నేను తెలుగులో చాలా రాశాను. పుస్తకాలు కూడా. ఇంకా రాస్తూనే ఉన్నాను. సైన్సు,సాహిత్యం, సంగీతం, కళలు నా హాబీలు.
Saturday, May 4, 2013
Wednesday, May 1, 2013
పిల్లల పాట
చింతా దీక్షితులు గారి పేరు చెపితే ఎంత మందికి తెలుస్తుందో మరి.
ఆయన రాసిన పిల్లల కథలూ, పాటలూ చాలాతాలా బాగుంటాయి.
సూరీ, సీతీ వెంకీ అనే క్రమంమలో కథలు అప్పటి వారికి ఎంతో నచ్చాయి.
అలాగే ఆయన రాసిన పిల్లల నవలలు కూడా.
ఆయన ఎన్నో గేయాలు రాశారు.
అందులో ఇది కూడా ఒకటి.
బూచాడు
చీకటి అమ్మా, చీకటి అమ్మా
చీకటి చూస్తే భయమే
ఇంట్లో చీకటి, దొడ్లో చీకటి
అంతా చీకటి మయమే
చీకట్లోనూ బూచీవాడూ
దాక్కొన్నాడమ్మా
బూచీవాడిని చూస్తే నాకూ
భయమేస్తుందమ్మా
నల్లటి వళల్లూ, ఎర్రటి కళ్లూ
ఊచల్లా కాళ్లూ
చేత్తో కత్తీ పట్టుకు వచ్చీ
ముక్కూ కోస్తాడూ
బూచీవీడూ బుట్టాతెచ్చీ
ఎత్తుకుపోతాడు.
బూచీవాడిని పొమ్మని చెప్పే
బబ్బుంటానమ్మా
అమ్మా నేనూ నీ వళ్లోనూ
బబ్బుంటా కానీ
నీ వళ్లోనూ బబ్బుంటేనూ
బూచాడొస్త్డాడా
బబ్బున్నాక మంచీ మంచీ
కథలూ చెప్పవుటే
బబ్బున్నాకా మంచీ జోలా
పాటలు పాడవుటే
కథలూ జోలా పాటలు వింటూ
నిద్దర పోతాను
బబ్బుని నేనూ అల్లరి చేయక
నిద్దర పోతానూ
నిద్దర పోయీ తెల్లారాకా
కళ్లు తెరుస్తాను
చీకటి పోయి అంతా తెల్లని
వెలుతురు వస్తుంది
బూచీవాడూ బుట్టా పట్టుకు
వెళ్లి పోతాడు
అప్పుడు బొమ్మల తోటీ నేనూ
ఆడుకుంటాను
"ఎందుకని ఆ కాలంలో ఇట్లా పిల్లలకు పిరికి మందు నూరి పోసే వారు?" అనిపించింది.
మీరేమంటారు?
Friday, April 26, 2013
దేవాలయాలపై బొమ్మలు - సమీక్ష
దేవాలయాలపై బొమ్మలు - పరమపద సోపానాలు
రచన:
డా.కొత్తపల్లి ఘన శ్యామల ప్రసాదరావు
శ్రీ గురుకృపాసింధు ప్రచురణలు,
రాజమండ్రి. వెల: రూ. 150/-
ప్రతులకు రచయిత, డి బ్లాక్, 212,
కె.ఎస్.ఆర్.గ్రీన్వ్యాలీ కాంప్లెక్స్,
మాధవ ధార, విశాఖపట్నం-18
ఫోన్: 9291489379
తాపీ ధర్మారావుగారు గొప్ప పండితులు. ఆయన హేతువాద దృష్టితో 1936లోనే ‘దేవాలయాలమీద బూతు బొమ్మలెందుకు?’ అని ఓ చిన్న పుస్తకం వెలువరించారు. నిజానికిధర్మారావుగారు రాసిన మిగతా పుస్తకాలేమిటో తెలియని వారు కూడా ఈ పుస్తకాన్ని చదివారు. పనిగట్టుకుని ఆ పుస్తకాన్ని పదే పదే అచ్చువేయించి, బతికించిన తీరు, మనిషి మనస్తత్వానికి
ఒక ఉదాహరణ.
వారణాసి సుబ్రహ్మణ్య శాస్ర్తీగారనే మరొక పండితుడు ‘తాపీ వారి దూషణమునకు సమాధానము’ అని మరో పుస్తకం రాసి వేయించారు. కానీ, అది మాత్రం అంతగా ప్రచారంలోకి రాలేదు.
