Monday, May 21, 2012

గతంగా మనం

ఆది మానవుడు, రాతియుగాలు, పాత బతుకుల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. తెలుసుకోవాలన్న ప్రయత్నం మాత్రం సాగుతూనే ఉంది. మానవ జాతి మరింత కాలం కొనసాగుతుంది. రానున్న కాలానికి మనం ‘గతం’లో ఉంటాము. మన ప్రస్తుతపు బతుకుల గురించి, ఆ తరాలకు తెలియగలిగిన సమాచారం గురించి ఆలోచనలు మొదలయినయి. మన గతంలో వారికి సమాచారాన్ని కేవలం సమాచారంగా దాచవచ్చునన్న ఆలోచన లేదు. అది కలిగిన తర్వాతి సమాచారం కూడా మన వరకూ మిగల్లేదు. నలందా, తక్షశిల గ్రంథాలయాలు మనకు అందలేదు. ఒక అగ్నిప్రమాదంలో అలెగ్జాండ్రియా జ్ఞాన భాండాగారం మసిగా మారింది.


లక్ష సంవత్సరాల తర్వాత పురాతత్వవేత్తలు మన గురించి తెలుసుకునే ప్రయత్నంలో పడితే ఏం దొరుకుతుంది? మనకు దొరికినట్లే కుండ పెంకులు, బూడిదల ఆధారాలేనా? కాలం ఒరిపిడికి నలగకుండా, నలుదిక్కులా చెల్లాచెదరు కాకుండా, కరిగి, మురిగిపోకుండా ఏ రకం సాక్ష్యం మిగులుతుంది? వ్యక్తిగా ఏ ఒక్కరూ తమ ఆనవాలుగా, ఆనాటి వారి కొరకు ఏమీ మిగల్చలేరు. మన తాతగారి తాతగారి వస్తువు, మన ఇంట్లో ఒక్కటి కూడా లేదు. మరో లక్ష సంవత్సరాలవరకూ మనగలిగిన వస్తువు మన దగ్గర లేదు. మానవజాతి చరిత్ర లక్ష సంవత్సరాల క్రితం మొదలయింది. అదీ ఆధునిక మానవుని చరిత్ర. అది ఆఫ్రికాలో మొదలయింది లాంటి విషయాన్నీ ఊహలు మాత్రమే. రాతి పనిముట్లు అక్కడక్కడ రాళ్లుగా మారి మిగిలిన అవశేషాలు ఈ ఊహలకు ఆధారాలు.

మనం భూమి మీద బతుకుతున్నాము. మన ఎముకలు రాయిగా మారి (శిలాజాలయి) మిగిలిపోయే వీలు చాలా తక్కువ. కానీ, ఏడు వందల కోట్ల మంది ఉన్నాము గనుక, ఏ కొందరి అవశేషాలయినా మిగిలితే మిగలవచ్చు. అటువంటి అరుదైన అవకాశం రావాలంటే మనుషులూ, మరిన్ని జంతువులూ కాల్షియం బాగా ఉండే మడుగులు, చిత్తడి నేలలు, గుహలలో చనిపోవాలి. ఆ శరీరాలు ‘తక్షణం శిలాజాలు’గా మారతాయి. శరీరం, ఎముకలు కుళ్లిపోయేలోగా వాటిలో ఖనిజాలు చేరుకుంటాయి. కనుక గట్టిబడి మిగిలిపోతాయి. దక్షిణ కీన్యాలో ఒక వన్యమృగం ఇలాగే చనిపోయింది. రెండు సంవత్సరాలు కూడా గడవకముందే దాని శరీరంలో కాల్షియం కార్బొనేట్ నిండిపోయింది. శరీరం రాతివిగ్రహంగా మారింది.

శ్మశానాల్లో పాతిపెట్టిన శరీరాలు కనీసం కొన్ని శతాబ్దాలలో ఎముకలతో సహా మట్టిగా, నుసిగా మారిపోతాయి. కనుక రానున్న యుగాల మానవులు మన కోసం శ్మశానాలలో వెతికి లాభం ఉండదు. కానీ ప్రమాదాలు జరిగి, సామూహికంగా జనం అంతరించినచోట కొన్ని అవశేషాలు మిగిలే వీలు ఉంది. ఈ మధ్య వచ్చిన సునామీలో కొందరు అలా మట్టిలో మిగిలిపోయారు. అగ్నిపర్వతాల బూడిదలో కప్పుకుపోయిన వారు కూడా అలాగే మిగిలిపోతారు. పీట్ గుంటలలో, ఎడారులలో కూరుకుపోయిన శరీరాలు కూడా మమీలుగా మారతాయి. కానీ, లక్ష సంవత్సరాల కాలంలో వచ్చే మార్పులను తట్టుకుని అవి మిగిలి ఉండే వీలు మాత్రం తక్కువ. మన గురించి మిగిలి ఉండగలిగిన మరికొన్ని ఆధారాలు కూడా ఈ మార్పుల కారణంగా నాశనమయిపోతాయి. సముద్ర మట్టాలు పెరిగితే, తీరాలలోని నగరాలు మునిగిపోతాయంటున్నారు. అలల కారణంగా అక్కడి భవనాలు సమసిపోతాయి. భూమిలోపలి మాళిగలు, పునాదులు మిగిలిపోతాయి. కొంతకాలానికి కాంక్రీటు కూడా కరిగిపోతుంది. అయినా వాటి ఆకారాలు మాత్రం మట్టిలో అచ్చులుగా మిగిలి ఉంటాయి. ఈ రకం ఆకారాలు ప్రకృతిలో మరెక్కడా ఉండవు గనుక, అప్పటివారికి అవి మనిషి ఆనవాళ్లుగా దర్శనమిస్తాయి.

