Friday, August 23, 2013

సి సి ఎమ్ బి - ప్రారంభం - లోకాభిరామమ్

సైన్స్ అందించిన అందమయిన మత్తులో హాయిగా గడుస్తున్న దినం కాదిది. ఆ రోజు గడిచింది. ఇది మరుసటి రోజు. అవగాహనకు అందని అంశాలను, అనర్థాలకు దారి తీస్తున్న అంశాలను, మరింత సులభంగా పరిశీలించడానికి, ఇప్పటి వరకూ వచ్చిన సైన్సు, కొత్త వెసులుబాటు మాత్రమేనని, అందరికీ అర్థమైంది, అంటాడు ఆల్డస్ హగ్జ్‌లే

* సైన్సుకు స్వంతంగా విలువలు ఉండవు. విలువలు మనుషులకుంటాయి. సైంటిస్టులు మనుషులు. సైన్సును వాడుకునే వాళ్లు మనుషులు.


సైన్సు పండుగ
* ‘పుష్పా! ఈ సదస్సులో నేను పాల్గొనడానికి పద్ధతేమిటి?’ ఇంచుమించు ఈ అర్థం వచ్చే ప్రశ్న ఏదో అడిగాను. ‘అదేమిటి? నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను’ అన్నాడు పుష్పా. అవును పుష్ప అమ్మాయి కాదు. పుష్పమిత్ర భార్గవ అనే పి.ఎమ్.భార్గవ. జంటనగరాల్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ’ అనే గొప్ప సంస్థను ప్రారంభించిన డైరెక్టర్ ఆయన. ఆ సంస్థ అప్పటివరకు ఆర్‌ఆర్ ల్యాబ్‌లోనే భాగంగా ఉండేది. స్వంత భవనాలు, మిగతా సౌకర్యాలు వచ్చిన తరువాత, ప్రారంభోత్సవానికి ప్రపంచంలోని గొప్ప శాస్తవ్రేత్తలను చాలామందిని పోగేసి రెండు వారాల పాటు సదస్సులు నిర్వహించారు. నేను అడిగింది, ఆ సదస్సులో పాల్గొనడం గురించే. నేను మాలిక్యులర్ బయాలజీ చదువుకున్నాను. పిహెచ్‌డి కూడా చేశాను. కానీ సదస్సుల నాటికి కేవలం సైన్సు జర్నలిస్టును! సైంటిస్టును కాదు! సదస్సుల వివరాలను, పాల్గొంటున్న వారి వివరాలను కలిపి ఒక పెద్ద పుస్తకం వేశారు. దేశ విదేశాలలోని వారెంతోమంది, పాల్గొనడానికి అప్లికేషన్స్ పంపారు. వారిలోంచి ఎంపికయిన వారు రెండు మూడు వర్గాలతో సెలెక్టెడ్ పార్టిసిపెంట్స్. ‘చాలా ముఖ్యమయిన వ్యక్తులు’ మాత్రం ఆహ్వానాలు అందుకుని వచ్చారు. పెద్ద సంస్థల డైరెక్టర్లు, ప్రభుత్వంలో సెక్రటరీల లాంటి వారితో సమానంగా, ఆ లిస్టులో నా పేరుఉంది. అప్పట్లో దేశంలో ఉండిన రెండు సైన్సు పత్రికల ఎడిటర్లు కూడా వచ్చారు. ఆరుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు వచ్చారు. డిఎన్‌ఏ నిర్మాణం కనుగొన్న ఫ్రాన్సిస్ క్రిక్, టెస్ట్‌ట్యూబ్ బేబీలను ప్రారంభించిన ఎడ్వర్డ్స్ లాంటివారు అక్కడ ఉన్నారు. కానీ, సమావేశంలో మొదటి ఉపన్యాసం ఎఫ్రాయిమ్ కచాల్‌స్కీ అనే పరిశోధకుడు సమర్పించారు. దీన్ని ప్రోటోకాల్ అంటారు. అంటే మర్యాదలు పాటించడమని అర్థం!

