Friday, August 9, 2013

మిస్సమ్మ - ఉత్తరం

మిస్సమ్మ సినిమా వచ్చినప్పుడు సినిమా రంగం అనే పత్రికలో ఒక ప్రేక్షకుడు రాసిన ఉత్తరం.
అప్పుడు మరి ఫేసుబుక్కలూ లైకులూ లోవు గదా!




Monday, August 5, 2013

రూమీ - అస్తిత్వం

మౌలానా జలాలుద్దీన్ రూమీ ప్రసిద్ధ కవి, తాత్వికుడు.
పర్షియన్ భాషలో రాసిన ఆయన కవితలు ప్రపంచమంతటా  పేరు పొందినయి.

దీవాన్ అంటే  సంపూర్తి కవితాసంకలనం అని అర్థం.
రూమీ దీవాన్ లోని 238వ కనిత ఇది.

ఉండుట, లేకుండుటల గురించి కాదు 
నా తికమక.

రెండు ప్రపంచాల నుంచి తెగతెంపులు 
చేసుకోవడం ధైర్యమనిపించుకోదు.

నాలో ఉన్న అద్భుతాలను 
గుర్తించ లేకుండడం
అది 
అసలయిన వెర్రితనం!

అంటాడాయన.



I neither know Persian nor English.
What I did is not translation.
I only tried to bring the idea here.

To be or not to be 
is not my dilemma.
To break away from both the worlds
is not bravery.
To be unaware of the wonders
that exist in me
that
 is real madness!

(Translation by Maryam Mafi & Azima Melita Kolin)





Saturday, August 3, 2013

అచ్చులో లోకాభిరామం

చాలా కాలం పాటు అచ్చులో వచ్చిన అంశాలను నెట్ లో అందించాను.
ఇక్కడికన్నా నా బహుభాషా బ్లాగులో అటువంటి అంశాలు ఎక్కువ.

ఆంధ్రభూమి శాస్త్రి గారూ, మూర్తి గారూ పట్టుబట్టి నా లోకాభిరామంని లోకాభిరామమ్ గా మార్చి అచ్చులో అందిస్తున్నారు.

అంశాలు కొత్తవి.
ఇక్కడినుంచి ఎత్తినవి కావు.

చిత్తగించండి.




ఊదవలసిన శంఖం


* ‘నేను చెప్పే మాటలు ఎవరికీ పట్టవని నాకు తెలుసు. అయినా చెపుతాను. ఈ మాటలు, నేను చెప్పకుంటే మరెవరూ చెప్పరు. చెప్పలేరు’ అంటాడొక చైనా తాత్వికుడు.

‘ఊదర సంగై ఊది వెచ్చాల్, విడియుం బోదు, విడియాట్టుం’ అని ఒక తమిళ సామెత. ఊదే శంఖాన్ని ఊదేస్తే, తెల్లవారేటప్పుడు తెల్లవారనీ, అని అర్థం.

* కనీ పెంచీ, కనిపించిన దేవతలు అమ్మా, నాన్నా! బతుకుకు, చదువుకు గురువు, తరువాత హితుడు, స్నేహితుడు నాన్న! (నేను నాన్నగారు, స్నేహితులు అనలేదని ఎవరూ బాధ పడనవసరం లేదు! మా తీరే అంత!) ఈ పని ఈ రకంగా చేయండి, అని నాన్న ఏనాడూ చెప్పింది లేదు. అయినా అన్నింటికీ ఆయనే గురువు. నాన్న సైకిలు పెట్టే చోట, గోడలో ఒక చిన్న చెక్క తలుపు అల్మారా ఉండేది. నేనూ, తమ్ముడూ పొద్దున్నే ముఖం కడుక్కుని వచ్చి అక్కడ నిలబడి, ‘ఎలుకా! మాకేమయినా యియ్యవా?’ అని అడగాలి. కళ్లు మూసుకుని అడగాలి. అల్మారాలో ఎలుక ఉంటుంది. అది మాకు బిస్కెట్లు, చాక్లెట్లు ఇస్తుంది. ఇప్పటిలాగ చారెడు, బారెడు చాకొలేట్లు లేవప్పుడు. ప్యారీ, దకన్, రావల్‌గావ్ అంటూ రెండు వేపుల చెవులు మెలేసిన చాక్లేట్లవి. బుద్ధిగా పిడక బూడిదతో పళ్లు తోముకుని, ముఖం కడుక్కుని వచ్చి నిలబడడమంటే, ఎలుక కొరకేనా?

