Showing posts with label పరిచయం. Show all posts
Showing posts with label పరిచయం. Show all posts

Saturday, June 30, 2012

తలకెక్కే తత్వాలు


తత్వగీతం: దీవి సుబ్బారావు
(తత్వగీతాల సంకలనం)
పేజీలు: 166,
వెల: రూ.100/-
ప్రతులకు: నవోదయ,
విశాలాంధ్ర పుస్తకాలయాలు;

పోతులూరి వీరబ్రహ్మంగారి పేరు చెప్పగానే అందరికీ ‘కాలజ్ఞానం’ముందు గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత బ్రహ్మంగారి తత్వాలు తలపునకు వస్తాయి. దీవి సుబ్బారావుగారు శ్రమకోర్చి బ్రహ్మంగారి తత్వాలను సేకరించి, పరిష్కరించి ప్రచురించారు. ఈ సేకరణలో వారికి మరి కొందరు పండితులు సాయం చేశారు. బ్రహ్మంగారి దారిలోనే తత్వాలు పాడిన సిద్దయ్య, లక్ష్మప్పల రచనలు కూడా ఈ సంకలనంలో చేర్చడం బాగుంది. వీటితోబాటు అజ్ఞాత గీత రచయితల తత్వాలు కూడా కొన్ని, సంకలనం చివరలో చేర్చారు. చదవడానికే కాక పాడడానికి కూడా అనువయిన తత్వాల రాగ తాళాల వివరాలను ప్రచురించడం మరింత ఉచితంగా ఉపయోగకరంగా ఉంది.

బ్రహ్మంగారి తత్వాలు వినడానికి ఎంతో సులభంగా ఉంటాయి. కాని వాటిలో యోగ విద్యకు సంబంధించిన వివరాలు సూచనలు నిండుగా ఉంటాయి. ఉదాహరణకు చాలా తత్వాలలో ‘బయలు’అనే మాట కనబడుతుంది. ఈ మాట అర్థాన్ని వివరింపబూనితే కొన్ని పేజీల గ్రంథమవుతుంది. ‘బయలూరికి పోవలెరా’ అంటారు బ్రహ్మము. అది మోక్షానికి గుర్తు. కుక్కను పట్టవలె, మూడు మూతల పెట్టెలో భూతము, పాము చిర్రున లేచుట, ఆరు కొమ్ముల ఏనుగు, అయిదు కోతులు, అయిదు మేకలు మొదలయినవన్నీ లోతయిన ప్రతీకలు. ‘నీళ్లలో మునిగి గొణుగుచు ఉంటే నిలకడ చెడును’ అంటారు బ్రహ్మము. చిల్లర రాళ్లకు మొక్కుచు ఉంటే అనే ఈ పాట వేరువేరు రకాలుగా అందరికీ పరిచయమయినదే.

ఊర్థ్వమూలం, అధశ్శాఖం అన్న మాటను సులభంగా ‘మొదలు మీదుగ, తలలు క్రిందగ’ వర్ణిస్తారు మరొక పాటలో. ఇక సిద్దయ్య పాటలలో ఏ కులమని నను వివరమడిగితే’అన్నది చాలా ప్రసిద్ధము. లక్ష్మప్ప తత్వం ‘ఎరిగినందుకు గురుతు ఎరుకయే సాక్షి’ ఆ తర్వాత అమరనారాయణ కైవారయోగి నోట కూడా ‘తెలిసినందుకు గురుతు’గా ప్రతిధ్వనించింది. ఇల్లు ఇల్లనియేవు, జీవులెనుబది నాల్గు లక్షల, ‘గూట చిలుక’ లాంటి తత్వాలు కూడా ఈ సంకలనంలో ఉన్నాయి.

ఇంకా బ్రహ్మంగారు, ఆయన శిష్యుల తత్వాలు మిగిలి ఉండవచ్చునంటారు సంపాదకులు సుబ్బారావు. తత్వాలంటే నిజానికి పాటలు. ఈ ప్రచురణలోని తత్వాలలో చాలాచోట్ల లయ (వరుస) కుదరడం లేదు. మూలంలో అట్లా ఉండడానికి వీలు లేదేమో? అర్థం పేరిట పరిష్కరణ కారణంగా ఈ తేడా వచ్చిందా? తత్వాలను పల్లవి, చరణాలుగా వేసినట్టు కనబడదు. ప్రతి చరణం తర్వాత పల్లవి రావాలి. చివరలో మాత్రం ఇచ్చారు. ఏమయినా, విషయంలో ఆసక్తిగల వారందరికీ ఈ పుస్తకం అవశ్యం పఠనీయం.

Friday, June 8, 2012

ఆంగ్లంలో రాయల ఆముక్తమాల్యద


తెలుగునుంచి ఇంగ్లీషులోకి అనువాదమవుతున్న సాహిత్యమే తక్కువ. అందునా ఒక తెలుగు కావ్యాన్ని యథాతథంగా ఇంగ్లీషులో చెప్పే ప్రయత్నాలు జరగనేలేదు. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం, లలిత కళల విభాగంలో, అధ్యాపకులు శిష్ట్లా శ్రీనివాస్ ఏకంగా శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’ను ఎంచుకుని ఆంగ్లంలోకి అనువదించారు. ‘తాను ధరించిన పూమాలను శ్రీరంగనాధునికి సమర్పించిన’ శూడికుడుత్తు నాచ్చియార్ అనే గోదాదేవికి ఆముక్తమాల్యద అని పేరు. చెప్పడానికి గోదమ్మ గురించి నిజానికి పెద్ద కథ లేనేలేదు. కానీ శ్రీ కృష్ణదేవరాయలు, వైష్ణవ సాంప్రదాయానికి చెందిన మరెన్నో అంశాలు కావ్యంలో ఉండవలసిన వర్ణనలు కలిపి ఈ పేరున కావ్యాన్ని వెలయించాడు.

తెలుగు కావ్యాలలో ‘ఆముక్తమాల్యద’కున్న స్థానం విశిష్టమయినది. విచిత్రమయినది. కవిత్వంలో రెండు లక్షణాలుంటాయని, మొదటిది శబ్దం, కూర్పు, బిగింపు, గడుసుదనము, పలుకుబడి కలిగి ఉంటే, రెండవ దానిలో భావము, కల్పన, అలంకారములు, కథన శైలి ముఖ్యమయినవి. ఆముక్తమాల్యద ‘ఈ రెండు మార్గములలోను దానికదే సాటి’ అని విశ్వనాధ సత్యనారాయణగారి విశే్లషణ. పైగా ఈ కావ్యం సులభంగా నములుడుపడని నారికేళ పాకంలో నడుస్తుందని అందరూ అంగీకరించిన విషయం.

