Tuesday, March 6, 2012

గుర్తుంచుకోవాలి


ప్రపంచంలో మనిషికున్నంత తెలివి మరో జాతికి లేదు. మనిషి తన పరిణామక్రమంలో తెలివిగా మిగతా జంతువులనూ, ప్రపంచాన్ని వాడుకోవడం నేర్చుకున్నాడు. వ్యవసాయం, నాగరికత, కళలు, సైన్సు, రాజకీయం అన్నీ ఈ తెలివితోనే సాధ్యమయ్యాయి. మిగతా జంతువులు లేకుంటే ఈ ప్రగతి కొంచెం కూడా వీలయ్యేది కాదనవచ్చు. అవి మనకు ఆహారాన్ని యిచ్చాయి. స్వయంగా అవే ఆహారమయ్యాయి. దుస్తులయ్యాయి. తోడు నిలిచాయి. ప్రేరణనిచ్చాయి. మన కాయకష్టంకన్నా పశువుల శ్రమే ఎక్కువని చెప్పనవసరంలేదు. చివరకు వినోదానికి కూడా ఈ జంతువులే
ఆధారాలవుతున్నాయి. నాగరికతకు, మనుగడకు దారులు వేసిన మహనీయులను గుర్తుంచుకుని పండగ చేయడం మనిషికి అలవాటు.

కానీ, జంతువుల సేవను మనం అంతగా పట్టించుకున్నట్లు కనబడదు. మొక్కుబడిగా వన్యప్రాణి వారోత్సవం చేస్తాం గాని, కుక్కల పేరున, ఆవుల పేరున పండగ చేయడం మరిచిపోయామా? పరోక్షంగా సేవ చేసే జంతువులు సరేసరి!

బీటూ పులి

పులులను చూడడానికి దేశ దేశాలు నుంచి జనం మన దేశానికి వస్తుంటారంటే ఆశ్చర్యం కాదా? వాటిని చంపకుండా, బతికిస్తేనే ఎక్కువ లాభమని ఎందుకు తోచదని ప్రశ్నిస్తారు విషయం అర్థమయినవారు. పులులున్న ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ బతికే పల్లెవారిని అడిగితే, మరింత బాగా పరిస్థితి అర్థమవుతుంది. వారికి పులి శత్రువు కానేకాదు!

ఒంటరిగా, భయమెరుగకుం డా తిరుగుతుంటే ఈ బలిష్ట మృగం అందరికీ ఆకర్షణే. బంధన్‌గడ్ పార్క్‌లో బీటూ అనే పులి
ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందిన ప్రాణి. ఈ మగపులికి అసాధారణంగా తన కూనల మీద ప్రేమ ఉండేదంటారు పరిశీలించినవారు.

ఇంటర్నెట్‌లో ఈ పులి గురించి సెర్చ్ చేసి చూడండి. అంతులేని వీడియోలు దొరుకుతాయి. పర్యాటకులకు బీటూ కనిపించిందంటే పండగ! అడపాదడపా బీటూ పల్లెల మీద పడి పశువులను ఎత్తుకుపోయేది. అయినా పల్లెవారికది హీరోగానే మిగిలింది. బీటూ తండ్రి పేరు ఛార్జర్. అది అంతర్జాతీయ పత్రికల ‘అట్టమీద బొమ్మ’గా ఎన్నిసార్లు వచ్చిందో లెక్కలేదు. పదేళ్లపాటు అందరినీ ఆకర్షించిన ఛార్జర్... పులుల సంరక్షణకు ఉత్తమ ఉదాహరణ!

* పులులను గుర్తుంచుకోవడానికి, అది ఎంతమంది మనుషులను చంపింది? అనే లెక్క ఆధారంగా ఉందంటే నమ్మగలరా? నేపాల్- భారత్ సరిహద్దు ప్రాంతంలో చంపావత్ అనే పులి ఉండేది. అది 436మందిని చంపింది. 1907లో అదికూడా చనిపోయింది!

లైకా కుక్క 

కుక్కకు, మనిషికీ గల సంబంధం పురాతనమయింది. కానీ, అంతరిక్షంలోకి ఒంటరిగా వెళ్లిన లైకా కథతో కుక్కల చరిత్ర మలుపు తిరిగింది. 1957 నవంబర్ మూడున రష్యావారు స్ఫుత్నిక్-2 అనే అంతరిక్ష నౌకను ప్రయోగించారు. స్ఫుత్నిక్ ఒకటిలాగా కాక ఈసారి నౌకలో ఒక పాసింజర్ ఉండడం విశేషం. ఆ పాసింజర్ లైకా అనే మచ్చల కుక్క. అది మాస్కో నగరంలో విచ్చలవిడిగా తిరుగుతున్న ఊరకుక్క. దానికి చలి, ఆకలి బాగా అలవాటు! కుక్కనుగానీ, నౌకనుగానీ తిరిగి భూమికి చేర్చే ప్రయత్నం అప్పట్లో వీలేలేదు. నౌకతోపాటు లైకా కూడా పోవలసిందే. నిజానికి నౌకను ప్రయోగించిన
కొన్ని గంటలలోనే లైకా చనిపోయింది. రష్యావారు ఈ సంగతిని 2002 దాకా రహస్యంగా ఉంచారు. ప్రయోగించిన నౌక భూమి
చుట్టూ రెండు, మూడుసార్లు తిరిగే లోపలపాడయింది. అపుడు పుట్టిన వేడికి లైకా బలయింది. కానీ లాంచింగ్, టేకాఫ్ లాంటి పరిస్థితులకు జీవులు తట్టుకోగలుగుతాయని రుజువుచేసిన ఘనత లైకాకు దక్కింది.

ఆ తరువాత మరో 8 కుక్కలు అంతరిక్షంలోకి వెళ్లాయి. వాటిలో ఆరు క్షేమంగా భూమికి తిరిగివచ్చాయి. చివరకు 1961లో గగారిన్ అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన తొలి మానవుడిగా పేరుపొందాడు. ఆ తర్వాత అంతరిక్ష యాత్రలు ఆటగా మారాయి.

* రష్యాలో లైకా బొమ్మతో పోస్టర్లు, పోస్ట్‌కార్డులు, స్టాంపులు వచ్చాయి ఆ రోజుల్లో.

1 comment:

  1. 8 కుక్కలు అంతరిక్షంలోకి వెళ్లాయా? ఈ విషయం అసలు ఇప్పటి వరకు తెలీదండి.

    ReplyDelete