Saturday, January 14, 2012

మబ్బులొచ్చినయ్!


*తేమగా ఉండే గాలి వెచ్చగా కూడా ఉంటే ఎత్తులకు చేరుతుంది. అక్కడ చల్లదనం ఉంటుంది.

*ఆ కారణంగా తేమ దుమ్ము, బూడిద, సూక్ష్మజీవుల వంటి పదార్థాల మీద చేరి దట్టంగా మారుతుంది. నీరు పdలస్ ఆధారం (దీన్ని సీడ్ లేదా విత్తనం అంటారు) ప్లస్ పైపైకి లాగే శక్తి కలిస్తే మేఘం లేదా మబ్బుపుడుతుంది.

*నీరు లేదా తేమ ఎక్కువగా ఉంది. సీడ్స్ మాత్రం తక్కువగా ఉన్నాయి. అప్పటికే తయారయిన మంచు కణాలుకూడా సీడ్‌గా పనిచేస్తాయి. ఒకేచోట తేమ సమకూరిన కొద్దీ, పైకి లాగే శక్తికి వీలుగానంత బరువుగా మారతాయి నీటి చుక్కలు. అంటే, అవిక కిందికి వర్షంగా పడక తప్పదు!

*మబ్బులు మరీ ఎక్కువగా ఉంటే, వేడిమీ ఈ లోపలే చిక్కుబడి వాతావరణం వేడెక్కుతుంది!
*మబ్బులలో కొన్ని మరీ ముత్యాల్లా మెరిసిపోతుంటాయి. వాటిని ముత్యం మేఘాలనే అంటారు. వాటిలోని మంచు స్ఫటికాలు మరీ సన్నవిగా ఉంటాయి. వెలుగును మరింత ప్రతిఫలింపజేసినందుకు ఆ తళతళ కనబడుతుంది. ఈ రకం మబ్బులు 10నుంచి 15 మైళ్ల ఎత్తులో ఉంటాయి.

*ఈ ముత్యం మేఘాల కారణంగా, ఓజోన్ పొరకు నష్టం ఏర్పడుతుంది.

*వాతావరణంలో మబ్బులను పైకి లాగే శక్తికి సమంగా, గాలివాటూ కిందకు కూడా లాగుతుంటే మేఘాలు గుండ్రంగా కదులుతాయి. ఆ తరువాత తుఫానువచ్చే వీలుంటుంది. కానీ ఈ రకంగా రోల్ అయ్యే మేఘాలు ఎంతో అందంగా, ఆసక్తికరంగా కనబడతాయి.
*భూమి నుంచి 50 మైళ్ల ఎత్తున కూడా మబ్బులు ఏర్పడతాయి. రాత్రిపూట మెరుస్తుండే ఈ మబ్బులు నీలం కలిసిన తెలుపు రంగులో ఉంటాయి. ఇవి పగటి పూట కనబడవు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత, ఆ క్రింద నుంచి వచ్చే వెలుగులో ఇవి తళతళలాడతాయి.
*1853లో క్రకటోవా అగ్నిపర్వతం పేలిన తరువాత ఈరాత్రి మబ్బులు కనబడడం మొదలయింది.

*2010 జూన్‌లో, దక్షిణ డకోటా (యు.ఎస్)లో వడగళ్ళవాన కురిసింది. అంతగా పెద్ద వడగళ్లు ముందెన్నడూ కురవలేదు. అప్పుడు పడ్డ ఒక మంచు ముద్ద రెండు పౌండ్ల బరువుంది. ఫుట్‌బాల్ కన్నా కొంచెం పెద్దదిగా ఉందది!

*ఎత్తులో మేఘాలుండేచోట, గాలివాటు, ఒత్తిడి విచిత్రంగా ఉంటాయి. 2007లో జర్మన్ పారాగ్లైడింగ్ చాంపియన్ ఈవా విస్నియేర్స్‌కా గ్లైడింగ్ చేస్తూ క్యుములోనింబస్ మబ్బులకు దగ్గరగా ఎగిరింది. గాలి ఆమెను 32,000 అడుగుల ఎత్తుకు లాక్కుపోయింది. ఆక్సిజన్ అందకుండా పోయినందుకు ఆమె మూర్ఛపోయింది. 23,000 అడుగుల ఎత్తున ఆమెకు తిరిగి తెలివి వచ్చింది!

*క్యుములోనింబస్ మేఘాలు తక్కువ ఎత్తులో ఉంటాయి. వాటి చుట్టు గాలివాటం చెప్పరాని రకంగా క్షణానికొక తీరుగా మారుతుంటాయి. సాధారణంగా విమానం పైలట్లు అందుకే ఈ రకం మేఘాలగుండా ప్రయాణించడానికి ఇష్టపడరు!

*నిజానికి విమానాలు వాటికన్నా ఎత్తులో ఎగురుతుంటాయి!

Friday, January 13, 2012

కళ్ల ముందు అమెరికా అంతరంగం


కళ్ల ముందు అమెరికా అంతరంగం



అమెరికా ప్రజల చరిత్ర-
హొవార్డ్ జిన్ రచన
అనువాదం: కె.సత్యరంజన్, బి.భాస్కర్
ప్రజాశక్తి బుక్‌హౌస్, ఆజమాబాద్, హైదరాబాద్- 20,
వెల: రూ.150/-,
పేజీలు: 294.

ఏ దేశం చరిత్ర చదివినా, అంతా అభ్యుదయ పరంపరగా జరిగిందనే చెపుతుంటాయి. అమెరికా అందుకు వేరుగా ఉండవలసిన అవసరం లేదు. అంకుల్ శాం నేటికీ అందరి మీదా పెత్తనం చేయాలనుకుంటాడే తప్ప, మంచితనం చూపుదామన్న పద్ధతి లేదు. అమెరికా చరిత్ర పుస్తకాలు తెలుగులో ఎన్ని వచ్చాయో తెలియదు. కానీ ఆ దేశం అసలు రూపాన్ని అందరి ముందు ఉంచే పనిని ప్రజాశక్తి బుక్‌హౌస్ వారు ఈమధ్యన చేపట్టారు. ఆ క్రమంలో మరో పుస్తకం ఈ అనువాదం.
ఇది అమెరికా చరిత్ర కాదు. అమెరికా ప్రజల చరిత్ర. అందునా శ్రామిక వర్గం వారి చరిత్ర. రచయిత జిన్ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి. తరువాత ప్రొఫెసర్ అయ్యాడు. మామూలుగా అందరూ చూడని, చరిత్రను చెపుతూ, నిరసనలలో పాల్గొంటూ ప్రభుత్వ వ్యతిరేకిగా గుర్తింపు పొందాడు. ఎన్నో రచనలు చేశాడు. ‘అమెరికా ప్రజల చరిత్ర’ అన్న ఈ పుస్తకం మూల రచనకు సంక్షిప్త రూపం మాత్రమే తరువాత వచ్చిన అభిప్రాయ మాలికల పుస్తకం నుంచి కూడా, ఈ అనువాదం చివరలో చేర్చారు.

