Thursday, July 5, 2012

పరిశోధకుల చరిత్ర

పరిశోధకులు చరిత్ర సృష్టించారు. కానీ, చరిత్ర మాత్రం వారిని క్షమించలేదు. వ్యక్తిగతంగా పరిశోధకులకు ఉన్న నమ్మకాలు, పద్ధతులను అడ్డుగా పెట్టి వారిని హింసకు గురి చేసింది. అలాంటివారు ఎందరెందరో పరిశోధకులు చరిత్రలో కనబడతారు.

ఆలన్ ట్యూరింగ్, 1952లో తాను ‘స్వలింగ సంపర్కం’ చేశానని ఒప్పుకున్నాడు. అతని మీద కేసు పెట్టి విచారణ జరిపించారు. జైలుశిక్ష అనుభవించాలి, లేదా హార్మోన్ ఇంజెక్షన్ చేయించుకుని ‘మగతనాన్ని’ పోగొట్టుకోవాలని నిర్ణయం వచ్చింది. జైలులో ఉంటే పరిశోధన సాగదని ట్యూరింగ్, ఇంజెక్షన్‌కు ఒప్పుకున్నాడు. ఆ తరవాత అతను క్రిప్టోగ్రఫీ పరిశోధనలు చేయకూడదని కూడా నిర్ణయం వచ్చింది. ట్యూరింగ్ శరీరంలోనూ, మెదడులోనూ ఇంజెక్షన్ తరువాత 1953లో మాంఛెస్టర్ యూనివర్సిటీ వారు అతనికి, అయిదు సంవత్సరాలు ఉద్యోగం ఇచ్చారు. కానీ, అతను 1954 జూన్‌లోనే ఆత్మహత్య చేసుకున్నాడు!
చరిత్రలో ఇలాంటి బాధలకు గురయిన పరిశోధకులు మరెందరో ఉన్నారు.




మహమ్మద్ ఇబ్న్ జకరియా అల్ రాజీ, 865 నుంచి 932 వరకు బాగ్దాద్‌లో జీవించిన వైద్యుడు. చరిత్ర అతడిని రేజెన్ అనే పేరుతో గుర్తుంచుకున్నది. అరబిక్ ప్రపంచంలో పాశ్చాత్య విజ్ఞానాన్ని హిప్పోకేట్స్, గాలెన్ వంటి వారిని ప్రచారం చేయడానికి అతను ప్రయత్నించాడు. అతను రాసిన ఒక పుస్తకం ఎంతో పేరు పొందింది. మతగురువులు మాత్రం, ఆ పుస్తకంతోనే, అతని తలమీద కొట్టాలని నిర్ణయించారు. ఫలితంగా రాజీ గుడ్డివాడయ్యాడు. తరువాత, వైద్యం, ప్రచారం సాగలేదు.


మైకేల్ సెర్వెటస్ (1511-1553) స్పెయిన్‌లో వైద్యుడు. ఊపిరితిత్తులు, రక్తప్రసరణల గురించి పరిశోధించాడు. ఇతను కూడా పరిశోధన గురించి పుస్తకం రాసి, అందులోనే మతం గురించి కూడా కొంత రాశాడు. సెర్వెటస్ స్పెయిన్ నుంచి స్విట్జర్లాండ్ పారిపోవలసి వచ్చింది. అక్కడ కూడా మతవాదులు అతడిని వెంటాడారు. పట్టి పీడించి, పుస్తకాలతో సహా అతడిని జెనీవా సరస్సు తీరాన సజీవ దహనం చేశారు.

గెలిలెయో గెలిలి (1564-1642) గురించి విద్యార్థులకుకూడా తెలిసి ఉంటుంది. భూమి, సూర్యుని చుట్టు తిరుగుతుందని చెప్పిన కోపెర్నికస్ సిద్ధాంతాన్ని అవునన్నందుకు, మతం అతడిని శిక్షించింది. అతను బతికినన్ని రోజులు ఇంట్లోనుంచి బయటకు రావడం కుదరలేదు. అతని పుస్తకాలు కూడా వెలుగు చూడలేదు.

