన్నా తప్పులేదు. ఫిజిక్సు అనే మదర్ ఆఫ్ సైన్సెస్ పద్ధతి అలాగే ఉంటుంది మరి!) ఇదంతా మనకు అర్థం కాలేదంటే ఆశ్చర్యం లేదు. పరిశోధకులకు కూడా ఈ సంగతులు అర్థం కాలేదు. కనుక వాళ్లు రూటుమార్చి, డార్క్ ఎనర్జీకి, గురుత్వాకర్షణ శక్తికి మధ్య సంబంధాలను వెతుకుతున్నారు. గురుత్వాకర్షణ అన్న విషయానికి ఆధారం ఆకర్షణ. రెండు పెద్ద పెద్ద ఆకారాల మధ్యన ఆకర్షణ ఉంటుందని దీని భావం. కానీ, వాటిమధ్యన దూరం బిలియన్ల కాంతి సంవత్సరాలయితే, ఆకర్షణ పోయి వికర్షణ మొదలవుతుందని ఒక సిద్ధాంతాన్ని తెచ్చారు వారు.

గురుత్వాకర్షణ గురించి ఇంత తేలికగా మాట్లాడడం తప్పు అంటారు మరికొందరు. ఐన్‌స్టైన్ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం, గ్రావిటీ అంటే స్థలకాలాలు వంపు తిరగడం. ఈ లెక్క ఆధారంగానే సౌర మండలంలోని గ్రహాలు, మనిషి ప్రయోగించే కృత్రిమ ఉపగ్రహాల దారులను, కదలికలను లెక్క వేస్తున్నారు. దాన్ని మొత్తం విశ్వం స్థాయిలోకి పెంచి, స్థలకాలాలను వంచగలిగితే- లెక్క ఎలాగుంటుందో అర్థంకాదు! పరిశోధకులు ఏదో అడ్డు వచ్చిందని పని మానే రకం కాదు. జోస్ బెల్ట్రాన్, ఆంటోనియో మరోటోలు మరీ రాటుదేలిన పరిశోధకులు. వాళ్లు స్పెయిన్‌లో గ్రావిటీ గురించి ఎంత కాలంగానో పరిశోధిస్తున్నారు. ఆకర్షణ పోయి వికర్షణగా మారడం గురించి ముందు ఊహించినది వీళ్లే. అంతలోనే మరో సంగతి తోచింది. అక్కడ విద్యుదయస్కాంత తత్వం లక్షణాలు కనిపించాయి. స్థలకాలాల బదులు దృష్టి అయస్కాంతాలు, వోల్టేజీలవైపు మళ్లింది. తరువాతి సంగతులు మరెప్పుడయినా చూద్దాం!

పాఠక మిత్రులకు ఒక మనవి! సైన్సు అంటే- తెలిసిన విషయాల గురించి అని మన భావన! కానీ సైన్సులో తెలిసిన సంగతులకన్నా, తెలియని సంగతులే ఎక్కువ. వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం గనుక సైన్సు కొనసాగుతుంది. ఈ విషయం అర్థం కావడానికే ఇలాంటి వ్యాసాలు!

Saturday, June 23, 2012

అవకాశం అందుకోవాలి!

పని దొరకడం లేదని ఏడుస్తూ కూచునే వారి సంఖ్య రాను రాను తగ్గుతున్నట్టు తోస్తుంది. అవకాశాలను అందుకోవాలని అందరూ అనుక్షణం ప్రయత్నిస్తున్నారు. అవకాశాలు ఉన్నాయి, లోపమంతా నీ ప్రయత్నంలోనే! అంటూ అందరూ మనల్ని ముందుకు తోస్తుంటారు కూడా! అవకాశాలున్నాయి, కానీ, అవి మనకు సరిపడేవిగా ఉన్నాయా? మన పరిస్థితులను, శక్తియుక్తులను కూడా లెక్కించాలి కదా! అక్కడే ప్రయాణం మొదలవుతుంది. వెతుకుతూ బయలుదేరితే, ఇంతకుముందు ఊహించని గమ్యాలకు చేరే వీలుంది. అందుకు ఓపిక, పట్టుదల, ప్రయత్నం అవసరం!


చదువులోగానీ, మరేదయినా పనిలోగానీ పడిన శ్రమ ఊరికే పోదు. చదువుకున్న సంగతి పోయి, సరదాగా నేర్చుకున్నదేదో మనకు దారి చూపించగలదు. అందులో మనం బాగా రాణించగలం కూడా. ఇలాంటి పరిస్థితులు వచ్చినపుడు, ఆలోచనతో, నిలకడగా నిర్ణయాలు చేయవలసి ఉంటుంది. ఎక్కడో ఒక రంగంలో మన సత్తా చూపించగలిగితే, ఆ అవసరం కలిగిన వారంతా మన గురించి ఆలోచించే పరిస్థితి రావాలి. అందుకు మన కృషి మాత్రమే ఆధారం. నాణ్యత అంతకన్నా ముఖ్యం. చేయగలిగే పనులను మరింత బాగా చేసే చోటికి మనం ఎదగాలి. కొత్త పనులు నేర్చుకోవాలి. ఒక సమయంలో ఎవరికీ కంప్యూటర్ గురించి తెలిసేది కాదు. ప్రస్తుతం కాల్ లెటర్స్ కూడా ఈ-మెయిల్‌లో పంపుతున్నారు. అవకాశాలను వెదకడంలో అవసరమయిన శ్రమ నిజానికి శ్రమ కాదు. అది మనకోసం మనమే పడుతున్న ప్రయాస!

*కళ్లు మూసుకుని ఉంటే అవకాశాలు కనబడవు. కళ్లు తెరిచిన తర్వాత అవి కరిగిపోతాయి. నిత్యం పనిగట్టుకుని వెతుకుతూనే ఉండాలి. కనిపించిన అవకాశాల గురించి అదేపనిగా ఆలోచిస్తూ కూచుంటే లాభం లేదు. అప్లై చేయడమా, మానడమా? అన్న ఆలోచనలోనే కాలమంతా గడిస్తే చివరి రోజున ఆదరాబాదరాగా, అరకొరగా అప్లికేషన్ పంపవలసి వస్తుంది. బాగుంది, అనిపిస్తే చాలు, కాగితం పంపడమే మంచిది. నచ్చకపోతే, ఇంటర్వ్యూకే వెళ్లము! తర్వాత, బాధపడడంకన్నా ఇది మంచి పద్ధతి కదా!

*కొన్ని అవకాశాలు, రారమ్మంటూ పిలవకుండా దాగి ఉంటాయి. చాలా ఉద్యోగాల గురించి ఎక్కడా ప్రకటనలు రావు. ఈ మధ్యన రెఫరల్ పద్ధతి ద్వారా ఉద్యోగులను ఎంచుకోవడం ఎక్కువయింది. అలా మన పేరు పదిమంది గుర్తుంచుకుని రెఫర్ చేసేలాగా, పరిచయాలు, నెట్‌వర్కింగ్ సిద్ధం చేసుకోవాలి. ఒక ఉద్యోగిని పరిచయం చేసిన తర్వాత, అతను ఉద్యోగానికి ఎంపికయి, చేరితే, రెఫర్ చేసినవారికి కూడా ఇనె్సంటివ్ ఇస్తున్నారు. రెఫర్ చేసినవారు మంచి నెట్‌వర్కింగ్ గలవారుగా లెక్కలోకి వస్తున్నారు.

*చిన్న ఉద్యోగంలో ఉన్నవారు అదే కంపెనీలో పెద్ద ప్రాజెక్టులలోకి దూకడం మామూలయింది. సంస్థ పెరుగుతున్నదంటే, వెయ్యి కళ్ళతో, మనకు సరిపడే ఖాళీల గురించి చూస్తుండాలి. పనిచేసేచోట మన ‘పనితనాన్ని’ చూపుతుంటే, కొత్త అవకాశాలు మరింత సులభంగా అందుతాయి. ఒకే కంపెనీలోని వేరు వేరు విభాగాలలో అవకాశాలు వస్తుంటాయి. అక్కడ రెఫరల్ మరింత బాగా పనిచేస్తుంది.

*అన్నింటికన్నా ముందు మన గురించి మనకు తెలిసి ఉండాలి. అవకాశాలు ఉంటాయిగానీ, అందుకు మనకు ఎంతవరకు అర్హత ఉందన్నది ప్రశ్న. చేస్తున్న పనిలో ఏ అంశాలు మనకు నచ్చుతున్నాయి? ఏ పనులను మనం బాగా చేయగలుగుతున్నాము? మిగతా వారికంటే మనం ఎక్కడ పైచెయ్యిగా ఉన్నాము? మిగతావారికి చేతగాని పనులు, తెలియని విశేషాలు మనకు ఎంతవరకు పట్టులో ఉన్నాయి? మనకు తెలిసిన పెద్దవారిలో, మన గురించి మంచి మాట చెప్పగలవారు ఎవరున్నారు? లాంటి ప్రశ్నలన్నీ మన మెదడులో తిరుగుతూ ఉండాలి. ప్రశ్నలతోనే సరిపెట్టుకుంటే చాలదు. ఈ ప్రశ్నలన్నింటికీ పాజిటివ్ సమాధానాలు వచ్చేదిశగా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి.

*మనకు చేతనయిన సంగతులతో బాటు, చేతగానివీ ఉంటాయి. బలహీనతలను కూడా గుర్తించి వాటిని గురించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సాగాలి. మనంకొన్ని పనులు ఇష్టం లేక, చేతగాక తప్పించుకుంటాము. అది తప్పుకాకపోవచ్చు కానీ, ఆ సంగతి మనకు తెలిసి ఉండాలి. తోటివారు, పై అధికారులు, పెద్దలు మనలోని బలహీనతలు, లోపాల గురించి ఏమనుకుంటున్నారు? సాధారణంగా, మన సమాజంలో ఎవరూ ఇలాంటి విషయాలను చెప్పరు. కానీ వాటిని కూడా చెప్పగల వారు మన సర్కిల్‌లో ఉండాలి. లోపం గురించి మనకు తెలియకపోవచ్చు. తెలుసుకోవాల్సిన అవసరమూ రాకపోవచ్చు. తెలిస్తే మాత్రం, వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.

శఅసలు మన మీద మనకు నమ్మకం ఉందా? ఆత్మస్థైర్యం ఉందా? పనులను పక్కనపెడుతూ తప్పించుకు తిరుగుతున్నామా? మనమే ఆలోచించి తెలుసుకుంటే మేలు గదా!

*కొత్త అవకాశం కనిపించిన వెంటనే దూకడం కూడా మంచిది కాదు. గోడ దొరికిన తరువాత తడికను తన్నమన్నాడు ఒకాయన! అసలు మనకు జీవితంలో ఏం కావాలి? తేల్చుకుని ముందుకు సాగాలి. ఊరు మారవలసి వస్తే కుదురుతుందా? జీతం భత్యాల విషయంలో తేడా రాదు గదా? కొత్త ఉద్యోగం నిలకడగా ఉంటుందా? అసలు అక్కడ మనం సుఖంగా కొనసాగగలుగుతామా? అక్కడ మరింత ముందుకుపోయే అవకాశాలు ఉంటాయా? అసలు అన్నింటికంటే ముందు కొత్త అవకాశం ఆసక్తికరంగా ఉందా? ఎన్నో ప్రశ్నలు! మనలో మనం, మరొకరితో వీలయితే అక్కడా చర్చించుకుని ముందుకు కదలాలి.

