Tuesday, December 11, 2012

పరిణామం- బరువు

ప్రతి మనిషికీ స్వంత ఆలోచనలు, ఆశలుంటాయి. అందరి ఆలోచనలు ఒకే రకంగా ఉండవు. కొన్ని ఆలోచనలు మాత్రం ఒక వర్గానికి, ప్రాంతానికి, దేశానికి గుర్తింపుగా నిలుస్తాయి. నాది అన్న భావన ఆలోచనతో ముగియదు. వస్తువులతో మొదలయి అది విస్తరిస్తూ పోతుంది.

మనుషుల తీరు ఇట్లాగే ఎందుకుంది? ఈ స్థితి ఎక్కడికి దారితీస్తుంది? మానవ జాతి గురించి, పరిణామం గురించి పరిశీలించేవారు చెప్పే సమాధానం, సంతృప్తికన్నా ఆశ్చర్యాన్ని ఎక్కువగా కలిగిస్తుంది. మనిషి జాతి పుట్టి లక్షల సంవత్సరాలయింది. అందులో 99 శాతం సమయంలో నాగరికత తెలియకుండానే గడిచింది. మనుషులు గూడు లేకుండా బతుకుతూ తిండి వెతుకుతున్నారని అర్థం. ఈ గతం మనకు తెలియకుండానే మనలను వెంటాడుతున్నది. అవునా, అని ఆశ్చర్యపడవలసినంత సత్యమిది. రక్షణ లేకుండా, తిండికి గ్యారంటీ లేకుండా బతికినందుకు, మనిషికి, ముఖ్యంగా రెండు లక్షణాలు అలవడినయి. మొదటిది రెండు కాళ్లమీద నడక. రెండవది మెదడు సైజులో పెరుగుదల. ఈ లక్షణాలు ఎప్పుడు ఎందుకు వచ్చాయని ఆలోచిస్తే అసలు సంగతి మన ముందుకు వస్తుంది. రెండు కాళ్లమీద నడిచినందుకు ప్రస్తుత ప్రపంచంలో మనకు ఒరిగింది వెన్నునొప్పి తప్ప మరో లాభం లేదు! ఇక మెదడు పెరిగినందుకు వచ్చిన కష్టాలు ఇన్ని అని చెప్పడానికి లేదు. ఆలోచన పెరిగింది. అసలు ఈ బతుకు ఎందుకు? లాంటి ప్రశ్నలు కూడా పుట్టాయి, పుడుతున్నాయి. కాలక్రమంలో మనిషి పరిణామాన్ని ఒక గీతగా భావిస్తే, ఈ లక్షణాలు, గీత మొదట్లో ఎప్పుడో పుట్టాయి. సహాయంగా నిలిచాయి. సందేహం లేదు. మనం మాత్రం గీత చివరల్లో ఉన్నాము. ఇప్పుడా లక్షణాలు మనకు సాయం చేస్తున్నాయి, చేయడంలేదు!

మనం మన బతుకును ప్రపంచాన్ని చాలా మార్చుకున్నాము. నిజానికి మన శరీరం, మెదడు తీరు ఇప్పటి ప్రపంచానికి అనువుగా పెరిగినవి, మారినవి కావు. తిండికోసం మనం పనిచేస్తున్నాము. కానీ, నిజంగా పరుగులు పెట్టి జంతువును తరమడం లేదు. కాయలు, పండ్లు వెతకడం లేదు. ‘పండించిన’ తిండిని ‘వండుకుని’ తింటున్నాము. ఆ వంటయినా అందరూ చేయడంలేదు. కూచుని, తింటూ కాలం గడిపేవారు ఎక్కువగా ఉన్నారు. అందరూ కలిసి గుంపులుగానే బతుకుతూ ఉన్నాం. కానీ, ఎవరితోనూ కలిసి గడపటానికి సమయం లేదు. మాటలు నేరుగా జరగవు. మనుషులు నేరుగా కనిపించరు. అంటే మొత్తానికి మన శరీరం, మనసు ఒక రకంగా ఉంటే, మన ప్రపంచం మరో రకంగా ఉందని అర్థమయింది. కానీ, ఆలోచన మనిషిని, అనుకూలం గాని పరిస్థితులలో ఉండనివ్వదు.


పరిణామం, అంటేనే మార్పు. నాగరికత తెలియక బతికిన మనిషికి, అనువయిన రకం లక్షణాలు, చిటికెవేస్తే రాలేదు. ప్రస్తుతం మన బతుకు తీరుకు, అనుకూలంగా ఉండే లక్షణాలు కూడా అంత సులభంగా రావు. పరిణామం బరువును మానవజాతి మొత్తం మోస్తున్నది. కనుకనే, ఆ బరువుతో సహా మరింత వేగంగా, తెలివిగా ముందుకుసాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాత మనిషి బుర్రను తిండి సంపాదించడం కొరకుమాత్రమే వాడలేదు. కనుకనే, మనం ఇవాళ ఇప్పటి పరిస్థితిలో ఉన్నాము. కానీ, మొత్తం పరిణామ చరిత్రని చిత్రంగా గీస్తే, అందులో ఈ పద్ధతి ఒక మూలన కూడ కనబడనంత చిన్నది. మంచికో, చెడుకో మనిషికి ‘సైన్సు’ అనే ఆలోచన కలిగింది. సమస్యలతో పోరాడడం ఒకటే కాదు ప్రస్తుతం మనిషికి వాటికున్న సమాధానాలను వెతకడం అలవాటయింది. ఉన్న తీరు కన్నా మరింత బాగా బతకాలన్న కోరికతో మనిషి చేస్తున్న ప్రయత్నాలు పరిణామం సాగే పద్ధతిని మారుస్తున్నాయి.