ఎఫ్రాయిమ్ కచాల్‌స్కీ అనే ఆ భారీ మనిషి, ఇజ్రాయెల్ దేశానికి అధ్యక్షుడు, మన భాషలో రాష్టప్రతిగా పనిచేశాడు. ఆ దేశంలో గొప్ప సైంటిస్టులను, పండితులను ప్రెసిడెంట్ చేసే సంప్రదాయం ఉంది. ఒకప్పుడు, ఐన్‌స్టయిన్‌ను అడిగారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. బహుశః ఆ మార్గంలోనే మన దేశంలో అవ్వల్ ఫకీర్ జైనులాబుదీన్ అబ్దుల్ కలామ్‌గారు అధ్యక్షులయ్యారు. కచాల్‌స్కీ పేరున్న జన్యుశాస్తవ్రేత్త. మంచి ప్రసంగం చేసినట్టు గుర్తుంది. వివరాలు గుర్తుకు రావడంలేదు. మొత్తానికి ఆయన మృదుభాషి. స్నేహశీలి. అంతకు ముందు నా పరిశోధన పత్రమొకటి, ఇజ్రాయెల్‌లో జరిగిన కాన్ఫరెన్సులో అంగీకరించబడింది. కానీ మన దేశానికీ, ఆ దేశానికీ సంబంధాలు సరిగా ఉండనందుకు నేను వెళ్లలేకపోయాను. ఒక మధ్యాహ్నం కచాల్‌స్కీ గారితో చాలాసేపు కబుర్లు గడిచాయి. ఒక ఇంటర్వ్యూ రికార్డు చేశాను. అంతా ముగిసి బయటకు వచ్చిన తర్వాత ఆయనను అనుక్షణం ఇంటిలిజెన్సు వారు పహరా కాస్తున్నారన్న సంగతి అర్థమైంది. ఒకాయన వచ్చి, నా రికార్డర్ లాక్కున్నాడు. ఆయనతో ఏం మాట్లాడావని గట్టిగా అడిగాడు. ‘నేను సైన్సు మాట్లాడాను. కావాలంటే, ఆ కాసెట్ పట్టుకుపో అన్నాను. అతను ఊరుకున్నాడు. మిగతా పాత్రికేయులను ఆయన దరిదాపులకు పోనివ్వలేదట! ఆ దేశంనుంచి మైకేల్ సేలా అని మరో గొప్ప ప్లాంట్ జెనెటిసిస్ట్ వచ్చాడు. ఆయనతో మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదు.


జెనెటిక్స్‌ను ఎంతో ప్రేమగా చదువుకున్న నాకు ‘ఫ్రాన్సిస్ హారీ క్రాంప్టన్ క్రిక్’ మరీ గొప్పవాడుగా కనిపించాడు. నాకు కొంతమంది పట్ల మరీ ఆరాధనా భావం ఉంటుంది. అవకాశం ఉన్నా వారికి మరీ దగ్గరగా పోవడానికి మనసు ఒప్పుకోదు. క్రిక్‌తో గుంపులో మాట్లాడడమే కానీ ఒంటరిగా కబుర్లు చెప్పే సాహసం చేయలేదు అందుకనే.
కార్ల్‌టన్ గాజుసేక్ అని మరో నోబెల్ లారేట్ వచ్చారు. ఆయన విశృంఖల భావాలు గల మనిషిగా పేరున్న వ్యక్తి. కొండజాతుల వారు, జెనెటిక్స్‌లో వారి పద్ధతుల పాత్రల గురించి గొప్ప పరిశోధనలు చేసినా, ఎందుకో అందరూ ఆయనను చూచి జంకుతారనిపించింది. నేను మాత్రం ఆయనను టైం అడిగాను. ‘నీవేమీ రికార్డు చేయనంటే ఎంతసేపయినా మాట్లాడవచ్చు!’ అన్నాడాయన. మేమిద్దరం గంటకన్నా ఎక్కువసేపు ఎన్నో సంగతులు మాట్లాడుకున్నాము. స్ర్తి పురుష సంబంధాల గురించి, ఆయనకు, కొండ జాతుల వారిలాగే, కొన్ని విచిత్రమైన అభిప్రాయాలున్నాయని అర్థమైంది. అది తప్పుకాదేమోననిపించేలాగ మాట్లాడారాయన. మేమంత సేపు మాట్లాడడం ఆశ్చర్యంగా కనిపించింది లాగుంది. సిసిఎంబీ వారి అఫీషియల్ ఫోటోగ్రాఫర్ మా ఫోటో తీసి మరునాడు ఉదయానికి నోటీసు బోర్డులో పెట్టాడు. నేను కాపీ తీసుకున్నాను. నేను రాసిన మరో వ్యాసంతోపాటు, అది ఒక దినపత్రికలో అచ్చయింది. కానీ, అదిప్పుడు నా దగ్గర మాత్రం లేదు.


జెర్మనీనుంచి వచ్చిన మరో నోబెల్ బహుమతి గ్రహీత యువకుడు. అతను బంజారా హోటేల్‌నుంచి సైకిల్‌మీద తార్నాక రావడానికి ప్రయత్నించాడు. మన మ్యాపుల కారణంగా, ఊరంతా తిరిగి తిరిగి చివరికి రానేవచ్చాడు. అప్పట్లో అదొక సంచలన వార్త! సైంటిస్టులు, పరిశోధకులు కూడా మనుషులే అనడానికి మరెన్నో ఉదాహరణలను ఈ సదస్సు సందర్భంగా నేను చూడగలిగాను.