హెన్రీ ఓల్డెన్ బుర్గ్(1619-1677), ఇతను లండన్‌లో 1667లోనే రాయల్ సొసైటీని స్థాపించాడు. గొప్పస్థాయి పరిశోధన పత్రాలను ప్రచురణకు ఆహ్వానించాడు. ఈ పేరున అతను యూరపులాంటి ఇతర ప్రాంతాలలోని విదేశీయులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించవలసి వచ్చింది. నెదర్లాండ్స్, ఇటలీ లాంటి దేశాలకు కూడా అతను ఉత్తరాలు రాశాడు. ఈ ఉత్తరాల సంఖ్య మరీ ఎక్కువయింది. ఈ సంగతి అధికారుల దృష్టిలో పడింది. విదేశీ గూఢచారి అని ఆక్షేపించి, అతడిని అరెస్టు చేశారు. టవర్ ఆఫ్ లండన్‌లో అతడిని చాలాకాలం బందీగా ఉంచారు.

గెర్‌హార్డ్ డొమాక్ (1895-1964) డొమాక్ జెర్మనీలో పాతాలజీ, బ్యాక్టీరియాలజీలలో పరిశోధకుడు. సల్ఫనమయిడ్ అనే మొట్టమొదటి ఆంటిబయోటిక్‌ను కనుగొన్నాడని అతనికి గుర్తింపు వచ్చింది. అదే విషయానికిగాను అతనికి 1939లో నోబెల్ (వైద్యం) బహుమతినికూడా ఇచ్చారు. నాజీ వ్యతిరేకి అయిన ఓసిమెట్‌స్కీకి 1936లో నోబేల్ శాంతి బహుమతి ఇచ్చారు గనుక, డొమాక్ తన బహుమతిని అందుకోగూడదని నాజీ ప్రభుత్వం శాసించింది. అతడిని అరెస్టు చేసి వారంపాటు బందీగా ఉంచారు కూడా. యుద్ధం ముగిసిన తరువాత 1947లో డొమాక్ తన బహుమతిని అందుకోగలిగాడు. చిత్రంగా, అతనికి బహుమతితోబాటు రావలసిన పైకం మాత్రం, అందలేదు. చాలా కాలం అయింది, గనుక, డబ్బు ఇవ్వలేదన్నారట!


ఆల్‌బర్ట్ ఐన్‌స్టైన్ (1879-1955) ఐన్‌స్టైన్ చేసిన పరిశోధనలు అర్థమయినా, కాకున్నా అందరికీ ఈ పేరు మాత్రం తెలిసి ఉంటుంది. ఐన్‌స్టైన్, జెర్మనీలోని ఉల్మెలో యూదుల వంశంలో పుట్టాడు. అతను మతాన్ని పాటించలేదు. సాపేక్ష సిద్ధాంతంతోబాటు, ఆతని రాజకీయాల గురించి కూడా మాట్లాడి, జెర్మనీవారి నిరసనకు గురయ్యాడు. 1933లో హిట్లర్ అధికారంలోకి వచ్చేనాటికి ఐన్‌స్టైన్ అమెరికాలో ఉన్నాడు. అయినా బెర్లిన్‌లోని అతని ఉద్యోగం, ప్రుసియన్ అకాడమీ ఆఫ్ సైనె్సస్‌లో సభ్యత్వం రద్దయ్యాయి. ఆస్తిని ప్రభుత్వం లాక్కున్నది. పుస్తకాలన్నింటినీ బజార్లో పెట్టి తగలబెట్టారు. ఐన్‌స్టైన్ తిరిగి జెర్మనీకి రాలేదు. పైగా తన దేశం వారు బాంబు తయారుచేస్తున్నారని, అమెరికా ప్రెసిడెంటు రూజ్వెల్టుకు ఉత్తరం రాశాడు. అమెరికాలోనూ అటువంటి పరిశోధనలు జరగాలన్నాడు!

చరిత్రలో ఎందరెందరో పరిశోధకులు ఈ రకంగా వేధింపులకు గురయ్యారు!

No comments:

Post a Comment