Thursday, August 16, 2012

పరిశోధన - పద్ధతి

కలడు కలండనెడివాడు కలడో లేడో? అని అనుమానం. ఉన్నాడని చెప్పేవారే గానీ, చూచినవారులేరు. అదే పద్ధతిలో పీటర్ హిగ్స్, సత్యేంద్రనాధ్‌బోస్ లాంటివారి ‘మరికొందరు’ ఒక పార్టికల్ ఉండి తీరాలని అన్నారు! ఇప్పుడేమో మరికొందరు- ఆ పార్టికల్ ‘కనిపించినట్టు ఉంది!’ అన్నారు. నాలుగురోజులు పాటు ప్రపంచమంతటా అందరూ చిందులు వేశారు. పరిశోధకులు ఎవరూ ఆ కణాన్ని- కనిపించని, కలడో లేడో అనే అనుమానం గలవానికి ముడిపెట్టినట్టు కనబడదు. మీడియా వాళ్లుమాత్రం ‘గాడ్‌ పార్టికల్’ అనేశారు. మనవారు మరో అడుగు ముందుకువెళ్లి దాన్ని ‘గాడ్‌లీ పార్టికల్’ చేసేశారు.

హిగ్స్ బోసాన్ కనిపించదు. కనుక, అది ఉందనేందుకు సూచనలను వెదికారు. గాలి కనిపించదు. కానీ గాలి ఉందనడానికి సూచనలు కనబడతాయి. అదే తీరులో హిగ్స్ బోసాన్ కూడా ఉందనడానికి ఆధారాలు కనబడ్డాయి. అవి అంతకుముందే ఒకసారి కనిపించాయన్నారు. కానీ, కనిపించలేదేమోనని అనుమానం కూడా కనిపించింది.

పొరపాట్లు లేకుండా పని చేయడానికి సిక్స్ సిగ్మా అని ఒక విశ్లేషణ పద్ధతి ఉంది. ఇక్కడా దాని ఫైవ్ సిగ్మాగా మార్చి, ప్రమాణంగా పెట్టుకున్నారు. కనుగొన్నది- మనం అనుకుంటున్న కణం కాకుండా పోవడానికి అవకాశం 0.00006 శాతం మాత్రమేనన్నారు. అందుకే పరిశోధకులు కూడా ఒళ్ళు దగ్గరబెట్టుకుని ‘మామూలు మనిషిగా చెపుతున్నాను (పరిశోధకుడిగా కాదు అని గదా అర్థం!) ఉన్నట్లే ఉంది!’ అన్నారు. ఆ కొద్ది మాటకే ప్రపంచమంతా పొంగిపోయి, కలడో లేడో అన్న అనుమానం తీరిపోయినంత గగ్గోలు చేశారు. సిఇఆర్‌ఎన్ వారి ప్రకటనను విశే్లషించి, తరువాత ఏమి కావచ్చునని సీరియస్‌గా వచ్చిన వ్యాసాలను, అభిప్రాయాలను ఎవరూ పట్టించుకోలేదు. ‘మేము కనుగొన్న పార్టికల్ ‘హిగ్స్ బోసాన్’గా తేలే అవకాశం (సంభావ్యత- ప్రాబబులిటీ) ఎక్కువగా ఉందని సెర్న్ వారు చేసిన ప్రకటన, చాలా ముఖ్యమయినది అంటున్నది అలాంటి ఒక వ్యాసం! పదార్థం నిర్మాణానికి ఆధారమయిన కణాలు, ఏ కొలతలూ లేని (రవ్వ) రూపంలో గాక పోగులు, దండలుగా ఉందన్న అంశాన్ని గురించి కొంతకాలమే ప్రతిపాదనలు వచ్చాయి. ఈ పద్ధతిలో చూస్తే కొలతలు పది ఉండాలని కూడా సూచనలు వచ్చాయి. ఐన్‌స్టైన్ మాత్రం స్థలం మూడు కొలతలు, కాలం ఒకే కొలత గురించి చెప్పి అందరినీ ఆలోచింపచేశాడు. అతనితో బాటే పనిచేసిన ‘మన’ సత్యేంద్రనాథ్ బోస్ చెప్పిన ‘బోసాన్’ గురించి ఆలోచించాలంటే, పది కొలతలు కూడా పనికిరావంటే, మనమంతా ఏదో అర్థమయినట్లు పండగ చేసుకుంటున్నాము. క్వాంటం ఫిజిక్స్ అంత సులభంగా పరిశోధకులకే అర్థం కాదు. అందులో ఏదో కొత్త ఆలోచనకు దారి దొరికితే సీరియస్ పరిశోధకులు బుర్ర తిరిగేలా ఆలోచిస్తున్నారు. అర్థం చేసుకుని ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నారు. మిగతా వారందరూ మాత్రం ఈ దెబ్బతో ప్రపంచంలోని సమస్యలన్నిటికీ జవాబు దొరికిందన్నంత గొప్పగా గోల చేస్తున్నారు.


