Thursday, January 26, 2012

ఇంధనం వాడకం - ఆహార ఉత్పత్తి


ఇంధనం వాడకం - ఆహార ఉత్పత్తి

తిండి సమస్య కాదు, కావలసినంత పండుతున్నది. ఆ పంటను నిలువ చేయడం, కాపాడడం, అందరికీ పంచడం నిజమయిన సమస్యఅంటున్నారు పెద్దలు. హరిత విప్లవం, శే్వత విప్లవం వంటి కార్యక్రమాల కారణంగా నిజంగానే పంటల దిగుబడి బాగా పెరిగింది. కానీ, అందుకోసం ఎక్కువ మొత్తాలలో రసాయనిక ఎరువులు, విద్యుత్తు, చమురు ఖర్చవుతున్నాయి. ఈ పరిస్థితి ఒక్క మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచం అంతటా ఉంది. ఇంధనశక్తి, ఆహార ఉత్పత్తి అన్న రెండు ముఖ్యమైన అంశాల మధ్యగల సంబంధాలను మరోసారి జాగ్రత్తగా గమనించవలసిన సమయం వచ్చింది. పంటలు పెరుగుతున్నాయి. దిగుబడులు పెరుగుతున్నాయి. అంటే కార్టన్ ఇంధనాల వాడకం కూడా పెరుగుతున్నది. నత్రజని ఎరువుల వాడకం కూడా పెరుగుతున్నదని అర్థం. ఈ రెండూ కలిసి ప్రపంచం మరింత వేడెక్కడానికి దారి తీస్తున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. వీటివల్ల కాలుష్యంతో పాటు మరిన్ని రకాల సమస్యలు కూడా పెరుగుతున్నాయి.

ఇంధనాల వాడకం చేతనయినంత తగ్గాలన్నది అందరికీ అర్థమయిన విషయం. కనుక అందరి చూపు వెంటనే రవాణా (వాహనాల) వేపు, ఇంధనం ఉత్పత్తి వేపు మరలుతుంది. అంతేగానీ, వ్యవసాయం వేపు దృష్టి అంతగా పోదు. విద్యుత్తు కొరత కారణంగా రైతు తల పట్టుకుని ఉంటున్న సమయంలో, ఆ రంగంలో ఇంధన శక్తి వాడకం గురించి తోచకపోవడం సహజమే. కాని, విద్యుత్తు సమస్యగా కనిపించని దేశాలలోనయినా ఈ పరిస్థితిని గురించి ఆలోచించాలని ప్రపంచ స్థాయి పరిశోధకుల ఆలోచన. అమెరికా వారు విద్యుత్తు, ఇంధనాలను వాడే విషయంలో అందరికన్నా ముందు ఉంటారు. అందులో సవరణలు జరగాలంటే మాత్రం, అందరికన్నా చివరలో ఉంటారు. ఆ దేశంలో వాడుతున్న ఇంధన శక్తిలో పదిశాతం కన్నా కొంచెం ఎక్కువ భాగాన్ని వ్యవసాయం, పశుపోషణలకు వ్యయమవుతున్నది. 