*కొంత అనుభవం కలిగినవారికి, చాలా అవకాశాలు కనిపించే వీలు కూడా ఉంటుంది. అప్పుడు వాటన్నిటి గురించీ వివరాలు సేకరించాలి. ఎక్కడ మనకు అనుకూలంగా ఉంటుంది? పని ఆనందం ఎక్కడ వీలవుతుంది? సంతృప్తికి వీలు ఎక్కడ? అన్నింటికీ మించి, సులభంగా అందుకోగలిగిన అవకాశాలు ఏవి? లాంటి ప్రశ్నలు ఎదురవుతాయి. కొన్ని ఉద్యోగాలలో చిక్కులుంటాయి. కానీ ముందు కనబడవు. వెళ్లిన తరువాత, తప్పు చేసిన భావం మిగులుతుంది. వెనక్కురావడానికీ ఉండదు.
అవకాశాల వేట, ఈ కాలంలో ఒకచోటికి ముగిసేదికాదు. ఉద్యోగాలు మారినందుకు మనుషుల విలువ పెరుగుతున్నది. ఒకప్పుడు పనిచేసిన చోటికే, పెద్ద స్థాయిలో తిరిగివచ్చేవారున్నారు. జాగ్రత్తగా, పట్టుదలగా, విశాల దృక్ఫథంతో ముందుకుసాగడమే! అవకాశాలు పిలిచినప్పుడు రావు. తెలిసేలా రావు. దూకుతూనే ఉండాలి. ఒకసారి అవకాశంలోకి దూకామని తర్వాత అర్థమవుతుంది.



సంగతి తెలిసింది!


ఒక దేశం ఉంది. ఆ దేశంలో గాడిదలు లేవు. ఒకతను ప్రయత్నంగా మరెక్కడినుంచో ఒక గాడిదను తెచ్చుకున్నాడు. కొంతకాలం దాన్ని బాగానే సాకాడు. కానీ, దాన్ని ఏరకంగా వాడుకోవాలో అర్థం కాలేదు. తిండి దండగ అంటూ గాడిదను ఒక కొండ పక్కన అడవిలో వదిలేసివచ్చాడు. అతని బాధ తీరింది. గాడిద, దొరికిందేదో తింటూ బాగానే బతుకుతున్నది. ఆ అడవిలో ఒక పులి కూడా ఉంది. అది ఒకనాడు గాడిదను చూచింది. అంత ఎత్తున్న కొత్త జంతువును చూసి కొంచెం భయపడింది. ఎక్కడినుంచి వచ్చిందో అనుకుంటూ కంటబడకుండా తప్పించుకుని తనదారిన తాను పోయింది. ఆ తరువాత పులి, దొంగచాటుగా గాడిదను పరిశీలిస్తూ కాలం గడిపింది. కొన్నాళ్లకు కొంచెం ధైర్యం కలిగి గాడిదకు దగ్గరగా వచ్చింది. అయినా తప్పించుకుని తిరిగింది. ఒకనాడు పులి వచ్చిన సమయానికి గాడిద ఓండ్రపెట్టింది. తన సంగతి తెలిసిపోయిందేమోనని జడుసుకుని పులి పరుగుతీసి దాక్కుంది. కొంచెం సేపటికి దొంగచాటుగా వచ్చి గాడిదగారిని రహస్యంగా పరికించింది. పెద్ద శరీరం, పెద్ద గొంతు తప్పితే మరేమీ ప్రత్యేకంగా కనిపించలేదు. పైగా, గాడిద గడ్డీగాదం తింటున్నది! పులికి, గాడిద అరుపులు అలవాటయి, నిర్లక్ష్యం మొదలయింది. అది వచ్చి గాడిద చుట్టు తిరిగి చూచింది కూడా! దానికి ధైర్యం పెరిగింది. గాడిద ముందుకు వెళ్లి, కావాలనే దాన్ని కుమ్మింది. గాడిదకు కోపం వచ్చింది. అది వెనుక కాళ్ళతో పులిని తన్నింది! పులికి విషయం అర్థమయింది! ఇంతేనా ప్రతాపం! అనుకుంది. అమాంతం పైనబడి, పులి గాడిదను చంపి తినేసింది!

పని - సమయం



నటుడు నసీరుద్దీన్ షా నాటకాల్లో, మామూలు సినిమాల్లో, ప్యారలల్ సినిమాలో పని చేస్తాడు. ‘రోజులో 24 గంటలున్నాయి. ఎనిమిది గంటలు పని. ఎనిమిది గంటలు నిద్ర. అయినా మరో ఎనిమిది గంటలు ఉండనే ఉన్నాయి. చేయదలచుకున్న పనికోసం సమయాన్ని వాడుకోవడం నా పద్ధతి’ అంటాడు ఈ 61 ఏళ్ళ యువకుడు. అతనింకా సినిమాల్లో నటిస్తున్నాడు. నాటకాలలో పాల్గొంటున్నాడు.
===

అసలు మాట
అవకాశాలలో అపార్థాలను, అనర్థాలను చూచేవారు నిరాశావాదులు. అనర్థాలలో కూడా అవకాశాలను వెదికేవారు
ఆశావాదులు -హ్యారీ ట్రూమన్

స్వతహాగా స్వభావం మంచిదయితే, ప్రపంచంలో వెలుగులే కాదు, మరెన్నో కనబడతాయి. అనుకోకుండానే, మంత్రం వేసినట్టు, అవకాశాలన్నీ మన ముందుకు వచ్చేస్తాయి. అప్పటివరకు కనిపించని ప్రపంచమంతా, మార్పు తరువాత ఎదుట నిలుస్తుంది.
-అర్ల్ నైటింగేల్

Sunday, June 17, 2012

సైన్సు.. బతుకు.. తీరు..


సైన్సు అంటే ఫ్రపంచం. సైన్సు అంటే జీవితం. ప్రపంచంలో, జీవితంలోనూ అందమయిన, ఆనందమయిన సంగతులుంటాయి. అంతకంటే ఎక్కువగా అందుకు వ్యతిరేకమయిన అంశాలు కూడా ఉంటాయి. అందుకే, సైన్సులోకూడా గొప్ప సంగతులుంటాయి. అవి ప్రపంచాన్ని గురించి పాఠాలు చెపుతాయి. కొన్ని సంగతులు మాత్రం భయంకరంగా ఉండి పాఠాలు చెపుతాయి. వాటిని పట్టించుకోకుండా బతకడం వీలుకాదు.

భూమి- విశ్వం:
మనిషి మొదట్లో ఈ విశ్వానికి తాను, తన భూగోళం కేంద్రం అనుకున్నాడు. ఇవాళటికీ భూమి స్థిరంగా ఉందని, సూర్యుడు తూర్పున ఉదయించి, పడమట అస్తమిస్తాడనీ అనుకునేవారు మన మధ్యన ఉన్నారు. కోపెర్నికస్ వచ్చి, భూమి మిగతా గ్రహాలతోబాటు సూర్యునిచుట్టూ తిరుగుతున్నదని అన్నాడు. అప్పటివారంతా ‘అర్థంలేని మాటలు’ అని కొట్టిపడేశారు. విశ్వానికి భూమి కేంద్రం కాదని అర్థం కావడానికి వందల ఏళ్లు పట్టింది. గెలిలెయో వచ్చి, దుర్భిణీ పెట్టి చూపించి విషయాన్ని వివరించసాగాడు. అప్పటివారికి చంద్రునిమీద గుంటలున్నాయంటే నచ్చలేదు. అసలు కొందరు టెలిస్కోపునే ఏవగించుకున్నారు. మతవాదులు గెలిలెయోను శిక్షలతో సత్కరించారు. సైన్సు నిజం చెపుతుంది. మనిషికి ఆ నిజం కనిపించడానికి సమయం పడుతుంది.

సూక్ష్మజీవులు:
అసలు కొంతకాలంవరకు ఈ సూక్ష్మప్రపంచం గురించి తెలియదు. తెలిసిన సూక్ష్మజీవుల ప్రపంచమంతా మనకు శత్రువులతో నిండి ఉందన్న భావం ఇంకా మిగిలింది. మన ఒంట్లో సూక్ష్మజీవులు ఉండి మనకు సాయం చేస్తుంటాయని చాలామందికి తెలియదు. సూక్ష్మజీవులను మందుల సాయంతో చంపడం ఒక పద్ధతి. సూక్ష్మజీవులనే వాడి వాటిని నాశనం చేయడం మరో పద్ధతి. టీకాలు లేకుంటే.. ఈ ప్రపంచం, ఈ జనాభా మరొక రకంగా ఉండేది. ఆటలమ్మ, మశూచి లాంటి వ్యాధులను వాటి ప్రభావాన్ని చూచిన వారికి తప్ప, ఈ సంగతి సులభంగా అర్థం కాదు. ఇక కొన్ని సూక్ష్మజీవులు మాత్రం అదుపు చేయడానికి వీలుగాని వేగంతో పెరుగుతున్నాయి.

ఇన్‌ఫ్లుయెంజా వైరసు అనుక్షణం మారుతూ పోతుంది. ఈ ఏడాది తయారుచేసిన టీకా మందు మరో ఏడాదిలో పనిచేయదు. స్ట్ఫాలోకోకస్ క్రిమి ఆసుపత్రులలో నిండి అందరినీ గజగజలాడిస్తున్నది. ఎబోవా, సార్స్, బర్డ్ఫ్లూ, స్వైన్‌ఫ్లూ లాంటి కొత్త వ్యాధులు బయటపడుతున్నాయి. క్షయవ్యాధి తిరిగి తల ఎత్తుతున్నదంటున్నారు. ఎన్ని రకాల మందులు వేసినా, తట్టుకుని పెరిగే క్రిములు వస్తున్నాయంటున్నారు. కొత్త శతాబ్దం వచ్చింది. పాత సమస్యలు మాత్రం మొండిగా కొనసాగుతున్నాయి. సైన్సు ముందుకు సాగుతున్నది. కొన్ని విషయాలలో మాత్రం గెలుపు కుదరడం లేదు.

