Friday, November 11, 2011

కూల్ డ్రింక్స్ తాగడం లాభకరమా


మంచినీటి కంటే, కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్ తాగడం లాభకరమా?

ప్రశ్న - జవాబు

మన శరీరానికి నీరు కావాలి. నోటి నుంచి అటు చివరిదాకా ఉండే గొట్టంలో తాగిన నీరంతా పీల్చబడి శరీరానికి అందుతుంది. శరీరానికి కావలసింది నీరయితే దానితోబాటు, మరేవో కలిపి తాగడంవల్ల లాభం లేదు. పైగా నష్టమే ఉంది. కూల్‌డ్రింక్స్ వల్ల దప్పి సులభంగా తీరుతుందన్నది కేవలం ఒక తప్పుడు భావన. గ్యాసు కలిసిన నీరు తాగితే తేన్పులు వస్తాయి. వాటితో లాభం ఉండదనడానికి లేదు. తాగింది ఏ నీరయినా శరీరానికి అందుతుంది. లేదంటే అటు చివర నుంచి బయటకు వస్తుంది. తాగిన నీరు మూత్రం ద్వారా బయటకు రావడం సహజం. చెమట ద్వారా వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి.

కూల్ డ్రింక్‌లో చక్కెర ఉంటుంది. తాగిన నీటిలో కొంత ఆ చక్కెరను కరిగించడంతో పోతుంది. రుచి బాగుంటుంది గనుక కూల్ డ్రింక్‌ను, మామూలు నీటికన్నా ఎక్కువగా తాగుతారు. కనుక దప్పి తీరిన భావం కలుగుతుంది. నీటి చల్లదనం విషయం కూడా కొందరి విషయంలో అంతే. శరీరానికి కావలసిన నీరు, శరీర ఉష్ణోగ్రతకు మారిన తర్వాతే పీల్చబడి లోపలికి చేరుతుంది.

===========
సాధారణంగా చెట్ల బెరడు మొరటుగా ఉంటుంది. జామ లాంటి చెట్ల బెరడు నునుపుగా ఉంటుంది. ఎందుకు?

చెట్లకు బెరడు ఒక రక్షణ కవచం లాంటిది. జంతువులు, పురుగులు, పరాన్నజీవులయిన మొక్కల నుంచి అది రక్షణనిస్తుంది. నునుపుగా ఉండే బెరడుమీద పురుగులు, బూజులకు పట్టు దొరకదు. కానీ నునుపు బెరడు నెమ్మదిగా పెరుగుతుంది. అటువంటి చెట్టుకు గాటు పెడితే అది తొందరగా మానదు. ఈ రకం చెట్ల మొత్తం పెరుగుదల కూడా తక్కువ వేగంతో సాగుతుంది.

తుమ్మ, వేపలాంటి చెట్ల బెరడు జామకంటే నాలుగింతల ఎక్కువ వేగంతో పెరుగుతుంది. అంటే వాటి గాట్లు కూడా త్వరగా పూడుకుపోతాయి. మొరటు బెరడుంటే చెట్లలో తేమ చాలాకాలం నిలుస్తుంది. అందుకే వాటికి ఎవరూ ప్రయత్నంగా నీరు పెట్టనవసరం లేదు. అయితే పెరుగుదల వేగం కారణంగా, వీటి బెరడు పెచ్చులుగా లేస్తుంది. ఆ సందుల్లో పురుగులు చేరుకుంటాయి. అందుకే వేప, తుమ్మ చెట్లలో జిగురు పుడుతుంది. దాని వాసన, తీరు వల్ల పురుగులు దూరంగా పోతాయి.

మరీ తేమ ప్రాంతంలో ఉండే చెట్ల బెరడు మెత్తగా ఉంటుంది. త్వరత్వరగా మారి పురుగులను చేరనివ్వదు.

No comments:

Post a Comment