మామూలు చరిత్ర పుస్తకాలలో ఒక రకమయిన ఏకపక్ష ధోరణి ఉంటుంది. కానీ జిన్ తన పుస్తకంలో కూడా ఏకపక్ష ధోరణి ఉందని నిస్సందేహంగా అంగీకరించాడు. నా రచన ఒక వేపునకు మొగ్గుచూపింది. ఇందులో నాకేమీ బాధ లేదు. అంటాడు రచయిత. మరీ ఏకపక్షంగా చెప్పిన చరిత్రలో అసలే కనిపించని అంశాలను గురించి చెప్పి ఒక రకమయిన సమతూకం కొరకు ఈ రచయిత శ్రమించినట్లు మనకూ అర్థమవుతుంది. ప్రభుత్వం విధానాలు బీదవారు, స్ర్తిలు తెల్లతోలు లేని వారి మీద చూపిన ప్రభావం గురించి ఈ పుస్తకంలో సవివరంగా తెలుసుకోవచ్చు. కార్మికుల పోరాటాలు, సమానత్వం కొరకు జరిగిన సంఘర్షణలు, ఇంత అన్యాయంగా జరిగినట్లు తెలిసిన తర్వాత అమెరికా దేశం పట్ల ఒక రకమయిన ఏవగింపు పెరిగినా ఆశ్చర్యం లేదు. అయినా వాస్తవం తెలియకుండా, ఒక దేశాన్ని ఆకాశానికెత్తి ‘ప్రామిస్‌డ్ ల్యాండ్’గా చూడడం తప్పుగదా! ఈ పుస్తకంలో ఇటీవలి చరిత్ర కూడా ఉండడం గమనించదగిన అంశం!

చరిత్ర పుస్తకాలు చదవడమే తలనొప్పి. అందునా మనకు పరిచయం లేని ఘటనలు మనుషులు, వాతావరణం గురించి చదవడం అందునా అసౌకర్యంగా ఉంటుంది. ఈ పుస్తకం చదవడంలో మరొక చిక్కు ఉంది. అసలు చరిత్రను చదవకుండా, ఈ మరో పార్శ్వం చదువుతూ ఉంటే, మరింత వివరం తెలిస్తే బాగుండునన్న భావం మిగులుతుంది.
ఆసక్తికరమయిన అంశం గనుక ఇంగ్లీషులో ఈ పుస్తకం లక్షల కాపీలు అమ్ముడయింది. ఏకబిగిన, ఒక నవల చదివినట్లు, చదివించే పుస్తకం కాదిది. అయినా ఆసక్తికరంగా సాగింది. తెలుగు అనువాదం మరింత సులభంగా సాగితే బాగుండును. ఇంగ్లీషులోని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు తెలుగులోకి తెచ్చే ప్రయత్నం జరిగింది.
‘‘చరిత్ర పుస్తకాల గుట్టల బరువు కింద కుంగిపోతూ, దేశము దేశ భక్తులు చూపిన మార్గంలో గౌరవంగా వణికిపోతూ, లొంగిపోయేలా కుంగదీయబడే క్రమంలో మనం నిలదొక్కుకుని వెన్ను నిటారుగా నిలుపుకుని నిలబడాలంటే, అనుద్దేశ పూర్వకంగా ఇంతకాలం ఈషణ్మాత్రం గౌరవించని ప్రజా ఉద్యమాల ఆసరానే కావాలి!’’ ఈ వాక్యానికి జీన్ మూలం ఇంత గజిబిజిగానూ ఉంది. అందులో మరో నాలుగు మాటలున్నాయి.

ఆపుతూ ఆపుతూ సీరియస్‌గా చదవవలసిన పుస్తకం ఇది. ఇంగ్లీషులో నయినా తెలుగు అయినా! విషయం మీద ఆసక్తి ఉంటే చాలు, చదవ వచ్చు!

Thursday, January 12, 2012

శూన్యంలో ఏముంది?


శూన్యంలో ఏముంది?

‘తెల్లోడు ఎర్రోడా (వెర్రివాడా?) ఏంటి, గొట్టాలెట్టి సూట్టానికి?’ అనిపించాడు గురజాడ తన కన్కాశుల్కంలో. ఆకాశం శూన్యం కాదని చెప్పడానికి, ఆ మాట వాడుకున్నారాయన! లెక్కల్లో శూన్యం, పూజ్యం లేదా సున్నా ఉంది. ఆ సున్నా ఒక్కటే ఉంటే ఏమీ లేదని అర్థం. 2012 సంవత్సరంలోని సున్నా లేకుంటే, లేక దానికి విలువ లేకుంటే, లెక్క తలకిందులవుతుంది కదా? ఇక్కడ సున్నా విలువ దాని స్థానాన్ని బట్టి తేలుతుంది.

ప్రకృతిలోనూ శూన్యం ఉందంటారు. ప్రకృతిలో శూన్యం ఏమిటి? అన్నారు గ్రీకు తత్వవేత్తలు రెండున్నర వేల సంవత్సరాల క్రితమే! రెండు వస్తువుల మధ్యన శూన్యం ఉంటుందా? ఉంటే రెండు వస్తువుల మధ్యన సంబంధానికి ఆధారం ఎలాగవుతుంది? ఖాళీకి ఆకారం, పరిధులు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నలు అడగనంతవరకు బాగానే ఉంటాయి గానీ, అడిగిన తర్వాత అవును గదా, అనిపించక మానదు. క్రీ.పూ. అయిదవ శతాబ్ది నాటి గ్రీకు తత్వవేత్త పార్మెనిడిస్, ఆ తర్వాత అతని దారిలోనే ఆలోచించిన అరిస్టాటిల్, శూన్యంలో కూడా కంటికి కనిపించని పదార్థమేదో ఉండాలి అన్నారు. లుసిప్పస్, డెమొక్రిటస్ లాంటి వారు, అప్పుడది శూన్యం ఎలాగయింది? అన్నారు. 17వ శతాబ్ది నాటికి ఆధునిక విజ్ఞానం మొదలయింటారు. అప్పుడు కూడా శూన్యం గురించిన అవగాహనలో పెద్ద మార్పులేమీ రాలేదు. న్యూటన్ కూడా, అరిస్టాటిల్ కూడా, శూన్యంలో, కనపడని, రాపిడి కలిగించని ‘మాథ్యమం’ ఏదో ఉందన్నాడు.