శ్రీనివాస్‌గారు ఇంతకుముందు కళా విషయాలను గురించి మంచి పుస్తకాలను రచించి, ప్రచురించారు. మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయనచూపు కావ్యాలను అనువాదం చేయడంవేపు మళ్లింది. మొదటి ప్రయత్నంగా తాము రాయల ఆముక్తమాల్యదను ఎంపిక చేసుకోవడానికి ఎన్నో కారణాలున్నాయంటూ శ్రీనివాస్‌గారు ఒక చక్కని నోట్ రాశారు. ముందు పుస్తకం గురించి పరిశోధన మొదలైంది. ప్రతులు, వ్యాఖ్యానాలు, చరిత్ర అన్నింటినీ సేకరించి సవివరంగా పరిశీలించారు. అనువాదం కూడా చేశారు. ఇంతకు ముందు రాసిన పుస్తకాలకు లాగే, ఈ ఆంగ్లానువాదానికి కూడా తానే ప్రచురణకర్త, సంపాదకుడు కూడా!

కావ్యంయొక్క అనువాద భాగం 325 పేజీలపైన ఉంది. ముందొక 125 పేజీలు, చివర మరొక కొన్నిపేజీలు, ఆసక్తికరమయిన విశేషాలతో నిండి ఉన్నాయి. చిత్రంగా ఈ పుస్తకంలో బోలెడన్ని బొమ్మలున్నాయి. బొమ్మలెందుకు అన్న ప్రశ్నకు కూడా శ్రీనివాస్ చక్కని వివరణ ఇచ్చి ఉన్నారు. కృతజ్ఞతల పేజీలో కొందరి పేర్లున్నాయి. నిజమే కానీ, పుస్తకమంతా శ్రీనివాస్‌గారి త్రివిక్రమావతారం కనిపిస్తుంది. ఇందులో ఒక వెసులుబాటు ఉంది. కొన్ని కష్టాలూ ఉన్నాయి.

పరిశోధకుడు, అనువాదకుడు, ఫ్రచురణకర్త తానే అయిన శ్రీనివాస్ ఒక కళాజీవిగా, కథకుడుగా చక్కనిపుస్తకాన్ని అందించారు. ముద్రణ కూడా చాలా బాగుంది. అట్టమీద బొమ్మ అందంగా ఉంది. గానీ ఆ బొమ్మనే ఎందుకు వాడిందీ అర్ధం లేదు. మొత్తానికి ఈ పుస్తకం ప్రచురణలో మరెవరిదైనా ప్రమేయం ఉంటే, దాని తీరు మరోరకంగా ఉండేదన్న భావం కలిగింది.

పరిశోధన చేసి రాసిన ప్రవేశిక, పండితులను ఆకర్షించేదిగా ఉంది. రాయల ఆముక్తమాల్యద వ్రాసిన తీరు గురించి, కథాక్రమం గురించి విడిగా చెప్పారు.ఆ తరువాత రియాలిటీ అండ్ మిత్ అనే పేరుతో కావ్యానికి సంబంధించిన సాహిత్య,రాజకీయ, మతపరమైన విశేషాలను ఎన్నో ఉపశీర్షికల కింద తర్కించారు. ఇందులోని చాలా అంశాలు (శ్రీనివాస్‌వల్ల కాదుగానీ) చర్చనీయమైనవే. రకరకాల విషయాలను ఒక చోటి చేర్చి చూడాలని శ్రీనివాస్ చేసిన ప్రయత్నం చాలా బాగుంది.

గోదమ్మ, పన్నిద్ధరాళ్వారులలో ఒకరు. కనుక కావ్యమంతటా వైష్ణవమే. కనుక శ్రీనివాస్‌గారు వైష్ణవం గురించి తర్కించడం సమంజసం,. అవసరం కూడా. కానీ మరింత వివరంగా ఈ విషయం గురించి సమాచారం చేరి ఉంటే బాగుండును. అహోబిల మఠాన్ని స్థాపించినవారు ఆదివణ్ శఠకోపయతి. ప్రస్తుతం ఉన్న ఇరువురు జియ్యర్లతో సహా, మఠానికి అధిపతులయిన యతీంద్రులు అందరి పేరులోను ముందు ఈ శఠకోప శబ్దం ఉంటుంది. ఈ పదానికి గల అర్ధం గురించి ప్రసక్తి సరిగా లేదని అనుమానం. శఠమనే దుర్లక్షణాన్ని దూరం చేసేది శఠగోపమని సంప్రదాయం. తమిళ భాషలో క,గలలకు ఒకటే అక్షరం గనుక అది శఠకోపమయిందా? తరువాత ‘వణ్ శఠకోప’ అని ఒక మాట వాడారు. శ్రవణ్ శఠకోప అని ఉండాలేమో! శ్రీమాన్ వంటి శబ్దమది.

‘చాలా తక్కువగా ఉన్న అచ్చు తప్పుల లాగే, ఏవో చిన్న ప్రశ్నలు తప్ప, శ్రీనివాస్ అందించిన పరిశోధనాంశాలు, కావ్యాలతో పోటీపడి చదివించేవిగా ఉన్నాయి. అనువాదానికి పడ్డ శ్రమకు సూచనగా పాఠభేదాలు, వ్యాఖ్యానాలతో తేడాల గురించి చేసిన చర్చ ఆసక్తికరంగా ఉంది. ‘పొరి విళంగాగ గములు’ అన్న మాటకు అర్ధం వెదికిన తీరు, ఆ వివరాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. తమిళంతో, అలనాటి తమిళంతో మంచి పరిచయమున్న వారు ఈ విషయాలను వివరిస్తే బాగుండును. పొరి అంటే పొడి అని అర్ధం ఉంది. లడ్డూలవంటి మధుర పదార్ధాలను ‘కాయలుగా వర్ణించే పద్ధతి కూడా ఉంది. గమి అన్నా గములు అన్నా సమూహమే! బాగుంది.

రాయల రచన చిత్రంగా సాగుతుంది. అది పండితులకే తప్ప మామూలు పాఠకులకు సులభంగా లొంగదు. మాతృక శైలి నారికేళమయితే, అనువాదశైలి కూడా అదే దారిని నడవాలా? నడవకూడదు. నడవలేదు. ఫలితంగా కావ్యం ఇంగ్లీషులో చదివితే అర్ధమయ్యేదిగా వచ్చింది. మూలంలోని ’జిగి’, ’బిగి’ అందవు. ఒకరకంగా అది లోపం. కానీ విషయం అందుతుంది. అది గుణం!

రెండవ అశ్వాసంలోనే విష్ణుచిత్తుడు ‘నాకు చదువురాదు!’ అని చెప్పడానికి ఒక పద్యం! ‘స్వామీ నన్ను’ అని ఆరంభమయే ఆ పద్యం అందరికీ తెలిసి ఉంటుంది. అందులో రెండు పాదాల నిడివికి పైన ఒక దీర్ఘమయిన సమాస పరంపర. దాన్ని ఇంగ్లీషులో మాత్రం చాలా సులభగ్రాహ్యమైన మాటలలో రాశారు. (ఈ పద్యం అనువాదంలో 91-ఎమెస్కో వారి మూలంలో 90-పాఠభేదమని అర్ధం!