నాన్న ఆ ఊళ్లోనే, అంటే మా ఊళ్లోనే బడిలో టీచరు. ఆయన సిద్ధమయి, ధోవతీ కట్టుకుని, తాంబూలం వేసుకుని, సైకిలు తీసుకుని ఠీవిగా బయలుదేరితే దారిలో ఎవరూ అడ్డువచ్చేవారు కాదు. కానీ, అదంతా చూచే ఓపిక ఎక్కడిది! ఉడుతలా పరుగెత్తి బడికి చేరుకునే వాణ్ని. పుస్తకాలు లేవు. కనీసం పలక లేదు. నాకసలు బడిలో అడ్మిషనే లేదు. ప్రార్థన అయింతర్వాత చెప్రాసీ (బంట్రోతు) శాంతయ్య, నన్ను ఇంట్లో దింపుతాడు. అతను భుజం మీద ఎత్తుకుని ఇంటికి తెస్తుంటే, నచ్చక, ఒకనాడు, అతని చెవి కొరికినట్టు జ్ఞాపకం! శాంతయ్య తలకు రుమాలు కట్టుకునేవాడు. మరి చెవి ఎట్లా కొరకడం కుదిరింది? ఇప్పుడు అనుమానం వస్తుంది. పెద్దవాణ్ని అయింతర్వాత శాంతయ్య ఎప్పుడూ ఆ సంగతులు చెప్పి మురిసిపోతుండేవాడు.

నేనూ బడిలో చేరాను. అక్షరాలు దిద్దే అవసరం లేకుండా, ఏకంగా పుస్తకం పట్టుకున్నానట. ఒకనాడు అందరినీ నిలబెట్టి నాన్న డిక్టేషన్ చెపుతున్నాడు. నేను మెడలిక్కించి ముందున్నవాడి పలకలోకి తొంగి చూచాను. తల మీద ఠపీమని దెబ్బ పడింది. తిరిగి చూస్తే నాన్న! పలక కింద పడేసి ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయాను. పలకను నాన్న ఇంటికి తెచ్చాడు. ఆయన చెప్పిన మాట, అప్పటికే నేను రాసి ఉంచానన్న సంగతి ఆ పలక ప్రకటించింది! నాన్న గట్టిగా నవ్వాడు! నేనూ గర్వంగా నవ్వాను.

క్రమశిక్షణంటే నాన్న తర్వాతే ఎవరయినా! ఆయన్ను చూచి గడియారం తత్తరపడేదేమో? చివరి వరకూ ఆయన అదే పద్ధతిగా బతికారు.

ఇంట్లో తాతయ్య పుస్తకాలు ఒక పెద్ద అల్మారా నిండా ఉండేవి. వాల్మీకం మొదలు ఆనంద రామాయణం దాకా, ఎన్ని రామాయణాలున్నా ఆశ్చర్యం లేదు. ఆరోగ్యం, వైద్యం, యాత్రా చరిత్రలు, గారడీ విద్య, మొదలయిన పుస్తకాలన్నీ తాతయ్య కొని చదివారంటే భుజాలు పొంగిపోతాయి. ఆ పుస్తకాలను తరచు దులిపి, నిర్వహించడం నా డ్యూటీ. ఆ పుస్తకాలు నావి, అది గర్వం!

నాన్న బాగా చదువుకున్న మనిషి. కానీ సర్ట్ఫికేట్లు లేని చదువది. ఏదో ఒక చిన్న ట్రెయినింగ్ పొంది, ప్రైమరీ స్కూల్ పంతులుగా సెటిలయ్యారాయన. అందులోని ఆనందం గురించి తర్వాతెప్పుడో చెప్పాడాయన మాతో! ఆయన విపరీతంగా పుస్తకాలు చదివేవాడు. నాకు అక్షరాలతో పరిచయం ‘చందమామ’తో మొదలయింది. మూడవ తరగతిలో ఉన్నప్పుడు చందమామ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చదవడం అలవాటయిపోయింది. అందులో వచ్చే వ్యాపార ప్రకటనలు కూడా గుర్తున్నాయి. నాన్న తాను చదివిన నవల, పత్రిక ఏదయినా సరే తరువాత నా ఒళ్లో పడేయడం అలవాటయింది. కోడిగుడ్డు దీపం పెట్టుకుని, అయిపోయిందాక అపరాధ పరిశోధక నవల చదివి,ఆ దృశ్యాలు కళ్ల ముందు మెదులుతుంటే, భయంగా పడుకోవడం గుర్తుంది! ‘ఈ ప్రపంచంలో పనికిరాని పుస్తకమని ఏదీ లేదు’ అని నాన్న అనుకున్నాడనిపిస్తుంది. అంగట్లో పప్పు కట్టిచ్చిన కాయితం కూడా చదవందే పడేయకపోవడం, అప్పుడే అలవాటయింది.