తిండి తీరు:
మనిషి బతకడానికి తిన్నంతకాలం పరిస్థితి బాగానే ఉంది. కానీ, తిండిలో రుచి వెతకడంతో సమస్యలు పుట్టుకు వస్తున్నాయి. రుచికరమయిన తిండి ఏదీ ఆరోగ్యకరమైనది కాదనే పరిస్థితి వచ్చింది. మన దేశంలో తీపి, నూనె, నెయ్యి లాంటివి చాలామందికి విషాలుగా కనబడుతున్నాయి. అసలు తిండి తినకుండా బతకడం వీలయితే బాగుండుననే వారు ఉన్నారు. రుచిగల తిండి తింటే గుండె జబ్బులు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు క్రమంగా పెరుగుతాయని పరిశోధనల ద్వారా నిరూపిస్తున్నారు. మసాచుసెట్స్- యుఎస్‌ఏలో 1948లో 5000 మందితో గుండె- తిండి సంబంధం గురించి పరిశోధనలు మొదలయ్యాయి. అప్పటి వలంటీర్ల మనుమలు, మనుమరాండ్రతో ఇంకా ఈ సర్వే సాగుతున్నది. ఇంతకాలం పరిశోధించి వారు చెప్పింది ఒకటే సంగతి. రుచిగల తిండి మంచిది కాదు.. అని! అక్కడి వారు వేపిన మాంసం, ఐస్‌క్రీములు మరీ ఎక్కువగా తింటున్నారు. అవి అసలు పనికిరావని తినకూడదని పరిశోధకులు చెపుతున్నారు. పండ్లు, కాయధాన్యంలో రకాలు కొన్ని, నట్స్, రెడ్‌వైన్ మంచివని కూడా వారే చెపుతున్నారు.

మానవులు తిండి దొరకని కాలంలో, కేవలం కాయలు, పళ్లు ఏరుకుని, జంతువులను వేటాడి తిండి సంపాదించేవారు. అప్పుడు, కావలసినపుడు తిండి దొరికేది కాదు. ఉప్పు, కొవ్వు, చక్కెరలు దొరికినంత తినడం అప్పుడు మొదలయింది. అప్పుడవి తిన్నా నష్టం లేదు. కానీ, కూచుని కదలకుండా దినం గడిపే ఈ కాలంలోనూ అదే తింటామంటే కుదరడంలేదు. మనవారు నెయ్యి పోసుకుని తిన్నారు. అంతగాను శ్రమించారు. మనకు శ్రమ తెలియదు. నెయ్యి తినడం కుదరదు. సైన్సు ఎన్నో చెపుతుంది. మంచీ, చెడు తెలుసుకోవడం మనిషికి ఒకోసారి కష్టమవుతుంది.

జంతు జాతులు కనుమరుగు:
రకరకాల విషయాల ఆధారంగా గతంలో జరిగిన సంగతులను పరిశోధించే వారున్నారు. వాటిలో పాలియోంటాలజిస్టులు కూడా ఒక రకం. వారు జీవం చరిత్రను గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జీవజాతుల చరిత్రలో ఇప్పటికి మొత్తం ఐదుసార్లు పెద్ద ఎత్తున జంతు, వృక్షాలు తుడిచిపెట్టుకుపోయినట్లు వారు లెక్కలు తీశారు. అంతరిక్షం నుంచి రాళ్లువచ్చి గుద్దుకుని, అగ్ని పర్వతాలు పేలి, లేక వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చి ఈ ప్రళయాలు జరిగాయి. ఇంకా కొన్ని కారణాలు కూడా ఉండి ఉంటాయి.

జంతు జాతులు నమూనా మిగలకుండా తుడిచిపెట్టుకుపోతాయంటే చాలామందికి నమ్మకం కుదరలేదు. మాస్టడాన్ అనే ఏనుగులాంటి జంతువు ఎముకలు కనిపించినపుడు, ఆ రకం ప్రాణి అడవులలో ఎక్కడో ఉండాలని అనుకున్నారు. కానీ, ఆ జాతి పోయి శతాబ్దాలయింది. ప్రస్తుతం ఆరవ ప్రళయం జరుగుతున్నదని పాలియోంటాలజిస్టులు అంటున్నారు. మనిషి జాతి ఒక ఖండం నుంచి మరో ఖండానికి వ్యాపించిన కొద్దీ పెద్ద జంతువులు నాశనమయిపోయినయి. అమెరికాలో మాస్టడాన్, ఆస్ట్రేలియాలో పెద్ద కంగారూ, యూరోపులో పొట్టి ఏనుగులు అందుకు ఉదాహరణలు. మనిషి ప్రస్తుతం వేటవల్ల, వాటి ఆవాస ప్రాంతాలను ఆక్రమించడం చేతనూ, వ్యాధులు ప్రబలడానికి కారణం కావడం వల్లనూ, ఎన్నో జంతు జాతుల వినాశనానికి కారణమవుతున్నాడు. కొన్ని మార్పులు చాలా కాలంపాటు జరుగుతాయి. అవి మనకు కనిపించవు, అర్థం కావు. వాటికి గల కారణాలు చటుక్కున తోచవు. అందులో మన ప్రమేయం ఉందని అసలే అర్థం కాదు. సైన్సు హెచ్చరిస్తుంది. అది మనకు అనవసరమనిపిస్తుంది.

ఐన్‌స్టైన్ సూత్రం:
శక్తిని నిర్వచించడానికి- ఈ ఈజ్ ఈక్వెల్‌టు ఎమ్.సి స్క్వేర్ అని ఒక సూత్రాన్ని ఐన్‌స్టైన్ ప్రతిపాదించాడు. ఇది నిజంగా, చాలా గొప్ప సమీకరణమని అందరూ చెపుతారు. అంత వరకు బాగానే ఉంది. అది నిజానికి మరో చిత్రమయిన అంశాన్ని సూచిస్తుంది. గొప్ప శక్తిని పుట్టించడానికి ఎక్కువ పదార్థం అవసరం లేదని, ఈ ఈక్వేషన్‌కు మరోలా అర్థం చెప్పవచ్చు. సీస్క్వేర్ అన్న పరిమాణంలో ఆ రహస్యం (అంత రహస్యమేమీ కాదది!) ఉంది. అది కాంతివేగం. సెకండుకు అది 186,282 మైళ్లు కదులుతుంది. ఆ అంకెను అదే అంకెతో గుణించాలి. (స్క్వేర్ అంటే అదే) వచ్చే అంకె 34,70,09,83,524. ఐన్‌స్టైన్ సూత్రాలు అర్థంగాక బుర్రలు బద్ధలు కొట్టుకున్న వారి లిస్టులో మనమూ చేరదామంటే సరే! కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం సులభంగా అర్థమవుతుంది. ఒక మహానగరాన్ని క్షణాలమీద నాశనం చేయాలంటే, ఒక్క పిసరంత ప్లుటోనియం ఉంటే చాలు! ఐన్‌స్టైన్ సూచనను ఈ రకంగా అర్థం చేసుకున్నవారు ఎంతమంది? సైన్స్ ఎన్నో చెపుతుంది. వాటికి అర్థాలు, అన్వయాలు మనం వెతకాలి మరి!

మనమూ - మన మెదడు:
సైన్సు అనగానే ఫిజిక్సు, కెమిస్ట్రీ, జియాలజీ లాంటివే అందరికీ కళ్లముందు కదలాడతాయి. వాటి ప్రభావం, ప్రమేయం మన మీద ఉందని గమనించగలిగితే మరో రకంగా ఉంటుంది. అందుకే, మన సంగతి చూడాలని ప్రయత్నం. మన ప్రవర్తన, పద్ధతులు, భావాలు మొదలయినవి మన అదుపులో లేవు. మనకు అర్థం కావు అని పెద్ద పెద్ద పరిశోధకులంతా చెపుతూనే ఉన్నారు. ఆనందంగా, ఆహ్లాదంగా ఉన్నారంటే ఆనాడు బయట వాతావరణం సుఖప్రదంగా ఉన్నందుకట తెలుసా? పది రకాల రుచులను నాలుకకు అందించి, అందులో ఏది బాగుందని అడిగితే, అందరికీ, లేదా చాలామందికి మొట్టమొదటి రుచి గుర్తుకు వస్తుందట. మరీ తరచుగా కనిపించే వస్తువు లేదా మనిషి మీద ప్రేమ మరీ ఎక్కువవుతుందట. జంటల మధ్యన ఆకర్షణకు వాసనలు ఆధారమట. ఇక కథను మరోవైపు నడిపిస్తే మనం కారణం లేకుండా, తెలియకుండా కొందరు వ్యక్తులు, కొన్ని వస్తువులను అసహ్యించుకుంటాము. అందిన సమాచారానికి, మనకు నచ్చిన, అనుకూలమయిన అర్థాలు చెప్పుకుంటాము. అనవసరమైన సంగతులన్నీ మన దృష్టిని ఆకర్షిస్తాయి. జ్ఞాపకాలు అనుకుంటున్నవన్నీ మనకు మనం చెప్పుకుంటున్న సంగతులు మాత్రమే. అందులో చాలావాటిని నమ్మడానికి లేదని పరిశోధన పూర్వకంగా రుజువు చేశారు.
మనకు ప్రపంచ జ్ఞానం చాలా ఉందనుకుంటాము. సైన్సులోనూ ఎందరో మహామహులు కొత్తదారులు వేసి ప్రపంచం నడిచే తీరును, దిశలను మార్చారు. కాని, వారి ప్రవర్తన మాత్రం ఎవరికీ అర్థం కాలేదు!

సైన్సుకు అందని అంశాలలో మనిషి, మెదడు మొట్టమొదటివి!

అంతా కోతులమే!:
కోతులు మన తాతలు అంటే బాగుంటుంది. మనం కోతులం కాదులే! అనుకోవచ్చు. కానీ పరిణామక్రమం ఒక నాటిలో, వందేళ్లలో జరిగిన సంగతి కాదు. ఇంకా మనలో ఎంత కోతి శాతం మిగిలి ఉందన్నది అసలు ప్రశ్న!
భూ చరిత్రలో సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలకు గుర్తింపు లేదు. మనకు ఈ సంగతి అర్థమయింది గనుక మనల్ని మనం ప్రత్యేక జాతిగా అనుకుంటున్నాము కానీ, కోతుల జాతి చరిత్రలో మనం ఇటీవలి మార్పు కింద లెక్క. చింపాంజీలకు, గొరిల్లాలకన్నా మనకు కొంచెం ఎక్కువ తెలివి ఉందేమో! కానీ ఈ కోతి మనసుకు కొంత మాత్రమే తెలుసు!
అందరూ జీవమంతా, వైవిధ్యంతో సహా, ఒకేనాడు పుట్టిందనుకున్నవాళ్ళే. డార్విన్ కూడా ఇలాగే అనుకున్నాడు. కానీ పరిశీలనల కారణంగా అభిప్రాయాలు మార్చుకుని పరిణామసిద్ధాంతాన్ని మనకు అందించాడు. ఒకటిన్నర శతాబ్దం గడిచింది గానీ, పరిణామం పద్ధతి మాత్రం ఇంకా అర్థం కాలేదు. మనం కోతులమంటే ఎవరికీ నచ్చదు. కానీ సైన్సు మాత్రం అదే నిజమంటున్నది!

ఆలోచనలు ఉన్నంత మాత్రాన సైన్సు సాగదు. సాగలేదు. అవగాహనలో లోతు అవసరం!