పూర్వపక్షం, అంటే ప్రతివాదం, లేదా ఖండనగా వచ్చిన పుస్తకం ఎక్కడో మరుగున వుండిపోయింది. తాపీవారి పుస్తకం పుట్టిన తరువాత పుట్టిన డా.కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు
ప్రస్తుతం ఈ ‘దేవాలయాలపై బొమ్మలు’అనే పుస్తకాన్ని తాపీవారి మాటలకు ఖండన రూపంగా అందిస్తున్నారు. ఈ రచయిత మామూలు మనిషేమీ కాదు. ఎనె్నన్నో పుస్తకాలు రాసారు.
దేశమంతటా తిరిగి ఎంతో సమాచారం సేకరించారు. ఎన్నో గ్రంథాలనుంచి విషయం గురించి ఎంతో సమాచారాన్ని సమకూర్చారు. అన్నింటినీ ఆధారాలుగా వారే ముందు, తాపీవారి వాదాలకు, తరువాత ఆరుద్రగారి ఒక రచనకు, మాటకు మాట పద్ధతిలో సవివరంగా సమాధానాలు రాశారు. చివరకు దేవాలయాల మీది ‘బూతు’ బొమ్మలు, ‘పరమ పద సోపానాలు’ అంటూ తమ వాదం అందించారు.
ఒక విషయాన్ని గట్టిగా నమ్మిన వారికి, ఆ విషయాన్ని మరొకరు చులకన చేసి, కించపరిస్తే బాగా కోపం కలుగుతుంది. విషయం మనసునకు మరీ దగ్గరైనదైతే కోపము కూడా ఎక్కువవుతుంది. ప్రసాదరావుగారి రచనలో ఈ కోపం కనపడుతుంది. ఎప్పుడో పోయిన ఒక వ్యక్తికి సమాధానంగా కాక, ఆ వ్యక్తి అభిప్రాయాలకు ఖండనగా మాత్రమే రచన సాగితే మరింత బాగుండేది.
అట్లాగని ఈ ఖండనలో పస లేదంటే తప్పు తప్పున్నర! తాపీ వారి మాటలను ఒక్కొక్కటే ఎత్తుకుని జవాబు చెప్పిన తీరు ఆలోచింప చేసేదిగా ఉంది. మామూలు పాఠకుడు, పండితుని అభిప్రాయాన్నివిని, ‘అవునేమో’ అనుకుంటాడు. మరి వారిలో వివేచన కలిగించడమా, సరదా కోరికా? అన్న ప్రశ్నతో చర్చ మొదలవుతుంది. ‘మాటలకు అర్థాలు మరిచిపోయారని’ తాపీవారు చేసిన అభియోగం మీద మరొక మంచి చర్చ సాగుతుందిక్కడ. ‘మనిషే దేవుని సృష్టించాడు’ అన్నది తాపీవారి మరొక మాట. ప్రసాదరావుగారి ప్రతివాదంలో, మనుజులంతా మనువు సంతతి,
మనువు తనను దేవుడు సృష్టించాడు అన్నాడు అంటూ చెబుతూ పంచ మహా భూతములను దేవుడు సృష్టించాడు, ద్వాపర, కలియుగాలలో మాత్రమే సంతాన ప్రాప్తి కొరకు స్ర్తి, పురుషుల కలయిక అవసరం అయింది లాంటి ఎన్నో వాదాలను చెబుతారు. వీటన్నిటికీ ఆధారాలు కూడా చూపుతారు. ఇవన్నీ ఈనాటి చదువులకు, అవగాహనలకు అందని సంగతులని అనే వారున్నారు. సృష్టి, దేవుడి సృష్టి, వాటికి ఆధారాలుగా చూపుతున్న ఆకారాలు అన్నీ మనిషి సృష్టించినవే అంటే, వాదం మరింత ముందుకు సాగుతుంది.
ద్రౌపది, అయిదుగురు భర్తలు గురించి ఈ పుస్తకంలో చక్కని చర్చ వుంది. ఇటీవల వచ్చిన ఒక రచన గురించి కూడా ఇక్కడ ప్రసక్తి వుంది. పండితులు ఈ రకంగా చర్చ జరుపుతూ వుంటే, మామూలు పాఠకులకు కూడా ఆలోచించే అలవాటు కలుగుతుంది. స్ర్తి పురుష అంగాలు, లింగారాధన, ప్రతీకలు మొదలైన అంశాల గురించిన చర్చ ఆసక్తికరంగా సాగింది. కానీ, వాదంలో చివరి మాట నాదే, అన్న ధోరణి మరింత చర్చకు వీలు లేకుండా
చేస్తుందేమో? ఎదుటి వారిది వితండ పద్ధతి అయినంత మాత్రాన మనదీ అదే తీరు కాకూడదు గదా! 118 పేజీల వరకు తాపీవారి మాటలకు చక్కని సమాధానాలతో రచన సాగుతుంది.