ఇంగ్లండ్‌నుంచి ఎడ్విన్‌డాస్ దంపతులు వచ్చారు. డాస్ గారిని ఎడ్డీ అని పిలుస్తున్నారందరూ. ఆయన ‘అయామ్ ఎడ్డీ!’ అని పరిచయం చేసుకుంటున్నాడు. కరిగే ప్లాస్టిక్‌లను కనుగొని వాటి గురించి మరింత కృషి చేస్తున్న గొప్ప పరిశోధకుడాయన. వింత ఏమిటంటే, ఆయనకు ఇంద్రజాలికుడు అంటే మెజీషియన్‌గా కూడా ప్రపంచమంతటా మంచి పేరుంది! మాజిక్ అంతా సైన్స్ అనడానికి ఆయన నిలువెత్తు ఉదాహరణ. ఒకనాటి సాయంత్రం, సతీమణి సాయంతో ఆయన చక్కని ప్రదర్శన చేశారు. అందరికీ ఆయనంటే వున్న గౌరవం నాలుగింతలైంది. ఈ సందర్భంగా సీసీఎంబీ ఆస్థాన మెజీషియన్, మ్యుజీషియన్ మధుసూదన్ వామన్ పండిత్ గురించి చెప్పకపోతే అన్యాయమే అవుతుంది. పరిశోధకుడు పండిత్ మంచి మెజీషియన్. అంతకన్నా హార్మోనియం మీద హిందుస్తానీ సంగీతంలో దిట్ట. దేశంలోని ప్రసిద్ధ గాయకులెందరితో బాటు సహకార వాద్యం వాయించాడు. పండిత్ ఆ తర్వాత మంచి మిత్రుడయ్యాడు.


గొప్ప పరిశోధకులంతా వేరు దేశాల వారే అనుకుంటున్న నాకు, పెట్రోలును తినే సూక్ష్మ జీవులను కనుగొన్న ఆనంద చక్రబర్తి, ఎయిడ్స్ పరిశోధకుడు శార్ఞరవన్ (ఈ పేరును అచ్చువేయడం కుదరదేమో శారంగ రవన్ అనవచ్చు!) మరో టాటా (నిజంగా ఒక టాటా పరిశోధకుడున్నాడు!) కనిపించి, మిత్రులయి, భుజాలు పొంగేలా చేశారు. ఈ సదస్సుల సందర్భంగా కళలను గురించి ఒక సెషన్ జరిగింది. మన చిత్రకారులు పీవీ రెడ్డి, ఎమ్.ఎఫ్.హుస్సేన్, కవి విక్రంసేఠ్, ప్రసిద్ధ నిర్మాణ నిపుణుడు చార్ల్స్ కొరియా మరెందరో ఆ సెషన్‌లో పాల్గొన్నారు.
సమాపన కార్యక్రమంలో ప్రధాని రాజీవ్‌గాంధీ పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మేమంతా భోజనాలకు బయలుదేరాము. ‘ప్రధాని మనతో భోజనం చేయనున్నారు. ఆయన కొరకు వేచి ఉండాలి!’ అని వార్త వచ్చింది. తాంక్స్‌గివింగ్‌డే, టర్కీ డిన్నర్‌లో రాజీవ్‌గాంధీ గారితో మాట్లాడే అవకాశం కూడా దొరికింది. ఆకర్షణగల అందగాడతను! ప్రధాన మంత్రి ఉండగా, ఫ్రాన్సిస్ క్రిక్ ‘జెనెటిక్స్ అంటే ఏమిటి?’ అని ఒక పాపులర్ ప్రసంగం చేశారు. నోబెల్ బహుమతి గ్రహీత, విషయాన్ని సులభంగా చెప్పిన తీరు అందరికీ నచ్చింది. సైన్స్ ఏజ్ అనే సైన్సు మాసపత్రిక సంపాదకుడు సురిందర్‌ఝా ఆ ప్రసంగ పాఠాన్ని పత్రికలో అచ్చు వేయాలనుకున్నాడు. రికార్డింగు కోసం భార్గవను అడిగాడు. సిసిఎంబీ వారు అన్ని ప్రసంగాలను రికార్డు చేశారు. క్రిక్ ఉపన్యాసాన్ని వదిలేశారు. భార్గవ, అంటే పుష్పా నన్ను అడిగాడు నేను రికార్డింగ్ ఇచ్చాను. ప్రసంగ పాఠం అచ్చయింది.


సంగీతోత్సవాలు, నాటకోత్సవాలు జరుగుతుంటాయి. సీసీఎంబీలో జరిగింది సైన్సు పండుగ. అంత ఎత్తున కాకున్నా, అడపా దడపా సైన్సు ఉత్సవాలు జరిగితే ప్రజలకు, సైన్సుకు మధ్యన ఉందనుకుంటున్న దూరం తగ్గుతుంది!

No comments:

Post a Comment