సెలవులు వచ్చినయంటే, ఏ లైబ్రరీ నుంచో సంచెడు పుస్తకాలు ఇంటికి వస్తాయి. నిదానంగా చదివితే నాలుగు రాళ్లు కాలం గడుస్తుంది. కానీ, అంత ఓపిక ఏదీ? పిచ్చెత్తినట్టు అన్నీ చదివేసి, మరో బ్యాచ్ కొరకు ఎదురుచూడడమే!
అది పరీక్షకు చదవవలసిన ‘సిలబస్’ పుస్తకం గానీ, సరదాగా చదివే నవల గానీ, చదువు కాని చదువుగా చదివే మరో పుస్తకం గానీ, పుస్తకమంటే, నాన్నలాగే మిత్రుడు, ఆప్తుడు! కష్టపడి చదవడం, సరదాగా చదవడమన్న తేడా లేదు! అన్నీ యిష్టంగానే చదవడం అలవాటయింది. వరుసబెట్టి రెండు క్లాసిక్సు, రెండు నవలలు చదివి, అదే ఊపులో ‘సిలబస్’ కూడా చదివితే, అన్నీ ఒకే రకంగా, సినిమాలాగ గుర్తుకు వచ్చేవి.

మా ఊరి బడిలో అయిదవ తరగతి వరకే ఉండేది. తరువాత, పక్కనున్న పాలమూరులో చదువు. చిత్రంగా నాన్నకు, తిరిగి మా బడికే బదిలీ అయింది. చివరి పీరియడ్ జరుగుతుండగా, (మామూలుగా అది ఆటల పీరియడ్) నన్ను వెతికి, ‘ఇంటికి పరుగెత్తకు;’ అని ఒక మాట చెప్పి వెళతాడు నాన్న! అంటే ఆనాడు సినిమా చూసే కార్యక్రమం ఉందని అర్థం. సినిమాలు చూడడమే కాదు, వాటిని గురించి చర్చించడం కూడా నాన్న దగ్గర నేర్చుకున్నాను. నమ్మండి, నమ్మకపొండి, జరదా పాన్ తినడం, నాన్న దగ్గర నేర్చుకున్నాను!

జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చెయ్యాలన్నది నాన్న ఫిలాసఫీ. పట్నంలో పడి, నన్ను నేను వెదుక్కుంటూ బతికే రోజుల్లో పండగకు ఇంటికి వెళతాను. సాపాట్లు (భోజనాలు) అయింతరువాత నాన్న పాన్ వేసుకుని, ఆ అందమైన పెట్టెను నా ముందుకు తోస్తారు అది అలవాటు. ఒకసారి, నేను ‘మానేశాను వద్దు’ అన్నాను. ‘నాన్నా! టీ, కాఫీ తాగవు. మరే అలవాట్లూ లేవు. ఉన్న ఈ ఒక్క సరదా (అదే జరదా) మానేసి ఏం చేస్తవయ్యా?’ అన్నారాయన.

-మళ్లీ వచ్చేవారం


Tuesday, July 23, 2013

పల్లె అందము

ఇది ఒక అందమయిన భావన
అంతకన్నా అందమయిన చిత్రమయింది.

గ్రామీణ కళాకారుని కుంచె అంచు నుంచి జాలువారిన కవిత ఇది


Sunday, June 16, 2013

యోగీశ్వర విలాసము

యోగీశ్వర విలాసము
నందికొటుకూరు సిద్ధయోగి ద్విపద కావ్యము
పరిష్కర్త: వైద్యం వేంకటేశ్వరాచార్యులు,
అక్షరార్చన ప్రచురణలు- కర్నూలు
ప్రతులకు: పరిష్కర్త, ప్లాట్: 167,
శ్రీకృష్ణ నిలయం, రెవెన్యూ కాలనీ, కర్నూలు
పేజీలు: 220, వెల: 120 రూ.