మనిషికి మనిషే శత్రువు:
ఈ సంగతి అందరికీ అనుభవంలో ఉన్నదే. వాతావరణం, నీరు, గాలి, ఆరోగ్యం లాంటివి సమస్యగా మారాయంటే, మన కారణంగానే కనుక, మనకు మనమే శత్రువులం. మానవ చరిత్రలో రాజ్యాలు, రాజుల గురించి చెపుతారు. కానీ మనిషి స్వభావం గురించి తక్కువగా మాత్రమే చర్చిస్తారు. ఒక తండ్రి, తన కొడుకుకు తిండి దొరకదని, తన శరీరాన్ని పీక్కుతినమన్నాడు. ఒక మహారాజు మరణించిన తరువాత కూడా, తనతో సిరిసంపదలను పాతి పెట్టించుకున్నాడు. ఆడ తోడును బలవంతంగా వెంటబెట్టుకు‘పోయిన’ కథలు మన దేశం, చైనాలలో ఉన్నాయి. నరబలి కథలు మనకు తెలిసినవే. ఆజ్‌టెక్ జాతి వారు ఒక మందిరం పారంభం కొరకు వేలాది మందిని బలియిచ్చారు. ఈ సంగతులలో నిజమెంతో, కథ ఎంతో చెప్పడం తేలిక! బైబిల్‌లో, గ్రీకు పురాణాల్లో, నార్స్ చరిత్రలో రోమన్ గాథలలో నరబలి నిండుగా వివరాలతో కనబడుతుంది. మనిషిని మనిషి చంపడం రకరకాలుగా సాగింది. కానీ, అదొక తంతుగా చంపడం కూడా సాగడం విచిత్రం! మనిషిని మనిషి తినడం అంతకన్నా విచిత్రం! ఇందులోని సైన్సు అర్థం కాదు. ఇందులో సైన్సు ఏమిటి అన్నా తప్పులేదు!

పర్యావరణం- వాతావరణం:
సులభంగా అర్థమయే సంగతులు కూడా మనకు పట్టడంలేదు. కార్లు, దీపాలు, మరెన్నో సౌకర్యాల పేరున ఇంధనాలను వాడుతున్నాము. కార్బన్‌డై ఆక్సైడ్ లెస్సగా పుడుతున్నది. భూవాతావణం మొత్తం వేడెక్కుతున్నది. ఫలితంగా మంచు కరుగుతున్నది. పూలు అకాలంగా, త్వరత్వరగా పూస్తున్నాయి. చల్లదనం పేరున, మనుషులు జంతువులు వలసపోతున్నారు!

మనం పుట్టించిన ఈ కాలుష్యం, మనం పోయిన తర్వాత వందల ఏళ్ల దాకా నిలిచి ఉంటుంది. అంటే ప్రభావాలు, మన వారిమీద కలకాలం కొనసాగుతాయి! నరబలి అంటే.. ఇదేమి సైన్సు అనవచ్చు. కాలుష్యం కూడా మరో రకం నరబలి కాదా?

విశ్వం - విస్తారం:
మనకు మన గురించి అర్థం కాలేదు. మన మనసు తెలియదు. మెదడు లోతు తెలియదు. కానీ ప్రపంచమంతా అర్థమయిందన్న భావం మాత్రం బలంగా ఉంది. ప్రపంచ జ్ఞానం అన్న మాటను అందరమూ గర్వంగా వాడుతుంటాము. ఈ విశ్వంలో మన ప్రపంచం ఒక చిన్న చుక్క! విశ్వం అన్నమాట వినగానే, చదువుకున్నవారికి, విశ్వం గురించి చదువుతున్నవారికి తోచేవి గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, బ్లాక్‌హోల్స్, తోకచుక్కలు, మరింత దుమ్ము మాత్రమే! ఇవన్నీ కలిసి విశ్వంలో నాలుగు శాతం కన్నా ఎక్కువ భాగం కాదంటే ఆశ్చర్యం కదా! మిగతాదంతా చీకటి అంటే డార్క్ వ్యవహారం. విశ్వంలో 23 శాతం డార్క్ మాటర్ ఉంది. మిగిలిన 73 శాతం డార్క్ ఎనర్జీ. వీటి స్వభావం గురించి తెలిసింది తక్కువ. డార్క్ పదార్థం కణాల గురించి కేవలం అభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి. సమాచారం లేదు. ఇక డార్క్ శక్తి గురించి అసలేమీ తెలియదు. దీన్ని ‘సైన్సులో అసలు సిసలయిన మిస్టరీ’ అని వర్ణిస్తున్నారు. కానీ, ఈ డార్క్ వ్యవహారం ఆధారంగానే విశ్వం విస్తరిస్తున్నదని మాత్రం తెలుసు. ఈ విస్తరణ ఊహలకందని వేగంతో సాగుతున్నది. విస్తరణ సాగితే విశ్వం పలచబడుతుంది. చల్లబడుతుంది. కుప్పకూలుతుంది. అది బిగ్ బ్యాంగ్‌తో మొదలయిన కథకు చక్కని ముగింపు!

ఇది సైన్సు తీరు! విజ్ఞానం అంటే తెలివి. మనకు తెలిసింది తక్కువ అన్న తెలివి. ఆ కొంచెం తెలిసిన సైన్సు- అర్థం కాదంటారు. అవసరం లేదంటారు. ఏమిటిదంతా?

Tuesday, May 29, 2012

కుక్క - మానవుడు


మనిషి... ఆరడుగుల ఎ త్తున్న మరో మనిషిని నమ్మడు. అంగుళం తాళాన్ని మాత్రం నమ్ముతాడు. అంతకన్నా ఎక్కువగా తన కుక్కను నమ్ముతాడు. మనిషి జాతికి మరో జంతువు గురించి పట్టనప్పటినుంచి కుక్క తోడుగా ఉంది. పదిహేను వేల సంవత్సరాల క్రితం అంటే వ్యవసాయం కూడా అంతగా రాని నాటినుంచే కుక్కలు సాయంగా వచ్చాయి. అయినా, మానవ నాగరికతలో కుక్క పాత్ర గురించి తెలిసింది తక్కువ. అటు వేటలో, తరువాత పశుపోషణలో కుక్కలు ఎంతో సాయం చేశాయన్నది నిజం. కుక్కలను గురించి పరిశోధకులు చాలామంది పట్టించుకున్నారు. డార్విన్ కుక్కల నడవడిని పరిశీలించాడు. తన నాచురల్ సెలెక్షన్ సిద్ధాంతానికి వాటిని ఉదాహరణలుగా వాడుకున్నాడు. 20వ శతాబ్దంలో నోబెల్ గ్రహీత కాన్రాడ్ లోరెంజ్ కుక్కలగురించి విస్తృతంగా పరిశీలనలు సాగించారు. స్కాట్, ఫుల్లర్ అనే జన్యు శాస్తవ్రేత్తలు కుక్కల నడవడిని విశే్లషించారు. ఇటీవలికాలంలో మాత్రం కుక్కల గురించి పరిశోధనలు అంతగా జరగలేదనాలి. 21వ శతాబ్దం వచ్చిన తర్వాత మాత్రం వాటి మీదకు మరోసారి చూపు మరలింది. తోడేళ్లనుంచి కుక్కలుగా మార్పులో జరిగిన అంశాలు, వాటి తెలివి, భావావేశాల గురించి ఎంతో పరిశోధన జరిగింది, జరుగుతున్నది కూడా. కనుక కుక్కల గురించి ఎన్నో కొత్త అంశాలు తెలియవస్తున్నాయి.

పెంపుడు జంతువుగా...

నిజానికి మానవుడు కుక్కలను ప్రయత్నించి మచ్చిక చేయలేదు. వేట పద్ధతినుంచి జీవనవిధానం మారుతున్న రోజులలో కుక్కలు వాటంతటవే మనిషి పంచన చేరాయి. తోడేళ్లు క్రమంగా కుక్కలుగా మారాయని, డిఎన్‌ఏవిశే్లషణలో బయటపడింది. ఇప్పటి తోడేళ్లను గమనిస్తే, రాతియుగం మానవుడు వాటిని చేరదీసి మచ్చిక చేసిన వీలు కనిపించదు. అంటే, వెనుకటి కాలంలో తోడేళ్లు మరింత మెత్తని స్వభావం కలిగిండేవని అర్థం చెప్పవచ్చు. ఆ జాతి గతించింది. వాటి వారసులుగా కుక్కలు మిగిలి ఉన్నాయి. అప్పటి తోడేళ్ళు మనుషుల ప్రాంతాలలో తిండికోసం తిరిగాయి. వాటి పిల్లలను మనుషులు చేరదీశారు. అప్పటి మానవులకు జంతువుల కూనలను తెచ్చి పెంచుకోవడం అలవాటు! అట్లా మనుషుల మధ్యల పెరిగిన జంతువులను మచ్చిక చేసి పనులు నేర్పడం సులభం. ఆ దారిలో మనిషికి కుక్కలసాయం మొదలయింది. కాపలా, వేటలాంటి లక్షణాలుకూడా నేర్చిన తర్వాత వాటి సాయం పెరిగింది. అంటే కుక్కలను మచ్చిక చేయడం అనుకోకుండా జరిగిన పని! కానీ, దానివల్ల అటు తోడేళ్ళకు, ఇటు మనుషులకు మంచి జరిగింది. సహవాసం సాగింది.

మచ్చిక - క్రమం

ఉత్తర ఇజ్రాయెల్‌లో ఒక సమాధిలో ఒక వ్యక్తి కుక్కమీద చెయ్యి వేసి ఉండడం కనిపించింది. ఆ కుక్క పిల్లకు, అప్పటి తోడేలు పిల్లలకూ ఎంతో తేడా ఉంది. ముఖ్యంగా, దాని దంతాలు పూర్తిగా వేరుగా ఉన్నాయి. అంటే, ఆ కాలానికి తోడేళ్లు కొన్ని కుక్కలుగా మారినట్లు లెక్క. కుక్కపిల్లను మనిషితో బాటు ఖననం చేశారంటే పరస్పర సంబంధం, ప్రేమ అర్థమవుతాయి. 12 వేల సంవత్సరాల నాటి ఈ సమాధి కుక్కల చరిత్రలో ఒక గొప్పసూచనగా నిలిచింది. కానీ, అంతకుముందు ఎక్కడ, ఏ రకంగా కుక్కలు మచ్చికయిందీ చెప్పగల ఆధారాలు నేటివరకూ అందలేదు. గత ఏడాది సైబీరియాలో జరిపిన తవ్వకాలలో ఒక చోట కుక్క పుర్రె దొరికింది. అది 33 వేల సంవత్సరాలునాటిదని లెక్క తేలింది. పుర్రె నిర్మాణం కుక్క పుర్రెలాగున్నా, పళ్లు మాత్రం తోడేలు పద్ధతిలో ఉన్నాయి. గతంలో బెల్జియంలో దొరికిన ఒక పుర్రెకూడా 31 వేల ఏళ్ల నాటిదని ఈ మధ్యన నిర్ణయించారు. ఇది బహుశా, ఈనాటి కుక్కల పూర్వీకుల జాతికి చెందినవని అభిప్రాయం, అనుమానం వచ్చాయి. కానీ, ఈనాటి కుక్కలు ఈ క్రమంలోనివి కావని ఆధారాలు కూడా అందాయి. 24,000 నుంచి 13,000 సంవత్సరాలు మధ్యన, భూమి మీద మంచు యుగం వచ్చింది. అప్పుడు మానవులు దక్షిణ ప్రాంతాలకు తరలి వచ్చారు. మునపటి కుక్కలు వారితో రాలేదు. మచ్చిక కార్యక్రమం మరోసారి మొదలయింది.