న్యూటన్ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అందుకే రాపిడి గురించి ఆలోచింపగలిగాడు. భూమిలాంటి గ్రహం శూన్యంలో తిరుగుతుంటే, అక్కడ రాపిడి ఉంటే, లెక్క మరోరకంగా ఉంటుంది. సమకాలీన జెర్మన్ పరిశోధకుడు గాట్‌ఫ్రీడ్ లైబ్నిజ్ ఈ మాటను కొట్టిపడేశాడు. కదలిక, అది భూమి తన చుట్టు తాను తిరగడం లాంటి రొటేషన్ అయినా సరే, విశ్వంలోని మిగతా అంశాలతో సాపేక్షంగా చూచి మాత్రమే అర్థం చేసుకోవలసినది అన్నాడతను. 19వశతాబ్దపు జెర్మన్ ఇంజనియర్, తత్త్వవేత్త ఆర్న్‌స్ట్ మాక్, విశ్వంలోని ఇతర అంశాల ఆకర్షణతో మాత్రమే రాపిడి వంటి మెకానికల్ ప్రభావాలు ఉంటాయన్నాడు. ఐన్‌స్టైన్, ఈ సిద్ధాంతాన్ని అంగీకరించలేక, వదలలేక తికమకకు గురయ్యాడు.
19వ శతాబ్దం పరిశోధకులకు విశ్వం గురించి, అందులోని శూన్యం గురించి కొత్త సమస్యలు, అవగాహనలు ఎదురయ్యాయి. అయస్కాంతాలు, లేదా ఛార్జ్‌లు (ధన, రుణ ఆవేశాలు) ఎలా పనిచేస్తాయి. అవి ఒకదానిని మరొకటి ఆకర్షించడం, వికర్షించడానికి మాథ్యమం ఏమిటన్న సమస్య వీరిని ఆలోచింపజేసింది. మైకేల్ ఫారడే క్షేత్రాలు (ఫీల్డ్స్) అనే కొత్త ఆలోచనను ప్రతిపాదించాడు. అయస్కాంతం, విద్యుత్తుల విషయంలో ఈ క్షేత్రాల కారణంగా, బలాలు తెలుస్తాయని ఆతని ఆలోచన! మరి ఈ క్షేత్రాలంటే ఏమిటి? మరోసారి కంటికి కనబడని మాథ్యమం గురించి ఆలోచన సాగింది. ఈతర్ అనే మాట అప్పట్లో అందరినీ ఎంతో కుదిపిందని శాస్త్ర చరిత్ర చెపుతుంది!
ప్రేతాత్మలు కూడా ఈ ఈతర్‌లో ఉంటాయన్న వారున్నారు. తరువాత జేమ్స్ మాక్స్‌వెల్ విద్యుతు,్త అయస్కాంతాల మధ్యగల సంబంధాన్ని 1860ల్లో వర్ణించాడు. విద్యుదయస్కాంత తరంగాలు, రేడియోతరంగాలు, వెలుగు కూడా ఈతర్ ద్వారా ప్రవహిస్తాయని ఒక అవగాహన మొదలయింది.

ఆ వెంటనే తిరిగి కదలిక, సాపేక్షంగా, అంటే ఒకదానితో పోల్చి చూపినప్పుడుగానీ కదలిక తెలియదనడం లాంటి సిద్ధాంతాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. గ్రహాల కదలిక, వెలుగు వేగం గురించి చర్చ మొదలయింది. మరోసారి ఐన్‌స్టైన్ ప్రమేయం మొదలయింది. 1905లో సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆయన, కదలికను, శూన్యంతోగాక, మిగతా పదార్థాలకు దూరం, దిశలలో మార్పుగానే నిర్వచించాలి, అన్నాడు. ఆ లెక్కలతో ఈతర్ కొంచెం అనుమానాస్పదమయింది. శూన్యంలో ఏదో ఉండాలి, ఉంటుంది. కానీ, మనం పదార్థంగా అనుకుంటున్న లాంటిది మాత్రం కాదు అది అన్నారు అందరూ!
పది సంవత్సరాలు తరువాత అణువులోపలి సంగతులను చర్చించే క్వాంటమ్ మెకానిక్స్ వచ్చింది. న్యూటన్ వర్ణించిన ప్రపంచం, కదలికలు మొదలయినవి తెరమరుగయ్యాయి. అణువులోపలి ఎలెక్ట్రాను కదులుతూ ఉంటుంది గానీ, ఒక ప్రత్యేక క్షణాన అది ఎక్కడుండేదీ చెప్పడం వీలుగాదన్నారు. అదే నిజమయితే, క్షేత్రాలు, మిగతా వాటి విషయంలో కూడా ఈ మాట పనిచేయాలి! క్వాంటం అనిశ్చితత అనేమాట వచ్చింది.

ఒక పెట్టె ఉందనుకుందాం. అందులో ఏ రకమయిన విద్యుత్తు ఛార్జ్స్‌లూ లేవు. ఆ లోపలికి వెలుపలనుంచి మరే రకమయిన ఆవేశాలు వచ్చే వీలు కూడా లేదు. అంటే, అందులో శూన్యం మాత్రమే ఉంది అన్నమాట. అయినా సరే క్వాంటమ్ మెకానిక్స్ సిద్ధాంతం ప్రకారం మాత్రం, ఆ పెట్టెలో తరగని విద్యుత్తు క్షేత్రం ఉండి తీరుతుంది! దాని కదలిక అనిశ్చితంగా ఉంటుంది. మనకు చేతయిన పద్ధతిలో అందులోని విద్యుత్తును కొలిచే ప్రయత్నం చేస్తే అది అందదు. ఆ కొలత అణువుల స్థాయిలో ఉంటేనే కొలత తెలుస్తుంది.

విద్యుత్తు క్షేత్రంలోని బలం సున్నా లేదా శూన్యం అయినంత మాత్రాన, ఆ శక్తి అక్కడ లేదనడానికి లేదు, అంటారు పరిశోధకులు. ఇప్పుడు ఒక ప్రశ్న పుడుతుంది. ఒక పరిమాణం గల భారీ పెట్టెలో ఎంత శక్తి ఉంటుంది? తెలిసిన పద్ధతులతో లెక్కగడితే అర్థంలేని ఒక జవాబు కూడా దొరుకుతుంది. శక్తికి అంతం లేదు. శూన్యం అంటే ఖాళీ కాదు. అందులో అంతులేని శక్తి ఉంటుంది.

ఇంత చదివిన తరువాత, నాలాగే మీకూ ఈ సంగతి అర్థం కాలేదన్న భావమూ, ఖాళీ భావమూ మిగిలితే, ఆశ్చర్యం లేదు. ఒకానొక ప్రసిద్ధ వేద పండితుడు ఈమధ్యన నన్ను అడిగిన ప్రశ్నల కారణంగా ఈ విషయాలన్ని లెక్కించుకోవలసి వచ్చింది. ఈ ప్రపంచంలో చాలా సంగతులు అర్థం కావు. మనకు అర్థంకానంతమాత్రాన వాటి గురించి ఆలోచన ఆగిపోదు. మనమూ ఆలోచించాలి. మరింత తెలుసుకోవాలి. శూన్యంలోనుంచి ఏదో బయటకు వస్తుంది! *

Wednesday, January 4, 2012

మన గురించి మనం - 4


మీరు కలలుకంటారా?
కలలు బాగుంటాయా, భయంకరంగా ఉంటాయా?

