Thursday, September 13, 2012

మనిషి - దాయాదులు

మానవ పరిణామం గురించిన చర్చలో కో తుల ప్రసక్తి రావడం సహజం. ‘కోతులు, మన తాతల తాతలు’ అన్నమాట అందరికీ తెలిసిందే. మరి మన దాయాదులంతా ఏమయినట్టు? కోతి (ఏప్) జాతి నాలుగు భాగాలుగా విడిపోయింది.

హోమో (ఈ జీనస్‌లోనే మనుషులనే మనమూ ఉన్నాము): హోమో జాతిలోని మిగతా ఉపజాతులు లేదా ప్రజాతులు అన్నీ అంతరించిపోయినయి. శాపియెన్స్ అనే మనం మాత్రం మిగిలి ఉన్నాము. ఈ జాతి 24 లక్షల సంవత్సరాల నాడు మొదలయిందని అంచనా. హోమో శాపిమెన్స్ అనే ఆధునిక మానవజాతి మాత్రం రెండు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో మొదలయిందని పరిశోధకులు లెక్కతేల్చారు. గ్రేట్ ఏప్స్ జాతిలో బాగా సంఖ్య పెరిగిన ఉపజాతి ఇది ఒక్కటే. ప్రపంచంలో వీరి సంఖ్య ఏడు బిలియన్లు దాటింది.


పాన్ (చింపాంచీలు, బూనోబోలు ఉండే జాతి లేదా జీనస్): గ్రేట్ ఏప్స్‌లో మానవుల జాతితో చాలా ఎక్కువ పోలికలు గల జాతి ఇది. చింపాంజీలు, మనుషుల జన్యు పదార్థం (డిఎన్‌ఎ)లో తొంభయి తొమ్మిదిశాతం ఒకే రకంగా ఉంటుందని 1973లోనే కనుగొన్నారు. ఈ జాతిలో చింపాంజీలు, బోనోబోలు అనే రెండు ఉపజాతులున్నాయి. అవి పది లక్షల సంవత్సరాల నాడు వేరు వేరు ఉప జాతులయ్యాయి. ప్రస్తుతం మాత్రం ఈ రెండు రకాలు కూడా అంతరించే దశకు చేరుకున్నాయి.


పోంగో (ఒరాంగుటాన్‌ల జాతి): గ్రేట్ ఏప్స్‌లోని ఒరాంగుటాన్స్ అనే జాతి ఒక్క ఆసియా ఖండంలో మాత్రమే ఉంది. ఇరవయి సంవత్సరాల కింద కూడా ఈ జంతువులన్నీ ఒకే జాతిగా లెక్కింపబడుతూ ఉండేవి. జన్యువుల పరిశీలన, సీక్వెన్సింగ్ తర్వాత ఒరాంగుటాన్‌లో రెండు ఉప జాతులు ఉన్నట్టు తెలిసింది. బోన్నియాలో ఉండే జాతి పోంగో పిగ్మేయియన్ ఒకటి. సుమత్రాలోని పోంగో ఎబెలియై మరొకటి.


గొరిల్లా (గొరిల్లాల జాతి): గొరిల్లాలన్నీ ఒకే జాతి అనే భావన చాలా కాలం వరకు ఉండేది. కానీ, ఈ జాతిలో అంతకుముందు అనుకున్నట్టు మూడు ఉప జాతులు కాక, రెండు జాతులు, వాటిలో నాలుగు (ఒక్కొక్క జాతిలో రెండు) ప్రజాతులు ఉన్నాయని గుర్తించారు. పడమటి గొరిల్లా, తూర్పు గొరిల్లా అనేవి రెండు జాతులు. వీటిలో రెండు ఉపజాతులు ఉన్నాయి. తూర్పు గొరిల్లాలో మూడవరకం కూడా ఉందని ఈ మధ్యన పరిశోధకులు గమనించారు.


తాతగారు బూనోబో: కోతుల్లో అందరికన్నా దగ్గరి చుట్టం మనకు ఈ బూనోబోగారే! మూడు అడుగులకు మించని ఎత్తు, 40కిలోలకు మించని బరువు ఈ తాతగారి లక్షణాలు. పండ్లు, గింజలు, ఆకులు, పూలు మాత్రమే తింటారు. అప్పుడప్పుడు మాంసం కూడా తింటారు. చూడడానికి చింపాంజీలాగే ఉన్నా, ముఖం మరింత చదునుగా, నల్లగా ఉంటుంది. కనుబొమలు కూడా చదునుగా ఉంటాయి. శరీరం, సన్నగా ఉంటుంది. వర్షారణ్యాలు, చిత్తడి అడవులకు ఈ జాతి పరిమితమయి ఉంది. మొత్తం సంఖ్య 5 నుంచి 50వేల మధ్య ఎంతయినా ఉండవచ్చు. మనిషి కారణంగా వీటికి తగిన జాగా మిగలడం లేదు. మనుషులు పట్టి పెంచుతున్నారు కూడా. కనుక, ఈ జాతి అంతరించే స్థితికి వచ్చింది.

No comments:

Post a Comment