అట్లాగే మూడవ ఆశ్వాసంలో 85 పద్యం ఒక సీసం. అది రాయల రచనకు మచ్చుతునక. మొదటి పాదంలోని మొదటి భాగం సంస్కృత సమాసం. రెండవ భాగం, (దొడ్డ కెందమ్మ కన్‌దోయి వాలి) అచ్చతెనుగు. ఆంగ్లంలో ఈ శైలిని ప్రతిబింబించడం సాధ్యమా? రాయల రచన ఎంత గహనంగా సాగుతుందో, శ్రీనివాస్ అనువాదం అంత సరళంగా సాగింది. మూలంలోని తీరు కనపడకపోవడం, లోపమయితే ఇది లోపం! అశోక్ బ్యాంకర్ అనే రచయిత ఆంగ్లంలో రామాయణం రాశాడు. అది నవల చదివినట్టు ఉంటుంది. అది లోపమా?

శ్రీనివాస్ కథను పద్యాల ప్రకారం వచనంగా చెప్పలేదు. పాదాల ప్రకారం అనువాదం చెప్పారు. అది కవిత మాత్రం కాదు. తన మాటలలో లయ ఉందని ఆయనే అన్నారు. తెలుగు పద్యాలలో ఎక్కడా కనిపించని ‘కొటేషన్’ మార్కులు ఎమెస్కో తెలుగు ప్రతిలో ఉన్నాయి. ఆశ్చర్యం మార్కులు అనువాదంలో ఉన్నాయి. అవి విషయంలో అనువాదకుడు పొందిన అనుభూతికి గుర్తులు!

కళా పరిశోధకుడు, పరిశీలకుడు శ్రీనివాస్, ఈ ‘కావ్యం’లో వాడిన ఫోటోలను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘సచిత్ర’ కావ్యం ఒక కొత్త పద్ధతి. పద్యం చదువుతుంటే, తన కనుల ముందు మెదలిన చిత్రాలను, (అక్కడకక్కడ నేరుగా సంబంధం లేకున్నా) వాడిన తీరు ఆసక్తికరంగా ఉంది.

‘తలిరింగైదువుజోదునానతి’ (వి.95)లో ఆయుధాల ప్రసక్తి. అక్కడ బొమ్మ లియోనార్డో దావించీ ఫిరింగి! భలే!
తెలుగు, ఇంగ్లీషు భాషలతో సమానంగా పరిచయమున్నవారు రెండు ‘వర్షన్స్’ను తులనాత్మకంగా చదివి ఆనందించవచ్చు. తెలుగు తెలియనివారు గోదమ్మ కథను, మిగతా అంశాలను మరింత బాగా ఆనందించవచ్చు. ఆనందించవలె! ఈ పుస్తకాన్ని అంతర్జాతీయ సంస్థలవారు (ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్) అందుకుని ఉంటే, తెలుగులోని రచనల తీరు ప్రపంచానికి ‘మరింత’ బాగా అందేదని అనిపించింది. ఇప్పుడు అందనిది లేనే లేదు. మంచిపనికి మంచి ప్రాచుర్యం రావాలి. శ్రీనివాస్‌గారు ‘సేల్స్’ అన్న కార్యకమాన్ని కూడా తామే తలకెత్తుకుంటే తర్వాతి సృజనాత్మక కార్యక్రమం సాగదు. పుస్తకం అందవలసిన దూరాలకు అందదు!

అందంగా ఆసక్తికరంగా రూపొందించిన ‘ఆముక్తమాల్యద’ గ్రంథానికి అయిదు తక్కువ అయిదువందలు. తక్కువే ధర!

-కె.బి.గోపాలం

ఈ రచయిత ఈ మధ్యనే మనుచరిత్ర ఆంగ్లానువాదం కూడా ప్రచురించారు.

వివరాలకు:

శ్రీనివాస్ శిష్ట్లా
దృశ్యకళాదీపిక
4-61-7, లాసన్స్ బే కాలనీ,
విశాఖపట్నం - 530017

ఫోన్ - 09395345431

sistlasrini@gmail.com 

Tuesday, June 5, 2012

ప్రకటన - పరిస్థితి

టీ కొత్తగా దేశంలోకి వచ్చిన కాలంలో ఇలాంటి ప్రకటనలు వచ్చాయంటే నమ్మగలరా?


Tuesday, May 29, 2012

కుక్క - మానవుడు


మనిషి... ఆరడుగుల ఎ త్తున్న మరో మనిషిని నమ్మడు. అంగుళం తాళాన్ని మాత్రం నమ్ముతాడు. అంతకన్నా ఎక్కువగా తన కుక్కను నమ్ముతాడు. మనిషి జాతికి మరో జంతువు గురించి పట్టనప్పటినుంచి కుక్క తోడుగా ఉంది. పదిహేను వేల సంవత్సరాల క్రితం అంటే వ్యవసాయం కూడా అంతగా రాని నాటినుంచే కుక్కలు సాయంగా వచ్చాయి. అయినా, మానవ నాగరికతలో కుక్క పాత్ర గురించి తెలిసింది తక్కువ. అటు వేటలో, తరువాత పశుపోషణలో కుక్కలు ఎంతో సాయం చేశాయన్నది నిజం. కుక్కలను గురించి పరిశోధకులు చాలామంది పట్టించుకున్నారు. డార్విన్ కుక్కల నడవడిని పరిశీలించాడు. తన నాచురల్ సెలెక్షన్ సిద్ధాంతానికి వాటిని ఉదాహరణలుగా వాడుకున్నాడు. 20వ శతాబ్దంలో నోబెల్ గ్రహీత కాన్రాడ్ లోరెంజ్ కుక్కలగురించి విస్తృతంగా పరిశీలనలు సాగించారు. స్కాట్, ఫుల్లర్ అనే జన్యు శాస్తవ్రేత్తలు కుక్కల నడవడిని విశే్లషించారు. ఇటీవలికాలంలో మాత్రం కుక్కల గురించి పరిశోధనలు అంతగా జరగలేదనాలి. 21వ శతాబ్దం వచ్చిన తర్వాత మాత్రం వాటి మీదకు మరోసారి చూపు మరలింది. తోడేళ్లనుంచి కుక్కలుగా మార్పులో జరిగిన అంశాలు, వాటి తెలివి, భావావేశాల గురించి ఎంతో పరిశోధన జరిగింది, జరుగుతున్నది కూడా. కనుక కుక్కల గురించి ఎన్నో కొత్త అంశాలు తెలియవస్తున్నాయి.

పెంపుడు జంతువుగా...