మనుగడ కొరకు సాగే సమరంలో నెగ్గిన లక్షణాలు గెలుస్తాయి. జాతులు నిలుస్తాయి ఇదే కదా డార్విన్ మహాశయుడు చెప్పిన పరిణామ క్రమంలోని సూత్రం! మైదానాల్లో ఎన్నో రకాల జంతువులు, అందులో కొన్ని మనలాంటివి కూడా ఉండేవి. వాటిలోనుంచి మనుషులం మాత్రం ఇంత దూరం రాగలిగాం. అడవుల్లో బతుకు వేరు, మైదానంలో తీరు వేరు. మైదానంలో ఎండలు ఎక్కువ, తిండినిచ్చే చెట్లు తక్కువ. అందుకే మన ఒంటిమీది వెంట్రుకలు పోయినయి. పంటి వరుసలో మార్పులు వచ్చినయి. శరీరానికి తిండిని దాచుకునే శక్తి అలవాటయింది. ఇప్పుడేమో అనవసరంగా తినడం అలవాటయింది. కనుకనే చక్కెర వ్యాధి మొదలయ్యింది. ప్రపంచమంతా ఒకటయింది నిజమే కానీ, తుమ్మితేచాలు, వైరసు, ప్రపంచమంతా వ్యాపించే వీలు కూడా మొదలయింది. ఇలాంటి బరువులు, మానవ జాతి బతుకు నిండా వేలాడుతున్నాయి. ప్రకృతిని కాదని, మరింత ముందుకు, మరింత ఎత్తుకు, లోతులకుపోవడం మనిషికి మొదటి స్వభావంగా మారింది, ఈ బరువు కారణంగానే. ఈ నడకకు, ప్రగతిని అసలయిన సాయం అందింది, ఒక్క సైన్సు నుంచి మాత్రమే. ఏం జరుగుతున్నా, ఎందుకు జరుగుతున్నదో తెలుసుకోవడం మనకు తెలిసింది. ఈ సైన్సు ఆధారంగా మానవుడు, ప్రపంచాన్ని తనకు అనుకూలంగా మారుస్తూ ముందుకు వెళ్లిపోతున్నాడు. మొదట్లో మొక్కలను, పశువులను తమ అదుపులోకి తెచ్చుకున్నవారు మనకు ఆదర్శప్రాయులు. దాంతో తిండి, పంట, రక్షణలు మనిషికి వీలయినయి. కానీ, బాగున్నాయనుకున్న ఆలోచనలు ప్రస్తుతం మనకు శత్రువులుగా నిలిచి భయపెడుతున్నాయి. సైన్సులో విచిత్రం ఇక్కడే ఉంది. ఇక్కడ ఏదీ శాశ్వత సత్యం కాదు. మనం అనుకుంటున్న ప్రతి అంశాన్నీ, ప్రశ్నించమంటుంది సైన్సు.


ఆ అంశం సైన్సులోనుంచి పుట్టిందయినా చర్చకు లొంగనిది కాకూడదు. కాదు. సైన్సు, మనలను నిలదీసి, ‘నీవెవరు?’ అని అడుగుతుంది. పరిశోధనలు, వాటి ఆధారంగా జరిగిన మార్పుల ఆధారంగా, మనిషి బతుకు తీరు మారింది. సగటు వయస్సు, ఎత్తు, తెలివి అన్నీ పెరుగుతున్నాయి. రికార్డులు పడిపోతూనే ఉన్నాయంటే, అది సైన్సువల్ల గానీ, మనిషివల్ల గాదు. సైన్సు మన తీరును మార్చింది. కానీ, పరిణామం బరువు మిగిలే ఉంది. ఎక్కువ కాలం బతికినందుకు లాభమా? నష్టమా చెప్పలేము. చావక తప్పదు, అది మారొక సత్యం! ఎవరో ఒకరు ఎత్తులు ఎగిరితే, వేగంగా పరుగిడితే అది నిజంగా పరిణామం అనడానికి లేదు. సగటున అందరికీ ఆ శక్తి ఉండాలి. మనిషి ఎంత వేగంగా పరిగెత్తినందుకు, ఏం లాభం జరుగుతుంది? ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే, పక్కవాడికన్నా వేగంగా పరుగెత్తితే చాలు!


ప్రశ్నలు అడగడం కొనసాగితే, సైన్సు కొనసాగుతుంది. ప్రగతి కొనసాగుతుంది. పరిణామం బరువు తరగడం కూడా వీలవుతుంది. పరిణామం ప్రకారం మనిషికి పరిధులు ఏవయినా ఏర్పడి వుంటే, వాటిని ప్రశ్నించడానికి, ఎదిరించడానికి, అధిగమించడానికి, మనకు ఒక సాయం సిద్ధంగా ఉంది. అదే- సైన్సు!

No comments:

Post a Comment