తరువాత ఆరుద్ర రచనకు సమాధానాలున్నాయి. ‘గుడిలో సెక్స్’ గురించిన ఈ చర్చలో శాస్త్ర గ్రంథాల నుంచి రెఫరెన్సులు లేవు. బొమ్మలు, పరమపద సోపానాలు అంటూ సూక్ష్మంగానైనా రచయిత తమ
వాదాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ కూడా రచన ఆసక్తికరమైన అంశాలను మన ముందు ఉంచుతుంది. ఏ విషయం గురించినదయినా, చర్చ జరగడం మంచి సంప్రదాయం, చెప్పవలసిన వారు, నోరు మూసుకుని
ఊరుకుంటే, కొన్ని అభిప్రాయాలు స్థిరమవుతాయి. ప్రసాదరావుగారి మాటలకు మరెవరయినా సమాధానాలను అందిస్తారా? చర్చ కొనసాగితే, విషయం మరింత విశదమవుతుంది. ఆసక్తి, వీలుగలవారందరూ ఈ చర్చలో
పాలుపంచుకోవాలి.
Monday, April 22, 2013
Saturday, April 20, 2013
Friday, April 12, 2013
నారాయణ్ శ్రీధర్ బేంద్రే
స్వర్గీయ శ్రీ పైడిమర్రి రాజా రామచంద్రరావు గారు కళా తపస్వి.
ఆయన బహుముఖ ప్ఱజ్ఞ గురించి చెప్పడాలికి ఒక పుస్తకం రాయాలి.
ఆయన రాసిన ఒక పుస్తకాన్ని తెలుగు చేసే అవకాశం నాకు దక్కింది.
అందులో నుంచి ఒక్క పేజీ మాతరం ఇక్కడ పంచుకుంటున్నాను.
ఇది భారతీయ కళల గురించిన పుస్తకం.
అందులోని చివరి భాగంలో ప్రఖ్యాత చిత్రకారుడు బేంద్రే గురించి రాశారు.
కొట్టవచ్చినట్టి వైవిధ్యంగల చిత్రకారుడు బేంద్రే. అతను ఎన్నో శైలులు, పద్ధతులతో ప్రయోగాలు చేశాడు. ఒక మూసలో ఇరుక్కు పోయేది లేదన్నాడు. అతని మీద మాత్రం బాంబే పద్ధతి ప్రబావం కొంతవరకు ప్రసరించింది.ముఘల్, రాజపుత్ లాంటి స్థానిక సంప్రదాయాల ప్రభావంతో బాటు, బెంగాల్ పునరుద్ధరణ ఉద్యమం, సెజాన్, గాగిన్ ల పోస్ట్ ఇంప్రెషనిజంల ప్రభావాలు కొంత పడ్డాయి. అతని విస్తృతమయిన కళాసృష్టికి భారతీయతే ముఖ్యాధారం. అతని చుట్టూ ఉన్న వాతావరణమే అందులో ప్రతిబింబించింది. ఎంతో వ్యక్తిగతమయిన సమగ్ర దృష్టికి అతని చిత్రాలు సమగ్రమయిన ఉదాహరణలు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురయినా అతనిలో మాత్రం నిరంతర అన్వేషణ కొనసాగింది. అది జీవితంలోని మానవత వెచ్చదనం, వర్ణాలకు స్పందించింది.
ఆయన బహుముఖ ప్ఱజ్ఞ గురించి చెప్పడాలికి ఒక పుస్తకం రాయాలి.
ఆయన రాసిన ఒక పుస్తకాన్ని తెలుగు చేసే అవకాశం నాకు దక్కింది.
అందులో నుంచి ఒక్క పేజీ మాతరం ఇక్కడ పంచుకుంటున్నాను.
ఇది భారతీయ కళల గురించిన పుస్తకం.
అందులోని చివరి భాగంలో ప్రఖ్యాత చిత్రకారుడు బేంద్రే గురించి రాశారు.