కలలు సాధారణంగా బాగుంటాయి గదూ? నిజం కానిదంతా, కాలేనిదంతా కలలో కనిపించినట్లు ఉంటుంది కదూ?
తెల్లవారుతుండగా కమ్మని కలలో కరుగుతుంటాము. ఎందుకో గానీ మధ్యలో మెలుకువ వస్తుంది. అందమయిన కల తెగిపోతుంది. ఎప్పుడయినా కల గురించి ఆలోచించి గుర్తు చేసుకోవాలనే ప్రయత్నం చేసారా తప్పక చేసే ఉంటారు. కల తెగుతుంది. తెల్లవారిందని తెలుస్తుంది. కలలోనుంచి నిజంలోకి మారాలన్న భావంతో బతుకు మళ్లీ పాత పద్ధతిలో మొదలవుతుంది. ప్రయత్నించినా కలలో సంగతి గుర్తు రాదు. కలలన్నీ గుర్తుకు వచ్చి ఉంటే ఇప్పటికి అందరికన్నా మంచి రచయిత అనిపించుకునే వాళ్లమేమో?
కల కరుగుకుంది, బతుకు మొదలవతుంది అనుకున్నాం గదా! నిజంగా బతుకు మొదలవుతుందా? లేక అది కూడా కలేనా?
నిజంగా బతుకంతా కలలాగ సాగుతుందన్న మాట గురించి అలోచించారా ఎప్పుడయినా?
మీరు చదువుతున్నామనుకుంటున్నారు. కల గంటున్నారేమో? గమనించండి ఈ క్షణం, గడిచిన క్షణం, రానున్న క్షణం అన్నీ కలలేనేమో?

ఇది నిద్ర మత్తు ప్రశ్న మాత్రం కాదు సుమా!
బతుకులో మనం నమ్ముతున్నవన్నీ నిజంగా ఉన్నాయా? జరుగుతున్నాయా? కలలాగే మనం వాటిని భావించుకుంటున్నామా?
అంతా కలేనేమో?

కల కాదనడానికి మనల్ని మనం గిల్లుకుని చూడాలంటారు. గిల్లుకున్నాము సరే. గిల్లుకోవడం కూడూ కలేనేమో? అది మరో కలలోకి మనలను కదిలిస్తుందేమో?

నాకు కథలు కథలే కలలుగా వస్తాయి. వాటన్నిటినీ గుర్తుంచుకుంటే బాగుంటుందన్న ఆలోచన వచ్చిన మాటా వాస్తవమే. అప్పుడు పడుకుని తీరికగా తెల్లవారిన తరువాత రాసుకుందామంటే అసలేమీ గుర్తుండదు. కనుక కల ముగిసిన వెంటనే నిద్ర లేవాలి. గుర్తున్నంత వరకు రాసుకోవాలి. అదీ ప్రయత్నం. రాసుకున్నాననే అనుకున్నాను. మరుసటి ఉదయం చూస్తే కాగితం మీద అక్షరం ముక్క లేదు. అంటే రాసుకోవడం కూడా కలేనన్న మాట.
ఏదో ఓడిపోయిన భావం కలిగింది. అందులో ఓటమి గెలుపులెక్కడివి అన్న ప్రశ్న కూడా కలిగింది.
ఇప్పుడు మాత్రం నేను మెలుకువగానే ఉన్నాను గదా! మెలుకువగా ఉన్నందుకే రాస్తున్నాను గదా!!
ఇది కలగాదు. నా ఆలోచన కలగాదు. నా రాత కలగాదు. నా ఇల్లూ, ఇల్లాలూ, పిల్లలూ కలగాదు. నా కలం, కాయితాలూ కలగాదు. అన్నీ కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. కలలోనూ అన్నీ కనిపిస్తాయి. వినిపిస్తాయి. తేడా ఎక్కడుంది మరి?
కలలో నా రాత కూడా అంత నిజంగానూ అనిపించింది. కాగితం మాత్రం ఖాళీగా ఉంది!
చూడండి. ఎంత గజిబిజి?

అలోచనలతో ఇదే కష్టం.
ప్రపంచమంతా ఉంది అనుకుంటే నిజం. లేదంటే అంతా అబద్ధం.
నా ఇల్లు లేదా? పిల్లలు ఎక్కడ? అంతా నిజమనుకుంటున్నానే! కాదా?
అక్కడే అసలు తెలివిని వాడుకోవాలి. బతుకును కలగా సాగనిస్తే అట్లాగే ఉంటుంది. నిజం చూడడం నేర్చుకుంటే మరో లాగ ఉంటుంది.
ఆలోచిస్తే గాని తేడా తెలుస్తుంది! కనుక ఆలోచించండి!!

Monday, January 2, 2012

హద్దులు దాటని యాత్రా చరిత్ర


హద్దులు దాటని యాత్రా చరిత్ర

బియాండ్ ద బార్డర్ ఆన్ ఇండియన్ ఇన్ పాకిస్తాన్ (ఆంగ్లం)
రచన: యోగిందర్ సికంద్ పెంగ్విన్ బుక్స్,
వెల: రూ.350/-,
పేజీలు 297+

భారత-పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్ పోటీ జరిగినా సరే, ప్రపంచ యుద్ధం జరుగుతున్నట్లు అందరూ ఊపిరి బిగబట్టుకుని చూస్తారు. పాకిస్తాన్ గెలిస్తే పండుగ చేసుకునే వారు భారతదేశంలో ఉన్నారు. కానీ, భారతదేశం మీద ప్రేమ వదులుకోలేక, తమ చరిత్ర, మతం, నమ్మకాలను వదులుకోలేక బతుకుతున్నవారు ‘సరిహద్దులకు ఆవల’ అంటే పాకిస్తాన్‌లో ఉన్నారని ఎంతమందికి తెలుసు.

యోగిందర్ సికంద్, పరిశోధకుడు, పాత్రికేయుడు పాకిస్తాన్ నుంచి పారివచ్చిన వారి సంతతి వ్యక్తి. అతనికి పాకిస్తాన్ అంతా తిరిగి చూడాలన్నది, చిన్న నాటి నుంచీ బలంగా ఉన్న కోరిక. పరిశోధన పేరున మరో రకంగా అక్కడి వారితో మైత్రి పెంచుకున్నాడు అయినా అక్కడికి వెళ్లడానికి అన్నీ అడ్డంకులే. వీసా ఇవ్వడానికి అధికారులు కనబరిచిన వైమనస్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘నువ్వు తిరిగి వచ్చిన తర్వాత మా దేశం గురించి నెగెటివ్‌గా రాయకూడదు!’ అన్నారంటే అక్కడే మనకు అనుమానం మొదలవుతుంది. సికంద్ కూడా అలాంటి భావాలతోనే బయలుదేరతాడు. మొదట్లో చదువుతుంటే పాఠకులకు విసుగు అనిపిస్తుంది. వాడెవడో ముక్కు గెలుక్కుంటే, దాని గురించి వర్ణించాల్సిన అవసరం ఏమిటి అనిపిస్తుంది.