నిజానికి మానవుడు కుక్కలను ప్రయత్నించి మచ్చిక చేయలేదు. వేట పద్ధతినుంచి జీవనవిధానం మారుతున్న రోజులలో కుక్కలు వాటంతటవే మనిషి పంచన చేరాయి. తోడేళ్లు క్రమంగా కుక్కలుగా మారాయని, డిఎన్‌ఏవిశే్లషణలో బయటపడింది. ఇప్పటి తోడేళ్లను గమనిస్తే, రాతియుగం మానవుడు వాటిని చేరదీసి మచ్చిక చేసిన వీలు కనిపించదు. అంటే, వెనుకటి కాలంలో తోడేళ్లు మరింత మెత్తని స్వభావం కలిగిండేవని అర్థం చెప్పవచ్చు. ఆ జాతి గతించింది. వాటి వారసులుగా కుక్కలు మిగిలి ఉన్నాయి. అప్పటి తోడేళ్ళు మనుషుల ప్రాంతాలలో తిండికోసం తిరిగాయి. వాటి పిల్లలను మనుషులు చేరదీశారు. అప్పటి మానవులకు జంతువుల కూనలను తెచ్చి పెంచుకోవడం అలవాటు! అట్లా మనుషుల మధ్యల పెరిగిన జంతువులను మచ్చిక చేసి పనులు నేర్పడం సులభం. ఆ దారిలో మనిషికి కుక్కలసాయం మొదలయింది. కాపలా, వేటలాంటి లక్షణాలుకూడా నేర్చిన తర్వాత వాటి సాయం పెరిగింది. అంటే కుక్కలను మచ్చిక చేయడం అనుకోకుండా జరిగిన పని! కానీ, దానివల్ల అటు తోడేళ్ళకు, ఇటు మనుషులకు మంచి జరిగింది. సహవాసం సాగింది.

మచ్చిక - క్రమం

ఉత్తర ఇజ్రాయెల్‌లో ఒక సమాధిలో ఒక వ్యక్తి కుక్కమీద చెయ్యి వేసి ఉండడం కనిపించింది. ఆ కుక్క పిల్లకు, అప్పటి తోడేలు పిల్లలకూ ఎంతో తేడా ఉంది. ముఖ్యంగా, దాని దంతాలు పూర్తిగా వేరుగా ఉన్నాయి. అంటే, ఆ కాలానికి తోడేళ్లు కొన్ని కుక్కలుగా మారినట్లు లెక్క. కుక్కపిల్లను మనిషితో బాటు ఖననం చేశారంటే పరస్పర సంబంధం, ప్రేమ అర్థమవుతాయి. 12 వేల సంవత్సరాల నాటి ఈ సమాధి కుక్కల చరిత్రలో ఒక గొప్పసూచనగా నిలిచింది. కానీ, అంతకుముందు ఎక్కడ, ఏ రకంగా కుక్కలు మచ్చికయిందీ చెప్పగల ఆధారాలు నేటివరకూ అందలేదు. గత ఏడాది సైబీరియాలో జరిపిన తవ్వకాలలో ఒక చోట కుక్క పుర్రె దొరికింది. అది 33 వేల సంవత్సరాలునాటిదని లెక్క తేలింది. పుర్రె నిర్మాణం కుక్క పుర్రెలాగున్నా, పళ్లు మాత్రం తోడేలు పద్ధతిలో ఉన్నాయి. గతంలో బెల్జియంలో దొరికిన ఒక పుర్రెకూడా 31 వేల ఏళ్ల నాటిదని ఈ మధ్యన నిర్ణయించారు. ఇది బహుశా, ఈనాటి కుక్కల పూర్వీకుల జాతికి చెందినవని అభిప్రాయం, అనుమానం వచ్చాయి. కానీ, ఈనాటి కుక్కలు ఈ క్రమంలోనివి కావని ఆధారాలు కూడా అందాయి. 24,000 నుంచి 13,000 సంవత్సరాలు మధ్యన, భూమి మీద మంచు యుగం వచ్చింది. అప్పుడు మానవులు దక్షిణ ప్రాంతాలకు తరలి వచ్చారు. మునపటి కుక్కలు వారితో రాలేదు. మచ్చిక కార్యక్రమం మరోసారి మొదలయింది.

మచ్చిక ఎక్కడ?

పురాతత్వ పరిశోధనలో అందిన ఆధారాల ప్రకారం, కుక్కల మచ్చిక మునుముందు పడమటి ఆసియా ప్రాంతంలో మొదలయింది. ఆ ప్రాంతాలను ఇప్పుడు మిడిల్-ఈస్ట్ (మధ్యప్రాచ్యం) అంటున్నారు. 2005లో కుక్కల డిఎన్‌ఏ నిర్మాణ క్రమాన్ని (జీనోమ్) పూర్తిగా గుర్తించారు. అంతకుముందు దొరికిన కుక్కలు, వాటి పూర్వీకులనుకున్న తోడేళ్ల జన్యు పదార్థాలను కూడా తరచి చూస్తే, పరిణామం, మచ్చికల గురించి మరెంతో తెలుస్తుంది. ఇలాంటి పరీక్షలు జరిగాయి. కుక్కలన్నింటిలోనూ మిడిల్ ఈస్ట్ పద్ధతి జన్యు నిర్మాణమే కనిపించింది. కనుక పురాతత్వ పరిశోధన వెల్లడించిన చరిత్ర సరయినదేనని గట్టిగా తెలిసింది. స్వీడన్ పరిశోధకులు పీటర్ సవొలైనెన్ మాత్రం కుక్కల పుట్టుక స్థానం ఆగ్నేయ ఆసియా అంటున్నాడు. జీవ జాతులు వేరు వేరు చోట్లకు చేరిన కొద్దీ వాటి జన్యువులలో వైవిధ్యం తగ్గి, మొదటి రూపం వస్తుంది. మాంగ్జే నది ప్రాంతపు కుక్కలలో మాత్రం ఆ లక్షణం కనిపించలేదు. యూరోపియన్ కుక్కలలో కూడా మధ్యప్రాచ్యం డిఎన్‌ఏ లక్షణాలు అంతగా కనిపించలేదట. కనుక పరిణామచరిత్రలో ఇంకా ప్రశ్నలు మిగిలాయి.
=================

అనుకోని నిజాలు

కుక్కల మధ్య బంధం
మచ్చికయిన తర్వాత కుక్కల కుటుంబం పద్ధతి పూర్తిగా మారిపోయింది. తోడేళ్లకు ప్రపంచమంటే కుటుంబం ఒకటే. తల్లి, తండ్రి, వాటి పిల్లలు కలిసి గుంపుగా తిరగడం వాటికి బాగా అలవాటు. పెరిగిన పిల్లలు కూడా తల్లిదండ్రులతోనే ఉండిపోతాయి. తమ తరువాత పుట్టిన పిల్లలను పెంచడంలో అవి సాయపడతాయి. తోడేళ్లనుంచి వచ్చిన కుక్కలకు మాత్రం ఈ కుటుంబం పద్ధతి ఏ మాత్రం చేతగాదు. కుక్కల మధ్యన ప్రేమ కలిగి ఉండడం లాంటివి కనిపించవు. అడవులలో పెరిగే కుక్కలు కూడా కుటుంబాలుగా ఉండవు. ఆడ తోడును ఎంచుకోవడంలో వాటికి ఒక పద్ధతి లేదు. ఇక పెంపుడు కుక్కలకు యజమాని, ఆ కుటుంబం మాత్రమే స్వంత కుటుంబంగా కనబడుతుంది. మిగతా కుక్కల సంగతి పట్టనే పట్టదు. నిజానికి కుక్కలకు.. కుక్క- మనిషి అనే తేడా తెలియదంటారు. మనిషితో కలిసి, మనిషినే జట్టు నాయకులుగా గుర్తించి బతుకుతాయవి!
ఎవరు ఎక్కువ?