మనుషులు మరీ పెద్ద నిర్మాణాలను నిలబెడుతున్నారు. ఆనకట్టలు వాటిలో కొన్ని. అదేరకంగా, గనుల పేరున తవ్విన గుంటలలో సెడిమెంట్ నిండుతుంది. నిర్మాణం గురించి తెలుస్తుంది. మనం ప్రస్తుతం భూమి వాడుకుంటన్న తీరు బహుశః అర్థ్ధమవుతుంది. యుఎస్‌లోని హూవర్ డ్యాం, చైనాలోని త్రీ గార్జెస్ లాంటివి మరీ పెద్దవి. వాటి ఆనవాళ్లు లక్ష సంవత్సరాల వరకు తప్పక మిగులుతాయంటారు పరిశోధకులు. ఫిన్‌లాండ్‌లో అణు వ్యర్థాలను దాచడానికి ఒక రిపాజిటరీని ఏర్పాటు చేస్తున్నారు. అది లక్ష సంవత్సరాలయినా నిలిచి ఉండే రకంగా కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి నిర్మాణాలు కూడా కొన్ని మిగిలిపోతాయి.

రానున్న కాలానికి మనం వదులుతున్న ‘చెత్త’ మాత్రం తప్పకుండా అందుతుంది. నగరాల వ్యర్థాలను లాండ్‌ఫిల్స్ పేరున మేట వేస్తున్నారు. నిండిన ఈ గుంటల మీద మట్టి పొరలు కప్పుతున్నారు. కనుక లోపలికి ఆక్సిజన్ చొరకుండా ఉంటుంది. ఏ పదార్థమయినా పాడవడానికి, మారడానికి ముందు ఆక్సిజన్ అవసరం. గాలి, ఆక్సిజన్ తగలకుంటే ఈ చెత్త గుంటలలో పూడుకుపోయిన గుడ్డలు, కర్రలు కూడా ఎంతకాలమయినా మిగిలి ఉండే వీలు ఉంది. ఈ పదార్థాలన్నీ కాలక్రమంలో మారతాయి. అయినా ఆ కొత్త రూపం వాటి పాత స్థితిని పట్టి ఇవ్వగలుగుతుంది.

కొన్ని పదార్థాలు మాత్రం ఎట్లున్నవి అట్లా ఉండిపోతాయి. నిజానికి మనం పాత్రల కొరకు, మరే ఉపయోగానికీ రాతిని వాడడం మానుకున్నాము. రాతి విగ్రహాలు మాత్రం తయారవుతున్నాయి. అవి కొంతకాలం మిగిలి ఉంటాయి. పింగాణీ కప్పులు, ప్లేట్లు, మగ్గులు కూడా ఎనే్నళ్లయినా మిగిలి ఉంటాయి. అంటే, కొత్త మనుషులకు మనం ‘రాతియుగం’గా మిగిలిపోతాము. ఇనుము లాంటి లోహాలు త్వరగా మారిపోతాయి. టైటేనియం, స్టెయిన్‌లెస్ స్టీల్, బంగారం లాంటివి కొన్ని ఎంతకాలమయినా ఉంటాయి. అయిదు వేల ఏండ్ల నాటి బంగారం ఇప్పటికీ కొత్తదిగా తళతళలాడుతూ ఈజిప్టులో దొరికింది. లక్ష సంవత్సరాలయినా అది అట్లాగే ఉంటుందని అంటారు సైంటిస్టులు. లాప్‌టాప్ కేసులను టైటేనియంతో తయారుచేస్తున్నారు. లోపలి భాగాలన్నీ పోయి ఈ కేసులు మాత్రం మన గుర్తులుగా మిగులుతాయి. వాటి ఆకారాలు, వాటిమీది కంపెనీ గుర్తులు, అప్పటివారికి పెద్ద చిక్కు ప్రశ్నలుగా ఎదురవుతాయేమో?

మన గురించి తెలియజేయడానికి ఏదో మిగిల్చిపోవాలని ప్రయత్నం జరుగుతుంది. కానున్న వారికి మన నాగరికతలోని ఏ అంశం ఎంత ఆకర్షణీయంగా కనబడుతుందన్న ప్రశ్నకు జవాబు లేదు. ప్రస్తుతం ప్రాచీన మానవుల గురించిన పరిశోధన మొత్తం డార్విన్ సిద్ధాంతాల ఆధారంగా సాగుతున్నది. వంద సంవత్సరాల క్రితం ఈ సిద్ధాంతం లేదు. ప్రస్తుతం మనం సేకరించి, నిక్షేపాలుగా దాచుకుంటున్న ఆనవాళ్లు రానున్న యుగాలవారికి ఏ రకంగా కనబడేదీ, వాటికి వారు ఏమని అర్థాలు చెప్పుకునేదీ మనం ఊహించలేము. అప్పటివారికి రాగలిగే ఆలోచనలు ప్రస్తుతం మనకు తోచే ఆస్కారం లేదు.

No comments:

Post a Comment