Monday, January 2, 2012

హద్దులు దాటని యాత్రా చరిత్ర


హద్దులు దాటని యాత్రా చరిత్ర

బియాండ్ ద బార్డర్ ఆన్ ఇండియన్ ఇన్ పాకిస్తాన్ (ఆంగ్లం)
రచన: యోగిందర్ సికంద్ పెంగ్విన్ బుక్స్,
వెల: రూ.350/-,
పేజీలు 297+

భారత-పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్ పోటీ జరిగినా సరే, ప్రపంచ యుద్ధం జరుగుతున్నట్లు అందరూ ఊపిరి బిగబట్టుకుని చూస్తారు. పాకిస్తాన్ గెలిస్తే పండుగ చేసుకునే వారు భారతదేశంలో ఉన్నారు. కానీ, భారతదేశం మీద ప్రేమ వదులుకోలేక, తమ చరిత్ర, మతం, నమ్మకాలను వదులుకోలేక బతుకుతున్నవారు ‘సరిహద్దులకు ఆవల’ అంటే పాకిస్తాన్‌లో ఉన్నారని ఎంతమందికి తెలుసు.

యోగిందర్ సికంద్, పరిశోధకుడు, పాత్రికేయుడు పాకిస్తాన్ నుంచి పారివచ్చిన వారి సంతతి వ్యక్తి. అతనికి పాకిస్తాన్ అంతా తిరిగి చూడాలన్నది, చిన్న నాటి నుంచీ బలంగా ఉన్న కోరిక. పరిశోధన పేరున మరో రకంగా అక్కడి వారితో మైత్రి పెంచుకున్నాడు అయినా అక్కడికి వెళ్లడానికి అన్నీ అడ్డంకులే. వీసా ఇవ్వడానికి అధికారులు కనబరిచిన వైమనస్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘నువ్వు తిరిగి వచ్చిన తర్వాత మా దేశం గురించి నెగెటివ్‌గా రాయకూడదు!’ అన్నారంటే అక్కడే మనకు అనుమానం మొదలవుతుంది. సికంద్ కూడా అలాంటి భావాలతోనే బయలుదేరతాడు. మొదట్లో చదువుతుంటే పాఠకులకు విసుగు అనిపిస్తుంది. వాడెవడో ముక్కు గెలుక్కుంటే, దాని గురించి వర్ణించాల్సిన అవసరం ఏమిటి అనిపిస్తుంది.

ఈ యాత్రాచరిత్ర రచన నిజంగా సరిహద్దులను దాటి జరిగింది అనవసరం అనిపించేంత ఉత్సాహంతో, ఓపికతో సికంద్ పాకిస్తాన్ దేశమంతటా కలియదిరుగుతాడు. ఆ విశేషాలను కళ్లముందుంచినట్టు కాకపోయినా వివరంగా చెపుతాడు (ఇతను కథారచయిత కూడా అయి ఉంటే రచన మరోలాగుండేదని అనిపిస్తుంది) మతం తప్ప మరోటి తెలియని ఒక ముల్లా ఇంట్లో సికంద్‌కు ఆతిథ్యం దొరుకుతుంది ఒక రోజు. దేశంలోనికి వెళ్లడం లాగే, అక్కడికి వెళ్లడం కూడా అనుమానంతోనే. అది విడిదికి భయం! కానీ నోరు తెరిచిన తర్వాత ఆ పెద్దాయన, ‘ముస్లిములు కానివారంతా శత్రువులు అనడం తప్పు’ అంటాడు. భోజనానికి కూచుంటే, వాళ్లు ఇతని కోసం ప్రత్యేకంగా శాకాహారం వండిపెడతారు ఆ దేశంలో శాకాహారం గురించి పడిన పాట్ల తర్వాత ఈ ఆచరణ, కంటతడికి కారణమయేలాగుంది.
సికంద్ ఎందరో వ్యక్తులను కలుస్తాడు. అందులో హైందవ సంతతి వారు కొందరు, అవసరం కొద్దీ మతం మారిన వారు కొందరు భారతీయుడని తెలుసుకున్న మరుక్షణం, అక్కడ ముస్లింల పరిస్థితి ఏమి అని అడిగేవారు చాలామంది. ఇందులోని మొదటిరకం వారంతా ‘ఇంకెక్కడికయినా వెళ్లి మాట్లాడుకుందాం’ అన్నవారే! అంటే వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో అందరికీ పాకిస్తాన్ గురించి వివరం తెలియకుండానే ఒక రకమయిన భావం ఉంది. పాత చరిత్ర రేఖామాత్రంగా తెలుసు. అందులో నిజంగా తెలియవలసిన అంశాలు మాత్రం తెలియవు. సికంద్ చూచిన స్థలాలు, కలిగినవ్యక్తులు చేసిన సంభాషణలు, కలిగిన అనుభవాలు కలిపి, చివరకొక బలమైన భావానికి దారి తీస్తాయి. ఈ రెండు దేశాలు, అందులోని తరాల ప్రజలు, వారి ఆలోచనల మధ్యగల సామాన్యులను, తేడాలను, మరోసారి నిర్వచించాలన్న గట్టి ఆలోచన మనలో కలుగుతుంది. సికంద్ యాత్ర చరిత్ర అందుకే, అందరూ, నిజంగా అందరూ (ఓపికగా) చదవదగిన పుస్తకం.

ఇది నవల కాదు ఇందులో కథ, డ్రామా లేవు కానీ, అంతకన్నా బలమయిన సమాచారం ఉంది. ఇస్లాం అంటే శరణాగతి సిఖ్ అంటే శిష్యుడు లాంటి మామూలు విషయాల గురించి చాలా మందికి ఇక్కడే మొదటిసారి తెలిస్తే ఆశ్చర్యం లేదు. సూఫీలు, భాయి మర్దానా లాంటి, మరికొందరు గురునానక్ శిష్యులు బాబా ముల్లేషా విశేషాలు, అక్కడి మ్యూజియంలో కనిపించే తీరు, ఇస్లాం పుచ్చుకున్న భిల్లులు, హిందువులు ముస్లిములూ కాని కైంఖానీలు, కాశ్మీరు యువకులకు శిక్షణ, ఆ పేరున వచ్చి ఇరికి పోయిన యువకులు మొయెంజోదరో, ఇలా ఎనె్నన్ని విశేషాలు.. ఎంతమంది వ్యక్తులు;

పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం లేదు కనుక అందరూ రాజకీయం గురించి మాట్లాడతారు. మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది కనుక, అందరూ రాజకీయం మాట్లాడతారు! ఎంత వింత పరిస్థితి? అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయానికి శంకుస్థాపన లేదా పునాదిరాయి వేసింది ఒక పాకిస్తానీ సూఫీ మహానుభావుడంటే ఎంత ఆశ్చర్యం!
ఈ పుస్తకం చదువుతుంటే మొదట్లో విసుగనిపిస్తుంది. కానీ ముందుకు పోయిన కొద్దీ ఆసక్తి పెరుగుతుంది. పుస్తకమంతా సికంద్ మొదటి ప్రయాణం గురించిన వివరాలు. చివరల్లో ఒక పదిహేను పేజీలు రెండవ విజిట్ గురించి వివరాలు! ఈ రెంటిలో తేడా, ఆ దేశం గురించిన పూర్తి చిత్రాన్ని మన ముందు ఉంచుతుంది. సులభంగా చదవగల ఇంగ్ల్లీషులో రచన నడిచిన తీరు కూడా బాగుంది.

ఒక పాకిస్తానీ పెద్దమనిషి మాటలు పుస్తకం వెనుక అట్టమీద ఉన్నాయి. ‘‘నేను భారతదేశంలో పుట్టాను. మీ గ్రాండ్ పేరెంట్స్, ప్రస్తుతం పాకిస్తాన్ అంటున్న ప్రాంతంలో పుట్టిన వారు వాళ్లు భారతదేశంలో వరించారు నేను పాకిస్తాన్‌లో ఉన్నాను విచిత్రం కదూ!’ అని ఇలాంటి మాటలు పుస్తకంలో చాలా చోట్ల కనబడతాయి. ‘పాకిస్తాన్‌లో ఉండే చాలామంది హిందువులు పాకిస్తాన్‌ను తమ దేశంగా భావించరు. వీలయితే భారతదేశానికి వలస వెళ్లాలని మాలో చాలామందిమి రహస్యంగా కోరుకుంటాము. భారతదేశం మా మాతృభూమి పవిత్రదేశం, హిందువుల దేశం. అయితే ఈ విషయం బాహాటంగా చెప్పలేమనుకోండి’ అంటాడు ఒక అజయ్. క్రికెట్ పోటీలో పాకిస్తాన్ గెలిస్తే, మిఠాయిలు పంచుకునే వారు గుర్తుకు వచ్చారా? ‘బియాండ్ ద బార్డర్’ చదివిన తర్వాత, ఆ సరిహద్దులు దాటి వెళ్లి చూడాలనిపిస్తే ఆశ్చర్యం లేదు!

-గోపాలం కె.బి.

No comments:

Post a Comment