మచ్చిక ఎక్కడ?

పురాతత్వ పరిశోధనలో అందిన ఆధారాల ప్రకారం, కుక్కల మచ్చిక మునుముందు పడమటి ఆసియా ప్రాంతంలో మొదలయింది. ఆ ప్రాంతాలను ఇప్పుడు మిడిల్-ఈస్ట్ (మధ్యప్రాచ్యం) అంటున్నారు. 2005లో కుక్కల డిఎన్‌ఏ నిర్మాణ క్రమాన్ని (జీనోమ్) పూర్తిగా గుర్తించారు. అంతకుముందు దొరికిన కుక్కలు, వాటి పూర్వీకులనుకున్న తోడేళ్ల జన్యు పదార్థాలను కూడా తరచి చూస్తే, పరిణామం, మచ్చికల గురించి మరెంతో తెలుస్తుంది. ఇలాంటి పరీక్షలు జరిగాయి. కుక్కలన్నింటిలోనూ మిడిల్ ఈస్ట్ పద్ధతి జన్యు నిర్మాణమే కనిపించింది. కనుక పురాతత్వ పరిశోధన వెల్లడించిన చరిత్ర సరయినదేనని గట్టిగా తెలిసింది. స్వీడన్ పరిశోధకులు పీటర్ సవొలైనెన్ మాత్రం కుక్కల పుట్టుక స్థానం ఆగ్నేయ ఆసియా అంటున్నాడు. జీవ జాతులు వేరు వేరు చోట్లకు చేరిన కొద్దీ వాటి జన్యువులలో వైవిధ్యం తగ్గి, మొదటి రూపం వస్తుంది. మాంగ్జే నది ప్రాంతపు కుక్కలలో మాత్రం ఆ లక్షణం కనిపించలేదు. యూరోపియన్ కుక్కలలో కూడా మధ్యప్రాచ్యం డిఎన్‌ఏ లక్షణాలు అంతగా కనిపించలేదట. కనుక పరిణామచరిత్రలో ఇంకా ప్రశ్నలు మిగిలాయి.
=================

అనుకోని నిజాలు

కుక్కల మధ్య బంధం
మచ్చికయిన తర్వాత కుక్కల కుటుంబం పద్ధతి పూర్తిగా మారిపోయింది. తోడేళ్లకు ప్రపంచమంటే కుటుంబం ఒకటే. తల్లి, తండ్రి, వాటి పిల్లలు కలిసి గుంపుగా తిరగడం వాటికి బాగా అలవాటు. పెరిగిన పిల్లలు కూడా తల్లిదండ్రులతోనే ఉండిపోతాయి. తమ తరువాత పుట్టిన పిల్లలను పెంచడంలో అవి సాయపడతాయి. తోడేళ్లనుంచి వచ్చిన కుక్కలకు మాత్రం ఈ కుటుంబం పద్ధతి ఏ మాత్రం చేతగాదు. కుక్కల మధ్యన ప్రేమ కలిగి ఉండడం లాంటివి కనిపించవు. అడవులలో పెరిగే కుక్కలు కూడా కుటుంబాలుగా ఉండవు. ఆడ తోడును ఎంచుకోవడంలో వాటికి ఒక పద్ధతి లేదు. ఇక పెంపుడు కుక్కలకు యజమాని, ఆ కుటుంబం మాత్రమే స్వంత కుటుంబంగా కనబడుతుంది. మిగతా కుక్కల సంగతి పట్టనే పట్టదు. నిజానికి కుక్కలకు.. కుక్క- మనిషి అనే తేడా తెలియదంటారు. మనిషితో కలిసి, మనిషినే జట్టు నాయకులుగా గుర్తించి బతుకుతాయవి!
ఎవరు ఎక్కువ?

కుక్కలలో పైచెయ్యి (డామినెన్స్) పద్ధతి లేదు. ఒక జంతువుల జత ఏదైనా విషయంలో పోటీపడితే అందులో ఎవరిది పైచేయి అన్నదే ఈ డామినెన్స్. కుక్కలలో నిజానికి మనిషితోబాటు ప్రైమేట్స్‌లో తప్ప, మరే జంతువులోనూ ఈ లక్షణం కనిపించదని పరిశోధకులు అంటారు. కుక్కలకు మనిషితోబాటు, మరే జంతువుతోనయినా పోటీ పడవలసి ఉంటే, అది అక్కడితోనే ముగుస్తుంది. రుచికరమయిన తిండి దొరకడం గానీ, ప్రేమతో నిమరడం గానీ జరిగితే కథ అంతటితో ముగుస్తుంది. పోటీపడుతున్న జంతువు గురించి కొంత తెలుసు గనుక, ఆ సంగతిని వాడుకుంటే, ఫలితం అందుతుందని మాత్రం తెలుసు. తమదే పైచెయ్యి కావాలన్న పట్టు మాత్రం లేదు.

దోషభావం లేదు
ఇంటికి వచ్చి చూచేసరికి కుక్క, ఏదో వస్తువును పాడుచేసిందనుకుందాము. కుక్కవేపు చూస్తే, దాని ముఖం, శరీరంలో దోషభావం కనిపిస్తే కనిపించవచ్చు. కానీ, అది తప్పు చేసినట్లు దానికి అర్థమయిందనడానికి సూచన మాత్రం కానే కాదు. ఈ విషయంగా పరిశోధనలు జరిగాయి. యజమానికి, కుక్క తప్పు చేసిందని, ఫిర్యాదు చేస్తే చాలు. దాని ముఖంలో ‘తప్పుభావం’ కనబడుతుందని గమనించారు. నిజానికి, కుక్క ఏ తప్పు చేయకున్నా, ఆ భావం కనబడుతుందట. యజమాని తనను శిక్షించబోతున్నారని అర్థమయితేచాలు, కుక్కలు బిక్కమొహం వేస్తాయన్నమాట. ఎందుకు శిక్షించబోతున్నారన్న సంగతి మాత్రం వాటికి తెలియదు!
==============

శక్తియుక్తులెన్నో..

* మనుషులకు సాయం చేయడంలో మరొక జంతువేదీ కుక్కలకు సాటిరాదు. చింపాంజీలకు కూడా మనుషుల శరీరం కదలిక సూచనలు అంత బాగా అర్థం కావు. వేలు చూసినా అర్థం చేసుకోవడం ఒక్క కుక్కలకే చేతనయింది. కుక్కలకు ‘నేర్చుకునే శక్తి- కోరికలు’ చాలా ఎక్కువ. మనుషుల నడవడిని అవి మరీ మరీ పరిశీలించి అర్థాలు తెలుసుకుంటాయి. కుక్కలకు మనుషుల ముఖ కవళికలు ఎంతో నచ్చుతాయి. కోపం, మెచ్చికోలు సులభంగా అర్థమవుతాయి. అసలు, ఆ ముఖం ఎటువేపు ఎందుకు చూచేదీ వాటికి అర్థమవుతుంది. కళ్ళు లేని వారికి కుక్కలు తోడుగా ఉంటున్నాయని తెలుసు. ఆ రకం కుక్కలను గురించి ఫ్లోరెన్స్ గానెట్ వంటి జంతు శాస్తజ్ఞ్రులు లోతుగా పరిశోధించారు. కళ్లు లేనివారు వారి ‘చూపును’ కూడా కుక్కలు చురుకుగా అర్థం చేసుకోగలుగుతాయని ఆమె అంటున్నారు.

* కుక్కలకు తమ పరిసరాలను గురించి అంతగా తెలియదని ఒక్కోసారి అనిపిస్తుంది. బ్రిటా ఓస్ట్‌హౌస్ అనే పరిశోధకురాలు ఈ అంశం గురించి పరిశోధిస్తున్నారు. ఆమె చేసిన ప్రయోగంలో రెండు హాండిల్స్ ఉంటాయి. వాటిలో ఒకదాని నుంచి కట్టిన దారం అటు చివరన మాంసం ముక్క ఉంటుంది. అయినా కుక్కలు ఆ దారం సంగతి పట్టించుకోకుండా, తిండికి దగ్గరగా ఉన్న హ్యాండిల్‌ను లాగాయి. కుక్కలకు కాలంలో వెనక, ముందుల గురించి కూడా అంతగా తెలియదని అర్థమయింది. గతం అనుభవాలను అవి గుర్తుంచుకోవు. రానున్న కాలానికి జాగ్రత్తలు వాటికి తోచవు. అందుకే ఒంటరిగా వదిలిన కుక్కలు మరీ సమస్యలకు గురవుతాయి. సమస్యలకు కారణమూ అవుతాయి. వదిలి వెళ్లిన యజమాని ఏదో ఒకనాటికి తిరిగివచ్చే సంగతి వాటికి తోచదు.

* కుక్కల ముక్కు, వాసన శక్తి ఎంతో ప్రత్యేకమన్న సంగతి తెలిసిందే. మనుషుల వాసన శక్తి కుక్కలతో పోలిస్తే, చాలా తక్కువ. మనుషులకు సూచనగా కూడా తెలియని వాసనలను కుక్కలు పసిగడతాయి. మనిషి రక్తంలో డయాబెటిస్ కారణంగా చక్కెరలు ప్రమాద స్థాయికి చేరుకుంటే కుక్కలు గుర్తించి హెచ్చరిక చేయగలుగుతున్నాయి. అవసరమైతే అర్థరాత్రి కూడా మనిషిని నిద్రలేపి, హెచ్చరించేలా కుక్కలకు శిక్షణ ఇవ్వగలిగారు. కుక్కలలో వాసనకు సంబంధించిన వోమెరో నేసల్ ఆర్గాన్ అనే రెండవ (అదనపు) వ్యవస్థ ఉంటుంది. పైవరుస కోరపళ్లమీద నుంచి ఒక డక్ట్ ఉండి ముక్కులోకి తెరచుకుంటుంది. ఈ దారి వెంట కూడా వాసనలు తెలుస్తుంటాయి. ఈ వ్యవస్థ గురించి మరింత పరిశోధన జరగవలసి ఉంది. మిగతా కుక్కల వాసన గుర్తించటం దీని పని అని పరిశోధకులు భావిస్తున్నారు.