ఈ యాత్రాచరిత్ర రచన నిజంగా సరిహద్దులను దాటి జరిగింది అనవసరం అనిపించేంత ఉత్సాహంతో, ఓపికతో సికంద్ పాకిస్తాన్ దేశమంతటా కలియదిరుగుతాడు. ఆ విశేషాలను కళ్లముందుంచినట్టు కాకపోయినా వివరంగా చెపుతాడు (ఇతను కథారచయిత కూడా అయి ఉంటే రచన మరోలాగుండేదని అనిపిస్తుంది) మతం తప్ప మరోటి తెలియని ఒక ముల్లా ఇంట్లో సికంద్‌కు ఆతిథ్యం దొరుకుతుంది ఒక రోజు. దేశంలోనికి వెళ్లడం లాగే, అక్కడికి వెళ్లడం కూడా అనుమానంతోనే. అది విడిదికి భయం! కానీ నోరు తెరిచిన తర్వాత ఆ పెద్దాయన, ‘ముస్లిములు కానివారంతా శత్రువులు అనడం తప్పు’ అంటాడు. భోజనానికి కూచుంటే, వాళ్లు ఇతని కోసం ప్రత్యేకంగా శాకాహారం వండిపెడతారు ఆ దేశంలో శాకాహారం గురించి పడిన పాట్ల తర్వాత ఈ ఆచరణ, కంటతడికి కారణమయేలాగుంది.
సికంద్ ఎందరో వ్యక్తులను కలుస్తాడు. అందులో హైందవ సంతతి వారు కొందరు, అవసరం కొద్దీ మతం మారిన వారు కొందరు భారతీయుడని తెలుసుకున్న మరుక్షణం, అక్కడ ముస్లింల పరిస్థితి ఏమి అని అడిగేవారు చాలామంది. ఇందులోని మొదటిరకం వారంతా ‘ఇంకెక్కడికయినా వెళ్లి మాట్లాడుకుందాం’ అన్నవారే! అంటే వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో అందరికీ పాకిస్తాన్ గురించి వివరం తెలియకుండానే ఒక రకమయిన భావం ఉంది. పాత చరిత్ర రేఖామాత్రంగా తెలుసు. అందులో నిజంగా తెలియవలసిన అంశాలు మాత్రం తెలియవు. సికంద్ చూచిన స్థలాలు, కలిగినవ్యక్తులు చేసిన సంభాషణలు, కలిగిన అనుభవాలు కలిపి, చివరకొక బలమైన భావానికి దారి తీస్తాయి. ఈ రెండు దేశాలు, అందులోని తరాల ప్రజలు, వారి ఆలోచనల మధ్యగల సామాన్యులను, తేడాలను, మరోసారి నిర్వచించాలన్న గట్టి ఆలోచన మనలో కలుగుతుంది. సికంద్ యాత్ర చరిత్ర అందుకే, అందరూ, నిజంగా అందరూ (ఓపికగా) చదవదగిన పుస్తకం.

ఇది నవల కాదు ఇందులో కథ, డ్రామా లేవు కానీ, అంతకన్నా బలమయిన సమాచారం ఉంది. ఇస్లాం అంటే శరణాగతి సిఖ్ అంటే శిష్యుడు లాంటి మామూలు విషయాల గురించి చాలా మందికి ఇక్కడే మొదటిసారి తెలిస్తే ఆశ్చర్యం లేదు. సూఫీలు, భాయి మర్దానా లాంటి, మరికొందరు గురునానక్ శిష్యులు బాబా ముల్లేషా విశేషాలు, అక్కడి మ్యూజియంలో కనిపించే తీరు, ఇస్లాం పుచ్చుకున్న భిల్లులు, హిందువులు ముస్లిములూ కాని కైంఖానీలు, కాశ్మీరు యువకులకు శిక్షణ, ఆ పేరున వచ్చి ఇరికి పోయిన యువకులు మొయెంజోదరో, ఇలా ఎనె్నన్ని విశేషాలు.. ఎంతమంది వ్యక్తులు;

పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం లేదు కనుక అందరూ రాజకీయం గురించి మాట్లాడతారు. మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది కనుక, అందరూ రాజకీయం మాట్లాడతారు! ఎంత వింత పరిస్థితి? అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయానికి శంకుస్థాపన లేదా పునాదిరాయి వేసింది ఒక పాకిస్తానీ సూఫీ మహానుభావుడంటే ఎంత ఆశ్చర్యం!
ఈ పుస్తకం చదువుతుంటే మొదట్లో విసుగనిపిస్తుంది. కానీ ముందుకు పోయిన కొద్దీ ఆసక్తి పెరుగుతుంది. పుస్తకమంతా సికంద్ మొదటి ప్రయాణం గురించిన వివరాలు. చివరల్లో ఒక పదిహేను పేజీలు రెండవ విజిట్ గురించి వివరాలు! ఈ రెంటిలో తేడా, ఆ దేశం గురించిన పూర్తి చిత్రాన్ని మన ముందు ఉంచుతుంది. సులభంగా చదవగల ఇంగ్ల్లీషులో రచన నడిచిన తీరు కూడా బాగుంది.

ఒక పాకిస్తానీ పెద్దమనిషి మాటలు పుస్తకం వెనుక అట్టమీద ఉన్నాయి. ‘‘నేను భారతదేశంలో పుట్టాను. మీ గ్రాండ్ పేరెంట్స్, ప్రస్తుతం పాకిస్తాన్ అంటున్న ప్రాంతంలో పుట్టిన వారు వాళ్లు భారతదేశంలో వరించారు నేను పాకిస్తాన్‌లో ఉన్నాను విచిత్రం కదూ!’ అని ఇలాంటి మాటలు పుస్తకంలో చాలా చోట్ల కనబడతాయి. ‘పాకిస్తాన్‌లో ఉండే చాలామంది హిందువులు పాకిస్తాన్‌ను తమ దేశంగా భావించరు. వీలయితే భారతదేశానికి వలస వెళ్లాలని మాలో చాలామందిమి రహస్యంగా కోరుకుంటాము. భారతదేశం మా మాతృభూమి పవిత్రదేశం, హిందువుల దేశం. అయితే ఈ విషయం బాహాటంగా చెప్పలేమనుకోండి’ అంటాడు ఒక అజయ్. క్రికెట్ పోటీలో పాకిస్తాన్ గెలిస్తే, మిఠాయిలు పంచుకునే వారు గుర్తుకు వచ్చారా? ‘బియాండ్ ద బార్డర్’ చదివిన తర్వాత, ఆ సరిహద్దులు దాటి వెళ్లి చూడాలనిపిస్తే ఆశ్చర్యం లేదు!

-గోపాలం కె.బి.