నారాయణ్ శ్రీధర్ బేంద్రే
వాస్తవికత యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించే ప్రయత్నంలో నారాయణ్ శ్రీధర్ బేంద్రే
నైరూప్య చిత్రకళ అనే గమ్యం దాకా పయనించాడు. అంతకు ముందే అతను భారతీయ లఘుచిత్రకళల
మీద అకడమిసిజమ్, ఇంప్రెషనిజమ్, క్యూబిజమ్, ప్రాచ్యభావాలను ముఖ్యంగా గమనించాడు.
అతనికి వస్తు నిర్మాణ వైచిత్రిలోని వివరాల పట్ల అత్యంత శ్రద్ధ. అందుకే రంగులు
సాధించగల ప్రేరణావకాశాల గురించి ఎంతో తరచి చూచాడు. అనుకోకుండా అలవోకగా కుంచె
కొన్ని రూపాలను ముందుంచింది. పసుపు, నారింజ, నీలం, ముదురుగోధుమ లాంటి రంగుల
వరుసలతో ఒక కదలిక కనిపించింది. అందులోనే స్థలం కదిలి చిందులు వేసింది. అతను ఈ కళా
సమన్వయాన్ని ఫ్రెంచి ప్రవీణుడు ఎమిలీ బోనార్డ్ నుంచి నేర్చుకున్నాడు. ఆ రంగులలోనే
ఆకారాలు ఆవిష్కరింపబడ్డాయి. చుట్టు హద్దులుగా ఉండే గీతల అవసరం తీరి పోయింది.
బేంద్రే ఆ తరువాతి కాలంలో వేసిన చిత్రాలలో ఒక ఔద్ధత్యం కనబడుతుంది. రంగులు వాటి
గట్లు తెంచుకుని విలయతాండవం చేస్తాయి. అంతకు ముందేమో, రూపాలు ముందే ఊహించి సమన్వయ
పరిచినట్లు ఉండేవి. ఆ తరువాతి నైరూప్య కళా ప్రయోగం పూర్తిగా మరో తీరు. ఆక్షన్
చిత్రాలూ అలాంటివే. అంటే, సౌందర్య పిపాసలో అతను తెరిపి లేకుండా తపించి, తనకు తాను
కొత్త పద్ధతిలోకి మారగలిగాడని చెప్పడానికి ఇదొక ప్రమాణం.
బేంద్రేలోని అశ్చర్యకరమైన వైవిధ్యాన్ని బరోడాలో ఎందరో చిత్రకారులు
అనుసరించారు. బరోడా విశ్వవిద్యాలయం వారి ఫైన్ ఆర్ట్స్ విభాగానికి బేంద్రే అధిపతిగా
ఉన్నాడు మరి. అక్కడ అడ్డు లేని స్వాతంత్ర్యంతో కొత్త సృజన తల ఎత్తింది. జ్యోతి
భట్, శాంతి దవే, జి.ఆర్. సంతోష్, గులాం
ముహమ్మద్ షేఖ్ అందుకు ఉదాహరణలు.
కొట్టవచ్చినట్టి వైవిధ్యంగల చిత్రకారుడు బేంద్రే. అతను ఎన్నో శైలులు, పద్ధతులతో ప్రయోగాలు చేశాడు. ఒక మూసలో ఇరుక్కు పోయేది లేదన్నాడు. అతని మీద మాత్రం బాంబే పద్ధతి ప్రబావం కొంతవరకు ప్రసరించింది.ముఘల్, రాజపుత్ లాంటి స్థానిక సంప్రదాయాల ప్రభావంతో బాటు, బెంగాల్ పునరుద్ధరణ ఉద్యమం, సెజాన్, గాగిన్ ల పోస్ట్ ఇంప్రెషనిజంల ప్రభావాలు కొంత పడ్డాయి. అతని విస్తృతమయిన కళాసృష్టికి భారతీయతే ముఖ్యాధారం. అతని చుట్టూ ఉన్న వాతావరణమే అందులో ప్రతిబింబించింది. ఎంతో వ్యక్తిగతమయిన సమగ్ర దృష్టికి అతని చిత్రాలు సమగ్రమయిన ఉదాహరణలు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురయినా అతనిలో మాత్రం నిరంతర అన్వేషణ కొనసాగింది. అది జీవితంలోని మానవత వెచ్చదనం, వర్ణాలకు స్పందించింది.
Monday, April 8, 2013
Subscribe to:
Posts (Atom)