నందికొటుకూరు సిద్ధయోగీంద్రుడు 1700- 1770 మధ్య కాలమున జీవించిన శివయోగి. కూచిపూడి సిద్ధేంద్రయోగి, బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధప్పలకు పేరులో మాత్రమే వీరితో పోలిక. వారిద్దరు వేరు. ఈ విషయాన్ని పరిష్కర్త సవివరంగా చూపించారు. నిజానికి ఈ రచనను ప్రపంచానికి అందించిన వైద్యం వేంకటేశ్వరాచార్యుల గురించి రెండు మాటలు చెప్పుకోవాలి. ఈయన పండితుడు. పరిశోధకుడు. వైష్ణవ సాంప్రదాయ అవలంబి. అయినా ఎన్నో శైవ గ్రంథాలను కూడా వెదికి, పరిష్కరించి ప్రపంచానికి అందజేశారు. నలభయికి పైబడిన ఈయన పుస్తకాలన్నీ పరిశోధన పద్ధతిలోనివే. 1923లోనే లింగైక్యం చెందిన చింతలేని సూగూరప్పలేదా నిశ్చింత సూగూర సూరిరాతప్రతినుంచి ప్రస్తుత గ్రంథాన్ని పరిష్కరించారు.

సిద్ధయోగి కవి మాత్రమే కాదు, యోగి కూడా. ఆయన జీవితం, మహిమల గురించి, సుమారు 20 పేజీల రచన ఒకటి పుస్తకం చివరలో ఉంది. అందులోని విశేషాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక పీఠికలో పరిష్కర్త అందించిన వివరాలు, విశే్లషణ మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. సిద్ధయోగి గాజులమ్మేవారు. ఊరూరు తిరుగుతూ, అలంపురంలో ఒక గురువును గుర్తించి, వారివద్ద శిక్షణ పొందిన వివరాలు కథలకన్నా బాగున్నాయి. శైవ సిద్ధాంత ప్రవర్తకులు, పండితులుగాక మామూలు మనుషులుగా బతికిన వారన్న సంగతి చరిత్రలో చూడవచ్చు. అటువంటి ఒకానొక మహాయోగిని అక్క మహాదేవి. యోగీశ్వర విలాపములో ఆమెకథ ఉన్నట్లు లెక్క. ఆ కథ కేవలము సూత్రము. ఆ దారంతో శైవ సిద్ధాంతంలోని వివిధ అంశాలను పూలుగా మార్చి పేర్చినది ఈ రచన.

ప్రాచీన శైవ సాహిత్యం ద్విపదల్లో ఉండడము కూడా జగమెరిగిన సత్యం. సిద్ధయోగి ద్విపద మరింత కట్టుబాట్లకు లొంగి నడిచిందని పరిష్కర్త పేర్కొన్నారు. అసలు రచన 159 పుటలలో మూడు ఆశ్వసాలుగా సాగింది. మొదటి ఆశ్వాసంలో రకరకాల విమర్శనములు. శుశ్రూష, వైరాగ్యము, పంచముద్రలు, పంచకోశము, పంచ భూతములు మొదలయిన వాటి తీరున వివరించడమే ఈ విమర్శనములు. పంచభూతముల గురించిన వివరణము పండితుల మెదళ్ళకు పనిపెట్టేదిగా ఉంది. రెండవ ఆశ్వాసంలో అక్క మహాదేవి కథ కూడా ఎన్నో మార్మిక విషయాల చర్చతోబాటుగా కొనసాగుతుంది. వీరశైవ రహస్యము ఇందులో ప్రత్యేకమయిన అంశము.

ఇక మూడవ ఆశ్వాసము మరింత గహనమయిన అంశాలను ముందుకు తెస్తుంది. జనన దిన ఫల వివేకము మొదలు, తానుతానగు వివేకము వరకు ఇక్కడ వరుసగా ఎన్నో వివేకములున్నాయి. యతిచంద్రవినుమునే- సంతధనంబు/ క్షితి పుట్టినపుడు తె- చ్చెడు నది కాదు/ తరలి గిట్టినవేళ- దనము రమంత/ పొరలి తాగైకొని- పోవుటలేదుచెప్పినది మామూలు విషయమయినా, తాత్విక వివేకమయినా భాష, పదముల నడక మాత్రము గొప్ప జిగితో సాగుతుంది.
పుస్తకంలో ఆ తరువాత సిద్ధయోగి రచనలు చిన్నచిన్నవి కూడా చేర్చారు. వేదాంత సూత్రము, షట్‌స్థల దర్పణము, నవ పద్య పుష్పమాలిక, పంచరత్నములు, సప్తచక్ర తత్వము అన్నవి పద్య రచనలు. ఒక తత్వము, మంగళహారతి కూడా ఉన్నాయి.