Friday, May 25, 2012

మన పనితనం

మనం ఒక ఉద్యోగం కొరకు అభ్యర్థన పంపాలంటే, మనకున్న ఆ కోరిక ఒకటి చెపితే చాలదు. మన గురించి, చదువు గురించి, ఇంతకుముందు చేసిన ఉద్యోగాల గురించి వివరాలు కూడా పంపాలి. ఈ సంగతులనంతా ఒక క్రమంలో రాసి పంపాలి. బయోడేటా, కరికులమ్ విటే, రెజూమె లాంటివి ఇందుకు పద్ధతులు. ఈ మధ్యన రెజుమె (ఈ మాటను సరిగా పలకడం చాలామందికిచేతకాదు. తెలుగులో దాన్ని రాసి చూపించడం అంతకన్నా వీలు కాదు) పద్ధతిని అందరూ ఆదరిస్తున్నారు. ఇంటర్‌నెట్లో చాలా సైట్లు మొదలు ట్రెయినింగ్ సంస్థల దాకా అందరూ మీ రెజుమె మేము బాగా రాసి యిస్తామంటారు. అంతేగాని, ‘బాగు’ లేక ‘మంచి’ అంటే ఏమిటో ఎవరూ చెప్పలేకపోతున్నారు. మన గురించి రాసే ఈ వివరాల పట్టిక ఎంత పొడుగుండాలి? దానికి సరయిన పద్ధతి అంటూ ఏదైనా ఉందా? వర్డ్ డాక్యుమెంట్ పంపాలా? లేక పీడిఫ్ పంపాలా? లాంటి ప్రశ్నలకు సూటిగా సమాధానం దొరకదు. ప్రింటు వేసి పంపే సందర్భంలో కూడా కాగితం సైజు, అక్షరం సైజు, ఎన్వలప్ సైజు లాంటివన్నీ అనుమానాలే.


అప్లికేషన్‌ను ఇతర దేశాలకు పంపాలంటే మరిన్ని చిక్కులు ఎదురవుతాయి. గ్రీసు దేశం వారికి మన వివరాలు ఎంత నిడివి ఉంటే అంత నచ్చుతాయట. నార్వేలో మాత్రం రెజుమె రెండు పేజీలు మించితే విసుక్కుంటారు. ఇటలీ, న్యూజీలాండ్ లాంటి దేశాలలో సీనియర్‌లయితే నిడివి అయిదు పేజీల దాకా ఉన్నా ఫర్వాలేదు. మన దేశంలో మరి ఏమిటి పరిస్థితి? ఎవరికయినా తెలుసా? దక్షిణాఫ్రికాలో అప్లికేషన్‌తో బాటు మన ఐడి నంబరు, ఏ దేశం వారులాంటి వివరాలు తప్పక ఇవ్వవలసి ఉంటుంది. జపానులో రెజుమె అంటే మన బయోడేటాలాగా పేరు, వయసు, స్ర్తి/పు వివరాలతోనే మొదలవుతుంది. యూరపులో కొన్నిచోట్ల అభ్యర్థులు తమ పేరు తప్ప మిగతా వివరాలు అన్నీ పంపడం కూడా ఉంది. మన దేశంలో కొన్ని రోజులకు ఆధార్‌నంబరు, అలాంటిదే మరో నంబరు అడుగుతారనవచ్చు. ఇంతకూ మనం ఏ రకమయిన వివరాలను ఏ పద్ధతిలో పంపాలన్నది ప్రశ్న!

అప్లికేషనుతో బాటు మన వివరాలు పంపవలసిన అవసరం ఏమిటి? అక్కడ ఒక వ్యక్తి కావాలి. ఆ పని చేయడానికి ఆ వ్యక్తికి కొన్ని సామర్థ్యాలు ఉండాలి. మనం ఆ పనికి పనికివస్తామని రుజువు చేయడానికి మనం, మన సామర్థ్యల వివరాలు పంపించాలి. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఈ పరిస్థితిమాత్రం మారదు. ఫెరారీ అనే కార్ల కంపెనీ వారు కొత్త మోడల్ కారు వచ్చినపుడు ఒకకొత్త కరపత్రం అచ్చువేయిస్తారు. వాళ్లు తమ కార్లను ప్రపంచమంతటా అమ్ముతారు. అన్ని దేశాలలోనూ పత్రంలోని భాష మారుతుంది గానీ, స్వరూపం మాత్రం ఒకేరకంగా ఉంటుందట. మన దరఖాస్తు, అర్జీ, అభ్యర్థన, అప్లికేషన్ విషయంలో కూడా ఇదే పద్ధతి పాటిస్తే తప్పులేదు. అందులో కథలు, కాకరకాయలు కాకుండా సూటిగా సమాచారం ఉండాలి.

రైల్వేవారు క్రీడాకారులకు ఉద్యగాలు యిస్తుంటారు. ఒక ఫుట్‌బాల్ ఆటగాడు తన అప్లికేషన్ పంపాడు. అందులో అతను ఇచ్చిన వివరాలు గమనించండి. వృత్తి: ఫుట్‌బాల్ ఆడడం, బాధ్యతలు: బంతిని తన్నడం, దాంతో పరుగెత్తడం, వీలయితే గోల్‌లోకి తన్నడం.. అలా సాగాయి వివరాలు. సాధారణంగా వృత్తి అంటే మనకు మరోలా తోస్తుంది. ఆకుపేషన్ అన్న ఇంగ్లీషు మాటకు ‘కులవృత్తి’ జవాబుగా తోచనవసరం లేదు. లెక్కలు రాయడం వృత్తి అయితే, అందులో భాగంగా ఏయే రకం పనులు చేశామన్నది చెప్పాలి. మదర్‌టంగ్ అన్న కాలంలో ఒకతను -అందరు అమ్మల నాలుకలలాగే అని రాశాడు! అప్లికేషనులో కనిపించవలసింది మన విలువ, సాధించిన పనులు మాత్రమే.

ఈమధ్యనే చేసిన ఉద్యోగంలో వెలగబెట్టిన నిర్వాకమంతా ఏకరువు పెడతారు కొందరు. అక్కడ ఇంతకూ మనం సాధించినదేమిటి, అంతకుముందు, అలాంటి శక్తి పాటవాలు ప్రదర్శించామా? లాంటి వివరాలు అవతలివారికి అందవు. నిజానికి చాలామంది ‘నేనేమి సాధించలేదు’ అంటారు. లేదా మామూలు సంగతుల గురించి గొప్పగా రాస్తారు. వాస్తవాలను రాయడం అంత కష్టం మాత్రం కాదు. మామూలు పనిలో కూడా మనం ప్రత్యేకంగా ఏమైనా చేయగలిగామా? అని ఆలోచించగలిగితే చాలు.
సేల్స్‌లో పనిచేసి ఉంటే, సూచించిన టార్గెట్‌లను అందుకున్నామా? అధిగమించామా? ఆ కంపెనీలో ముఖ్యులయిన క్లయింట్ల అకౌంట్లు మీ చేతిలో ఉండేవా? మంచిపని చేసినందుకు కంపెనీవారు గానీ, మరెవరైనాగానీ, మీకు అవార్డులు, అభినందనలు అందించారా? లాంటి వివరాలు మన విలువను పెంచుతాయి.

ఎంత పెద్ద బడ్జెట్‌లను మనం నిర్వహించాము లాంటి వివరాలు మరింత బలం అందిస్తాయి. లక్షలు, కోట్లలో ఉండే లావాదేవీలు మన చేతిమీద నడిచినట్లయితే గొప్ప. చివరకు అలాంటి ప్రాజెక్టులో ఏ మూలనయినా బాధ్యత గల పొజిషన్‌ను నిర్వహించి ఉంటే, మన విలువ బయట పడుతుంది. వేల మంది పనిచేసే ఒక ఆఫీసు కాంప్లెక్స్‌లో పరిశుభ్రతను ‘నేనే నిర్వహించాన’ని గౌరవంగా, గర్వంగా చెప్పవచ్చు. పాత కంపెనీలో మన తాహతుకుమించిన బాధ్యతలు మనమేదయినా నిర్వహించామా? అనుభవంలేని వారు కూడా వెతికితే, చదువుకునే సమయంలో చేపట్టిన బాధ్యతలు, సంధించిన లక్ష్యాలు ఉండే ఉంటాయి. రాత, మాట అవసరమయే ఉద్యోగాలు చాలా ఉంటాయి. ప్రజలతో సంపర్కం ఉండే బ్యాంకు ఉద్యోగాల లాంటివి కొన్ని ఉంటాయి. అక్కడ మన తీరు, మన మాట తీరులకు ప్రాముఖ్యం ఉంటుంది. రచనలు, ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడంలాంటి వాటికి అక్కడ ప్రాముఖ్యం! అసలు కస్టమర్లను సంతృప్తిపరచడం, వారి చేత అవుననిపించుకోవడం గొప్ప సామర్థ్యం! అలాంటి అనుభవాలు మనకు ఉన్నాయా?

అసలు బాధ్యతలతో బాటు అదనపు బాధ్యతలు నిర్వహించిన వారికి గౌరవం ఎక్కువ. ఇలాంటి వివరాలన్ని రెజుమెలో ఉండాలి. దానితోబాటు, అంతే గౌరవంగా రాసిన కవరింగ్ లెటర్ ఉండాలి. ఆ ఉత్తరాన్ని చూడగానే, చదవగానే మన తీరు బయట పడుతుంది. కాగితాలను మడిచి చిన్న కవర్లో పెట్టడంలోనూ, సరైన సైజు ఎన్వలప్‌లో, లేదా మరీ పెద్ద కవర్‌లో పెట్టంలోనూ తేడా ఉంది! వారి సమస్యకు ‘మనం సమాధానం’ అన్న భావం కలిగించగలిగితే గ్రేట్! కదూ!



రెండవ అవకాశం





అనగనగా ఒక రైతు. ఆయన పొలం అడవికి పక్కనే ఉంది. కష్టపడి పనిచేస్తాడుగానీ, ఏదో ఒకనాడు అదృష్టం వచ్చి తన ముందు కుప్పగా పడుతుందని అతనికి ఒక నమ్మకం. అతను మామూలుగానే తోటలో తన పని తాను చేసుకుంటున్నాడు. అంతలో బాగా బలిసిన కుందేలు ఒకటి వేగంగా పరిగెత్తుతూ వచ్చింది. మరీ వేగంగా వచ్చిందేమో, అక్కడ ఒక చెట్టుకు తగిలింది. చటుక్కున దాని మెడ విరిగింది. కుందేలు పాపం చచ్చిపడింది.
రైతుకు మాత్రం అది అదృష్టంలాగా కనిపించింది!
అతను వెళ్లి కుందేలును ఎత్తి తెచ్చుకున్నాడు. ‘ఇట్లా నిత్యం ఒక కుందేలు దొరికితే ఇంకేం కావాలి? ఈ కష్టం, ఈపని ఏవీ అవసరమే ఉండవు అనుకున్నాడు.
మరునాటినుంచి అతను పార, పలుగు పక్కన బెట్టి ఆ చెట్టు దగ్గరే మరో కుందేలు కోసం ఎదురు చూడసాగాడు. రోజులు గడుస్తున్నాయి, కుందేలు మాత్రం మరొకటి రాలేదు.
రైతు ఆశ మాత్రం చావలేదు. అందరూ అతడిని గేలి చేయసాగారు.

(అదృష్టాలు, అవకాశాలు అనుకోకుండా వస్తాయి. వాటి గురించి ఎదురుచూచి లాభం లేదు. వస్తే ఆనందించాలి గానీ అవకాశాల కొరకు ఆశించకూడదు. కష్టపడడంలో ఉన్న సుఖం మరోచోట లేదు. చేయదల్చుకున్న మంచి పనయినా మొదటి అవకాశంలోనే చేయాలి. మరోసారి చూద్దాం అనుకుంటే, ఆ మరోసారి రానే రాదు!)