కుక్కలలో పైచెయ్యి (డామినెన్స్) పద్ధతి లేదు. ఒక జంతువుల జత ఏదైనా విషయంలో పోటీపడితే అందులో ఎవరిది పైచేయి అన్నదే ఈ డామినెన్స్. కుక్కలలో నిజానికి మనిషితోబాటు ప్రైమేట్స్‌లో తప్ప, మరే జంతువులోనూ ఈ లక్షణం కనిపించదని పరిశోధకులు అంటారు. కుక్కలకు మనిషితోబాటు, మరే జంతువుతోనయినా పోటీ పడవలసి ఉంటే, అది అక్కడితోనే ముగుస్తుంది. రుచికరమయిన తిండి దొరకడం గానీ, ప్రేమతో నిమరడం గానీ జరిగితే కథ అంతటితో ముగుస్తుంది. పోటీపడుతున్న జంతువు గురించి కొంత తెలుసు గనుక, ఆ సంగతిని వాడుకుంటే, ఫలితం అందుతుందని మాత్రం తెలుసు. తమదే పైచెయ్యి కావాలన్న పట్టు మాత్రం లేదు.

దోషభావం లేదు
ఇంటికి వచ్చి చూచేసరికి కుక్క, ఏదో వస్తువును పాడుచేసిందనుకుందాము. కుక్కవేపు చూస్తే, దాని ముఖం, శరీరంలో దోషభావం కనిపిస్తే కనిపించవచ్చు. కానీ, అది తప్పు చేసినట్లు దానికి అర్థమయిందనడానికి సూచన మాత్రం కానే కాదు. ఈ విషయంగా పరిశోధనలు జరిగాయి. యజమానికి, కుక్క తప్పు చేసిందని, ఫిర్యాదు చేస్తే చాలు. దాని ముఖంలో ‘తప్పుభావం’ కనబడుతుందని గమనించారు. నిజానికి, కుక్క ఏ తప్పు చేయకున్నా, ఆ భావం కనబడుతుందట. యజమాని తనను శిక్షించబోతున్నారని అర్థమయితేచాలు, కుక్కలు బిక్కమొహం వేస్తాయన్నమాట. ఎందుకు శిక్షించబోతున్నారన్న సంగతి మాత్రం వాటికి తెలియదు!
==============

శక్తియుక్తులెన్నో..

* మనుషులకు సాయం చేయడంలో మరొక జంతువేదీ కుక్కలకు సాటిరాదు. చింపాంజీలకు కూడా మనుషుల శరీరం కదలిక సూచనలు అంత బాగా అర్థం కావు. వేలు చూసినా అర్థం చేసుకోవడం ఒక్క కుక్కలకే చేతనయింది. కుక్కలకు ‘నేర్చుకునే శక్తి- కోరికలు’ చాలా ఎక్కువ. మనుషుల నడవడిని అవి మరీ మరీ పరిశీలించి అర్థాలు తెలుసుకుంటాయి. కుక్కలకు మనుషుల ముఖ కవళికలు ఎంతో నచ్చుతాయి. కోపం, మెచ్చికోలు సులభంగా అర్థమవుతాయి. అసలు, ఆ ముఖం ఎటువేపు ఎందుకు చూచేదీ వాటికి అర్థమవుతుంది. కళ్ళు లేని వారికి కుక్కలు తోడుగా ఉంటున్నాయని తెలుసు. ఆ రకం కుక్కలను గురించి ఫ్లోరెన్స్ గానెట్ వంటి జంతు శాస్తజ్ఞ్రులు లోతుగా పరిశోధించారు. కళ్లు లేనివారు వారి ‘చూపును’ కూడా కుక్కలు చురుకుగా అర్థం చేసుకోగలుగుతాయని ఆమె అంటున్నారు.

* కుక్కలకు తమ పరిసరాలను గురించి అంతగా తెలియదని ఒక్కోసారి అనిపిస్తుంది. బ్రిటా ఓస్ట్‌హౌస్ అనే పరిశోధకురాలు ఈ అంశం గురించి పరిశోధిస్తున్నారు. ఆమె చేసిన ప్రయోగంలో రెండు హాండిల్స్ ఉంటాయి. వాటిలో ఒకదాని నుంచి కట్టిన దారం అటు చివరన మాంసం ముక్క ఉంటుంది. అయినా కుక్కలు ఆ దారం సంగతి పట్టించుకోకుండా, తిండికి దగ్గరగా ఉన్న హ్యాండిల్‌ను లాగాయి. కుక్కలకు కాలంలో వెనక, ముందుల గురించి కూడా అంతగా తెలియదని అర్థమయింది. గతం అనుభవాలను అవి గుర్తుంచుకోవు. రానున్న కాలానికి జాగ్రత్తలు వాటికి తోచవు. అందుకే ఒంటరిగా వదిలిన కుక్కలు మరీ సమస్యలకు గురవుతాయి. సమస్యలకు కారణమూ అవుతాయి. వదిలి వెళ్లిన యజమాని ఏదో ఒకనాటికి తిరిగివచ్చే సంగతి వాటికి తోచదు.

* కుక్కల ముక్కు, వాసన శక్తి ఎంతో ప్రత్యేకమన్న సంగతి తెలిసిందే. మనుషుల వాసన శక్తి కుక్కలతో పోలిస్తే, చాలా తక్కువ. మనుషులకు సూచనగా కూడా తెలియని వాసనలను కుక్కలు పసిగడతాయి. మనిషి రక్తంలో డయాబెటిస్ కారణంగా చక్కెరలు ప్రమాద స్థాయికి చేరుకుంటే కుక్కలు గుర్తించి హెచ్చరిక చేయగలుగుతున్నాయి. అవసరమైతే అర్థరాత్రి కూడా మనిషిని నిద్రలేపి, హెచ్చరించేలా కుక్కలకు శిక్షణ ఇవ్వగలిగారు. కుక్కలలో వాసనకు సంబంధించిన వోమెరో నేసల్ ఆర్గాన్ అనే రెండవ (అదనపు) వ్యవస్థ ఉంటుంది. పైవరుస కోరపళ్లమీద నుంచి ఒక డక్ట్ ఉండి ముక్కులోకి తెరచుకుంటుంది. ఈ దారి వెంట కూడా వాసనలు తెలుస్తుంటాయి. ఈ వ్యవస్థ గురించి మరింత పరిశోధన జరగవలసి ఉంది. మిగతా కుక్కల వాసన గుర్తించటం దీని పని అని పరిశోధకులు భావిస్తున్నారు.