ఇందులో కేవలం ఉత్పత్తి మాత్రమేగాక, ప్రాసెసింగ్, పరిరక్షణ, రవాణా, పంపిణీ మొదలయినవి కూడా ఉన్నాయి. మన దేశంలోనయినా మరెక్కడయినా, ఆహార వ్యవస్థలో ఇవన్నీ ఉండవలసిన భాగాలే.
ఆహారం ఉత్పత్తి, పంపిణీ, వాడుకలను, ఇంధనం వాడుకునే తీరుతో కలిపి లెక్కలు వేస్తే ఒక కొత్తరకమయిన చిత్రం ముందుకు వస్తుంది. అందులో భాగంగా మరింత తెలివయిన విధానాలు, సాంకేతిక పద్ధతులు, తిండి అలవాట్లు కూడా తోడయితే, ఒకే ప్రయత్నంతో అటు ఆహారం ఉత్పత్తి, ఇటు ఇంధనం సమస్య రెంటికీ సమాధానాలు అందుతాయి. ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రకృతి కూడా మెరుగవుతుంది.
వ్యవసాయంలో ఇంధనం వాడకం సరిగా జరగదని ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది. అందుతున్న సౌరశక్తిలో రెండు శాతాన్ని మాత్రమే మొక్కలు, పంటలు వాడుకుంటాయి. అంటే మిగతా 98 శాతం శక్తిని నిలువ చేయలేకపోతున్నాయని అర్థం. పశుపోషణ మరింత అన్యాయమయిన పరిస్థితి. మనుషులు ఈ రెండు వనరులను వాడుకుని మానవశక్తిగా మార్చుకుంటారు. వద్దన్నా సరే, ఎండ ఉండనే ఉంటుంది గనుక, దాన్ని మనం సరిగా వాడుకోలేకపోతున్నామని ఎవరికీ తోచదు. కానీ పెరుగుతున్న ప్రపంచ జనాభాకు సరిపడా తిండి, పండించడానికి తగినంత సాగునేల లేదు. నీరు, ఎరువులు లేవు. వీటన్నిటినీ లెక్కలోకి తీసుకుని గమనిస్తే, వాడుతున్న ఇంధన శక్తికి తగినంత పంటఅందడం లేదన్న సంగతి అర్థమవుతుంది. పండిన పంటలో అంటే మొత్తం మొక్కలో గింజలను మాత్రమే మనం వాడుకుంటాం. అందులోనూ రకరకాల కారణాలవల్ల ఎంతో వ్యర్థమవుతుంది. మిగతా మొక్కం తా ఇంచుమించు వ్యర్థమవుతుంది.
పశువులకు బదులు ట్రాక్టర్లు, నీటి పంపులను వాడి, వ్యవసాయ ఉత్పత్తులను పెంచారు. ఎరువుల తీరు మారింది. పురుగు మందుల వాడకం పెరిగింది. వ్యవసాయంలో కూలీలుగా అవసరమయే మనుషుల సంఖ్య బాగా తగ్గిపోయింది. మన దేశంలో ఇంకా ఈ పరిస్థితి మరింత తీవ్రం కాలేదు.

కొన్ని పనులకు ఇంకా మనుషులనే వాడుకుంటున్నారు. ప్రపంచ వాతావరణం మారనుంది గనుక, పరిస్థితి రాను రాను మరింత మారుతుంది. పంటలు పండే చోటనే వాటిని వాడుకునే పరిస్థితి పోయి కొత్త పద్ధతులు వస్తున్నాయి. నేల అందుబాటులో ఉండేచోట వ్యవసాయం జరుగుతుంది. పశుపోషణ మన దేశంలోగానీ న్యూజిలాండ్ లాంటి చోట్ల గానీ సులభంగా వీలవుతుంది. పశువుల మేతను ప్రత్యేకంగా పండించనవసరం లేకుండానే అందే వీలు మన దగ్గర ఇంకా ఉంది. కనుక ఇక్కడ పెంచిన పశువుల మాంసాన్ని మరిన్ని ప్రాంతాలలో దేశాలలో వారికి అందించగలిగితే బాగుంటుంది.
పొలాలు ఉన్న చోట్ల నీరు లేదు. అందిన కొద్దిపాటి నీరు వ్యర్థమయిపోతున్నది. కనుక సాంకేతిక పద్ధతులను వాడి, పంట నేలలను చదును చేస్తే ఎరువులు, నీరు ఊరికే కొట్టుకుపోకుండా, మరింత ఫలసాయానికి దారితీస్తాయి. ట్రాక్టర్లలాంటి యంత్రాలలో శక్తిని రకరకాలుగా వాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తక్కువ నీటితో పండే పంటల గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పశువుల ఆహారంగా ఆల్గెలను పెంచగలిగితే, అక్కడ జరుగుతున్న ఇంధన నష్టం తగ్గుతుందంటున్నారు. ఇంధనానికి వ్యవసాయానికి గల సంబంధంలో మరొక కొత్త కోణం ఒకటి ఈ మధ్యన మన ముందుకు వచ్చింది. నేలనుంచి తవ్వి తీసే ఇంధనాల బదులు, మొక్కల నుండి వాటిని తీయాలంటున్నారు. అంటే ఇకమీదట మొక్కజొన్న, సోయా, చక్కెర, పామ్‌ఆయిల్ లాంటిది, ఆహారంలో భాగంగా ఉండవు. అవి ఇంధనం తయారీకి ముడిసరుకులుగా గుర్తింపు పొందుతున్నాయి. వ్యవసాయ రంగంలో ఒక విచిత్రమైన పరిస్థితికి ఇది దారితీస్తుంది. అమెరికాలో అప్పుడే పంటలను ఇతనాల్ తయారీకి మరలిస్తున్నారు. ఒకవేపు ఎంతో బయోమాస్ (జీవపదార్థం) వ్యర్థమవుతుంటే, మరోవేపు మనుషుల ఆహారాన్ని ఇంధనం తయారీకొరకు వాడుతున్నారు. ఇది అర్థంలేని పని!
మొక్కజొన్నను ఇతనాల్ తయారీ కొరకు వాడడం వెంటనే ఆపాలి అంటారు ఈ ఇంధనం - ఆహారంరంగంలో పరిశోధనలు జరుపుతున్న నిపుణులు. ఆ విత్తనాలు మనుషులు, పశువులకు ఆహారంగా వాడుకయినప్పుడు, మరింత విలువ అందుతుంది. ఆ మొక్కలో తినడానికి పనికిరాని కాండం, ఆకులను ఇంధనం తయారీకి వాడుకున్నా అర్థ ఉంటుంది.