మేధ 020112


ప్రపంచాన్ని మార్చగల ఆలోచనలు


గుండెలో నొప్పిగా ఉందని అనుమానం వస్తుంది. మరెక్కడో కణితి ఉందని అనిపిస్తుంది. అప్పుడు ఆదరాబాదరాగా డాక్టరుదగ్గరికి వెళితే ‘మీరెప్పుడో వచ్చి ఉండవలసింది’ అంటారు. ఈ రకం బాధల లక్షణాలను, అనునిత్యం మనతోనే ఉండే సెల్‌ఫోన్ సాయంతో ఎప్పటికప్పుడు గమనించగలిగితే ఎంత బాగుంటుంది? అది ఆలోచన! స్మార్ట్ ఫోన్‌లు వచ్చిన తర్వాత అప్లికేషన్స్ పేరున ఏవో గమ్మత్తులు వచ్చాయి. కానీ అవి నిజంగా గమ్మత్తులు మాత్రమే! ఆలివ్‌కోర్ అనే కంపెనీ వారి ఐఫోన్ ఇసిజి, అప్లికేషన్ కాదు. అది ఒక ఫోన్ మీద ఒక తొడుగు. 2012లో దీని యుఎస్‌లో అనుమతి వస్తుంది.
ఈ ప్లాస్టిక్ కేస్ వెనుకభాగంలో రెండు ఎలక్ట్రోడులుంటాయి. ఫోన్‌ను రెండు చేతులతో పట్టుకున్నా, లేక గుండెకు తగిలించి పట్టుకున్నా, గుండె పని తీరు తెలుస్తుంది. ఆ వివరాలను వయర్‌లెస్ పద్ధతిలో అవసరమయిన చోటికి పంపవచ్చు కూడా! అంటే, గుండెనొప్పి వచ్చేదాకా ఆగనవసరం లేకుండానే, ముందు సూచనలు సులభంగా అందుతాయని అర్థం!
ఐ-ఫోన్ సాయంతో రక్తం పోటును గుర్తించగల మరో పరికరాన్ని ఫ్రాన్సుకంపెనీ వారు తయారుచేశారు. ఒక తెల్లని పట్టీని చేతికి వేసుకుంటే 30 సెకండ్లలో బ్లడ్‌ప్రెషర్ రీడింగ్ ఫోన్‌లో కనబడుతుంది. రీడింగ్‌లో గమనించవలసిన తేడాలుంటే హెచ్చరికగా సిగ్నల్స్ కూడా వస్తాయి.
ఇంత సులభంగా కాకున్నా, ఇచ్చిన సమాచారం సాయంతో డయబెటిక్స్‌కు సూచనలు అందించగల అప్లికేషన్ ఒకటి అప్పుడే వచ్చేసింది. ఇలాంటి సదుపాయాలన్నీ ఎక్కడికక్కడ వేరు వేరుగా వస్తున్నాయి. ‘‘ఇది ఆరంభం మాత్రమే. మునుముందు ఇవన్నీ కలిసి పనిచేయగల వీలు త్వరలోనే అందుబాటులోకి వస్తుంది’’ అంటారు ఎరిక్ టూపోల్ లాంటి నిపుణులు. జన్యు పరీక్షలు కూడా కలిసి, ఒక రకం వ్యాధి అవకాశాలు ఉన్నవారికి, అందుకు సంబంధించిన సూచనలు చాలా ముందే అందే వీలు త్వరలోనే వస్తుంది, అంటున్నారు. ఈ రకం సదుపాయాలు వాడగలిగినవారు ఎందరు అన్న ప్రశ్న. ముఖ్యంగా మన దేశంలో ఉంది! అది మరో విషయం.

ధర్మేంద్ర.ఎస్ మోడా మామూలుగా కంప్యూటర్ చిప్స్ నిర్మాణం గురించి కృషి చేస్తుంటారు. ఆయన బృందంలో ఒక మనస్తత్వవేత్త కూడా ఉండడం విచిత్రం! అయిదు విశ్వవిద్యాలయాలు, మరో ఐదు కంప్యూటర్ పరిశోధన సంస్థలకు ధర్మేంద్ర పరిశోధనలు కావాలి. ఈ పరిశోధనల రంగాన్ని కాగ్నిటివ్ కంప్యూటింగ్ అంటున్నారు. చెప్పిన పని చేయడం, కంప్యూటర్లకు తెలుసు. కానీ తెలిసిన విషయాలను వాడుకుని, స్వంతంగా ఆలోచించి, పని చేయడానికి ఈ పేరు వర్తిస్తుంది. ఈ బృందం వారు ఒక్కొక్క దాంట్లో 256 నాడీకణాల వంటి న్యూరాన్లుగల రెండు మైక్రోచిప్‌లను తయారుచేశారు. అవి ప్రస్తుతం మనుషులతో ఆటలతో మాత్రం పోటీపడుతున్నాయి. రాను రాను వీటి పరిధి పెరుగుతుంది. సిలికాన్ చిప్‌కు ఆలోచన, నిర్ణయాలు చేసే శక్తి అలవడుతుంది. వీళ్లు 10 బిలియన్ న్యూరాన్లు, అదే సంఖ్యలో నాడీ సంబంధాలు ఉండే చిప్స్‌ను తయారుచేస్తున్నారు. అది మనిషి మెదడులో సగానికి సమానమయిన శక్తి కలిగి ఉంటుంది. అయినా ఈ చిప్ రెండు లీటర్ల ఘనపరిమాణాన్ని మించదు. వెయ్యి వాట్ల కరెంటుతో పనిచేస్తుంది. అయినా ఇది మెదడు మాత్రం కాదు, అంటారు ధర్మేంద్ర. ‘‘మామూలు కంప్యూటర్లలో మార్గం ఇరుకుగా ఉంటుంది. సమాచారం త్వరగా కదలదు. ఇక్కడ అలా కాక, ఎక్కడి దారి అక్కడే ఉంటుంది. ఈ రకం చిప్స్‌ను చాలా చోట్ల వాడవచ్చు’’ అంటారాయన. వాడుకలో ఉన్న కంప్యూటర్లకు ఈ చిప్స్‌ను జత చేస్తే వాటి పని తీరు ఎంతో మెరుగవుతుంది.
ఈ రకం కంప్యూటర్లు నాడుల పద్ధతి ఆధారంగా పనిచేస్తాయి. కనుక ఈ పద్ధతిని న్యూరల్ కంప్యూటింగ్ అంటారు. మామూలు కంప్యూటర్లు తికమకపడి హ్యాంగ్ అయే పనులను ఇవి సునాయాసంగా చేయగలుగుతాయి!
కొంతకాలం పాటు డబ్బంటే నాణెం. తరువాత కాగితం వచ్చింది. ఈమధ్యన కార్డులు వచ్చాయి. అది కూడా అవసరం లేదు, చెయ్యి ఉంటే చాలు అంటున్నారు. పినెలాస్‌కౌంటీ స్కూల్‌లో పిల్లలు క్యాంటీన్‌లో లంచ్ కొని, యంత్రానికి తమ చెయ్యి చూపించి ముందుకు వెళ్లిపోతారు. కారొలీనాస్ హెల్త్‌కేర్ సంస్థల్లో కూడా సుమారు 20 లక్షలమంది పేషెంట్లు, అర చెయ్యి చూపించి కావలసిన సేవలను అందుకుంటున్నారు. టోక్యోలోని జపాన్ బ్యాంకులో కస్టమర్లు ఈ పద్ధతితోనే తమ అకౌంట్లను పనిచేయిస్తున్నారు. మనుషులను గుర్తించడానికి, శరీరంలోని రకరకాల భాగాలను వాడుతున్నారు. వాటిలో అరచేయిలాంటి భాగాలను సులభంగా వాడవచ్చు. వేలిముద్రలు, ముఖాలు అనుకున్నంత మంచి గుర్తింపులుకావనీ, వాటితో తికమక పరిస్థితులు తరుచు వస్తున్నాయని ఈ మధ్య కనుగొన్నారు. మోసం చేయడానికి వాటిలో వీలు ఎక్కువని కూడా తెలిసింది. కంటి పాపలు చాలా మంచి గుర్తింపు కార్డులే, కానీ, వాటిని పరిశీలించడం అంత సులభం కాదు. యంత్రంలోకి దగ్గరనుంచి తొంగిచూడాలి. కొన్ని సెకండ్లపాటు కన్నార్పకుండా ఉండాలి. అదే అరచేతిలో రక్తనాళాల అమరిక ప్రతి వ్యక్తిలో వేరుగా వుంటుంది. నియర్ ఇన్‌ఫ్రారెడ్ కాంతితో వాటిని గమనించడం చాలా సులభం. చేతిని డిజిటల్ వ్యాలెట్ (డబ్బు సంచి)గా వాడడానికి బ్యాంకుల వారి సమ్మతి ఒకటే అడ్డు! అంటారు సెక్యూరిటీ నిపుణులు బ్రూస్ షైనర్! క్రెడిట్ చేసేదల్లా, మనిషి గుర్తింపును డేటాబేస్‌లోంచి ఎత్తి చూపడమే, చెయ్యి ఆ పనిని అంతే సులభంగా చేస్తుంది. ఈ సంగతిని అర్థం చేసుకుని చేతి పద్ధతిని వాడడానికి అంగీకరిస్తే, అంగడిలోగానీ, హోటేల్‌లోగానీ, ‘హాయ్’! అని చేయి చూపితే చెల్లింపులు జరిగిపోతాయి.