Friday, May 18, 2012

పలుకుబడి- వ్యాస సంకలనం


పలుకుబడి- వ్యాస సంకలనం,
రచన- తెలిదేవర భానుమూర్తి,
లిఖిత ప్రెస్, బాగ్‌లింగంపల్లి,
హైదరాబాద్- 44,
పేజీలు: 169, వెల: రూ.100/-

మాండలికం యాసలో కవితలు, కథలు రావడమే కరువయింది. దానికి రాజకీయ, సాంఘిక కారణాలు ఉన్నాయని అనిపిస్తుంది. భాషాపరంగా కూడా కారణాలున్నాయి. మాండలికంలో రచనలు ఆ ప్రాంతం వారికి తప్ప మిగతా వారికి మింగుడు పడవు. మాండలికం మనుషుల నోళ్లలో ఉంటుంది. దాన్ని కాయితం మీద పెట్టడమే ఒక ప్రయత్నం. నిజంగా పలికే తీరుకు అక్షర రూపం యిస్తే, ఆ అక్షరాలు, ఆ మాండలికం వారే కూడబలుక్కుని చదవవలసి వస్తుంది. ఇగ సమఝకు అచ్చుడు సంగతే ఏర్పాటుగుంటది! అది ఏ యాసయినా ఇదే పరిస్థితి.

తెలంగాణ మాండలికమని ఒక భాష లేదు. తెలంగాణంలో ఒకే జిల్లాలో బోలెడన్ని యాసలుంటయి. మారిన మాటలకు అర్థాలు తోచనుకూడ తోచవు. అటువంటి వాతావరణంలో తెలిదేవర భానుమూర్తిగారు పత్రికలో పనిచేశారు గనుక, ఏకంగా కాలం రాశారు. అది పొలిటికల్ సెటైర్! ఈ సంకలనంలోని వ్యాసాలు ‘చంద్రబాబునాయుడు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రహసనంపై భానుమూర్తీయమయిన పరిహాసమ’ని ప్రచురణకర్తలే ప్రకటించారు.

పుస్తకం నిండా చంద్రబాబునాయుడే! అజరుద్దీనూ, వాజ్‌పేయి సర్కార్, చంద్రశేఖరూ, దేవేంద్రగౌడూ అక్కడక్కడ తొంగి చూస్తారు. ఇదంతా గతం కథ! అయినా తెలంగాణ మాండలికం చదవాలనుకున్న వారికిది బాగానే ఉంటుంది! ఏ మాండలికమయినా హుషారుగా ఉంటుంది. రాజకీయం మీద చెణుకులు మరింత బాగుంటాయి. అయినా, మందులకన్నా శ్రేష్టం (!) ఉత్తమం, రోగాలు మటుమాయమవుతాయి లాంటి మాటలు మాత్రం, అసలు రచనను పోలి అన్నవేమోననిపిస్తుంది.

మురికి కాల్వలు మంచివి. కమస్కం గండ్లనన్న నీల్లుండయి! (కమ్‌సే కమ్, కనీసం! మన్సుకొచ్చిందా?) ఆత్మ నీల్లల్ల నానదు, నిప్పులల్ల గాలదు, ఆత్మహత్య ఎట్ల జెయ్యొస్తది లాంటి మాటలు నిజంగా కితకితలు పెడతాయి. అప్పులు దెచ్చే కళ, పిలగాడు పరీక్ష ఫేలయినందుకు దావతు, దేవుళ్లమీద విసుర్లు కూడా ఆలోచింపజేస్తాయి. ‘బైరూపులోండ్లు’ రకరకాల అంశాల మీద ఆటలాడి అందించే వ్యాఖ్యానాలు చదివిస్తాయి.

ఇంతకూ చంద్రబాబునాయుడు ఈ వ్యాసాలు చదివి ఉంటారా? నవ్వుకుని ఉంటారా? తప్పక చదివే ఉంటారు. మీరుకూడా చదవండి. అర్ధమయినా కాకున్నా నవ్వు మాత్రం వస్తుంది. గింతకు, తెలంగాణముల గింతగానము ‘గ’కారం వాడుతరా? గట్లనే వాడుతరేమొ? గెవనికెరుక?

Wednesday, May 9, 2012

సైన్సు.. ఆలోచనలు

ఆలోచనలున్నాయని తెలుసు. వాటిని మన పద్ధతిలో నడిపించవచ్చునని మాత్రం తెలియదు. సైన్సు ఉందని తెలుసు. దాన్ని గురించి ఆలోచించడం మాత్రం తెలియదు. అసలు ఆలోచనలన్నీ సైన్సు పద్ధతిలో నడవవచ్చునని మనకు అసలే తెలియదు. నిత్యం బతుకుదారిలో ప్రతి పనికీ కారణాలు, పద్ధతులు మనకు తెలియకుండానే వెదుకుతాం. ఆ తీరు వేరు, సైన్సు తీరు వేరు అనుకుంటాం. అందుకు కారణం మనం సైన్సు ఉందనీ, దానికి ఒక పద్ధతి ఉందని పట్టించుకోకుండానే బతకడం. సైంటిస్టుల బుర్రనిండా వారికి కావలసిన విషయాలకు సంబంధించిన ఆలోచనలు తిరుగుతుంటాయి. వాళ్లకు ప్రపంచమంతా సైన్సుగానే కనబడుతుంది. కానీ, ఆ ఆలోచనలు నడిచే దారికీ, మామూలు ఆలోచనల దారికీ తేడా లేదని ఎంతమందికి అర్థమయింది?

ప్రపంచంలో జరుగుతున్న చాలా సంగతులు మనకు వెంటనే అర్థం కావు. కొన్ని మరీ ఆశ్చర్యం కలిగించే రకంగా కూడా ఉంటాయి. అంతా మ్యాజిక్‌లాగ ఉంటుంది. మెజీషియన్స్ కొన్ని ట్రిక్కులు ఎలా చేశారో చెపుతారుకూడా. చెప్పనివాటి వెనుకనున్న రహస్యం అర్థం చేసుకోవాలని మనం ఎప్పుడయినా ప్రయత్నించవచ్చు. ప్రయత్నించిన వారందరూ సైన్సుపద్ధతి ఆలోచనలు కలిగినవారే. ఇంటి తలుపు తెరిస్తే కిటికీ దఢాలున మూసుకుటుంది. అంత వేగంగానూ తిరిగి తెరుచుకుంటుంది. కిటికీ రెక్కకు అడ్డుపెట్టలేదని అర్థమవుతుందిగానీ అది తెరుచుకోవడం, మూసుకోవడం ఎందుకు జరిగాయన్న ప్రశ్న తోచకపోవచ్చు. తోచినా పోనీలే?! అనిపించవచ్చు. కొంతమందికి మాత్రం తలుపును నాలుగుసార్లు తెరిచి, మూసి, కిటికీని పరిశీలించే ఆలోచన పుడుతుంది. చివరకు గదిలో గాలి ఒత్తిడి సంగతి కూడా తోచవచ్చు. ఆలోచిస్తే, చాలా సంగతుల వెనకనున్న రహస్యం బట్టబయలవుతుంది! ఈ సంగతులు ముందు.. అంత గొప్పవిగా తోచకపోవచ్చు. కానీ, ఈ ప్రపంచంలో జరిగే మామూలు విషయాల వెనుక కూడా ఆసక్తికరమైన సైన్సు ఉంటుంది. వాటిని గురించి తెలుసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి అర్థం కానివీ, కష్టమయినవీ మాత్రం కావు. సైంటిస్టులుకూడా తమ పరిశోధన పేరున ఈ పద్ధతులనే వాడుతుంటారు. అది మనిషి ప్రవర్తన గానీ, ప్రకృతిలోని అంశాలుగానీ, అర్థం కాదనిపించే ఆస్ట్రానమీ సంగతులు గానీ, అన్నింటిలోనూ ఒకటే పద్ధతి ఉంటుంది. నమ్మండి!

మనకు తెలిసీ తెలియక, మనమంతా సైన్సు పద్ధతిలో ఆలోచిస్తుంటాం. పనులు కూడా చేస్తుంటాం. మనం అట్లా చేస్తున్నామన్న ఆలోచన మాత్రం రాదు. అంతే తేడా!

గమనించిన అంశం గురించి ప్రశ్నిస్తాం
ఈ రోజు గుడ్డలు ఎందుకు త్వరగా ఆరలేదు? ఇవాళ చెమట ఎందుకు ఎక్కువగా పడుతున్నది? మొదలు నిత్యం తెలియకుండానే ఎన్నో ప్రశ్నలు అడుగుతాం. చీమలకు వాటి చోటు ఎట్లా తెలుస్తుంది? దోమలకు మనం ఎట్లా దొరుకుతాం? ఇంకొంచెం ముందుకు వెళితే... అవి సైన్సు ప్రశ్నలవుతాయి. నాకు కోపం ఎందుకు వచ్చింది? ఆకలి ఎందుకు కాలేదు? 


అన్నా సైన్సు ప్రశ్నలే! నమ్మండి!
ప్రశ్న అడిగి ఊరుకుంటే జవాబు చెప్పేవారు ఎదురుగా ఉండకపోవచ్చు. కనుక మనమే ముందుకు సాగడానికి ప్రయత్నించాలి!

పరిశోధన సాగించండి
మీరు ఒక విషయాన్ని గమనించారు. దాన్ని గురించి ఆలోచించి ప్రశ్న అడిగారు. మరి ఆ అంశం గురించి ఇప్పటివరకు తెలిసిన అంశాలను ఒకసారి గుర్తుచేసుకోవాలి. ప్రతిదినం వేసినట్లుగానే గుడ్డలుతికి ఆరవేశాం. ఎప్పటికీ వేసే చోటునే ఆరవేశాం కూడా. కానీ, అవి ఎక్కువయ్యి ఒకదానిమీద మరొకటి వేయవలసి వచ్చిందా? గాలి కదలకుండా మరేదయినా అడ్డుగా వచ్చిందా? లేక వాతావరణం తేమగా ఉందా? గుడ్డలు ఆరకపోవడానికి ఒక కారణం ఉండి తీరుతుంది. గుడ్డలు సరిగా పిండడం చేతకాలేదేమో?

అనుమానాలు రావాలి
అనుమానాలతో రకరకాల పరిస్థితుల గురించి మనకు ఆలోచనలు పుడతాయి.

స్వంత ఆలోచనలు కాస్త పక్కకు..
మనకు సాధారణంగా అలవాటుకొద్దీ, సమస్యకున్న ఒకరూపం మాత్రమే కనబడుతుంది. కొన్నిసంగతులను చూడలేకపోతాం. గుడ్డలు నిత్యం ఏ సమయానికి ఆరుతున్నాయని సంవత్సరమంతా గమనించి, వాతావరణంలో తేమ, వేడి గురించి కూడా తెలుసుకుని సంబంధాలను లెక్కవేస్తే, అది శాస్త్ర పరిశోధన అవుతుందని మనకు తోచదు. మరి చలికాలంలో కూడా బట్టలు త్వరగా ఆరతాయా?

మరింత సమాచారం, సాక్ష్యాలు వెదకాలి
వాతావరణంలో తేమ ఎప్పుడు ఎంత ఎక్కువ ఉంటుంది? చీమలకు, దోమలకు వాసనలు బాగా తెలుస్తాయని మనకు తెలుసా? ఇంటి తలుపు మూసి ఉన్నప్పుడు కిటికీ తెరిచి ఉన్నా గాలి అందులోనుంచి లోపలికి రాదు. తలుపు తెరవగానే అది తోసుకువస్తుంది. కిటికీ మూసుకుంటుంది. బలంగా తగిలినందుకు తిరిగి తెరుచుకుంటుంది.

అన్ని సంగతులనూ అర్థం చేసుకుని..
సాక్ష్యం, సమాచారాలను బట్టి మన ఆలోచనలు, నమ్మకాలు మారాలి. ఈ ప్రపంచంలో అందరికీ ఒకేలా చెమట పట్టదు. తేమ పెరిగినా నాకు చెమట లేదుగనుక, తేమలేదు అనగలమా? ఈ విషయం గురించి ప్రపంచమంతటా ఉండే అనుభవాలుంటాయి. మన చుట్టుపక్కల చూచినా ఎన్నో వివరాలు తెలుస్తాయి.

ఇది కాదు.. అనే పద్ధతి
ఒక విషయానికి వంద కారణాలు కనబడతాయి. ఆలోచించి వాటిని.. ఇది కాదు, ఇది కాదు.. అంటూ సంఖ్య తగ్గిస్తూ పోవాలి. అనుభవం పాఠాలు చెపుతుంది. అందులో నుంచి మార్గాలు కనబడతాయి.