ఇది కథకొరకు, కాలక్షేపంకొరకు చదవవలసిన పుస్తకం కాదు. పండితులు, ఆర్ష, శైవ విజ్ఞానంలో ఆసక్తిగలవారు శ్రద్ధగా అనుసంధానం చేయవలసిన గ్రంథం ఇది. ఓపిక ఉండి చదివితే మాత్రం, అందరికీ ఎన్నెన్నో విశేషాలు తెలుస్తాయి. భాష మీద కాసింత పట్టున్న వారికి మరెన్నో మర్మాలు కనబడతాయి. రచనా కాలం ప్రకారం ఇది నిజంగా ప్రాచీనగ్రంథం. ఇంత మంచి పుస్తకాన్ని, పరిష్కరించి అందించిన పరిష్కర్త అభినందనీయులు.

Saturday, May 4, 2013

సరస్వతి - 53

నేను పుట్టిన సంవత్సరంలోనే ఈ బొమ్మ కూడా పుట్టింది.


సరస్వతి అనగానే అందరికీ వచ్చే ఆలోచనకూ ఈ బొమ్మకూ తేడా ఉంది కదూ?

1953లో ఆంధ్రపత్రికలో వచ్చిన బొమ్మ ఇది

Wednesday, May 1, 2013

పిల్లల పాట


చింతా దీక్షితులు గారి పేరు చెపితే ఎంత మందికి తెలుస్తుందో మరి.
ఆయన రాసిన పిల్లల కథలూ, పాటలూ చాలాతాలా బాగుంటాయి.
సూరీ, సీతీ వెంకీ అనే క్రమంమలో కథలు అప్పటి వారికి ఎంతో నచ్చాయి.
అలాగే ఆయన రాసిన పిల్లల నవలలు కూడా.

ఆయన ఎన్నో గేయాలు రాశారు.
అందులో ఇది కూడా ఒకటి.


బూచాడు



చీకటి అమ్మా, చీకటి అమ్మా
చీకటి చూస్తే భయమే
ఇంట్లో చీకటి, దొడ్లో చీకటి
అంతా చీకటి మయమే

చీకట్లోనూ బూచీవాడూ
దాక్కొన్నాడమ్మా
బూచీవాడిని చూస్తే నాకూ 
భయమేస్తుందమ్మా

నల్లటి వళల్లూ, ఎర్రటి కళ్లూ
ఊచల్లా కాళ్లూ
చేత్తో కత్తీ పట్టుకు వచ్చీ
ముక్కూ కోస్తాడూ

బూచీవీడూ బుట్టాతెచ్చీ
ఎత్తుకుపోతాడు.
బూచీవాడిని పొమ్మని చెప్పే 
బబ్బుంటానమ్మా

అమ్మా నేనూ నీ వళ్లోనూ 
బబ్బుంటా కానీ
నీ వళ్లోనూ బబ్బుంటేనూ
బూచాడొస్త్డాడా

బబ్బున్నాక మంచీ మంచీ 
కథలూ చెప్పవుటే
బబ్బున్నాకా మంచీ జోలా
పాటలు పాడవుటే

కథలూ జోలా పాటలు వింటూ
నిద్దర పోతాను
బబ్బుని నేనూ అల్లరి చేయక 
నిద్దర పోతానూ

నిద్దర పోయీ తెల్లారాకా
కళ్లు తెరుస్తాను
చీకటి పోయి అంతా తెల్లని
వెలుతురు వస్తుంది 

బూచీవాడూ బుట్టా పట్టుకు 
వెళ్లి పోతాడు
అప్పుడు బొమ్మల తోటీ నేనూ
ఆడుకుంటాను

ఈ పాట నాకెందుకో కొంచెం బాధను కలిగించింది.
"ఎందుకని ఆ కాలంలో ఇట్లా పిల్లలకు పిరికి మందు నూరి పోసే వారు?" అనిపించింది.
మీరేమంటారు?