కంచుయుగం నాటినుంచి కూడా గనులు తవ్వే పద్ధతి మాత్రం ఒకే రకంగా సాగుతున్నది. ముడిలోహాన్ని తవ్వి తీయడం, అందులోనుంచి లోహాలను బయటికి తీయడానికి గాను వేడిని, బొగ్గులాంటి రసాయన పదార్థాలను వాడుకుంటున్నారు. ఇందులో ఎంతో వేడి అవసరం. అంటే ఇంధనం అవసరం. ముడి ఖనిజంలో ఉండే లోహం తక్కువగా ఉంటే, మొత్తంమీద లాభసాటి వ్యవహారం కాదు. ఇక్కడే సూక్ష్మజీవులను వాడవచ్చునన్న ఆలోచన పుట్టి పెనుమార్పులకు దారితీసింది. తక్కువగా లోహం ఉండే ముడి ఖనిజాలనుండి, ఆయా లోహాలను వెలికి తీయడానికి సూక్ష్మజీవులను పెద్దఎత్తున వాడుతున్నారు. ఇది చవకగా జరిగే పనిమాత్రమే గాక, వేడి అవసరం ఏ మాత్రం లేకుండా జరగడం ఒక సులువు! ఈ పద్ధతి వాడి ముడిసరుకులోని లోహాన్ని 85 శాతం వరకు తీయగలుగుతున్నారు. ఇందుకు చేయవలసిందల్లా, ముడిసరుకు కుప్పలోపలికి సూక్ష్మజీవులను చేర్చడం, అందులోకి బాగా నీరు కలిసిన ఆమ్లాలను తోడుగా పంపించడం మాత్రమే. ఆసిడితయోబేసిలస్, లెప్టోస్పైరియం లాంటి సూక్ష్మజీవులు తమ పెరుగుదలకోసం ఇనుము, గంధకాలను తింటాయి. అప్పుడు ఇనుము, గంధకం పుడతాయి. వాటివల్ల రాతి వంటి పదార్థం మరింత కరుగుతుంది. మరింత లోహం బయటపడుతుంది. పాత గనుల్లో పేరుకుపోయిన ఆసిడ్ ద్రవాలను తొలగించడానికి కూడా సూక్ష్మజీవులను వాడే పద్ధతి ఈమధ్యన అమలులోకి వస్తున్నది. అక్కడ కూడా వ్యర్థంగా పోయిన కొద్దిపాటిలోహం తిరిగి చేతికి అందుతున్నది. రాగి, నికెల్ లాంటి లోహాలను ఈ రకంగా సేకరిస్తున్నారు. గనులలో ఎక్కడా లోహం ఎక్కువగా గల ఓర్ దొరకడం లేదు. అందుకని ఈ బయోమైనింగ్ పద్ధతులకు గిరాకీ బాగా పెరుగుతున్నది. ప్రపంచంలోని మొత్తం గనుల్లో 20 శాతం రాగి సూక్ష్మజీవుల సాయంతోనే బయటపడుతున్నది. దీంతో రాగి ఉత్పత్తి రెండింతలయింది అంటారు గనుల నిపుణులు కొరేల్ బ్రయర్లీ. ఇంతకముందు ‘పనికిరాదని’ పడవేసే ముడిఖనిజం ప్రస్తుతం అసలు ఖనిజంగా మారింది అంటారు బ్రయర్లీ.
ఇక నిజంగా వ్యర్థపదార్థం నుంచి కూడా లోహాలను తీసే పద్ధతి కూడా వచ్చేసింది. రాను రాను గనులలో సూక్ష్మజీవుల పాత్ర ఎక్కువవుతుంది. కార్టన్ ఇంధనాల మీద ఆధారపడకుండా పని జరగవలసిన పరిస్థితి రానుంది. కనుక సహజంగా జరిగే బయోమైనింగ్ కొత్తదారులను చూపగలుగుతుంది. ఆ దిశగా కృషి అప్పుడే మొదలయింది, అంటారు గనుల రంగం పరిశోధకులు. చిన్న ఆలోచన పెద్దపాత్ర వహించే వరకు వచ్చింది మరి!
వ్యవసాయం అన్న పద్ధతి రాక ముందు ఎటుచూచినా మొక్కలు చెట్లే ఉండేవి. అవి ఎన్ని సంవత్సరాలయినా కొనసాగేవి. ఈ బహు వార్షిక వృక్షాలు పోయి ఏటేటా వాడవలసిన మొక్కలు వచ్చాయి. ప్రస్తుతం పరిశోధకులు పద్ధతిని తిరగవేసి, గోధుమ, మొక్కజొన్న లాంటి పంటలు కోయవలసిన అవసరం లేకుండా, అదే మొక్కనుంచి మళ్లీ మళ్లీ పంట వచ్చే పద్ధతి గురించి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఫలిస్తే అంతగా పంటరాని ప్రాంతాలలో కూడా మంచి ఫలసాయాలు అందే వీలు ఉంటుంది.

ఏకవార్షిక పంటలకు బదులుగా బహుశార్షిక పద్ధతి తిరిగి తేవాలని పరిశోధనలు చాలాకాలంగా జరుగుతున్నాయి. ఇందుకు అవసరమయిన జన్యుపద్ధతులు మాత్రం గడిచిన పది పదిహేను సంవత్సరాలలో మాత్రమే చేతికి అందాయి. మొక్క ఎక్కువ సంవత్సరాలు పంటను ఇవ్వగలితే ఉండే లాభాలు చాలా ఉన్నాయి. ఈ రకం మొక్కల వేళ్లు బాగా లోతుగా నేలోకి చొచ్చుకుపోతాయి. మట్టి ఒరుసుకుపోవడం, దానితో బాగా తగ్గుతుంది. భాస్వరం లాంటి ఖనిజాలు మట్టితో బాటు మిగిలి ఎక్కువకాలం అందుబాటులో ఉంటాయి. ఈ రకం మొక్కలకు నీరు, ఎరువు అవసరం తక్కువ. ఏటేటా నాటి కోసే పంటలతో వాతావరణంలోకి లెక్కలేనంత కార్బన్ డయాక్సయిడ్ చేరుతున్నది. బహువార్షిక పంటలుగల నేలను ఏటేటా దున్ననవసరం లేదు. అప్పుడది కార్బన్‌ను పీలుస్తుంది కూడా! పంటలను కలిపి పండించడం మన దేశంలో కూడా తెలిసిందే. మెట్ట పంటల మధ్యన పప్పు ధాన్యాలను పెంచుతారు. కానీ వాటిని కూడా ఒక పంట తర్వాత కోస్తారు. మలావీ లాంటి దేశాల్లో మొక్కజొన్న పంటలో మధ్యన వేసిన పప్పు ధాన్యాల మొక్కలను బహువార్షికాలుగా వాడుకుంటున్నారు. ఆరోగ్యానికి అవసరమయిన మాంసకృత్తులనిచ్చే పప్పు దొరుకుతున్నది. ఈ మొక్కలు నత్రజనిని పట్టి నేలను సారవంతం చేస్తాయి. తేమను పట్టి ఉంచుతాయి. అయినా అసలు పంట దిగుబడి పెరుగుతుందే తప్ప తరగడం లేదని గమనించారు.
ఈ ఆలోచన వ్యవసాయ పరిశోధకులకందరికీ నచ్చింది. కానీ, ఈ రకం పంటలు సాగులోకి వచ్చేలోగా మరింత పరిశోధన జరగవలసి ఉంది. మొక్కజొన్న పంటను గురించి పరిశోధిస్తున్న కార్నెల్ సైంటిస్ట్ ఎడ్ బక్లర్, ‘పంట ప్రయోగాత్మకంగా వేయడానికే మరో 15 సంవత్సరాలు కృషి అవసరం’ అంటున్నారు. ఆలోచన వచ్చింది. ఇక ఆచరణకు ప్రయత్నం కూడా మొదలయింది. అది చాలు!

అరుదయిపోతున్న పెట్రోలియం ఇంధనాలు ద్రవరూపంలో ఉన్నాయి. వాటికి బదులుగా బ్యాటరీ కార్లను తయారుచేస్తున్నారు. ఈ బ్యాటరీలతో మరీ ఎక్కువ దూరం ప్రయాణాలు కురదటంలేదు. ప్రస్తుతం ఉన్న పద్ధతులతో మరింత ఎక్కువ దూరాలకు మన్నగల బ్యాటరీలు రావడం కష్టంగా ఉంది. కొత్త పద్ధతిని వాడితే బ్యాటరీల శక్తిని రెండింతలు చేయవచ్చునంటున్నారు.
ఈ ఆలోచన ఎమ్‌ఐటీ ప్రొఫెసర్ యెట్-మింగ్ చియాంగ్ గారికి వచ్చింది. అతనే స్థాపించిన ఒక బ్యాటరీల కంపెనీలో ఈ ఆలోచన పుట్టింది. బ్యాటరీలు రెండు రకాలు. అందులో మొదటిది ఫ్లోబ్యాటరీ. అందులోని సెల్‌లో ఎలక్ట్రొలైట్ ద్రవం ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీలు రెండవరకం. ఇవి చాలా చిన్నవి. ఫ్లో బ్యాటరీ, అంటే ద్రవం ఉండే బ్యాటరీలో శక్తి ద్రవం పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. వాటిని సైజు పెంచి మరింత విద్యుత్తును అందించేలాగ మార్చవచ్చు. చియాంగ్ బృందం వారు ఈ రెండు పద్ధతులను ఒక చోట చేర్చి ఒక బ్యాటరీ తయారుచేశారు. లిథియం అయాన్ లాంటి శక్తిగల బ్యాటరీలో ద్రవాన్ని వాడుతుంది ఈ కొత్త పద్ధతి. శక్తిని దాచి ఉంచగల నానో కణాలతో ఈ ద్రవాన్ని తయారుచేశారు. ఈ కాంపోజిట్ బ్యాటరీ పనితీరు బాగుంది, ఇది అద్భుతం అంటున్నారు పరిశీలకులు.
కారులో ఈ రకం బ్యాటరీ వాడితే, ఆ కారును పెట్రోల్ బంక్ లాంటి ఒకే కేంద్రానికి తెచ్చి ద్రవాన్ని మార్చుకోవడం కూడా వీలవుతుంది. అంటే గంటల పాటు ఛార్జింగ్ అవసరం లేదని అర్థం! అయితే ‘కేంబ్రిడ్జ్ క్రూడ్’ అనే ఈ ద్రవం అందరికీ అందుబాటులోకి రావడానికి ఇంకా ఎంతో కృషి అవసరం! అయినా ఇది బ్యాటరీల రూపానే్న మార్చే ఆలోచన అంటున్నారు యూరీ గొగొత్సీలాంటి పరిశోధకులు. ఇక్కడ ఆలోచనకు తొలిరూపం కూడావచ్చింది! ఏమవుతుందో వేచి చూడాలి!

రోగాలను కలిగించే క్రిములు రాను రాను మందులకు లొంగకుండా మారుతుంటాయని మన అనుభవం చెపుతున్నది. ట్యుబర్‌క్యులోసిస్ (టిబి) విషయంలో దీనివల్ల పరిస్థితి మరింత దారణం అయింది. మరెన్నో వ్యాధుల విషయంలోనూ ఇదే పరిస్థితి కనబడుతున్నది.
మరి పరిశోధకులకు కొత్త దారులు వెతకడమే పని! ఇక్కడ ఒక ఆలోచన రానే వచ్చింది. ఈ ఆలోచనకు దూరం నానోకత్తి! ఐబిఎమ్ పరిశోధకులు ఒక నానో(అతి సూక్ష్మ) కణాన్ని సిద్ధం చేశారు. అది శరీరంలోని హానికారక బ్యాక్టీరియాల కణకవచాలను కత్తిరించి నాశనం చేస్తుంది. బ్యాక్టీరియా పొరలకు నెగెటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ నానో పార్టికల్స్‌కు పాజిటివ్ ఆవేశం ఉంటుంది. కనుక ఇవి రెండూ సులభంగా ఒకచోట చేరుకుంటాయి. నానోకణం, సూక్ష్మజీవిలోకి రంధ్రం వేస్తుంది. చిల్లుపడిన బెలూనులాగా సూక్ష్మజీవి నశిస్తుంది. ఈ పార్టికల్స్ రక్తకణాల వంటి మామూలు కణాలకు ఏమాత్రం హాని కలిగించవు. సూక్ష్మజీవుల కణాలలో వంటి ఛార్జ్, మన శరీర కణాల్లో లేకపోవడం ఇక్కడి విశేషం! శరీరంలో వాటి పని ముగిసిన తర్వాత నానో కణాలను ఎంజైము సాయంతో కరిగించగలుగుతారు.
రానున్న సంవత్సరాలలో ఈ పద్ధతిని మనుషులలో వాడి చూస్తారు. ఆ తర్వాత వైద్యం, మందులు మొదలయిన మాటలకు కొత్త అర్థాలు కనబడతాయి!
ఎంత గొప్ప మార్పు అయినా ఒక ఆలోచనతో మొదలవుతుంది. రోగకారక క్రిములను నాశనం చేయడం, కొత్త దారులను చేరితే ఆరోగ్య సమస్యలకు మరింత సులభంగా జవాబు దొరుకుతుంది!