====================
అసలు మాట!
మనమేమయినా అయిపోవచ్చు. అందుకే ఇక్కడ అన్యాయమన్నది అసంభవం. పుట్టుక ప్రమాదవశాత్తు జరుగుతుందేమో? చావులో మాత్రం ప్రమాదం లేదు. మనం ఎలాగున్నామో, అలాగే ఉండిపోవాలని ప్రపంచంలో ఏ శక్తీ ఒత్తిడి చేయదు
-జాన్ బెర్జర్

మిగతా జీవులకు అంతగా లేని వెసులుబాటు మనుషులయిన మనకు ఉంది. మనం తార్కికంగా ఆలోచించగలుగుతాము. కార్యకారణాలను గుర్తించగలుగుతాము. సహేతుకంగా, తెలివిగా మనకు కావలసినవాటిని ఎంపిక చేసుకోగలుగుతాము. నిర్ణయించి కొత్త దిశలో కదలగలుగుతాము.

కోపం ప్రదర్శించడం కుదరలేదనుకుందాం. మన భావాన్ని మరో రకంగా పదుగురికీ తెలియజేసే మార్గం వెతకగలుగుతాము. మనవారి పొత్తు పొసగకపోతే, ప్రయత్నించి సమస్యకు సమాధానం వెతకగలుగుతాము.
ఏ విషయంలోనైనా ఒకటి కంటే ఎక్కువ మార్గాలుంటాయి. చాలామంది పని ఒత్తిడి పేరున ఈ సంగతి గుర్తిచలేకపోతారు. అప్పుడు అక్కడ ఇరుక్కుపోయిన భావం కలుగుతుంది. మార్గాలు ఉన్నా కనిపించవు. అంతా గందరగోళమవుతుంది.
నిలకడగా ఆలోచించడం మంచిది!

Monday, May 21, 2012

గతంగా మనం

ఆది మానవుడు, రాతియుగాలు, పాత బతుకుల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. తెలుసుకోవాలన్న ప్రయత్నం మాత్రం సాగుతూనే ఉంది. మానవ జాతి మరింత కాలం కొనసాగుతుంది. రానున్న కాలానికి మనం ‘గతం’లో ఉంటాము. మన ప్రస్తుతపు బతుకుల గురించి, ఆ తరాలకు తెలియగలిగిన సమాచారం గురించి ఆలోచనలు మొదలయినయి. మన గతంలో వారికి సమాచారాన్ని కేవలం సమాచారంగా దాచవచ్చునన్న ఆలోచన లేదు. అది కలిగిన తర్వాతి సమాచారం కూడా మన వరకూ మిగల్లేదు. నలందా, తక్షశిల గ్రంథాలయాలు మనకు అందలేదు. ఒక అగ్నిప్రమాదంలో అలెగ్జాండ్రియా జ్ఞాన భాండాగారం మసిగా మారింది.


లక్ష సంవత్సరాల తర్వాత పురాతత్వవేత్తలు మన గురించి తెలుసుకునే ప్రయత్నంలో పడితే ఏం దొరుకుతుంది? మనకు దొరికినట్లే కుండ పెంకులు, బూడిదల ఆధారాలేనా? కాలం ఒరిపిడికి నలగకుండా, నలుదిక్కులా చెల్లాచెదరు కాకుండా, కరిగి, మురిగిపోకుండా ఏ రకం సాక్ష్యం మిగులుతుంది? వ్యక్తిగా ఏ ఒక్కరూ తమ ఆనవాలుగా, ఆనాటి వారి కొరకు ఏమీ మిగల్చలేరు. మన తాతగారి తాతగారి వస్తువు, మన ఇంట్లో ఒక్కటి కూడా లేదు. మరో లక్ష సంవత్సరాలవరకూ మనగలిగిన వస్తువు మన దగ్గర లేదు. మానవజాతి చరిత్ర లక్ష సంవత్సరాల క్రితం మొదలయింది. అదీ ఆధునిక మానవుని చరిత్ర. అది ఆఫ్రికాలో మొదలయింది లాంటి విషయాన్నీ ఊహలు మాత్రమే. రాతి పనిముట్లు అక్కడక్కడ రాళ్లుగా మారి మిగిలిన అవశేషాలు ఈ ఊహలకు ఆధారాలు.

మనం భూమి మీద బతుకుతున్నాము. మన ఎముకలు రాయిగా మారి (శిలాజాలయి) మిగిలిపోయే వీలు చాలా తక్కువ. కానీ, ఏడు వందల కోట్ల మంది ఉన్నాము గనుక, ఏ కొందరి అవశేషాలయినా మిగిలితే మిగలవచ్చు. అటువంటి అరుదైన అవకాశం రావాలంటే మనుషులూ, మరిన్ని జంతువులూ కాల్షియం బాగా ఉండే మడుగులు, చిత్తడి నేలలు, గుహలలో చనిపోవాలి. ఆ శరీరాలు ‘తక్షణం శిలాజాలు’గా మారతాయి. శరీరం, ఎముకలు కుళ్లిపోయేలోగా వాటిలో ఖనిజాలు చేరుకుంటాయి. కనుక గట్టిబడి మిగిలిపోతాయి. దక్షిణ కీన్యాలో ఒక వన్యమృగం ఇలాగే చనిపోయింది. రెండు సంవత్సరాలు కూడా గడవకముందే దాని శరీరంలో కాల్షియం కార్బొనేట్ నిండిపోయింది. శరీరం రాతివిగ్రహంగా మారింది.

శ్మశానాల్లో పాతిపెట్టిన శరీరాలు కనీసం కొన్ని శతాబ్దాలలో ఎముకలతో సహా మట్టిగా, నుసిగా మారిపోతాయి. కనుక రానున్న యుగాల మానవులు మన కోసం శ్మశానాలలో వెతికి లాభం ఉండదు. కానీ ప్రమాదాలు జరిగి, సామూహికంగా జనం అంతరించినచోట కొన్ని అవశేషాలు మిగిలే వీలు ఉంది. ఈ మధ్య వచ్చిన సునామీలో కొందరు అలా మట్టిలో మిగిలిపోయారు. అగ్నిపర్వతాల బూడిదలో కప్పుకుపోయిన వారు కూడా అలాగే మిగిలిపోతారు. పీట్ గుంటలలో, ఎడారులలో కూరుకుపోయిన శరీరాలు కూడా మమీలుగా మారతాయి. కానీ, లక్ష సంవత్సరాల కాలంలో వచ్చే మార్పులను తట్టుకుని అవి మిగిలి ఉండే వీలు మాత్రం తక్కువ. మన గురించి మిగిలి ఉండగలిగిన మరికొన్ని ఆధారాలు కూడా ఈ మార్పుల కారణంగా నాశనమయిపోతాయి. సముద్ర మట్టాలు పెరిగితే, తీరాలలోని నగరాలు మునిగిపోతాయంటున్నారు. అలల కారణంగా అక్కడి భవనాలు సమసిపోతాయి. భూమిలోపలి మాళిగలు, పునాదులు మిగిలిపోతాయి. కొంతకాలానికి కాంక్రీటు కూడా కరిగిపోతుంది. అయినా వాటి ఆకారాలు మాత్రం మట్టిలో అచ్చులుగా మిగిలి ఉంటాయి. ఈ రకం ఆకారాలు ప్రకృతిలో మరెక్కడా ఉండవు గనుక, అప్పటివారికి అవి మనిషి ఆనవాళ్లుగా దర్శనమిస్తాయి.

మనుషులు మరీ పెద్ద నిర్మాణాలను నిలబెడుతున్నారు. ఆనకట్టలు వాటిలో కొన్ని. అదేరకంగా, గనుల పేరున తవ్విన గుంటలలో సెడిమెంట్ నిండుతుంది. నిర్మాణం గురించి తెలుస్తుంది. మనం ప్రస్తుతం భూమి వాడుకుంటన్న తీరు బహుశః అర్థ్ధమవుతుంది. యుఎస్‌లోని హూవర్ డ్యాం, చైనాలోని త్రీ గార్జెస్ లాంటివి మరీ పెద్దవి. వాటి ఆనవాళ్లు లక్ష సంవత్సరాల వరకు తప్పక మిగులుతాయంటారు పరిశోధకులు. ఫిన్‌లాండ్‌లో అణు వ్యర్థాలను దాచడానికి ఒక రిపాజిటరీని ఏర్పాటు చేస్తున్నారు. అది లక్ష సంవత్సరాలయినా నిలిచి ఉండే రకంగా కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి నిర్మాణాలు కూడా కొన్ని మిగిలిపోతాయి.

రానున్న కాలానికి మనం వదులుతున్న ‘చెత్త’ మాత్రం తప్పకుండా అందుతుంది. నగరాల వ్యర్థాలను లాండ్‌ఫిల్స్ పేరున మేట వేస్తున్నారు. నిండిన ఈ గుంటల మీద మట్టి పొరలు కప్పుతున్నారు. కనుక లోపలికి ఆక్సిజన్ చొరకుండా ఉంటుంది. ఏ పదార్థమయినా పాడవడానికి, మారడానికి ముందు ఆక్సిజన్ అవసరం. గాలి, ఆక్సిజన్ తగలకుంటే ఈ చెత్త గుంటలలో పూడుకుపోయిన గుడ్డలు, కర్రలు కూడా ఎంతకాలమయినా మిగిలి ఉండే వీలు ఉంది. ఈ పదార్థాలన్నీ కాలక్రమంలో మారతాయి. అయినా ఆ కొత్త రూపం వాటి పాత స్థితిని పట్టి ఇవ్వగలుగుతుంది.

కొన్ని పదార్థాలు మాత్రం ఎట్లున్నవి అట్లా ఉండిపోతాయి. నిజానికి మనం పాత్రల కొరకు, మరే ఉపయోగానికీ రాతిని వాడడం మానుకున్నాము. రాతి విగ్రహాలు మాత్రం తయారవుతున్నాయి. అవి కొంతకాలం మిగిలి ఉంటాయి. పింగాణీ కప్పులు, ప్లేట్లు, మగ్గులు కూడా ఎనే్నళ్లయినా మిగిలి ఉంటాయి. అంటే, కొత్త మనుషులకు మనం ‘రాతియుగం’గా మిగిలిపోతాము. ఇనుము లాంటి లోహాలు త్వరగా మారిపోతాయి. టైటేనియం, స్టెయిన్‌లెస్ స్టీల్, బంగారం లాంటివి కొన్ని ఎంతకాలమయినా ఉంటాయి. అయిదు వేల ఏండ్ల నాటి బంగారం ఇప్పటికీ కొత్తదిగా తళతళలాడుతూ ఈజిప్టులో దొరికింది. లక్ష సంవత్సరాలయినా అది అట్లాగే ఉంటుందని అంటారు సైంటిస్టులు. లాప్‌టాప్ కేసులను టైటేనియంతో తయారుచేస్తున్నారు. లోపలి భాగాలన్నీ పోయి ఈ కేసులు మాత్రం మన గుర్తులుగా మిగులుతాయి. వాటి ఆకారాలు, వాటిమీది కంపెనీ గుర్తులు, అప్పటివారికి పెద్ద చిక్కు ప్రశ్నలుగా ఎదురవుతాయేమో?