ధాన్యం నుంచి ఇతనాల్ తీయం సులభం. కాం, ఆకులలోని సెల్యులోజ్ నుంచి ఇంధనం తీయడం అంత సులభం కాదు. ఆ విధానం కొరకు వెచ్చించే పెట్టుబడులకన్నా, వచ్చిన ఫలితాలు ఇవ్వగల లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయని పరిశోధకుల అభిప్రాయం. అప్పుడు జీవ ఇంధనం తయారీకి ముడి సరుకు అప్రయత్నంగానే, కావలసినంత అందుతుంది.
వ్యవసాయం, పశుపోషణలనుండి వచ్చే వ్యర్థాలను, మరింత బాగా వాడుకునే ప్రయత్నం మొదలయింది. ముందు వీటినుంచి బయోగ్యాస్ తీయవచ్చు. దాన్ని వాడి విద్యుత్తును తయారుచేయవచ్చు. ఈ పద్ధతిలో నడుస్తున్న కొన్ని జెర్మన్ గ్రామాలు, జాతీయ విద్యుత్ గ్రిడ్ మీద ఆధారపడకుండా తమ అవసరాలను తీర్చుకుంటున్నాయి. వ్యర్థంగా పోతున్న కార్బన్‌డై ఆక్సయిడ్‌ను వాడి, ఆల్గేలను పండిస్తున్నారు. అవి మనుషులు పశువులకు ఆహారంగా అందుతాయి. మంచినీటి అవసరం లేకుండా, ఉప్పునీటిలో బాగా పెరిగే నారు రకాలను గుర్తించారు. ఈ రకం ఉత్పత్తులు మన ఆహారంలో భాగంగా అంగీకారం పొందడానికి కొంత కాలం పట్టవచ్చు. కానీ అది జరిగి తీరుతుంది.
తక్కువ నీరు, తక్కువ ఇంధనం వాడి ఎక్కువ పంటలను, ఫలసాయాన్ని సాధించడం ప్రస్తుతం పరిశోధకులకు పని కల్పిస్తున్న గమ్యం! హరిత, శే్వత విప్లవాలు తిండి భరోసానిచ్చాయి. అదేదారిలో మరింత ముందుకు సాగితే, సమస్యలు లేకుండా, అందరికీ తిండిని అందించే వీలు కూడా కలుగుతుంది. ఇదొక కొత్త హరిత విప్లవమవుతుంది. *

No comments:

Post a Comment