Tuesday, January 24, 2012

‘భమిడిపాటి’ రచనలు - సమీక్ష


నవ్వడం నేర్పించే ‘భమిడిపాటి’ రచనలు


భమిడిపాటి
కామేశ్వర రావు
రచనలు - 4
నాటకాలు
పేజీలు: 230
వెల: రూ. 110/-
ప్రతులకు: విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్, బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాద్-1.

భమిడిపాటి కామేశ్వరరావుగారి పేరు చెపితేనే నవ్వేతరం ఒకటి ఉండేది. ఆ తరువాత ఆయన కుమారుడు రాధాకృష్ణ కూడా హాస్యరచనలతో పేరు సంపాదించుకున్నారు. విశాలాంధ్ర వారు కామేశ్వర రావుగారి రచనలను సేకరించి సంగ్రహాలుగా వేయటం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఇంకా కొన్ని రచనలు మాకూ అందలేదు. మీ దగ్గర ఉంటే పంపించండి. అని అడగడం మరింత బాగుంది.


నాలుగవ సంపుటమయిన ఈ పుస్తకంలో నాలుగు స్టేజి నాటకాలున్నాయి. వాటిలో మూడు అనువాదాలు. చివరిది నేరుగా వారి రచన.
ప్రణయరంగం ఈడూ-జోడూ అన్న నాటకాలు ప్రసిద్ధ ఆంగ్లవక్త, రూపకకర్త, రిచర్డ్ బ్రిన్‌స్లీ షెరిడన్ నాటకాలకు తెలుగు రూపాలు. పాశ్చాత్య నాటక ప్రపంచంలో షెరిడన్, మోలియర్‌లకు ఉన్న పేరు చాలా గొప్పది. వాళ్ల రచనలను కామేశ్వర రావు గారు తెలుగు చేయడంలో ఆశ్చర్యం లేదు. అందులో ఆయన ఎంపిక చేసిన నాటకాలు మరీ ప్రత్యేకమయినవి.
షెరిడన్ సృష్టించిన ఒక పాత్ర, భాషాప్రయోగంలో ఒక సిద్ధాంతానికి ఆధారమయింది. ఆ నాటకం పేరు ‘రెవల్స్’. అందులో మిసెస్ మ్యాలప్రాల్ అని ఒకావిడ ఉంటుంది. ఆవిడ పదాలను బాగా వాడాలన్న కోరికతో అర్థంలేని పదప్రయోగాలు చేస్తుంది. ఆ పద్ధతికి ఆంగ్లంలో, ఆ పాత్ర పేరున ‘మ్యాలప్రాసిజం’ అని పేరు వచ్చింది. ఈ ప్రణయరంగంలో కూడా ఒక రాంబాణమ్మ గారిని రచయిత సృష్టించారు. ఆమె, అర్థంలేని పదప్రయోగాలతో నవ్వులు పండించారు.


షెరిడన్ 1816లో మరణించాడు. అంటే ఈ నాటకాలు అంతకన్నా ముందు కాలానివి. అలనాటి ఆంగ్ల సమాజంలో అమ్మాయిలను పెళ్ళిళ్ళను, అపార్థాలనూ వాడి హాస్యం పండించే పద్ధతి ఉండేది. ఈ సంప్రడంలో రెండవ నాటకం ‘ఈడూ - జోడూ’ కూడా షెరిడన్‌దే ఈ నాటకం సంగీత నాటకంగా నేటికీ ప్రపంచాన్ని ఊపేస్తున్న డ్యూయెన్నాకు తెలుగు రూపం.


సంకలనంలో మూడవ నాటకం, మరో ప్రసిద్ధ రచయిత ఆలివర్ గోల్డ్‌స్మిత్ రచనకు అనువాదం గోల్డ్‌స్మిత్ 18వ శతాబ్దం మధ్యకాలం నాటి రచయిత చివరి నాటకం, చెప్పలేం మాత్రం కామేశ్వర రావుగారి స్వంత రచన. కానీ అది మొదటి మూడు నాటకాల తీవ్ర ప్రభావం ప్రతిఫలించిన రచన.


నాటకాలు నాలుగింటిలోనూ, అమ్మాయిలు, అబ్బాయిలు, వాళ్ళ తండ్రులు, అత్తలు, మిత్రులు, పనివాళ్ళు, చిత్ర విచిత్ర మనస్తత్వాలతో మన ముందుకు వస్తారు. ప్రణయ రంగంలో నాయిక నవలలు చదివి, అలాగే నవల పద్ధతిలో పెళ్ళి చేసుకోవా లను కుంటుం ది. అక్కడ నాయకు డు మారు వేషంతో ఆమె మనసు కాజేసే ప్రయ త్నం చేస్తాడు. మరొక నాటకం లో అమ్మాయి తాను పనిమనిషినన్న నాటకమాడి నచ్చిన వాడిని మెప్పిస్తుంది. అంతటా ఒక అమ్మాయి కొరకు పోటీపడే మనుషులు ఎదురవుతారు. నిజం చెప్పాలంటే ఈ రకం హాస్యం తెలుగు పాఠకులకు, ప్రేక్షకులు, ఆనాడు, ఈనాడూ కొత్తే! పుస్తకంలో పాత్రలు రంగం మీదకు వచ్చి, వెళ్ళిపోయే సూచనలను, ఇంకా ఉంచడం అవసరమేమో! నాటకాలు, ఆసక్తిగలవారు ఓపికగా చదివితే, చేతయితే, నవ్వుకోవచ్చు! అవునుమరి. కాలక్రమంలో మనం నవ్వుకునే పద్ధతులు కూడా మారిపోయినాయి.


కామేశ్వర రావుగారి భాష, సంభాషణ, శైలి గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అక్కడక్కడ డయలాగులు మరీ ఇంగ్లీషుగా తోచవచ్చు. కానీ అనువాదంలో కూడా అంతటి తెలుగుదనాన్ని పలికించినందుకు రచయిత గుర్తుండి పోతాడు. ‘రహస్యం చెప్పావా?’ అన్న ప్రశ్నకు ‘అక్షరం తలకట్టు కూడా చెప్పలేదండీ’ అనిపించగలిగిన ‘ఈజ్!’ ఆశ్చర్య పరుస్తుంది. అలాంటి తెలుగు ఏమయింది? అన్న ప్రశ్న అందరికీ ఒక్క క్షణం ఎదురవుతుంది. ఆ తెలుగు కోసమయినా ఈ నాటకాలను చదవాలి. చేతనయితే ప్రదర్శించాలి.


పాత్రలకు పేరు పెట్టడంలో ఈ రచయిత పద్ధతి ఎవరికీ చేతగాలేదు. కుమార సేనం, జ్వాలారంగం, నభోమణి, మండోదరం, కరాళం, తంపటి లాంటి పేర్లు ఏ పుస్తకంలోనూ చూచి ఉండలేదు.


ఈ తరం పాఠకులకు భమిడిపాటి వారి పేరుతో కూడా పరిచయం లేకపోవచ్చు. కానీ వారి రచన ఒకటి చదివినా, మిగతావన్నీ చదవాలనిపిస్తుంది.!

-కె.బి. గోపాలం

1 comment: