Showing posts with label ప్రశ్న. Show all posts
Showing posts with label ప్రశ్న. Show all posts

Monday, August 6, 2012

మన గురించి మనం


ప్రశ్నలడగడం తెలుసు
ప్రయాణం సంగతి తెలుసు
కలల గురించి తెలుసు
మనసు గురించీ తెలుసు
అయితే ఏంటట?
పోదురూ విసిగించక అంటారా? అవును మరి. ఇప్పుడవన్నీ ఎవరికి కావాలి అసలే పని తెమలక ఛస్తుంటే అంటారా అక్కడే మొదలవుతుంది అసలు కథ ఎన్ని తెలిసినా, ఎంత చేతనయినా మనసులో ఉత్సాహం లేనిదే ఏమీ చేయాలనిపించదు. మెదడులో తెలివి ఉన్నా మనసులో మరేదో ఉండాలంటారు అందుకే. రెపటి రూపం తెలియాలంటే మనసులో అందుకు సంబంధించి కోరిక ఉండాలి. తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉండాలి.
నా బతుకింతే అనుకుంటే నిజంగా అంతే. మరేమీ లేదా అంటే మరేమయినా ఉండవచ్చు. ఉందా అంటే ఎవరూ వెతికి పెట్టరు. మనమే వెతుక్కోవాలి. ఈ జీవితం ఒక సినిమా. ఇందులో మీరే ముఖ్యపాత్ర. మరెవరి సినిమాలోనో వెనుక కనిపించే పాత్ర కాదది.
మనం లేకున్నా అంతా బాగానే సాగుతుందంటారు కని రెడ్డిగారు. సవినయంగా వారి మాటను నేను కాదంటాను. మనం లేకుంటే మనం లేని లోటు కనబడి తీరుతుంది. మనం లేకుంటే మనం చెప్పవలసిన మాటలు మరెవరూ చెప్పరు.
  
మనం చెయ్యవలసిన పని మనమే చేయాలి. మనం చెప్పవలసిన మాట మనమే చెప్పాలి.
చెప్పిన మాట ఎవరూ వినరని తెలిసినా సరే మన పని మనం చేస్తూ ముందుకు సాగాలి.
మనకిష్టం వచ్చింది చేద్దామా?
పదుగురికి నికి వచ్చేది చేద్దామా?
మన కొరకు బతుకుదామా?
మనవారి కొరకు బతుకుదామా?
మధ్యలో చేతనయితే కాస్త బాలెన్సు చూపుదామా?
మన సంతోషం పది మంది సంతోషంలో ఉందన్న సంగతి మనం మరిచి పోతుంటాము.
అట్లాగని తెల్లవార్లూ ప్రజాసేవలో బతకడం కుదరదు.
అక్కడే ఉంది అసలు కిటుకు.
సర.న దారి అని అందరూ సులభంగా చెపుతారు. ఎలాగుంటుంది సర.న దారి
మీకు తెలుసా?
తెలిస్తే అంతకన్నా కావలసింది లేదు!
తెలుసన్న సంగతి తెలిస్తే అటువంటి మనుషులకు సాగిలబడి మొక్కవచ్చు.

ఈ ప్రపంచంలో మంచి జరుగుతూ ఉంటుంది. కానీ అది కనబడే లాగ జరగదు. దానం చేశారనుకోండి. ఒకరు ఇవ్వడమూ, మరొకరు పుచ్చుకోవడమూ కనబడుతుంది. కానీ అందులోని మంచితనం కనబడదు. కాని వారికి దానం చేసినా చేసినప్పుడు అర్థం కాదు. మనం డబ్బులిచ్చిన మనిషి తరువాత కల్లుపాకలో కనబడితే ప్రాణం ఉసూరుమంటుంది. ఆకలిగా ఉన్న మనిషికి అన్నం పెడితే ఆ కళ్లల్లో సంతృప్తి కనబడితే, ఆ పూట అన్నం తినకున్నా నిద్ర సుఖంగా పడుతుంది. అక్కడా మంచితనం కనబడదు. అనుభవంలోకి వస్తుంది అంతే.
కళ్లకు వెలుగులు కనబడతాయి. రంగులు కనబడతాయి. మంచితనం కనబడదు. తప్పూ, ధర్మం తేడా కనబడదు. అలాగని అవి లేవందామా మనకు కనిపించనివన్నీ లేవంటే మనవాళ్లందరబ ప్రతి క్షణం మనకు కనబడుతూ ఉన్నారా పోయినవాళ్లు కనబడరు. భావం మాత్రం ఉంటుంది. వాళ్లు ఉన్నారనుకుంటే ఉన్నట్టేనా? ఉన్నవాళ్లు, ఉన్న సంగతులు లేవనుకుంటే లేకుండా పోతాయా?

ఏ వస్తువయినా మనం చూచినప్పుడు ఉన్నట్టే ఉండి పోతుందా? మన మనసులో మాత్రం ఆ పాత బొమ్మ ఒకటే నిలిచి ఉంటుంది. మంచితనమ సంగతి వేరు. అది ఏ సంగతిఎట్లా ఉంటే బాగుంటుంది అన్న భావానికి రూపం. అది మనసులో మాత్రమే ఉంటుంది.
దానగుణం మంచిది అని మనకు అనిపిస్తే, అందరూ దానం చేస్తూ ఉండాలను మనం అనుకుంటామని అర్థం. కళ్లకు అది కనిపించదు. జరిగినా ప్రతి సందర్భాన్నీ మనం చూడలేము.

తెలిసి జరిగిన మంచితనమం మన దృష్టికి వస్తుంది. తెలి.నిది తెలియకుండానే ఉండిపోవచ్చు. తెలి.కుండా జరిగే చెడ్డతనమయినా అంతే. అనుకోని ఘాతుకం మన కళ్ల ముందు డరిగితే అది తప్పు అని మనకు వెంటనే తెలుస్తుంది. అందులోని తప్పిదాన్ని మనం చూడలేమన్న సంగతి ఆ క్షణాన గుర్తుకు కూడా రాదు. బల్ల గుద్ది అది తప్పు అని వాదించడానికి కూడా మనం సిద్ధమవుతాము. శరీరానికి అంటే కళ్లకు, చెవులకూ అందని సంగతి గురించి మనం నిరణ.లు ఎందుకని అంత సులభంగా చేయ గలుగుతాము.

అందులోని మంచి చెడుల గురించి మనం ఎందుకు, ఎట్లా నిర్ణయానికి రాగలుగుతాము.

అంటే మంచి చెడుల తేడా మనకు తెలియకుండానే మనకు తెలుసన్న మాట. దానం మంచిది. దొంగతనం చెడ్డది. ఇవి సులభమయిన సంగతులు. ఇంతకన్నా గట్టి. సంగతుల గురించి కూడా మనకు గట్టి అభిప్రాయాలు ఉంటాయి. ఏది మంచి ఏది చెడు అంటే వెంటనే ఉపన్యాసానికి లంకించుకుంటాము. ఎట్లా అవి మంచి తెడులయిన. అని ఎవరన్నా ఎదురు అడిగితే మాత్రం మన నుంచి సమాధానం అంత నమ్మకంగా రాదు.

నమ్మకంగా మీరు మంచి వేపు ఉన్నారా?
ఎదుటివారి గురించి వ్యాఖ్యానించే చోటికి మీరు చేరుకున్నారా?
మంచి చెడుల తేడా తెలుసా?
గట్టిగా మంచి వేపున నిలిచి పోరాడగలరా?
ఆలోచించండి!!

Saturday, January 21, 2012

మన గురించి మనం - 5


కలలాంటి బతుకు! బతుకులాంటి కల!
ఏది నిజం? ఏది కల?
ఎక్కడుంది తేడా?
గిల్లుకుంటే లాభం లేదు.

నిద్ర నిజం. కల నిజం. కలలో సంగతి మాత్రం కల. అంటే అబద్ధం అని అర్థం.
బతుకు నిజం. ఇవాళ నిజం. అన్నం నిజం. పోనీ ఇడ్లీ నిజం.
తిండి, నిద్రకన్నా నిజమయిన సంగతులు ఉండవు కదూ!
వాటిని మనం ఎన్నడూ మరిచిపోము. అవి మరి బతుకుకు ఎంతో ముఖ్యం. అవే బతుకు, అనేంత ముఖ్యం. ఆలోచించండి. పని జరగనీ, జరగకపోనీ, సాపాటు జరగవలసిందే. వద్దన్నా నిద్ర ముంచుకు వస్తుంది. ఇంట్లో, వంట్లో సుఖంగా ఉండనీ ఉండకపోనీ సాపాటు జరగవలసిందే. ఆలోచించారా. అంతా మామూలుగా ఉంటే అన్నం తినవచ్చు. ఏ కొంచెం అనారోగ్యమయినా అన్నం పనికిరాదు. రొట్టె కావాలి. పండ్లు కావాలి. పాలు మాత్రం తాగవచ్చు. నాకు పాలు ఇష్టం ఉండవు. కనుక జ్వరం వస్తే రుచిగా ఏదన్నా తాగ వచ్చని ఎదురుచూపులు. పండ్ల రసం కావాలి. బాగుందా ఇష్టమయిన పండ్ల రసం కావాలంటే జ్వరం రావాలి.

శవం పక్కన ఉన్నా సరే, కాఫీ కావాలి.
ప్రాణం పోతున్నా సరే. పాలు కావాలి.
శవం పక్కన ఉండగా హాయిగాపడుకుని రావలసినవారెవరో వచ్చిన తరువాత తగిన ఏర్పాట్లు చేయడం కొత్తగాదు కదా. తగిన ఏర్పాట్లలో తిండి నిద్ర అన్నిటికన్నా ముందుంటాయి.
నిత్యమూ నిద్ర తప్పదు. నిత్యమూ తిండి తప్పదు. అవి మన బతుకులకు పునాదులని మనం గట్టిగా నమ్ముతున్నాం మరి.

తిండి నిద్రలలాగే నిత్యం ఆలోచన, సమీక్ష అవసరమని అనుకోగలమేమో గమనించండి.
ఏం చేశాము? ఏం చేయాలి? ఏమనుకుంటున్నాము? ఏం జరుగుతున్నది? తేడా ఎక్కడున్నది? నిత్యం కనీసం నాలుగు నిమిషాలు ఆలోచించే ఓపిక తీరిక ఉన్నాయా?
అవి మన బతుకులకు అవసరం గాదా? ఆలోచన లేకుండా బతకవచ్చా? బతికితే ఎంత కాలం?
తిండికి నిద్రకు ఎన్ని ప్రయాసలు పడి ఏర్పాట్లు చేసుకుంటున్నాము? బతుకంతా మంచి తిండి, సుఖంగా నిద్ర అందాలనిగదా మిగతా ప్రయత్నాలన్నీనూ? అదేపద్ధతో ఆలోచన అవగాహన కూడా అవసరమనుకుంటే ఎంత బాగుంటుంది!
బతుకు ప్రయాణంలో గమ్యం ముఖ్యమా తతంగం ముఖ్యమా ఆలోచించాలిగదా!
కల నిజమా నిజం కలలాగ ఉందా అర్థం చేసుకోవాలి గదా!
ఇదంతా ఆలోచన లేకుండా వీలవుతుందా?
ఈ ఆలోచన కలిగిన తరువాత, నమ్మండి, నిద్ర పట్టదు, తిండి సయించదు. వాటిప్రాముఖ్యం తెలుస్తుంది. తగ్గుతుంది, కనీసం. వాటిని వదలాలని ఎక్కడా లేదు. వాటినే పట్టుకుని వేలాడాలని కూడా లేదు. అదీ సంగతి.

ఈ ఆలోచన అలవాటుగా మారితే అవగాహనలు మారుతాయి.దానితో ఆశయాలు మారి, అప్పుడు మన ప్రవర్తనలూ మారుతాయి.
మార్పు జరగాలంటే ఆలోచన ప్రారంభం. అది లేనిదే బతుకు బండి నడక మారదు. ఎంత చదివినా ఎన్ని విన్నా చివరకు ఆలోచన జరగకుంటే అంతా దండగేకదా. మన అలోచన లేక అవగాహన ఎంత చదివినా మారదు కదా.

పిల్లలుగా ఉన్నప్పుడు ఆలోచన లేదు. యువవయసులో ఆలోచనల దారి వేరు. ఆ తరువాత బతుకు బండి చక్రాల కింద నలగడం తప్ప మరో ఆలోచనే రాదు. కనుక ఆలోచన అలవాటుగా మారాలి.

ఈ ప్రయాణం మరింత మంచి గమ్యానికి దారి తీయాలి. అసలు ప్రయాణమే బాగుండాలి. మొదలు, మధ్య బాగుంటే చివర సంగతి పట్టదు. గుర్తించగలిగారా ఈ విషయాన్ని
బతుకు తతంగం, అదే బతుకు బండి నడిచే తీరు, దారి, ముఖ్యంగా అవి బాగుండాలి.
ఇవాళకన్నా రేపు బాగుండాలి. నిన్నటికన్నాఇవాళ బాగుండాలి.
అనుకుంటే బాగుంటుందా?
నిత్యం చేసే పనులే చేస్తే, నిత్యం ఉండేట్టే ఇవాళా ఉంటుంది. అవునంటారా
మరి మార్పు రావాలంటే ఆలోచన కావాలి గదా!
ఆలోచించండి.

Thursday, December 15, 2011

మన గురించి మనం - 3


ప్రయాణం

ఎక్కడికి ప్రయాణం?
ఎన్ని రకాల ప్రయాణాలు?

మనం కదిలితేప్రయాణం, మనసు కదిలితే ప్రయాణం, ఉందోలేదో తెలియని చోటికి ప్రయాణం – అంతు లేని ప్రయాణం. బతుకే ఒక ప్రయాణం. యాత్రా చరిత్రలున్నాయి. మనసు నడచిన మార్గాల కథలున్నాయి. కారులో షికారు కథలున్నాయి.

ప్రయాణం అంటే నిజానికి ఆ తతంగమే. బయలుదేరడమూ, గమ్యం చేరడమూ ఉంటాయి గానీ, నిజానికి ప్రయాణమనే తతంగం మధ్యలో జరుగుతుంది. ఈ తతంగం లేని ప్రయాణం ఎందుకు? అసలు దాన్ని ప్రయాణం అనవచ్చా? గమ్యంకన్నా అటువేపు కదలిక ముఖ్యం. అది అనుకున్నట్టు జరుగుతుంటే, గమ్యం వచ్చినా గుర్తించలేనంత బాగుంటుంది. గుర్తించక అదే పనిగా ముందుకు నడిచిన బాటసారులెందరో ఉన్నారు. ఇంటికని బయలుదేరి, ఇల్లు దాటి, పల్లె దాటి ముందుకు పోయిన ప్రయాణం నిజంగా బాగున్నట్టు లెక్కగదా!

మనకు ప్రయాణం భావన అలవాటయింది. ఆలోచించకుండా, ఆ పనేదో మరెవరో చేసి పెడుతుంటే బతుకు వెళ్లమార్చడం అలవాటయింది. ఇంతకూ ప్రయాణం అంటే ఏమిటి చెప్పండి చూద్దాం! ఇందాకటినుంచీ చదువుతూనే ఉన్నారు గదా! ఏం చదువుతున్నరు? కాలం కదిలిందా? ఇంతసేపూ మీరు కదిలారా? మనసు కదిలిందా? ఏ రకం ప్రయాణం జరిగింది? ఏది బాగుంది? ఆలోచించారా? లేదు కదూ!!

అంతా బుద్ధిమంతులయిన బాలలు! ప్రయాణం ముఖ్యం కాదు, తతంగం ముఖ్యమంటే అవునంటారు. మరి గమ్యం సంగతేమిటి? అది అవసరమా కాదా? చదువుకోవాలి! సంపాయించాలి! పిల్లలను కనాలి! వాళ్లను ప్రయోజకులుగా తీర్చి దిద్దాలి! మరో లెవెల్లో ఆలోచిస్తే, వంట చేసుకోవాలి. అన్నం తినాలి. నిద్ర పోవాలి మళ్లా లేవాలి

ఇవన్నీ ప్రయాణాలా? గమ్యాలా? లేక ప్రయాణమన్న దాని తతంగమా? బతుకు ప్రయాణమయితే అందులో గమ్యమేది? తతంగమేమిటి?

తతంగం లేకుండా బతుకు గడిచేట్టుంటే బాగుండునని ఎప్పుడయినా అనిపించిందా? తెల్లవారేకల్లా పిల్లలు పెద్దవాళ్లయి ఎదురయితే ఎంత బాగుంటుంది? బాగుంటుందా? లేక వారిని తీర్చి దిద్దలేదన్న లోటు తోస్తుందా? మీకు ప్రయాణం, గమ్యం రెండూ కావాలా? లేక గమ్యం ఒకటీ అందితే చాలా?

నిజానికి అనుకున్నది ఒక్కటయితే అయ్యింది ఒక్కటన్న బతుకులే ఎక్కువ. ఎక్కడికని బయలుదేరిందీ గుర్తుండదు. ఎక్కడికి చేరిందీ అర్థం కాదు. మన చేతుల్లో ఏ నిర్ణయమూ ఉండదు. గమ్యం చేరిన వారి సంగతి మరొక రకంగా ఉంటుంది. అక్కడికి చేరిన తరువాత అర్థమవుతుంది, చేరదలుచుకున్నది ఆ గమ్యం కాదని. కానీ ప్రయాణం పేరున జరిగిన తతంగం మాత్రం భలే అనుభవంగా నిలిచిపోతుంది. పోనీ, మళ్లా బయలుదేరి కొత్త దారి పడితే పోయిందిగదా అన్న ఆలోచన కలిగితే అంతకన్నా కావలసింది మరొకటి ఉందా?
తతంగం సాగుతుంటే మనకు చేతనయిన సంగతులూ, చేతగానివీ అర్థమవుతాయి. కొత్త అనుభవాలు కొత్త గమ్యాల గురించి చెపుతాయి. చివరికి గమ్యం కాదు ప్రయాణమే ముఖ్యమనే చోటికి చేరుకుంటాం. అదీ ఒక గమ్యమేనా?

ఆలోచించండి! ఏం కావాలి? ప్రయాణమా? గమ్యమా? తతంగమా? తికమక అవసరం లేదు.
అలోచిస్తే అంతా తెలుస్తుంది.

Monday, December 12, 2011

పచ్చబొట్టు - సైన్సు


పచ్చబొట్లు, గాయం మచ్చలు సమసిపోకుండా ఎలాగుంటాయి?

నిజమే! రక్తకణాలలాగే చర్మం కణాలు కూడా పాతవిపోయి ఎప్పటికప్పుడుకొత్తవి పుడుతూ ఉంటాయి. అయినా ‘పచ్చబొట్టు చెదిరిపోదులే’ అనేపాట ఎలా వచ్చింది?

సులభంగా చెప్పాలంటే చర్మం అంతా ఒకే పొర కాదు. అందులో అన్నింటికన్నా వెలుపలిపొర ఎపిడెర్మిస్. అందులో మాత్రమే పాత కణాలుపోయి కొత్తవి పుడుతూ ఉంటాయి. మన పడక బట్టలలో, ఇంట్లో ఉండే దుమ్ములో సగం, చనిపోయిన ఈ కణాలే ఉంటాయంటే నమ్మగలరా? ఇక డెర్మిస్ అనే లోపలి పొరలో కూడా కణాలు విభజన చెందుతూంటాయి కానీ, అక్కడ పాత కణాలు పోవడం అనే పద్ధతి లేదు. అందుకే పచ్చబొట్టు పేరున లోపలికి చేరిన రంగుగా, లోతయిన గాయం గానీ అట్లాగే ఉండిపోతాయి.

చర్మమంతా, కొలాజెన్ అనే ప్రొటీన్ పదార్థంతో తయారై ఉంటుంది. ఈ కొలాజెన్, ఫైబ్రోబ్లాస్ట్స్ అనే కణాలలో పుడుతుంది. గాయం తగిలి, మానుతుంటే కొత్త కొలాజెన్, ఆ గాయంలోనే ఫైబ్రోబ్లాస్ట్‌లు ఉండి, వాటిలో నుంచి పుడుతుంది. అది మామూలు కొలాజెన్‌లాగుండదు. అందుకే గాయం మానిన చోట చర్మం, మిగతా చర్మంలా కాక బాగా నునుపుగా ఉంటుంది. చర్మంలో మిగతా కణాలు, లోపలి పొరలలోవి కూడా పెరుగుతున్నా ఈ గాయం కొలాజెన్ మాత్రం అట్లాగే ఉండిపోతుంది.

శిశువుకు, గర్భంలో ఉన్నపుడు గాయాలు తగిలితే మాత్రం మామూలు చర్మం వచ్చేస్తుంది. అంటే అక్కడ గాయం కణాలు, అందులో కొలాజెన్ తయారీ లాంటివి ఉండవు.

పచ్చబొట్టు విషయాని వస్తే, మరో ఆసక్తికరమయిన విషయం ఉంది. శరరంలో ప్రవేశించిన ఇతర రసాయనాలను సాధారణంగా తెల్ల రక్త కణాలు మింగేస్తూ ఉంటాయి కానీ పచ్చబొట్టు పేరున శరరంలోకి పంపబడుతున్న, రంగు రసాయనాల కణాలు పెద్దవిగా ఉంటాయి. తెల్లరక్తకణాలు వాటిని మింగజాలవు. అందుకే పచ్చబొట్టు చెరగకుండా, చెదరకుండా ఉండిపోతుంది. ఎవరన్నా పచ్చబొట్టును నిజంగా తుడిపి వేయాలనుకుంటే అందుకు పద్ధతులున్నాయి. లేజర్ కిరణాలతో ఈ రంగు రసాయనాన్ని పొడిగా చేయవచ్చు. అప్పుడు తెల్ల రక్తకణాలు ఈ పొడిని మింగేస్తాయి. పచ్చబొట్టు మాసిపోతుంది.

Friday, December 2, 2011

ప్రశ్న - జవాబు


వైరస్‌లు చనిపోతాయా?

ప్రశ్న - జవాబు

Q వైరస్‌లు చనిపోతాయా?
A సూటిగా జవాబు చెప్పాలంటే, వైరస్‌లకు మరణం లేదు. ఎందుకంటే వాటికి జీవం లేదు. జీవంలేని వైరస్‌లు మరి జీవులు ఎట్లా అయినవని ప్రశ్న పుడుతుంది. అదే విచిత్రం. వాటిలో డిఎన్‌ఏ, లేదా ఆర్‌ఎన్‌ఏ అనే న్యూక్లిక్ ఆమ్లాలు ఉంటాయి. వాటి పని తీరును నిర్థారించే సమాచారం ఆ ఆసిడ్‌లలో ఉంటుంది. జీవులన్నింటిలోనూ ఇదే పద్ధతి గనుక, వైరస్‌లను జీవులుగా అంగీకరించక తప్పదు. కానీ, అవిసంపూర్ణ, స్వతంత్ర జీవులు కావు. తమంత తాముగా మనుగడ సాగించలేవు. మరేదో జీవిలో ఉన్నంత కాలమే వాటి మనుగడ సాగుతుంది. అక్కడ అవి తామున్న ప్రాణినుంచి జన్యుసమాచారాన్ని దొంగిలిస్తాయి.
ఇక్కడ ఇంకొకప్రశ్న పుడుతుంది. స్వంత జీవం, ఉనికి లేని ఈ వైరస్‌లు, చావు లేకుండా ఎంతకాలం కొనసాగుతాయి. ఎంతకాలం ఇన్‌ఫెక్షన్ కొనసాగుతుంది? అన్నవి అనుమానాలు. ఒక శరీరంలోకి ప్రవేశించకుండా బయటి వాతావరంలో గనుక ఉండిపోతే, హెచ్‌ఐవి (ఎయిడ్స్), ఇన్‌ఫ్లుయెంజా లాంటి వైరస్‌లు కొన్ని గంటలకన్నా ఎక్కువ కాలం ఉండవు. అవి చనిపోతాయని కాదు గానీ, పని చేయలేకుండా సమసిపోతాయి. పరిశోధకులు, వాటిని పట్టి ఉంచి పరిశీలించడానికి చాలా కష్టపడతారు. అదే మశూచి (స్మాల్‌పాక్స్) వైరస్, ఎక్కడ పడి ఉన్నా సంవత్సరాలపాటుండి, అవకాశం దొరికితే చాలు తిరిగి ఇన్‌ఫెక్షన్‌కు కారణం కాగలుతుంది. 1787లో బ్రిటిష్ డాక్టర్ల కారణంగా ఈ వైరస్ ఆస్ట్రేలియాకు చేరిందట. అది అక్కడ రెండు సంవత్సరాలపాటు పడి ఉండి, ఆ తరువాత స్థానిక అబూరిజిన్స్‌లో ప్రవేశించి పెద్దఎత్తున మశూచి రావడానికి కారణమయిందట!

-----
Q కార్లు, స్కూటర్లు, మోటార్ సైకిళ్లకు వేసే ఎర్రరంగు
మిగతా రంగులకంటే త్వరగా వెలిసిపోతుంది.. ఎందుకు?
A ఎర్రరంగులు మామూలుగా వెలుగుకు ఎక్కువ ప్రభావితమవుతాయి. ఎండలోని యువి కిరణాల కారణంగా ఎర్రరంగు ముందు విరిగిపోతుంది. ఈ విషయం ఒక్క వాహనాలలోనే కాక పుస్తకాలు, పెయింటింగులు మొదలైన ఎన్నో చోట్ల కూడా కనబడుతుంది. ప్రస్తుతం కార్లకు, మిగతా వాహనాలకు వేస్తున్న రంగులు బాగా అభివృద్ధి చెందిన రకం. కనుక ప్రస్తుతం ఎర్రరంగు అంతగా వెలిసిపోవటం లేదు. నీలం రంగు తొందరగా పాడవుతుందన్న భావం కూడా ఉందిప్పుడు. రంగుల మీద ఎండ ప్రభావాన్ని బట్టి వాటి మన్నిక ఉంటుంది.

Tuesday, November 22, 2011

నీటిమీద నూనె - రంగులు


నీటిమీద నూనె ఏదైనా పడితే దానిమీద రంగులు కనబడతాయి. ఎందుకు?

కేవలం నీరే ఉండి, దానిమీద వెలుగు ఎంతగా నాట్యం చేసినా రంగులు కనబడవు. కేవలం చమురు ఉన్నా సరే, దానిమీద రంగులు కనబడవు. ఇక నీళ్లమీద, మనం మామూలుగా వంటలో వాడుకునే మంచి నూనెవేసి చూడండి. దానిమీద కూడా రంగులు కనబడవు. వేరే నీళ్ల మీద కొంచెం కిరోసిన్ వేసి చూడండి. కొంచెంగా రంగులు కనబడతాయి. (నిజంగా ఈ ప్రయోగం చేయదలుచుకుంటే, పిల్లలు పెద్దవాళ్ళనడిగి, వారి సాయంతో చేయాలి. లేకుంటే గొడవ!)


వర్షం తరువాత రోడ్డు మీదకు నీరు పారుతుంది. దానిమీద మాత్రం రంగులు నాట్యమాడుతూ కనబడతాయి. ఇందుకు కారణం సులభంగా చెప్పవచ్చు. రోడ్డుమీద నడిచే రకరకాలవాహనాలనుంచి చమురు చుక్కలు కిందపడతాయి. వర్షం నీటి మీద ఆ చమురు పలుచని పొరగా పరచుకుంటుంది. నీటికంటే చమురు సాంద్రత తక్కువ. కనుక అది నీటి మీద నిలుస్తుంది. ఇక్కడ ఉండే చమురులలో సర్‌ఫెక్టెంట్స్ అనే రకం రసాయనాలు కలిసి ఉంటాయి. అందుకే చమురు నీటి మీద అంతటా పరచుకుంటుంది. మంచి నూనెలో ఈ రసాయనాలు ఉండవు. పైగా దాని సాంద్రత కొంచెం ఎక్కువ. కనుక, అది నీటిమీద అంత సులభంగా పరచుకోదు. నీటిమీద తేలడం మాత్రం తేలుతుంది. అంటే మొత్తానికి చమురు నీటి మీద పరచుకోవడం, ఆ పొర మందం, అది మధ్యలో ఎక్కువగా ఉండడం మీద రంగుల సంగతి ఆధారపడి ఉంది.

చమురు మీద పడిన వెలుగు, రెండు చోట్ల నుంచి పరావర్తనం చెందుతుంది. అంటే తిరిగి వెనుకకు వస్తుంది. చమురు పొర పైతలం నుంచి ఒకసారి, ఆ పొర నీటికి తగులుతూ ఉండే, లోపలి తలం నుంచి మరొకసారి, అది ప్రతిఫలిస్తుంది. ఈ రెండు వెలుగులమధ్య కొంత తేడా ఉండడం సహజం. ఆ తేడా వల్లనే రంగులు కనబడతాయి. ప్రతిఫలించే కాంతి మార్గాలు, ఒకే స్థాయిలో ఉన్నంతకాలం, రంగులు కనబడవు.

మరి, రంగులు ఎక్కడివి అనే ప్రశ్నకు సులభంగా సమాధానం చెప్పాలంటే, సూర్యకాంతిలో ఏడు రంగులు కలిసి ఉంటాయి. వర్షం తర్వాత, నీటి తుంపరలో, ఆ కాంతి ప్రతిఫలించి, ఇంద్రధనుస్సుగా కనబడుతుంది. పట్టకం అనేగాజు దిమ్మెలో కూడా కాంతి విడిపడి కనబడుతుంది. నీటిమీద వ్యాపించిన చమురు పొర తగినంత మందం ఉంటే, అందులోనూ, కాంతి విడిపోయి రంగులు కనబడతాయి. *

Sunday, November 13, 2011

కాలం సమస్య


కాలం సమస్య!

చూస్తుండగానే మరో వారం వచ్చేస్తుంది. కాలం పరుగెడుతుంది. అదే కాలం నత్తనడకలు నడుస్తుంది. కాలాన్ని కొలత వేస్తాం. వృథా చేస్తాం. ఇంకొంచెం ఉంటే బాగుండును అనుకుంటాం. ఇంతకూ కాలం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబు కొరకు వేల సంవత్సరాలుగా పరిశోధనలు, ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. ఫలితాలే అనుమానం.

‘కాలాన్ని గుర్తించవచ్చు. కానీ అర్థం చేసుకోవడమే కుదరదు!’ అంటారు తత్వవేత్త జూలియన్ బార్బర్. ‘కాలం ఇంత కాలమయినా అర్థం కాకపోవడం ఆశ్చర్యం’ అంటారామె. కాలం గురించి అర్థం కాకున్నా, శాస్త్ర విజ్ఞానం ముందుకు సాగుతూనే ఉంది. అందుకే కాలంమీద అంత ధ్యాస అవసరం రాలేదేమో? ఫిజిక్సులో న్యూటన్ గతి సిద్ధాంతాలు, ఐన్‌స్టైన్ సాపేక్ష సిద్ధాంతం, చివరకు అణునిర్మాణానికి సంబంధించిన క్వాంటం సిద్ధాంతాలు, కాలం గురించిన అవగాహన అవసరం లేకుండానే పని చేస్తున్నాయి. గడియారాలు రకరకాలుగా వచ్చాయి. కానీ వాటిని తయారుచేసే వారికి ‘కాలం’ అసలు స్వరూపం అర్థం కానవసరం లేదు.

కాలం ఎప్పుడూ ముందుకే నడుస్తుంది. ఇది అవగాహన, అనుభవాల మీద అర్థమయిన సంగతి! అందరికీ వయసు పెరుగుతున్నది. తరగడం లేదు. అందుకే గడియారాలు ముందుకే నడుస్తాయి. కనీసం వాటిని అలా తయారు చేస్తారు. అది ఎండ గడియారం గానీ, చక్రాల గడియారం గానీ, అణు గడియారం గానీ. అందులో కాలం తెలియడానికి ‘కదలిక’ అవసరం. కదలిక అంటే మార్పునకు మరో రూపం. అంటే కాలానికి, మార్పునకూ సంబంధం ఉందని అర్థం! అంతే అక్కడికంటే, అవగాహన, ముందుకు కదలదు.

కాలం గురించి రెండురకాల వివరణలున్నాయి. అది విశ్వానికి గల మౌలిక లక్షణం అంటుంది మొదటి వివరణ. స్థలం, పదార్థం ఉన్నట్లే, కాలం కూడా దానంతటది ఉంది. అందులో సంఘటనలు జరుగుతున్నాయి. న్యూటన్ చెప్పిన ఈ వివరణ ప్రకారం ఈ కాలం కూడా ఒక పదార్థం. అట్లా అనకుంటే, దాన్ని కొలతవేయడం కుదరదు. ఐన్‌స్టైన్ వచ్చి కాలం అందరికీ, అన్ని పరిస్థితుల్లో ఒకేలాగ కదలదు అని ఒక కొత్త ఆలోచనను ఇచ్చాడు. కాలం ఒక భ్రమ అన్నాడాయన. ‘స్థలకాలాల సంబంధం కొంచెం వీలును కలిగిస్తుందని అందరూ అన్నారు.
ఇక రెండవ వివరణ మళ్ళీ ఫిలాసాఫికల్‌గా సాగుతుంది. మార్పు ఈ విశ్వానికి సహజ లక్షణం. ఈ మార్పుల కారణంగా మన మనసులలో కాలం అనే భావన కలుగుతుంది అని లైబ్నిజ్ లాంటి వారి వాదం. అంటే అది మనసు, మెదళ్ళల్లో పుడుతుందని అర్థం! అంటే మరి కాలం వాస్తవమా? ఒకవేళ నిజమయితే ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ అంతమవుతుంది? ఇదంతా చూస్తుంటే మనకేమీ తెలియదని మాత్రం గట్టిగా తెలుస్తుంది.

Friday, November 11, 2011

కూల్ డ్రింక్స్ తాగడం లాభకరమా


మంచినీటి కంటే, కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్ తాగడం లాభకరమా?

ప్రశ్న - జవాబు

మన శరీరానికి నీరు కావాలి. నోటి నుంచి అటు చివరిదాకా ఉండే గొట్టంలో తాగిన నీరంతా పీల్చబడి శరీరానికి అందుతుంది. శరీరానికి కావలసింది నీరయితే దానితోబాటు, మరేవో కలిపి తాగడంవల్ల లాభం లేదు. పైగా నష్టమే ఉంది. కూల్‌డ్రింక్స్ వల్ల దప్పి సులభంగా తీరుతుందన్నది కేవలం ఒక తప్పుడు భావన. గ్యాసు కలిసిన నీరు తాగితే తేన్పులు వస్తాయి. వాటితో లాభం ఉండదనడానికి లేదు. తాగింది ఏ నీరయినా శరీరానికి అందుతుంది. లేదంటే అటు చివర నుంచి బయటకు వస్తుంది. తాగిన నీరు మూత్రం ద్వారా బయటకు రావడం సహజం. చెమట ద్వారా వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి.

కూల్ డ్రింక్‌లో చక్కెర ఉంటుంది. తాగిన నీటిలో కొంత ఆ చక్కెరను కరిగించడంతో పోతుంది. రుచి బాగుంటుంది గనుక కూల్ డ్రింక్‌ను, మామూలు నీటికన్నా ఎక్కువగా తాగుతారు. కనుక దప్పి తీరిన భావం కలుగుతుంది. నీటి చల్లదనం విషయం కూడా కొందరి విషయంలో అంతే. శరీరానికి కావలసిన నీరు, శరీర ఉష్ణోగ్రతకు మారిన తర్వాతే పీల్చబడి లోపలికి చేరుతుంది.

===========
సాధారణంగా చెట్ల బెరడు మొరటుగా ఉంటుంది. జామ లాంటి చెట్ల బెరడు నునుపుగా ఉంటుంది. ఎందుకు?

చెట్లకు బెరడు ఒక రక్షణ కవచం లాంటిది. జంతువులు, పురుగులు, పరాన్నజీవులయిన మొక్కల నుంచి అది రక్షణనిస్తుంది. నునుపుగా ఉండే బెరడుమీద పురుగులు, బూజులకు పట్టు దొరకదు. కానీ నునుపు బెరడు నెమ్మదిగా పెరుగుతుంది. అటువంటి చెట్టుకు గాటు పెడితే అది తొందరగా మానదు. ఈ రకం చెట్ల మొత్తం పెరుగుదల కూడా తక్కువ వేగంతో సాగుతుంది.

తుమ్మ, వేపలాంటి చెట్ల బెరడు జామకంటే నాలుగింతల ఎక్కువ వేగంతో పెరుగుతుంది. అంటే వాటి గాట్లు కూడా త్వరగా పూడుకుపోతాయి. మొరటు బెరడుంటే చెట్లలో తేమ చాలాకాలం నిలుస్తుంది. అందుకే వాటికి ఎవరూ ప్రయత్నంగా నీరు పెట్టనవసరం లేదు. అయితే పెరుగుదల వేగం కారణంగా, వీటి బెరడు పెచ్చులుగా లేస్తుంది. ఆ సందుల్లో పురుగులు చేరుకుంటాయి. అందుకే వేప, తుమ్మ చెట్లలో జిగురు పుడుతుంది. దాని వాసన, తీరు వల్ల పురుగులు దూరంగా పోతాయి.

మరీ తేమ ప్రాంతంలో ఉండే చెట్ల బెరడు మెత్తగా ఉంటుంది. త్వరత్వరగా మారి పురుగులను చేరనివ్వదు.