మన గురించి తెలియజేయడానికి ఏదో మిగిల్చిపోవాలని ప్రయత్నం జరుగుతుంది. కానున్న వారికి మన నాగరికతలోని ఏ అంశం ఎంత ఆకర్షణీయంగా కనబడుతుందన్న ప్రశ్నకు జవాబు లేదు. ప్రస్తుతం ప్రాచీన మానవుల గురించిన పరిశోధన మొత్తం డార్విన్ సిద్ధాంతాల ఆధారంగా సాగుతున్నది. వంద సంవత్సరాల క్రితం ఈ సిద్ధాంతం లేదు. ప్రస్తుతం మనం సేకరించి, నిక్షేపాలుగా దాచుకుంటున్న ఆనవాళ్లు రానున్న యుగాలవారికి ఏ రకంగా కనబడేదీ, వాటికి వారు ఏమని అర్థాలు చెప్పుకునేదీ మనం ఊహించలేము. అప్పటివారికి రాగలిగే ఆలోచనలు ప్రస్తుతం మనకు తోచే ఆస్కారం లేదు.

Wednesday, May 16, 2012

చేతులు కలిసిన చప్పట్లు


జీతం బాగానే ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఇంక్రిమెంట్ మాత్రం లేదన్నారు. అందరికీ ఇవ్వగూడదని ఒక పాలసీ! అందుకని ఇవ్వలేదు! అని చెప్పారు కూడా. అయినా అతను అక్కడే సంతోషంగా పని చేస్తున్నాడు. అతనికి అక్కడ ఆనందంగా ఉందని మాత్రం కాదు. ఆనందం కొంత ఉంది. కొంత లేదు. ఉద్యోగం వదిలితే మరోచోట దొరుకుతుంది. ఎక్కువ జీతం వచ్చే వీలు కూడా ఉంది. కానీ, ఎక్కడో ఏదో మెలిక ఉంది. ఏది బాగుంది. మేనేజర్లు తప్ప మిగతా వారంతా బాగుంటారు. బహుశ పనిలో ఎక్కడో కొంత సంతృప్తి కూడా దొరుకుతున్నట్లుంది.

బోలెడు జీతాలు, బోనసులు ఇవ్వడం గొప్పకాదు. జీతాలు బాగా ఇస్తే ఎవరూ కెఫెటీరియాలో తిండి తినరు. బైక్ వేసుకుని మరెక్కడికో వెళ్లిపోతారు. అక్కడ కూడా మేనేజర్ (వెర్రి) గురించి మాట్లాడుకుంటారు. వాళ్లకు మరి జీతం కన్నా, కావలసింది మరేదో ఉందిమరి! చేసే పనికి అర్థం ఉండాలి. వాళ్ల శక్తి బయటపెట్టి చూపించడానికి తగిన అవకాశం ఉండాలి. అంతేగానీ, ఫలితం బాగున్నా, పద్ధతి తమది కాదని, అదేపని మళ్లీ చేయమంటే, వాళ్లకు ఒక అసంతృప్తి మిగులుతుంది. అప్పుడు జీతం గుర్తురాదు. మీరు మేనేజరయినా, కాకున్నా ఈ సంగతి అనుభవంలోకి వచ్చే ఉంటుంది. నిజానికి ప్రభుత్వ ఉద్యోగాలలోనూ, ప్రైవేటు కంపెనీలలోనూ ఎవరికెంత జీతం ఇవ్వాలన్న విషయం మధ్య మేనేజర్ల చేతుల్లో ఉండదు. ఆ అధికారం ఉంటే బాగుండునన్న కోరిక మాత్రం మేనేజర్లకు బాగా బలంగా ఉంటుంది. జట్టులో వారిని ఉత్సాహపరిచి, పని మీద అభిమానం పెరిగేలా చేయవలసిన బాధ్యత మాత్రం పూర్తిగా మధ్య మేనేజర్లదే. తమ ఈ బాధ్యతను, బరువుగా భావించి, చాలా మంది మేనేజర్లు తప్పు పద్ధతులను అనుసరిస్తుంటారు. స్ట్ఫాను నలుపుకు తినడం గొప్ప అనుకుంటారు.

కంపెనీ ముఖ్యమయనది. అందులో మన టీంలో, నాయకులతోబాటు, మిగతా వారంతా కూడా మనకు అసలయిన కంపెనీ. ముందు ఈ కంపెనీ బాగుండాలి. అప్పుడు మొత్తం కంపెనీకి, బజార్లో మంచి పేరు వస్తుంది. ఎవరికీ ఈ ప్రపంచాన్ని మరమ్మతు చేసే కోరిక, ఓపికా ఉండవు. తన చుట్టున్న ప్రపంచం బాగుంటే, మొత్తం ప్రపంచం బాగానే ఉంటుంది. కనీసం, ఆ భావమయినా కలిగి పని చేయడానికి ఉత్సాహం ఉంటుంది. ఇది వాస్తవంగానూ, సూక్ష్మంగానూ అందరికీ మనసులో ఉండే కోరిక. ఉదయం పనిలోకి వచ్చాము. సాయంత్రం బయటపడే సమయానికి, ఎప్పుడు బయట పడతామా? అనే, ఉసూరుమనే భావం కాకుండా ఉంటే మేలు. కొంతయినా చేశామన్న సంతృప్తితో ఇంటికి వెళితే నిద్ర బాగా పడుతుంది. మేనేజర్లకు కూడా ఇదే కోరిక ఉంటుంది. కానీ బాధ్యత కారణంగా, వారి ప్రవర్తన కొంచెం మొరటుగా ఉండే వీలుంది. తమ సంగతి అర్థం చేసుకుని వారు మరింత స్నేహభావం చూపగలిగితే పరిస్థితి మారుతుంది. వారికి మనసులో స్నేహభావం చూపాలన్న ఆలోచన కలిగించే బాధ్యత జట్టులోని వారికందరికీ ఉంటుంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లవుతాయి మరి!

ప్రపంచాన్ని మరమ్మతు చేయటంలో, లేదా కనీసం మెరుగుపరచడంలో మన సంస్థకు కూడా భాగం ఉంటుంది. అందులో మన వంతు పాత్ర ఎంతన్నది జట్టులో అందరికీ అర్థం కావాలి. డబ్బులిచ్చి పని చేయిస్తున్నారంటే, మన ఉద్యోగం తప్పకుండా గొప్పదే అయి ఉంటుంది. (కిరాయి గూండాలు, బిర్యానీలు డబ్బులకు సమ్మెలలో పాల్గొనే వారి సంగతి మాత్రం వేరు) మంచిపనికి మాత్రమే విలువ ఉంటుంది. డబ్బులు చేతులు మారుతున్నాయంటే అక్కడ కొన్ని పరిస్థితులు ఉండక తప్పదు. ఎవరో ఒకరికి కష్టం, శ్రమ, బాధ తగ్గుతుంది. ఒకరికి నమ్మకం, ఆశ పెరుగుతాయి. చివరగా ఈ ప్రపంచం, పని కారణంగా, మరింత మెరుగవుతుంది. ఇలాంటి ఉద్దేశ్యం కొరకే అందరమూ తపన పడతాము.

మన ఉద్యోగంలో కూడా ఈ మూడింటిలో ఒకటయినా జరుగుతూ ఉంటుంది. ఆ కారణం కనిపించాలి. ఇక మేనేజర్లు, టీములు, యజమానులు, క్లయింట్లు అందరి మధ్యనా కనెక్షన్లు వాటంతటవే మెరుగవుతాయి. ఒకచోట ఒక భవనం కడుతున్నారు. ‘ఆఁ! ఏముందీ? పొట్టకూటికి ఇటుకలు పేరుస్తున్నాను, అన్నాడు ఒక మేస్ర్తి. కాలేజీ బిల్డింగట! కొంచెం కొత్తగా ఉంది, ప్లాను!’ అని రెండవ మేస్ర్తి అన్నాడు. ఇక మూడవ మేస్ర్తి మాత్రం, ఆ కాలేజీ ప్రత్యేకత గురించి అందులో చదవబోయే యువత గురించీ కలలు గన్నంత బాగా వివరించాడు. చేసే పని చిన్నదయినా అందులోని విలువను గుర్తించి చేస్తుంటే, ఇంక్రిమెంటు ఇవ్వలేదన్న సంగతి మళ్లీమళ్లీ ముందుకు రాదు. మేనేజర్లయినా ఇదే పద్ధతిలో పనినే పరమార్థంగా భావిస్తే, అందరికీ బాగుంటుంది. మనస్తాపం లేకుండా అందరూ ఆనందంగా పనిచేసుకుపోతారు.

ఉత్సాహంగా ఉండాలన్నా, ఉత్సాహం పెరగాలన్నా మనుషుల మనసుల్లో మార్పు రావాలి. జేబులు, పర్సులు బరువయినంత మాత్రాన ఉత్సాహం పెరగకపోవచ్చు. ప్రతి ఉద్యోగంలోనూ ఎవరి బాధలనో తగ్గించడానికి, నమ్మకాలను, ఆశయాలను పెంచడానికీ, ప్రపంచాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడానికీ అవకాశాలుంటాయి. వాటిని గుర్తించి, ఆనందాన్ని అనుభవించాలంటే అన్ని స్థాయిలలోని వారూ కలిసి ప్రయత్నం చేయాలి. ముందు, సవ్యంగా మనసువిప్పి మాట్లాడే పరిస్థితి, అలవాటు ఉండాలి. మాటలతో, బంధాలు ఏర్పడతాయి. బలపడతాయి. పని, కస్టమర్లు, సమాజం, సహోద్యోగులు, స్వంత కుటుంబం అన్నింటికీ పరస్పరం బంధాలు ఉండాలి. రానున్న కాలం గురించి కలలుగంటే, అందులో ఈ దృశ్యాలే కనబడతాయి మరి!
ఉద్యోగం మాని వెళ్ళిపోతానన్న వ్యక్తికి, ‘మరింత జీతం’ ఆశ చూపితే ఉండకపోవచ్చు. వారికి కావలసింది మరేదో ఉంటుంది. అది, మరో చోటయినా దొరుకుతుందేమోనన్న ఆశ ఉంటుంది. ఆ బంధం, ఇక్కడే దొరకాలంటే, రెండు చేతులు కలవాలి. చప్పట్లు మోగాలి.

అసలు మాట
మనమన్న మాట గొప్ప ‘కోట్’ అవుతుందనీ, దాన్ని అందరూ చెప్పుకుంటారనీ అనుకోవడం అర్థం లేని మాట. అది నిజమయినా, అందుకు చాలా కాలం పడుతుంది.
-అజ్ఞాత జ్ఞాని
నాకు గొప్ప పేరుంది! అమ్మా, నాన్నా పెట్టిన పేరు!