అయితే, సైన్సంతా ఇంతేనా అనేసి వెళ్లిపోకండి! కొన్ని ప్రశ్నలకు బుర్ర చించుకున్నా జవాబు తోచదు. అందుకు అవసరమైన సమాచారం, లెక్కలు బోలెడుంటాయి. ఆలోచన సాగితే, వేరే విషయాలు వంద తెలుస్తాయి కానీ, మొదటి ప్రశ్నకు జవాబు అందదు. నిజంగా ఇలా జరిగిందంటే, మిమ్మల్ని మీరే అభినందించుకోండి. మీరు శాస్ర్తియ పద్ధతిలో పడిపోయినట్లు లెక్క మరి! ముందుకు సాగితే ఆశ్చర్యాలకు, అద్భుతాలకు కూడా జవాబులు దొరుకుతాయి. శతాబ్దాల నుంచి మీలాగే ప్రశ్నలు అడిగి, ఎందరో సేకరించిన సమాచారం, మీ కొరకు ఎదురుచూస్తున్నది. తెలుసుకుంటే, బతుకు మరింత అర్థవంతంగా, ఆసక్తికరంగా మారుతుంది. చుట్టూ చూడండి. పరిశీలించండి. ప్రశ్నలడగండి. సైన్సును స్వంతం చేసుకోండి!

Tuesday, May 8, 2012

జిడ్డు కృష్ణమూర్తి -


జిడ్డు కృష్ణమూర్తి
-అబ్బూరి ఛాయాదేవి
సి.పి.బ్రౌన్
అకాడమి,నాగార్జునహిల్స్,
పంజగుట్ట,
హైదరాబాద్- 82
పేజీలు: 150;
వెల: రూ.95/-

అర్థమయిన వాళ్లకూ, అర్థంకాని వాళ్లకు ఒక ప్రశ్నగా మిగిలి గుర్తుండిపోయే జిడ్డు కృష్ణమూర్తి పేరులోనే తప్ప మరెందులోనూ జిడ్డుతనం లేదు. తెలుగువాళ్లంతా ఆయనను ‘మనవాడు’ అంటారు. ఆయన నిజంగా భారతీయుడా? అని అనుమానం వచ్చినవారున్నారు. అందరికీ ఆ అనుమానం ఉంది, అన్నా తప్పుగాదు. ఆయన ప్రపంచ పౌరుడు. ‘నేను గాలిలాంటి మనిషిని!’ అనగలిగిన మనిషిని పట్టుకుని ఒక పద్ధతికి, ప్రాంతానికి కట్టివేయడం అమాయకత్వం. జేకే గురించి తెలుగులో పుస్తకాలు తక్కువ. వందలకొద్దీ ఉన్న ఆయన పుస్తకాల అనువాదాలు కూడా తక్కువే. ఆయన గురించి తెలుసుకోవాలంటే, మేరీ లుటెన్స్, ప్రపుల్ జయకర్‌లు రాసిన పుస్తకాలు చదవాలి!


అబ్బూరి ఛాయాదేవిగారు రాసిన ఈ పుస్తకం అట్టమీద జీవనమార్గం- జీవితం, బోధనలు అని ఉపశీర్షిక ఇచ్చారు.
అరవయి సంవత్సరాలపాటు ప్రపంచమంతా తిరిగి, నిత్యం తన భావాలను పంచిన ఒక తాత్వికుని గురించి, ఒక చిన్న పుస్తకంలో చెప్పడం వీలుకాని పని! ప్రయత్నం చేయడంలో తప్పులేదు. మంచి పుస్తకమే వచ్చింది. కానీ ఈ పుస్తకంలో కృష్ణమూర్తికన్నా ఆయన ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచానే్న ‘మార్పు’వేపు మరల్చిన ఒక ప్రఖ్యాత తాత్వికుని ఆలోచనలను, ఒకసారి కథలాగ చదివితే లాభం ఉండదు. ప్రతి నాలుగు వాక్యాల తరువాత, ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది.


ఆయన వెంట తిరిగినవారు, ఆయననుంచి మెప్పు ఆశించారు. అది దొరకనందుకు వారంతా దూరంపోయారు, అంటారు రచయిత్రి ఒకచోట. కృష్ణమూర్తిని మత బోధకుడు అన్నారు కొందరు. ఆయన ఒక మతానికి, సంస్థకు, దేశానికి కట్టుబడినవాడు కాదు. ఆయన మాటలు గురువు బోధనలుగా ఉండవు. ఆయనలో ఒక మిత్రుని చూడగలిగినవారు ఎక్కువ సంతృప్తిపొందారు.


జె.కె. గురించి తెలియని తెలుగు పాఠకులకు ఈ పుస్తకం ఒక మిత్రునిగా వచ్చింది. ‘కొంత’తెలిసిన వారికి కూడా ఈ పుస్తకంలో మంచి మెటీరియల్ ఉంది. పుస్తకంలో వేసిన బొమ్మల కింద, వివరాలు వేస్తే మరింత బాగుండేది. ఇంగ్లీషు పుస్తకాల మీద ఆధారపడినందుకేమో కొన్ని వాక్యాలు, ఇంగ్లీషు సింటాక్స్‌లో వచ్చాయి. విషయం గురించిన ఆసక్తిలేనివారిని కూడా చదివించగల రచనా పద్ధతి, ఇంత చిన్న పుస్తకంలో వీలవుతుందా? ప్రతి విషయంమీద కొంచెం వివరణ ఉంటే ఎంత బాగుండును, అనిపించింది. సీరియస్‌గా చదవవలసిన పుస్తకాలలో ఇదొకటి!

Monday, January 16, 2012

ఆశారాజు - ఇప్పుడు

ఆశారాజు ఇప్పుడెట్ల ఉన్నడని కాదు
ఇది ఆతని కొత్త కవితా సంకలనం పేరు
నా దృష్టిలో రాజు దమ్మున్న కవి
చెప్పదలుచుకున్నది అంత బలంగా చెప్పడం చాలా మందికి చేతగావడం లేదు ఈ మధ్య
అందుకే రాజుకు నా సలాం

హార్మోనియం అని ఒక ఖండిక

అందులోనుంచి నాలుదు లైన్లు చదవండి
రాజు అంటే ఏమిటో అర్థమవుతుంది.




కవిత్వం కలలో ఉంటుంది
కత్తి వొరలో ఉంటుంది
అమ్ములపొదిలో ఉంటుంది
ఆత్మవిశ్వాసంలో ఉంటుంది
నమ్మకంలో ఉంటుంది
చెదరని ఆశయంలో ఉంటుంది
నిద్రపోని ఆయుధంలో ఉంటుంది
ఎక్కడని కనిపెడతావు
ఎట్లా అరికడతావు

కవిత్వం బతికించే ఊపిరి
ఊగేటి ఉరికంబం
ఉప్పొంగే జీవితం
ఎన్ని ఊళ్లని వెదుకుతావు
ఎన్నాళ్లు తిరుగుతావు
మరణం కవిత్వం
జననం కవిత్వం
కదనం కవిత్వం
కన్నీళ్లు కవిత్వం
నూకు తెలియదు
జైలు గోడలూ కవిత్వం
కవిత్వాన్ని ఆపుతావా
బ్యాక్ కవర్ మీద వేసిన కవిత పూర్తి రూపం నాకు అన్నింటికన్నా బాగనిపించింది.
అందులో రాజు (పహిల్వాన్ తమ్ముడు) అసలు రూపం కనబడుతుంది