హిగ్స్-బోస్ అనేవారిలో పీటర్ హిగ్స్ ఇంకా బతికే ఉన్నాడని చాలామందికి తెలియకపోవచ్చు. ఆయనను ‘మీరేమంటారు?’ అని అడిగితే, ‘అనేందుకు ఏముంది’ లాంటి సమాధానమిచ్చాడు. ‘ఈ బోసాన్‌కు తండ్రులు బోలెడంత మంది ఉన్నారుగదా, మరి నోబేల్ బహుమతి ఎవరికిస్తారు?’ అని కూడా అడిగారు ఆయనను. ‘అలాంటి నిర్ణయాలు నేను కాదు గదా చేసేది’ అన్నాడాయన. అటు పాకిస్తాన్‌లో అబ్దుస్ సలాంగారికి (ఈయనకు మన కలాం గారికి సంబంధం లేదని గుర్తుంచుకోవాలి) ఇటు మన దేశంలో సత్యేంద్రనాధునికి అన్యాయం జరిగిపోయిందని, వ్యాసాలు వచ్చేశాయి. బోసాన్ కణం ఉందని కనుగొనడానికీ, బోస్‌కు సంబంధం లేదు. హిగ్స్‌కు అంతకన్నా సంబంధం లేదు. ఇంకా ఆ పార్టికల్‌ను హిగ్స్ బోసాన్ అంటున్నారంటే, వారిద్దరినీ గౌరవించినట్లే లెక్క. ఫెర్మియానులు, బోసానులు, వాటిలో రకాల గురించి, ఇక్కడ చర్చ మొదలుపెడితే, ఎవరికీ ముక్క తోచదని, అర్థంకాదని అంటే తప్పుకాదు. నిజానికి హిగ్స్‌తో బాటు పనిచేసిన టామ్ కిబెల్ అనే సైంటిస్టును ఈ క్షణంలో అందరూ గుర్తు తెచ్చుకోవాలి అంటారు నిజంగా సంగతి తెలిసినవారు. సలాంను, బోస్‌ను ఎవరూ మరిచిపోలేదు. వాళ్లు గొప్ప పరిశోధకులు. కానీ ఇప్పుడు జరిగిన పరిశోధనలో వారికి సంబంధం లేదు, అంటున్నారు కూడా!
ప్రపంచానికి నిత్యం ఒక సంచలన వార్త కావాలి. ఇవాళటి కొత్త సంచలనం రాగానే, నిన్నటి మహా సంచలనం మరుగున పడిపోతుంది. కానీ సైన్సు ప్రపంచం పద్ధతి వేరు. అక్కడ సంచలనాన్ని సంచలనంగా కాక, మరింత కృషికి మార్గంగా భావిస్తారు. మరింత సీరియస్‌గా ముందుకు సాగుతారు. లాజికల్‌గా ముందుకు సాగుతారు. ఈ లాజిక్ అన్న అంశం పరిశోధకులను కొన్ని అభిప్రాయాలనుంచి సత్యాలవరకు నడిపిస్తుంది.


ఒకటి ఉంది గనుక రెండు కూడా ఉంటుంది. కలిసి మూడవుతాయి అన్నది భావన. నిజంగానే లాజిక్‌లో లెక్కలుంటాయి. అది లెక్క ప్రకారం ముందుకు సాగుతుంది. మొదలు అనుకున్న అభిప్రాయం లేదా భావన నిజమే అయితే, ఆ తరువాతి లెక్కలు కూడా నిజాలవుతాయి. కానీ, సైన్సులో కూడా అభిప్రాయాలు సమగ్రంగా అవసరమయినవి అన్ని ఉండి, పరిశోధన మొదలయ్యే స్థితి ఉండదు. అందుకే లాజిక్- లెక్క ప్రకారం వచ్చిన ఫలితాలను కూడా పూర్తి చివరి సత్యాలు అనడానికి ఉండదు. బోసూ, హిగ్స్ మరి కొందరు, ఇలాంటి కణాలు ఉండితీరాలి అన్నారు. ఇవాళ ఉన్నట్టే ఉంది అంటున్నారు. మరెన్నో ప్రయోగాలు, పరిశీలనలు జరగాలి. అందరికీ ఒకే తీరు ఫలితాలు రావాలి. అప్పుడు గానీ ఒక సిద్ధాంతం ముందుకు రావటనికి వీలు కలుగుతుంది.


లెక్కలున్నంత మాత్రాన పని జరగదు. కవి, చిత్రకారుడులాగే, సైంటిస్టు కూడా ఒక భావనను కల్పించుకోవాలి. బోస్‌లాంటి వారంతా అదే చేశారు. బోసాన్ ఉందని తేలిననాడు, బోస్‌కు సన్మానం జరిగినట్లే లెక్క. ఆ సంగతి తెలుసు గనుకనే పీటర్ హిగ్స్ నిక్షిప్తంగా మాట్లాడింది! మన మాట నిజమని రుజువయితే, అంతకంటే ఏం కవాలి? అన్నది ఆయన భావం!


స్టేజిమీద తెర ఇప్పుడే లేచింది! నాటకం మొదలు కాలేదు. అప్పుడే చప్పట్లు కొడితే ఎట్లా?

No comments:

Post a Comment